-
ఆడదే ఆధారం
నాటి సినిమా పురుషుడు స్త్రీకి ఈ ప్రపంచంలో ఒక చిన్న ప్రపంచం కేటాయింటాడు. దాని పేరు ఇల్లు. స్త్రీ ఇంట్లో ఉండాలి. సాటి స్త్రీని ఇంట్లో ఉంచాలి. ఇంటి రాజకీయాలలో ఒకరితో ఒకరు తలపడుతూ ఉండాలి. రెండు గదులు, ఒక హాలు, చిన్న వరండా... ఇదే సామ్రాజ్యం అనుకుంటూ దానిలో ఆధిపత్యం కోసం ఒక స్త్రీ మరో స్త్రీతో వాదనకూ యుద్ధానికీ పీడనకూ దిగాలి. చాలాసార్లు పురుషుడు ఈ యుద్ధానికి దూరంగా ఉంటాడు. ఈ పాపంతో తనకు సంబంధం లేదు అన్నట్టుంటాడు. ఎందుకంటే అతడికి బయట పెద్ద ప్రపంచం ఉంది. అందులో అతడు హాయిగా తిరుగుతుంటాడు. కాని స్త్రీ మాత్రం? ఇంట్లోనే తాను వేదన అనుభవిస్తూ ఒకరికి వేదన కలిగిస్తూ... ‘ఆడదే ఆధారం’ సినిమా పురుష ప్రపంచంలో స్త్రీల సగటు మానసిక స్థితిని చెబుతుంది. అత్తగా ఉండే స్త్రీ కోడలని వేధించాలని, కోడలుగా ఉండే స్త్రీ అత్తామామలను నిర్లక్ష్యం చేయాలని నమ్ముతూ సమాజం కల్పించిన చట్రంలో స్త్రీలు ఎంత దారుణంగా కొట్టుకుపోతున్నారో చూపుతుంది. ఇందులో ఒక కోడలు (ముచ్చెర్ల అరుణ). ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఉద్యోగం చేస్తూ సంపాదిస్తోంది కనుక ఇంట్లో దర్జాగా ఉండాలని భావిస్తుంది. అత్తమామలను పనివాళ్ల కింద జమ చేస్తుంది. భర్త ఈ విషయాన్ని చూసీ చూడనట్టుగా ఉంటాడు. వాదన చేస్తే భార్య పెద్ద గొడవకు దిగుతుందని భయం. వీళ్ల పక్క వాటాలోనే ఒక అత్తగారు (పి.ఆర్.వరలక్ష్మి) ఉంటుంది. ఈమె తన ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేస్తుంది. కోడలు (సీత) ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెకు సంతోషం లేదు. ఎందుకంటే కోడలు తేవాల్సిన కట్నాన్ని ఇంకా తేలేదు. బాకీ ఉంది. అందువల్ల అత్త కోడలని వేధిస్తూ ఉంటుంది. ఆమెను గర్భం దాల్చవద్దని ఆజ్ఞాపిస్తుంది. అయినప్పటికీ గర్భం వస్తే అబార్షన్ చేయించాలని చూస్తుంది. చివరకు కోడలితోనే తెగదెంపులు చేసుకునేదాకా వెళుతుంది. ఆ ఇంట్లో ఒక కోడలి వల్ల సుఖం లేదు. ఈ ఇంట్లో ఒక అత్త వల్ల సంతోషం లేదు. వీరి మనసులు, మెదడులు ఇంత ‘నేరో’గా కావడానికి కారణం ఎవరు అని మనం ఆలోచించాలి. కోడలికి అత్త శత్రువు, అత్తకు కోడలు శత్రువు అని ఎవరు నిర్థారణ చేశారు? మగవాడు కాదా? కాని అందరు మగవాళ్లు ఒకేలా ఉండరు. ఈ కథలోనే ఒక రేడియో మామ (విసు) ఉంటాడు. ఈయన రిటైరైన పెద్ద మనిషి. అయితై రిటైరైనవాడు రిటైరైనట్టు ఉండక కొడుకూ కోడలి (చంద్రమోహన్, రాజ్యలక్ష్మి)తో ఏ కాలనీకి వెళితే ఆ కాలనీలో చుట్టు పక్కల ఆడవాళ్ల కష్టాలను తీర్చే పని పెట్టుకుంటాడు. అతడి దృష్టి ఈ కాలనీకి రాగానే పొరుగన ఉన్న అత్తగారిపైన, పై పోర్షన్లో ఉన్న కోడలి మీద పడుతుంది. వారిని అతడు ఎలా సరిదిద్దాడో అనేది కథ. అయితే అత్తాకోడళ్లందరూ ఇలాగే ఉంటే ఈ సినిమాకు విలువ లేదు. ఈ సినిమాలోని రేడియో మామ కోడలు పరిణితి కలిగిన స్త్రీ. మామగారు స్త్రీల పట్ల ఆర్తి చెందితే ఆయనకు ఆమె ఆలంబనగా నిలుస్తుంది. అలాగే మరో మురికివాడలో ఇద్దరు అత్తాకోడళ్లు ఉంటారు. తండ్రీ కొడుకులు తాగి తందనాలాడుతూ ఉంటే ఈ అత్తాకోడళ్లు ఎంతో సహనంతో సంయమనంతో ఒకరికొకరు మద్దతుగా ఉంటూ కాపురాన్ని నిలబెట్టుకుంటూ వస్తారు. మగాడు నిస్సహాయంగా ఉన్నా, దాష్టికంగా ఉన్నా స్త్రీ బుద్ధి కుశలతా, ఇంగితజ్ఞానంతో ఇంటిని నిలబెట్టుకోవచ్చు అనడానికి ఈ పాత్రలు కనిపిస్తాయి. కాని చాలాసార్లు స్త్రీలు ఎంత అభద్రతతో ఉంటారంటే అత్తతోగాని, కోడలితోగాని వైరం పెట్టుకుంటే తప్ప మనుగడ లేదు అనట్టుగా ఉంటారు. ఆర్థిక కేంద్రం మగాడు తీసుకోగా నాలుగ్గోడలు ఉండే ఇంటి కేంద్రమైనా తన చేతుల్లో ఉండాలని భావించడం వల్లే ఈ అభద్రత. ఎట్టకేలకు ఈ సినిమాలో అత్త కోడలి ఔన్నత్యాన్ని గ్రహిస్తుంది. కోడలు అత్త పెద్దరికాన్ని అర్థం చేసుకుంటుంది. నలుగురూ ఆడవాళ్లే. కాని కొద్దిపాటి సామరస్యాన్ని కోల్పోయి ఇల్లు నరకం చేస్తారు. అత్త కోడలి దృష్టి నుంచి ఆలోచించినా కోడలు అత్త వైపు నుంచి ఆలోచించినా చాలా సమస్యలు రావు. ఉన్నవి తొలిగిపోతాయి. నేటికీ ఈ సూత్రం పాటించే అత్తాకోడళ్లు మాత్రం తక్కువ. అలాంటివారిని తట్టిలేపే సినిమా ‘ఆడదే ఆధారం’. తమిళంలో నటుడుగా, నాటక కర్తగా, దర్శకుడుగా ప్రఖ్యాతి పొందిన విసు ఈ సినిమాను మొదట తెలుగులో (1988) తీసి ఆ తర్వాత తమిళంలో చేశాడు. రెండు చోట్లా విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇరుగు పొరుగు ఎలా చస్తే మనకేంటి అనుకునే మనుషులకు బదులు... సాటి మనిషి కష్టాన్ని పట్టించుకునే రేడియో మామగా అతడు ఆకట్టుకుంటాడు. ఇందులో సీతారామశాస్త్రి రాసిన ‘మహిళలూ మహరాణులు’... ‘నేలమ్మా నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ’.. పాటలు రేడియోలో చాలాకాలం వినిపించాయి... వినిపిస్తున్నాయి. ప్రపంచం దాని చలన సూత్రాల ఆధారంగా అది కదలుతూ ఉండొచ్చు. కాని ఇంటి చలన సూత్రాలు సరిగ్గా ఉన్నప్పుడే దాని చలన సూత్రాలు సజావుగా సాగుతాయి. ఇల్లు సజావుగా ఉండాలంటే కుటుంబం సజావుగా ఉండాలి. కుటుంబం సజావుగా ఉండాలంటే స్త్రీ తనను తాను గమనించుకుంటూ ఏమరుపాటుగా ఉండాలి. తను స్త్రీ. ఎదురుగా ఉన్నది కూడా స్త్రీయే. ఆమే అగ్ని. ఆమే జడి. ఆడదే ఆధారం. కథ ఆడనే ఆరంభం. – కె -
మహిళా సాక్షిగా!
