వైభవంగా రుద్రహోమం
ఐ.పోలవరం: నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు శైవాగమ పద్ధతిలో స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాముల, అధికారుల పర్యవేక్షణలో ఈ అయిదు రోజుల క్రతువు జరుగనుంది. సోమవారం ఆలయంలో ఉదయం గవ్యాంతం, పంచవింశతి, కలశస్థాపన పూర్వక అభిషేకం, సరస్వతి హోమం, రుద్రహోమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించిన ్ఙసూర్య ప్రభశ్రీ వాహనంపై ఊరేగించారు. పచ్చిపూలతో స్వామివారి, అమ్మవారి అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో భారీ చలువ పందిళ్లు, పచ్చిపూల అలంకరణ, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు.