ఘట్కేసర్: కూతుర్ని కళాశాలలో దించడానికి వెళ్తున్న తండ్రి దిచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో కూతురు కళ్లెదుటే తండ్రి మృతి చెందిన సంఘటన ఘట్కేసర్లో బుధవారం ఉదయం జరిగింది. మేడిపల్లికి చెందిన హనోక్ కుమార్ (52) ప్రైవేటు ఉద్యోగి. కొండాపూర్ సంస్కృతి కళాశాలలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు స్వాతిని మేడిపల్లి నుండి కళాశాలలో దించి వెళ్లడానికి బైకుపై బయలుదేరాడు.
ఘట్కేసర్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు చేరుకోగానే బస్టాండ్ లోపలి నుండి బయటకు వస్తున్న ఆర్టీసీ బస్ వేగంగా వచ్చి బైకును ఢీకొంది. దీంతో స్వాతి పక్కకు పడిపోగా.. హనోక్కుమార్ పైనుండి బస్సు ముందు, వెనక చక్రాలు వెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కూతురు స్వాతి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.