ఆమె... పేరుకే సర్పంచ్... పెత్తనం అంతా మిస్టర్ సర్పంచ్దే. ఇదీ... మన దగ్గర సాగుతున్న మహిళాసాధికారత. ఇంటి పనికి జీతం ఉండదు... ఇంట్లో జీతం తెచ్చే వాడిదే పై చేయి. ఇదీ మన గృహిణికి ఉన్న ఆర్థిక సాధికారత. సమాజంలో మహిళ వెతలకు అంతే లేదు. ఆమె సమస్యలకు సమాధానం ఒక్కటే! మహిళ ఇంకా ఇంకా ఎదగడం... దేశ నిర్మాణంలో భాగం కావడం! అందమైన... ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఆమె బలమైన ఇరుసు కావాలి. అప్పుడే ఆమెకు... ఆర్థిక స్వావలంబన... సామాజిక గుర్తింపు... మానసిక వికాసం!! ఆల్ ఇండియా ఉమెన్ జర్నలిస్ట్ల వర్క్షాప్... ఉద్దేశమూ అదే. స్వతంత్ర భారతంలో ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిది!! అధికార ముద్రిక ఆమె అయితే... ఆ ముద్రను వేసే చేయి మగవాడిది కాకూడదు. అధికారం నిజంగానే మహిళకు దక్కాలి. బస్తాల కొద్దీ పిస్తాలు రికార్డుల్లో మాత్రమే కాదు... పిల్లల చేతుల్లో ఉండాలి. ఒక మాట మహిళల కోసం... మరోమాట పిల్లల కోసం... ఈ రెండు మాటలు చెప్పింది కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ. ప్రదేశం... ఢిల్లీ విజ్ఞాన్భవన్లోని ఈస్ట్ హాల్. తేదీ: జూన్ 7, 2016. ఉదయం పదిగంటల సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మహిళా విలేఖరుల సమావేశంలో అన్న ఈ మాటలు దేశమంతటికీ వర్తించేవి... అన్ని రాష్ట్రాలవారూ అనుసరించాల్సినవి. పదకొండు భాషల ప్రసారమాధ్యమాల నుంచి దాదాపుగా 250 మందికి పైగా మహిళా విలేఖరులు హాజరైన సందర్భంగా వారిని ఉద్దేశించి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రసంగిస్తూ అన్న మాటలివి. దేశనిర్మాణంలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి గడచిన రెండేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలతోపాటు మరికొన్ని కొత్త ప్రతిపాదనలను మహిళా విలేఖరుల ముందుంచారు మంత్రి. అమలులో అవసరమైన మార్పులు, సూచనలను స్వాగతించారామె. ‘సమాచారమే శక్తి. ఆ శక్తితో పురోగతి సాధించవచ్చు’ అంటూ సాగిన ప్రసంగంలో, మహిళా విలేఖరులు ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’కు సోషల్ ఏజెంట్లుగా సహాయసహకారాలందించాల్సిగా ఆమె కోరారు. మహిళలు, పిల్లల హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ వివరాలను నేరుగా మంత్రిత్వ శాఖ నెట్వర్క్తో పంచుకోవడం ద్వారా త్వరితగతిన ప్రక్షాళన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఆరు గంటలు సాగిన సెషన్లో, దేశం నలుమూలలా మహిళలు, పిల్లలకు ఎదురవుతున్న సమస్యలను మనేకాగాంధీ ప్రస్తావించారు. తమ సందర్శన సందర్భంగా తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటనలను ఉదాహరించారు. పిల్లలకు పోషకాహారాన్ని పెట్టాల్సిన అంగన్వాడీ సెంటర్లు... పిల్లలకు రుచి, నాణ్యత లేని ఆహారం పెట్టడాన్ని, ఉత్తరాఖండ్లో దాబా నుంచి నూనెలో వేయించిన పదార్థాలు కొని పెట్టడాన్ని నిరసించారు. కర్ణాటకలో తనకు ఎదురైన చిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. ‘అక్కడి ఎన్జివో నిర్వహకులు పిల్లలకు పిస్తా, పండ్లు, గుడ్లు పెట్టారు ఆ రోజు. పిల్లలను పరిశీలిస్తే... రోజూ అలాంటి ఆహారం తీసుకుంటున్నట్లు ఏ మాత్రం నమ్మకం కుదరడం లేదు. పోషకాహార లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది’ అని చెప్పారు. కేవలం మంత్రి పర్యటించే రోజున మాత్రం పని చేసినట్లు కనిపించే చర్యలను తప్పుపట్టారు. తాను ప్రతిరోజూ పర్యటించి పరిశీలించడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి మహిళా విలేఖరులు వీటి మీద ఒక కన్ను వేసి ఏమైనా పొరపాట్లు దొర్లివుంటే మంత్రిత్వశాఖ వెబ్సైట్ ద్వారా తన దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు. తల్లిపాలతో పిల్లలు ఆరోగ్యంగా పెరిగితేనే దేశం శక్తిమంతమవుతుందనీ, అందుకే ప్రసవించిన మహిళకు 26 వారాల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలనే నిబంధనను గుర్తు చేశారామె. వీటన్నింటినీ సక్రమంగా అమలయ్యేలా చూసే మరో నేత్రంగా విమెన్ మీడియా పనిచేయాలని, మహిళల స్థితిగతులను మెరుగుపరచడంలో సహకరించాలని మనేకా గాంధీ కోరారు. ఇది మహిళల వికాసానికి మంత్రి హోదాలో ఓ మహిళ చేస్తున్న ప్రయత్నం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి సంక్షేమం కోసం... పథకాలు... ప్రతిపాదనలు! జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015... కౌమారదశలోని పిల్లల నేరాన్ని బాల్యచేష్టగా పరిగణించడమా, శిక్షార్హమైన నేరంగా పరిగణించడమా అనేది విచక్షణతో వ్యవహరించాలి. మిస్సింగ్, ట్రాఫికింగ్... పారిపోయిన పిల్లల కోసం ‘ఖోయా-పాయా’ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇందులో రైల్వేలతో ఒప్పందం కుదుర్చుకుని బోగీలకు వివరాల పట్టికను అతికిస్తారు. పారిపోయిన పిల్లలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరడానికి ఎన్నుకునే ప్రధాన రవాణా మార్గం రైల్వేలే అయి ఉంటాయి. అందుకే ప్రతి స్టేషన్లోనూ ఇలాంటి పిల్లలను గుర్తించి ప్రభుత్వ హోమ్లకు సమాచారం అందించి పిల్లలను చేర్చడానికి ఒక సెల్ ఏర్పాటు. కాంప్రహెన్సివ్ అడాప్షన్ రిఫార్మ్స్... ఆర్థిక పరిపుష్టి ఉన్న దంపతులు తమ పిల్లలతోపాటు ఒక అనాథ బాలికను పెంచుకోవడాన్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఇందులో పాక్షిక దత్తతనూ ప్రోత్సహిస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సిఎస్ఆర్) ద్వారా కంపెనీలు కూడా అనాథ బాలికలను దత్తత తీసుకోవచ్చు. ప్రతి బాలికకూ ప్రభుత్వం ఒక ఐడీ నంబరు ఇస్తుంది. స్కూల్లో చేర్చడానికి, ఇతర సౌకర్యాలకు ఆ ఐడి సరిపోతుంది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్... అంగన్ వాడీ సెంటర్ల మౌలిక సదుపాయాల పెంపు... పిల్లలకు అందుతున్న ఆహారంలో నాణ్యత, స్వచ్ఛ్ అంగన్వాడీ అభియాన్ ద్వారా డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ రెమ్యూనరేషన్ వంటివి ఈ కార్యక్రమాల కింద ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ పథకాల ప్రచారంలో పని చేయించుకోవడం ద్వారా వాళ్లు పిల్లల సంరక్షణ మీద దృష్టి పెట్టలేకపోతున్నారని, వారికి అదనపు పనులు కేటాయించరాదనేది తప్పక పాటించాల్సిన నియమం. సాధారణంగా గ్రామానికి ఒక అంగన్వాడీ సెంటర్ ఉంటుంది. దాని పరిధిలో చిన్న చిన్న నివాస ప్రాంతాలు దూరదూరంగా ఉంటాయి. అలాంటి చోట్ల ఆ పిల్లలందరూ ఒక సెంటర్కు రావడం సాధ్యం కానప్పుడు మినీ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.జంక్ఫుడ్ గైడ్లైన్స్... స్కూల్ పరిసరాల్లో జంక్ఫుడ్ అమ్మడం మీద నిషేధం విధించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. మహిళల కోసం... మొబైల్ ఫోన్లలో పానిక్ బటన్ ఏర్పాటు... ప్రత్యేకమైన యాప్ ద్వారా ప్రమాదం సంభవించినప్పుడు మొబైల్ ఫోన్లోని నిర్దేశిత బటన్ నొక్కితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్తోపాటు సమీపంలో ఉన్న పది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులకు సమాచారం అందుతుంది.మహిళా-ఇ-హాట్... మహిళలు ఇంట్లోనే ఉండి తమకు చేతనైన పనులు చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. ఇతర మెళకువలేమీ లేకపోయినా సరే... స్వీట్లు, మురుకుల వంటి తినుబండారాలు చేయడం మాత్రమే వచ్చిన వాళ్లు కూడా ఈ-మార్కెటింగ్ వెబ్సైట్లతో కనెక్ట్ అవుతారు. బేటీ బచావో బేటీ పడావో... ఆడబిడ్డను రక్షించాలి, చదివించాలని సమాజాన్ని చైతన్యవంతం చేసే క్యాంపెయిన్. స్వచ్ఛ భారత్లో భాగంగా బాలికలున్న అన్ని స్కూళ్లలో టాయిలెట్ల నిర్మాణం దీని లక్ష్యం. వితంతువుల పునరావాసం... యూపీలోని బృందావనంలో పిల్లలు వదిలేసిన మహిళల కోసం హోమ్. ఇతర చోట్ల అలాంటి హోమ్ల అవసరాన్ని గుర్తించి నిర్మించాలి.ఉమెన్ హెల్ప్లైన్... మహిళల హక్కుల కోసం సలహాలు, సహాయం కోసం పని చేస్తుంది.హెరాస్మెంట్ ప్రివెన్షన్ సెల్... పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అరికట్టడానికి ఉద్దేశించిన‘సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్ 2013’ ప్రకారం... ప్రతి ఆఫీసులోనూ ఒక సెల్ ఏర్పాటయ్యే వరకు మహిళలు ఉద్యమస్ఫూర్తితో పనిచేయాలి.పోలీసు నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్ ... చట్టాన్ని ఆశ్రయించిన మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడడం వంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండాలి. హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ అచీవర్స్ కాంటెస్ట్... నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ వంటి సంస్థాగతమైన అంశాలతోపాటు మాట్రిమోనియల్ వెబ్సైట్ల వాడకంలో చట్టపరమైన నిబంధనలు రూపొందాలి. ఈ వెబ్సైట్ల ద్వారా మగవాళ్లు మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రశ్నలు వేయడాన్ని శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు (ఒక పెళ్లి కొడుకు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఒక అమ్మాయితో ‘పెళ్లికి ముందు శీల పరీక్షకు సిద్ధమేనా’ అని అడిగిన సంగతి ప్రస్తావించారు మనేక). పంచాయితీరాజ్లో మహిళా ప్రతినిధులకు శిక్షణ... ప్రభుత్వ పథకాలు, వాటిని ఏయే కార్యాలయాల ద్వారా చేయించుకోవాలనే అంశాల్లో శిక్షణ ఇవ్వడం, ఒక యాప్ ద్వారా మహిళా ప్రతినిధులను కనెక్ట్ చేయడం, ‘సర్పంచ్పతి’ విధానానికి అడ్డుకట్ట వేయడం ద్వారా మహిళల రిజర్వేషన్ను పటిష్టంగా అమలు చేయడం. మహిళల పని వేళలు... రాత్రిళ్లు పని చేయాల్సిన ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక సదుపాయాల కల్పన, మహిళల మీద అఘాయిత్యం జరిగినప్పుడు ‘లో నెక్ బ్లవుజ్, పొట్టి దుస్తులు’ అనే నేలబారు వ్యాఖ్యానాల నిరోధానికి పటిష్టమైన చట్టాల ఆవశ్యకత వంటి అనేక ప్రతిపాదనలతోపాటు నారీ శక్తి పురస్కారాన్ని ప్రస్తావించారు. ఇందులో అభ్యుదయ రీతిలో వ్యవహరించిన మహిళలకు మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందిస్తారు. ఈ ఏడాది కూతుళ్లిద్దరినీ రైఫిల్ షూటర్లను చేసి ఒక మహిళకు పురస్కారం అందించినట్లు గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అర్హులైన మహిళలను గుర్తించి వారి వివరాలను మంత్రిత్వ శాఖ ఫేస్బుక్లో పోస్ట్ చేయవలసిందిగా మహిళా విలేఖరులను కోరారు మనేకా గాంధీ. ఫేస్బుక్ యూజర్సే ఈ ఎంట్రీలకు న్యాయనిర్ణేతలు. -
అబ్బాయి మారాడు
‘సమాజంలో మార్పు రావాలంటే మహిళల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే.. సింపుల్గా... అబ్బాయిలు మారాలి’ అని చెబుతూ ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ వలంటీర్లు దేశవ్యాప్తంగా చైతన్యం కలిగిస్తున్నారు. అబ్బాయిలలో పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పుటలు పుటలు రాశారు. పుస్తకాలు, గ్రంథాలు ప్రచురించారు. ఉద్యమాలు చేశారు. ఆపసోపాలు పడ్డారు. బ్యానర్లు కట్టారు. నినాదాలు చేశారు. సీన్లు రాశారు. సినిమాలు తీశారు. స్టేజీలు ఎక్కారు. మైకులు మింగారు. సభలకు వెళ్లారు. చట్టాలు తెచ్చారు. అయినా... ‘అబ్బాయి’ మారలేదు. లేదు... లేదు... మారాడు! ‘నీ పేరు?’ ‘అనికేత్’ ‘ఏం చదువుతున్నావ్? ‘ నైన్త్ క్లాస్’ ‘వీళ్లంతా ఎవరు?’ ‘మా ఫ్రెండ్స్!’ ‘ఎందుకలా ఆ ఆడపిల్లల్ని ఆట పట్టిస్తున్నారు?’ ‘ఆడపిల్లలు ఇంటి పట్టున ఉండకుండా అట్లా సైకిళ్లేసుకొని తిరగడమేంటి?’ ‘ఏ! ఎందుకు ఆడుకోవద్దు.. వాళ్లూ మీ వయసువాళ్లేగా?’ ‘కానీ వాళ్లు ఆడపిల్లలు.. ఆడపిల్లలు రోడ్లమీదకు రావడమేంటి?’ ‘రావద్దని ఎవరు చెప్పారు?’ ‘మా అమ్మా, నాన్న. మా ఇంట్లో అయితే అంతే. అమ్మాయిలు బయటకు రారు. మగపిల్లలతో మాట్లాడరు, మాట్లాడొద్దు కూడా!’ కరాఖండిగా చెప్పాడు అనికేత్. ‘నీకు అక్క, చెల్లెళ్లు ఉన్నారా?’ ‘ఊ.. ఒక అక్క, చెల్లెలు’ ‘చదువుకుంటున్నారా?’ ‘చదువా? హె.. హె (వెటకారంగా నవ్వుతూ)’ ‘ఎందుకలా నవ్వుతున్నావ్?’ ‘మరి? మా అక్క ఇంట్లోనే ఉంటుంది.. మాకు వండిపెడుతూ. చెల్లెలు స్కూల్కి వెళ్తుంది. కాని పెద్దమనిషి కాగానే మాన్పించేస్తామని అమ్మ చెప్పింది’. ‘ఇంట్లో నువ్వు సాయం చేస్తావా?’ ‘నేనా? ఛీఛీ...’ ‘ఎందుకు ఛీ?’ ‘నేను అబ్బాయిని. అలాంటి పనులు చేయకూడదు. నేనే కాదు మా గల్లీలో, మా ఫ్రెండ్స్ ఇళ్లల్లో, మా చుట్టాల్లో అబ్బాయిలెవరూ ఇలాంటి పనులు చేయరు.. చేయకూడదు. మేం మగవాళ్లం. బయట పనులు చేస్తాం. బోర్ కొడితే సినిమాలకెళ్తాం. ఆడుకుంటాం.. సైకిల్ రేస్ పెట్టుకుంటాం..’ అనికేత్ చెప్తుంటే.. పక్కనే ఉన్న గుంపులో ఒక అబ్బాయి ‘ఆడపిల్లల్ని చిడాయిస్తాం కూడా’ అన్నాడు వెకిలిగా నవ్వుతూ. అతను ఆ మాట అనగానే గుంపు గుంపంతా హై ఫైవ్ ఇచ్చుకున్నారు అదే వెకిలి నవ్వుతో! మూడు నెలల కిందట జరిగిన సంభాషణ ఇది. పుణెలోని ఎగువ, దిగువ మధ్యతరగతి కలగలసి ఉండే ప్రాంతంలోని ఓ మార్కెట్లో! ఒక్క అనికేతే కాదు ఆ మార్కెట్లోని పద్నాలుగు, పదిహేడేళ్ల మధ్య వయసున్న అబ్బాయిలంతా వాళ్లింటి ఆడపిల్లల గురించి దాదాపు ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు. ఇప్పుడు... అనికేత్ వాళ్లింట్లో... వాళ్లక్క ప్రశాంతి నీళ్ల బిందె మోస్తుంటే ఎదురెళ్లి బిందెను తన భుజం మీదకు తీసుకుంటూ కనిపించాడు అనికేత్. ఆమె చపాతి పిండి తడుపుతుంటే కూరగాయలు తరిగిపెట్టాడు. ఆశ్చర్యపోయి.. ‘అనికేత్ నువ్వేంటి? అమ్మాయిల పని చేస్తున్నావ్? నీ ప్రెస్టేజ్ ఏం కాను?’ అని అడిగితే.. ‘ప్రెస్టేజ్ గిస్టేజ్ జాన్తా నహీ మేడమ్.. లడ్కా యా లడ్కీ దోనో బరాబర్ హై.. సబ్కో సబ్ కామ్ కర్నా చాహియే’ అంటూ అక్కకు హిస్టరీ పుస్తకంలోని పాఠాన్ని వివరించసాగాడు. చపాతీలు చేస్తూనే తమ్ముడు చెప్తున్న పాఠాన్ని శ్రద్ధగా వింటోంది ప్రశాంతి. ‘ఏంటీ అక్కకు చదువు చెప్తున్నావా?’ .. ‘అవును మేడం.. ఈ యేడాది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది ప్రైవేట్గానే’- సమాధానమిచ్చాడు. చెల్లెల్నీ మంచిగా చదివించాలని, అందుకు వాళ్ల నాన్న ఒప్పుకోకుంటే తను చదివిస్తానని చెప్పాడు. అక్క, చెల్లెలు ఇంటి పనికే పరిమితం కావాలని, సల్వార్కమీజ్ తప్ప ఇంకెలాంటి మోడర్న్ డ్రెస్లు వేసుకోకూడదని, మగపిల్లల వంక కన్నెత్తి చూడకూడదనే బలమైన భావాలతో ఉన్న అనికేత్లో ఇంతటి మార్పేంటి? కారణం ఎవరు? ఎవరంటే.. ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ అనే స్వచ్చంద సంస్థ! దీనిని స్థాపించింది.. రుజుతా తెర్దేశాయి. అసలు ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ‘స్కూల్, కాలేజ్, సినిమా, షాపింగ్ ఇలా ఎక్కడికి వెళ్లినా అల్లరిమూకల పిచ్చి మాటలు వింటూనే పెరిగాను. ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాను. స్కూల్డేస్లో, కాలేజ్ డేస్లో అబ్బాయిలు ఇలా మాట్లాడుతున్నారు అని ఇంట్లో చెబితే ఒళ్లు కనపడని బట్టలు వేసుకో, అమ్మాయిలంతా గుంపుగా వెళ్లండి, అల్లరిమూకలున్న రూట్లో కాక వేరే రూట్లో రా, చీకటి పడకముందే ఇంటికి వచ్చేయ్ అంటూ నాకే సలహాలు ఇచ్చారు తప్ప ఇబ్బంది పెడ్తున్న వాళ్లతో మీ ప్రవర్తన మార్చుకొండని అనలేదు. అవతల అబ్బాయిలు తప్పుగా మాట్లాడుతుంటే నేనెందుకు నా అలవాట్లను మార్చుకోవాలి అని ఇంట్లో వాదించేదాన్ని. మా అన్నయ్యలూ నన్నే కంట్రోల్లో పెట్టాలని చూశారు. సో.. అసలు తప్పు అక్కడుందన్నమాట. అబ్బాయిలను ఒకరకంగా.. అమ్మాయిలను ఒకరకంగా పెంచడంలో! అబ్బాయిల్లో మార్పువస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. స్త్రీల మీద హింసా తగ్గుతుంది అనుకున్నా. అందుకే అబ్బాయిలను సెన్సిటైజ్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేశా. ముందసలు ఒక సంస్థ పెట్టాలనే ఆలోచనే లేదు. నాకు టైమ్ ఉన్నప్పుడల్లా మిడిల్క్లాస్, లోయర్ మిడిల్క్లాస్, స్లమ్స్ ఏరియాల్లోకి వెళ్లి అక్కడి మగపిల్లలతో మాట్లాడేదాన్ని. మొదట్లో చాలా రఫ్గా, ఏమాత్రం మర్యాద లేకుండా మాట్లాడేవాళ్లు. ఒకానొక దశలో ఆత్మాభిమానం దెబ్బతిని నాకెందుకొచ్చిన గోల వదిలేస్తే పోలా అనీ అనుకున్నా. కానీ నా ప్రయత్నం గురించి తెలిసిన నలుగురైదుగురు ఫ్రెండ్స్ ధైర్యం చెప్పి సపోర్ట్ చేశారు. తర్వాత నాతోపాటూ వాళ్లూ రావడం మొదలుపెట్టారు. అప్పుడే దీనికి సంబంధించి ఓ సంస్థను స్టార్ట్ చేస్తే పకడ్బందీగా పనిచేయొచ్చు అని ‘ఈక్వల్ కమ్యునిటీ ఫౌండేషన్’ను స్థాపించాం’ అని చెప్తారు రుజుతా తెర్దేశాయి. యునిసెఫ్ సర్వే మొన్నీమధ్యనే యునిసెఫ్ సహాయంతో ఎన్పీఆర్ అనే వెబ్జర్నల్ లింగ వివక్ష మీద ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలోని పదిహేను దేశాల్లో ఒక సర్వే నిర్వహించింది. ఇప్పటికీ బాల్యవివాహాలు, రుతు సమయంలో ఆడపిల్లలను ఆరుబయట ఉంచడం, పెద్దమనిషి కాగానే చదువు మాన్పించేయడం, కూతుళ్లకు తిండిపెట్టకుండా కొడుకులకు మంచి ఆహారాన్నివ్వడం, అసలు అమ్మాయిని పెంచడమంటేనే ‘పక్కింటి తోటకు నీళ్లు పట్టడం’... అన్న ముతక భావాలతో ఆడకూతురి పట్ల తీవ్ర విక్షను చూపుతున్న దేశంగా ఆ సర్వేలో తలవంచుకున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది, అనుసరణీయమైనది కూడా. మూడు నెలల ప్రోగ్రామ్ టీనేజ్ అబ్బాయిలకు వాళ్లుండే ప్రాంతాల్లోనే స్త్రీ, పురుష సమానత్వం మీద తరగతులు నిర్వహిస్తుంటుంది ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ సంస్థ. అమ్మాయిల పట్ల గౌరవంగా లేకపోతే సమాజంలో ఎదురయ్యే దుష్పరిణామాలను వీడియో క్లిప్పింగ్స్ద్వారా చూపిస్తుంది. నాన్న.. అమ్మను గౌరవించడం మంచి కుటుంబానికి చిహ్నం అని షార్ట్ ఫిలిమ్స్తో చెప్పిస్తుంది. థియరీ, ప్రాక్టికల్స్తో రెండంచెలుగా ఒక్కో బ్యాచ్కి మూడునెలల ప్రోగ్రామ్ ఉంటుంది. ‘ముందు ఎవరూ ఇష్టంగా రారు. మేమే వాళ్ల దగ్గరకు వెళ్తాం. బలవంతంగా కూర్చోబెడ్తాం. ఫస్ట్ బాలీవుడ్ సినిమాలు చూపిస్తూ.. నెమ్మదిగా వాళ్ల అటెన్షన్ను గైన్ చేసి తర్వాత జెండర్ ఈక్వలిటీ గురించి చెప్తాం. మారిన వాళ్లకు సర్టిఫికెట్ కూడా ఇస్తాం’ అని చెప్పారు రుజుత. పుణెలో కనిపిస్తున్న ఈ మార్పు, అందుతున్న ప్రోత్సాహంతో ఈ మధ్యే పశ్చిమబెంగాల్లో కూడా జెండర్ ఈక్వాలిటీ తరగతులు ప్రారంభించిందీ సంస్థ. స్థానికంగా ఉన్న ఎనిమిది స్వచ్ఛంద సంస్థలు దీనికి సహకారాన్ని అందిస్తున్నాయి. ‘ఈక్వల్ కమ్యునిటీ ఫౌండేషన్’కు వంద బ్రాంచ్లను స్టార్ట్ చేసి దేశమంతటా విస్తరించాలనేదే తమ సంస్థ భవిష్యత్ లక్ష్యం అంటారు రుజుత. ఇ.సి.ఎఫ్. వ్యవస్థాపకురాలు రుజుతా తెర్దేశాయి -
మహిళ కంటిలో కీటకం
- శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యులు - ఏడాదిగా కంటిలోనే 9 సెం.మీ. వరకు పెరిగిన వైనం సాక్షి, ముంబై: ఓ మహిళ కంటి నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవున్న కీటకాన్ని (వానపాము ఆకారంలో) వైద్యులు ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు. ఏడాది కాలంగా మహిళ కంటిలోనే ఉన్న కీటకం అప్పటి నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవు పెరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గర్భవతి అయిన సంబంధిత మహిళకు ఎలాంటి హాని జరగకుండా వైద్యులు చికిత్స చేశారు. దక్షిణాఫ్రికాలో అరుదుగా కనిపించే ఈ కీటకాలు మన దేశంలో ఇప్పటి వరకు మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే కనిపించినట్లు సమాచారం. కాగా ఆమె పేరు, ఫొటో ప్రచురించడానికి బంధువులు నిరాకరించడంతో చికిత్స చేసిన వైద్యులు వివరాలు వెల్లడించారు. ఏడాది కిందట ఆమె కంటిలో ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో కంటి డాక్టర్కు చూపించగా ఏమి లేదని చెప్పాడు. అయితే అలాగే జరుగుతుండటంతో ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించారు. అయితే కంటిలో ఏదో కదులుతున్నట్లు వైద్యులు గుర్తించినప్పటికీ కచ్చితంగా అది ఏంటో నిర్ధారించలేకపోయారు. తరువాత మాటుంగా గాంధీ నర్సింగ్ హోంలోని సర్జన్ డాక్టర్ దీపక్ గాంధీని బాధితురాలు సంప్రదించింది. సోనోగ్రఫ్రీ చేయగా కుడి కంటిలో తొమ్మిది సెంటీమీటర్ల పొడవైన కీటకం ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ చెప్పారు. కీటకాన్ని ప్రయోగశాలకు పంపామని, అక్కడి నుంచి నివేదిక వస్తే పూర్తి వివరాలు బయటపడతాయని ఆయన అన్నారు. -
విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
- విద్యుత్ లోటును పూడ్చగలిగాం - రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సుజాత జంగారెడ్డిగూడెం రూరల్ : విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనులశాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి ఇంటికీ ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేస్తుందని చెప్పారు. జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో శుక్రవారం ఇంటింటా ఎల్ఈడీ బల్పుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం దశాబ్ధ కాలంలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును చూపించిందని, తమ ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేసి లోటును పూడ్చగలిగిందన్నారు. విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.22 కోట్ల విలువైన 15.22 లక్షల ఎల్ఈడీ బల్బులను ప్రజలకు అందిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నాలుగు రోజుల్లో వినియోగదారులకు రెండు ఎల్ఈడీ బల్బులు చొప్పున పంపిణీ చేయనున్నామని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో 75 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎల్ఈడీ బల్బులు పొందడానికి వినియోగదారుడు విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు లేదా ఏదైనా ఇతర ఫొటో గుర్తింపు కార్డు ఇచ్చి రెండు ఎల్ఈడీ బల్బులు పొందవచ్చన్నారు. ఈ ఎల్ఈడీ బల్బులు పొందడం వల్ల విద్యుత్ వినియోగం సంవత్సరానికి 55 యూనిట్లు ఆదా అవుతుందన్నారు. చింతలపూడి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలో అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని వీటి ఏర్పాటుకు అర ఎకరం స్థలం కేటాయించాల్సి ఉందని ఇందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాల రాజు మాట్లాడుతూ ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల ప్రతి ఇంటా విద్యుత్ పొదుపు జరుగుతుందని, దానివల్ల ఏటా వినియోగదారునకు రూ.800 ఆదా అవుతుందన్నారు. రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 49 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయడం జరుగుతుందని దానివల్ల 24 శాతం విద్యుత్ పొదుపు చేయగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వెంకట రమణ, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ట్రాన్స్కో ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి, డీఈ సాల్మన్ రాజు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, నాయకులు రాజాన సత్యనారాయణ (పండు), కొడవటి సత్తిరాజు, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో రూ. 10.40 లక్షలతో నిర్మిం చనున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టూరిజం సర్క్యూట్ పర్యాటకుల సదుపాయాల సమాచార భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఈ కార్యాలయ భవనాలను మంత్రి ప్రారంభించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement