-
అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ
సూపర్స్టార్ కృష్ణ అంటే తెలుగు సినీ ప్రపంచంలో తెలియని వారుండరు. అంతలా ఆ పేరు ప్రేక్షకుల గుండెల్లో అంతలా పాతుకుపోయింది. ఆయన నటనకు ప్రతిరూపం. అలనాటి తెలుగు సినిమాల్లో ఆయన ముద్ర చెరిగిపోని స్వప్నం. ఎన్నో అరుదైన రికార్డులు ఆయన సొంతం. టాలీవుడ్ నటుల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఏ హీరో సాధించని అరుదైన రికార్డును సాధించిన ఏకైక స్టార్ కృష్ణ మాత్రమే. అందుకే ఆయన పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. (చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే.. వైద్యులు) తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘట్టమనేని కృష్ణ.. నటనతోనే ఆగిపోకుండా దర్శకుడు, నిర్మాతగా, ఎడిటర్గానూ పని చేశారు. సినీ పరిశ్రమలో కృష్ణ కెరీర్ దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగిందంటే ఆయన నటనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో తెలుస్తోంది. దాదాపు 350 సినిమాల దాకా నటించారాయన. హ్యాట్రిక్ రోల్స్తో అబ్బురపరిచిన స్టార్ సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం పోషించే నటులను చూస్తాం. కానీ ఒకే సినిమాలో ఒకే నటుడు బహుళ పాత్రల్లో నటించడం అనేది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. అలాంటి పాత్రల్లో అవలీలగా నటించడం ఒక్క సూపర్ స్టార్కే సాధ్యమైంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ త్రిపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించడం ఆయనకే సాధ్యమైంది. ఇలా మూడు పాత్రల్లో కనిపించడం ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. కుమారరాజా, డాక్టర్-సినీ యాక్టర్, రక్త సంబంధం, పగపట్టిన సింహం.. ఇలా మూడు కంటే ఎక్కువ సినిమాల్లో ఆయన త్రిపాత్రాభియనంతో అలరించారు. ఆ చిత్రాలు ఇవే.. ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా టాలీవుడ్లో అరుదైన రికార్డు సృష్టించారు. ఆపై త్రిపాత్రాభినయ చిత్రాల్లో.. మొదటి సినిమా కుమారరాజాలో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారాయన. ఇది కన్నడ చిత్రం శంకర్ గురుకి రీమేక్. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్లో కృష్ణ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలు ఆయనే పోషించారు. ఈ చిత్రం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కృష్ణ తన ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన రెండో చిత్రం విజయనిర్మల దర్శకత్వం వహించిన డాక్టర్ సినీ యాక్టర్. సినిమాలో తండ్రి పాత్రతో పాటు కొడుకుగా, మేనల్లుడి పాత్రల్లో ఆయనే నటించారు. ఆ తర్వాత 'పగపట్టిన సింహం' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మళ్లీ అదే ట్రెండ్ రిపీట్ చేశాడు. ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విలన్గా, పోలీసాఫీసర్గా, లాయర్గా మూడు పాత్రల్లో మెప్పించారు. సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, బొబ్బిలి దొర వంటి ఇతర చిత్రాలలో కూడా బహుళ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు సూపర్ స్టార్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నోటి దురుసుతో అనర్ధాలు
నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మాట్లాడాలి. దైవానికి భయపడుతూ ఆచి తూచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరుల మనసు గాయపడేవిధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. మానవులకు దేవుడు ప్రసాదించిన వరాలు అనంతం. వాటిని లెక్కించడం గాని, ఊహించడం గాని, వర్ణించడం గాని అసాధ్యం. అటువంటి అసంఖ్యాక అనుగ్రహాల్లో ‘నోరు’ కూడా ఒకటి. కేవలం తినడానికి, తాగడానికి మాత్రమేకాదు, సంభాషణకు, సంవాదానికి, మానవుల మధ్య పరస్పర సంబంధాలకు ఇదేవారధి. దీని వినియోగ తీరుపైనే జయాపజయాలు, సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే అమృతపు జల్లు జాలువారుతుంది, ప్రేమామృత కుసుమాలను వికసింపజేస్తుంది. మంచిని పంచి మనిషి గౌరవ మర్యాదల్ని ఇనుమడింప జేస్తుంది. సంఘంలో ఉన్నత స్థానాన్ని సమకూర్చి పెడుతుంది. స్నేహ సౌభ్రాత్రతలను, శాంతి సామరస్యాలను పరిఢవిల్లజేస్తుంది. దుర్వినియోగం చేస్తేమాత్రం విద్వేషం చిలకరిస్తుంది. సమాజంలో అగ్గి రాజేస్తుంది. అశాంతి, అలజడులను సృష్టిస్తుంది. స్థాయిని దిగజారుస్తుంది. ఇహపర లోకాల్లో ఆపదలు తెచ్చి పెడుతుంది. వైఫల్యాలకు కారణమవుతుంది. దైవం దృష్టిలో నోటిదురుసు, దుర్భాష, అశ్లీలం తీవ్రమైన నేరాలు. దీనికి ఇహలోకంలో పరాభవం, పరలోకంలో నరక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఇతరుల మనోభావాలు గాయపరిచేవారిని, అశ్లీలపు మాటలు పలికే వారిని, దుర్భాషలాడేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. కొంతమంది పైకి ఎంతో చదువుకున్నవారిలా, ఎంతో భక్తి పరులుగా కనిపిస్తారు. కాని నోటితో ఇతరుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పరుల మనసు గాయపరుస్తారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త వారితో ఇలా విన్నవించుకున్నాడు. ‘ఒక స్త్రీ ఎన్నెన్నో నఫిల్ నమాజులు చేస్తుంది. మరెన్నో నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది. పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తూ ఉంటుంది. ఈ సత్కార్యాల కారణంగా ఆమె గొప్పదాతగా ప్రసిద్ధి చెందింది. కానీ ఆమెకు నోటిదురుసు ఎక్కువ. ఏదో ఒకటి అని పొరుగువారి మనసు బాధ పెడుతుంది.’ అని నివేదించాడు. ‘అయితే ఆమె నరకానికి పోతుంది.’ అన్నారు ప్రవక్త మహనీయులు. తరువాత ఆ వ్యక్తి ‘‘దైవప్రవక్తా! ఒక స్త్రీ ఫర్జ్ నమాజులు ఫర్జ్ రోజాలు (అంటే, విధిగా పాటించవలసినవి) మాత్రమే ఆచరిస్తుంది. నఫిల్ నమాజులు నఫిల్ రోజాలు (ఐఛ్ఛికం) పాటించడం చాలా అరుదు. దానధర్మాలు కూడా పెద్దగా ఏమీ చేయదు. ఉన్నంతలోనే అప్పుడప్పుడూ కొన్ని జున్నుముక్కలు దానం చేస్తుంది. అయితే ఆమె ఎప్పుడూ ఇరుగు పొరుగు వారిని పల్లెత్తుమాట అనదు. వారి మనసు నొప్పించదు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుందని జనం చెప్పుకుంటూ ఉంటారు’ అని విన్నవించు కున్నాడు. ఈ మాట విని ప్రవక్త మహనీయులు, ‘ఆమె స్వర్గవాసి’ అని సెలవిచ్చారు. కనుక నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో మాట్లాడాలి. దైవానికి భయపడుతూ ఆచి తూచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరుల మనసు గాయపడేవిధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. హుందాగా సౌమ్యం, నమ్రత ఉట్టిపడే విధంగా మాట్లాడాలి. ఉపయోగంలేని ఉబుసుపోక మాటలకన్నా మౌనంగా ఉండడం ఎంతో మేలు. లేకపోతే అనర్ధాలు జరిగిపోతాయి. ప్రజలకు, ప్రభుత్వాలకు వివరణలు, సంజాయిషీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, మాట్లాడిన ప్రతి మాటకూ, పలికిన ప్రతి పదానికీ దైవానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. దైవం మనందరికీ ఆచితూచి మంచి మాట్లాడే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఆంతరంగిక శుద్ధి
మనిషికి బాహ్య అంగాల శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధి అవసరం అంటుంది బౌద్ధం. ఈ మనోశుద్ధి వల్ల మనస్సు మలిన రహితం అవుతుంది. తేటదనం ఉట్టిపడుతుంది. శారీరక శుద్ధి కంటే మనోశుద్ధే మేలు. మనో వాక్కాయ కర్మల్లో మనో శుద్ధి ఉంటే వాక్కులూ చేసే పనులూ, వాటంతట అవే శుద్ధి అయిపోతాయి. అందుకే అన్నింటికీ అగ్రగామి మనసే’’ అంటుంది ధమ్మపదం. ఎంత విన్నా, ఎంత చదివినా హీనబుద్ధి గలవాడు తమగుణం మానలేడు అంటారు. దేహాన్ని ఎంత శుద్ధిగా ఉంచుకున్నా అవగుణం ఉన్నవాడికి ఒక్కసారి కాకపోతే ఎప్పుడో ఒక్కసారైనా దేహశుద్ధి తప్పదు. మనోశుద్ధి ఉంటే వారు మణిలా జీవితాంతం రాణిస్తారు. కానీ శారీరక శుద్ధి వల్ల పాపాలు పోయి పుణ్యం వచ్చిపడుతుంది అని నమ్మే పండితుడు చివాట్లు తిన్న కథ ఇది. మగధ దేశంలో మల్లిక అనే ఒక దాసి ఉండేది. ఆమె ఎంతో అందగత్తె. నిండు యవ్వనంలో ఉన్నా నిలకడ గల మగువ. ఒకరోజు తెల్లవారు జామునే నీటికోసం నదికి పోయింది. మంచు పట్టి ఉంది. చలి వణికిస్తోంది. ఆమె నదీతీరం చేరి అక్కడ నదిలోకి కట్టి ఉన్న మెట్ల మీద నుండి దిగింది. అప్పటికే అక్కడ ఒక పండితుడు నీటిలో స్నానం చేస్తూ ఉన్నాడు. బుడింగిన మునిగి పైకి లేచాడు. ఎదురుగా మల్లిక కనిపించింది. ఆమె అప్పటికే నీరు ముంచుకుని కడవ నడుమున పెట్టింది. ఆ క్షణంలో ఆమె అందాన్ని, వయ్యారాన్ని చూసి, పండితుని మనస్సు చలించింది. అలాగే నిలబడి చలికి వణుకుతూ ఆమె వంకే చూస్తుండిపోయాడు. అతని వాలకం మల్లిక పసిగట్టి– ‘‘అయ్యా నేను దాసిని. ఈ తెల్లవారు వేళ నీటికోసం ఈ నదికి రాక తప్పదు. చలి బాధను భరించకా తప్పదు. కానీ, మీరు దాసులు కారే? తమరెందుకు ఈ వేళ ఇక్కడికి వచ్చారు? ఈ నీట్లో దిగి ఇలా వడ వడ వణికిపోతున్నారు?’’ అని అడిగింది. ‘‘మల్లీ! నీకు ఆమాత్రం తెలియదా? ఈ జలం పవిత్రమైనది. దీనిలో స్నానం చేస్తే ఎప్పటి పాపాలు అప్పుడు కొట్టుకుపోతాయి. ఈ నీట్లో దిగి మూడు మునకలు వేస్తే సరి. చేసిన దోషాలన్నీ హరించుకుపోయి, పుణ్యం పోగుపడుతుంది. ఆ మాత్రం తెలియని అజ్ఞానివి’’ అంటూ మునిగి లేచాడు. మల్లిక నడుమున ఉన్న నీటి కడవను సరిచేసుకుని – ‘‘అయ్యా! నిజమా! నీటిలో మునిగితేనే పాపాలు హరించుకుపోతాయా?’’ అంది అమాయకంగా! ‘‘అవును మల్లికా! ఇది శాస్త్రం’’ అన్నాడు. ‘‘అయితే స్వామీ! మీ కంటే ఎప్పుడూ ఈ నీటిలోనే ఉండే కప్పలు, చేపలు, పీతలు, జలగలు ఎంతో పుణ్యశాలురన్నమాట. మూడు మునకలకే మీకు పుణ్యం పోగుపడితే.. నిరంతరం మునకలేసే అవి ఎంతటి పుణ్యాన్ని పోగుపెట్టుకుని ఉంటాయి? అవును లెండీ, మీకంటే కప్పలే గొప్ప’’ అంటూ నవ్వుతూ మెట్లెక్కి వెళ్ళిపోయింది. తనకు చిత్తశుద్ధి లేదని తెలియ చెప్పడానికే మల్లి అలా వ్యంగ్యంగా మాట్లాడిందని పండితుడు గ్రహించాడు. శారీరక శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధే గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తెలుసుకున్నాడు. ఆంతరంగిక శుద్ధి జరగాలంటే బుద్ధుని బోధనలే శరణు అని బుద్ధుణ్ణి శరణు వేడాడు. ఆ తరువాత గొప్ప పండితునిగా... శీలవంతునిగా కీర్తిగాంచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
వైద్యుడా.. వందనం.. డాక్టర్స్ డే వెనుక చరిత్ర ఇదే
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. మనిషికి ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించే ఆరోగ్యం లేకపోతే అదంతా వృథాయే. అనారోగ్యంతో బాధపడే వారిని ప్రమాద స్థితి నుంచి కాపాడే శక్తి కేవలం వైద్యునికే ఉంది. అందుకే ప్రజలు వైద్యుడిని సాక్షాత్తు దేవుడిగా భావిస్తారు. ప్రాణాలు నిలిపినందుకు అతడిని దేవుడే అంటూ ప్రజలు దండాలు పెడతారు. పవిత్రమైన ఈ వృత్తిలో రాణిస్తూ విశేష సేవలు అందించే వైద్యులు చరిత్రలో నిలిచిపోతారు. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): బెంగాల్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బిదన్ చంద్రారాయ్ సంస్మరణగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దేశమంతటా నిర్వహిస్తున్నారు. ఆదర్శ వైద్యుడిగా ఆయనకుగల ఖ్యాతిని యేటా ఆయన జన్మదినం నాడు డాక్టర్స్ డేగా నిర్వహిస్తూ ఇతర వైద్యులు స్ఫూర్తి పొందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిదన్ చంద్రారాయ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన 1882 జులై 1వ తేదిన జన్మించారు. 1962 జులై 1నే కన్నుమూశారు. 1991 నుంచి ఆయన సంస్మరణగా వైద్య లోకం డాక్టర్స్ డే నిర్వహిస్తోంది. పవిత్రమైన వృత్తి సమాజంలో అత్యంత పవిత్రమైన, కీలకమైన వృత్తి వైద్యం. ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద్బాం«ధవుడిలా కనిపించే వైద్యులను ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. సాక్షాత్తు దేవుడులాంటివాడివంటూ హృదయ పూర్వకంగా నమస్కారం చేస్తారు. అందుకే ఆయనను ‘వైద్యో నారాయణో హరి’ అంటూ గౌరవిస్తారు. అందుకే ఈ వృత్తికి సమాజంలో ప్రథమస్థానం ఉంది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలను డాక్టర్ కమ్మని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇతరుల ప్రాణాలు నిలిపే అవకాశం డాక్టర్ వృత్తికి మాత్రమే ఉండడంతోపాటు ప్రస్తుత సమాజంలో ఆశించే ధనం కూడా ఈ వృత్తిలో పుష్కలంగా లభిస్తుంది. గనుక వైద్య వృత్తికి అంతటి డిమాండ్ ఉంది. పెరుగుతున్న కాలానికి అనుగుణంగా వైద్యుల సంఖ్య, మెడికల్ కళాశాలల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దీన్ని గుర్తించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాలను ప్రకటించింది. ఈ ప్రణాళిక సాకారమైతే రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వైద్యుల కొరత ఉండదు. దేవ వైద్యుడు మానవులకే కాకుండా దేవతలకు కూడా వైద్యుడు ఉన్నాడు. ఆయనే ధన్వంతరి. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ వైద్యనాథస్వామి ఆలయంలో మూల విరాట్ ఎదురుగా గోడపై ధన్వంతరి కుడ్య శిల్పం ఉంది. పురాణాలు ఆయనను దేవతల వైద్యునిగా పేర్కొంటున్నాయి. అందుకే ఈ దేవాలయంలోని శివునికి వైద్య నాథుడు అని పేరొచ్చింది. ఒకప్పుడు దేవాలయాలే వైద్యాలయాలుగా కూడా సేవలు అందించేవి. చుట్టుపక్కలగల అడవుల్లో లభించే ఆకులు, గరుడు, వేర్లు తదితరాలను ఆలయాల అరుగులపై గుండ్రాళ్లతో మెత్తగా నూరేవారు. ఆ పసర్లతో స్థానికులకు వైద్యం చేసేవారని, అందుకు నిదర్శనంగా జిల్లాలోని పలు దేవాలయాల అరుగులపై నేటికీ మందులు నూరిన గుర్తుగా కల్వాలు (అరుగులపై మందును నూరిన గుర్తులు) కనిపిస్తాయి. పుష్పగిరిలోని వైద్య నాథస్వామి ఆలయానికి అప్పట్లో జిల్లా నలుమూలల నుంచి రోగులు వచ్చి వైద్య సేవలు పొందేవారని తెలుస్తోంది. చరిత్రలో జిల్లాను బ్రిటీషు వారు పాలించే రోజుల్లో కడప నగరంలో హకీం మంజుమియాకు మంచి వైద్యునిగా పేరుంది. యునాని వైద్యునిగా ఆయన ఎంతో విశిష్ఠత సాధించారు. దేశం నలుమూలల నుంచి ప్రజలు వైద్యం పొందేందుకు ఆయన వద్దకు వచ్చేవారు. ప్రస్తుతం కడప నగరంలోని సిండికేట్బ్యాంకు ఉన్నచోట ఆయన వైద్యశాల ఉండేదని, పేదల వద్ద ఎలాంటి రుసుము తీసుకోకుండా మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారని తెలుస్తోంది. ఎందరో నవాబులు, రాజులు తమ సంస్థానానికి వస్తే పెద్ద ఎత్తున ధనం, గౌరవం ఇస్తామని ఆశ పెట్టినా ఆయన కడపలోని పేదలకు వైద్య సేవలు అందించాలని ఇక్కడే ఉండిపోయారు. ఆయన ప్రతిభ గురించి ఎన్నో విశేషమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రోగి స్వయంగా రాలేకపోయినా వారి తల వెంట్రుకగానీ, గోరుగానీ చూపితే వ్యాధి నిర్ధారణ చేసి రోగాలు నయం చేసేవారని ప్రచారంలో ఉంది. ముఖం చూసిన వెంటనే వ్యాధి ఏమిటో చెప్పగలిగే వారని కూడా ఆయనకు పేరుంది. డాక్టర్ల వీధి కడప నగరం క్రిస్టియన్లేన్కు డాక్టర్ల వీధిగా పేరుంది. దాదాపు వంద మీటర్ల పొడవు గల ఆ వీధిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నివాస గృహం లేదంటే అతిశయోక్తి కాదు. రోడ్డుకు ఇరువైపుల దాదాపు అన్ని వైద్యశాలలే. అవిగాక స్కానింగ్ సెంటర్లు, ల్యాబోరేటరీలు, అడుగడుగునా మందుల దుకాణాలు ఉన్నాయి. తెలుగునాట ఇలాంటి వీధి మరేది లేదంటారు. -
స్వయం శిక్షణ
నేడు మారుతున్న కాలానికనుగుణంగా పురోభివృద్ధితో పాటు సమాజంలో పగ, వైరం, ద్వేషం, అసూయ, అల్పబుద్ధి, హింస పెరిగి పోతున్నాయి. నైతిక స్వభావంలో లోపం ఏర్పడడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అభ్యుదయాత్మకమైన మనోవైఖరి అలవరచుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి. నిశ్చయాత్మకంగా ఉండే లక్షణం అలవడినపుడు కష్టాలు ఎదురైనా మనస్సు అదుపు తప్పదు. ఈ క్రమంలో... పరిస్థితులకు భయపడని వాడు తనకు తాను మిత్రుడవుతాడు. స్వయంశిక్షణ అంటే తన ఆలోచనలను, తన అధీనంలో ఉంచుకోవడం. ఇది ఒక వ్యక్తికి నిశ్చయాత్మకంగా ఆలోచించే శక్తినిస్తుంది. స్వయంశిక్షణ మనస్సును అన్ని రకాలైన బలహీనతల నుంచి రక్షించి జీవితానికి ఒక ప్రత్యేక విలువనూ, యోగ్యతనూ ఇస్తుంది. నైతిక ప్రమాణాలను విశ్వాసంతో క్రమబద్ధంగా అనుష్టించడం ద్వారా విశ్వాసం పెరిగి పరిణితి లభిస్తుంది. ఈ విశ్వాసం పెరగాలంటే క్రమశిక్షణ అనేది అత్యంత ఆవశ్యకమని గుర్తెరగాలి. క్రమశిక్షణ అనేది ఏదో కొన్ని విషయాలల్లో కాకుండా అన్నింటిలోనూ అలవరచుకోవాలి. ఒక ఇనుప కడ్డీని అయస్కాంతంగా మారిస్తే, అది దాని బరువు కన్నా 12 రెట్లు అధికంగా ఉన్న బరువును ఎత్తగలదు. అయితే అది దాని అయస్కాంత శక్తిని కోల్పోతే మాత్రం ఒక చిన్న గుండు సూదిని కూడా ఎత్తలేదు. మనిషి మనస్సు కూడా అంతే. నిశ్చయాత్మకంగా, నిర్మలంగా, నిలకడగా ఉంటే మనిషి పరిస్థితులను తన అ«ధీనంలో ఉంచుకుని అద్భుతాలు చెయ్యగలడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వారందరికీ గుర్తింపు రావడానికి కారణం వ్యతిరేక భావాలను అధిగమించే శక్తి. నిశ్చయాత్మకంగా ఉండడమేనని, వారు తమ మనస్సును నిశ్చయాత్మక భావనలతో నింపి ఉంచడం వల్లనే ఆ స్థాయికి వెళ్ళారని అవగతం చేసుకోవాలి. మనిషి స్వప్రయత్నం తో తనను తాను ఉద్ధరించుకోవాలని, తనను తాను కించపరచుకోకుండా ఉండాలని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడికి తెలియ చేశాడు. మనిషి తనకు తానే శత్రువు, అలాగే, తనకు తానే మిత్రుడు కూడా. ప్రపంచం పట్ల, తమ పట్ల సానుకూలమైన, నిర్మాణాత్మకమైన, నిర్మలమైన స్నేహ వైఖరిని అలవరచుకుని తమకు తామే మిత్రులవ్వాలి. వ్యతిరేక భావాలతో వ్యతిరేక చర్యలు చేపట్టేవారికి బతుకు వ్యర్థం అవుతుంది. దీనికి మన నిత్య జీవితంలో కనిపించే చీమలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. తమను ఎవరైనా ఆపినా, లేక వాటి మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినా చీమలు ఆగవు. అడ్డంగా ఉన్న దాని మీదకు ఎక్కి దానిని దాటుతాయి. లేదంటే మరో మార్గంలో ముందుకు వెళతాయి. కానీ అవి ఆగవు. అంటే దీనివల్ల చేపట్టిన పని పూర్తయ్యే వరకు లక్ష్యాన్ని సాధించే వరకూ ఆగకూడదని నిగూఢం గా చీమలు మనకు తెలియ చేస్తున్నాయి. అలాగే, చీమలు వేసవి కాలంలో శీతాకాలం గురించే ఆలోచిస్తాయి. చలి కాలానికి కావల్సిన ఆహారాన్ని కూడా అవి వేసవిలోనూ సేకరిస్తాయి. అంతేకాదు రుతువుల్లోని మార్పులకు అవి అసంతృప్తి ప్రకటించవు. సముద్రపుటొడ్డున ఇసుకలో సూర్యరశ్మిలో ఆనందిస్తున్నట్టే, ఈత కొట్టడానికి దిగే ముందు సముద్రపు అడుగునుండే బండరాళ్ళ గురించి ఆలోచించాలి. అందువల్ల ఎప్పుడూ ఆచరణాత్మకంగా ఉండాలి, నిశ్చయాత్మకంగా ఆలోచించాలని తెలుసుకోవాలి. చీమ శీతాకాలం గురించి ఆలోచిస్తూనే, ఎంతోకాలం అది ఉండదని, త్వరలోనే దానినుంచి బయటపడతామని తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. అలాగే మనిషి కూడా ఎల్లపుడూ కష్టాల గురించి ఆలోచించకుండా నిశ్చయాత్మకంగా ఆలోచించాలి. ఎందుకంటే చీకటి తరువాత వెలుతురు కూడా వస్తుందని గుర్తెరిగి మసలుకోవాలి. జీవితం పట్ల ఆసక్తి, నిశ్చయాత్మక మనో వైఖ రుల వల్ల ప్రతిబంధకాలను సైతం అధిగమించవచ్చు. మానవ దేహాన్ని, మనస్సును కావల్సిన విధంగా మలచుకోవచ్చు. అంకిత భావం, క్రమ శిక్షణ, ఆత్మ విశ్వాసం, నిశ్చయాత్మక మనో వైఖరి, కష్టపడి పనిచేయడం అనేవి మానవ మేధకు ప్రోత్సాహానిస్తాయి. అలాగే, అపరాధ భావం, వైరం, విచారం లాంటి వ్యతిరేక భావాల్ని తొలగించుకుని ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత, స్వయంశిక్షణ లాంటి విశిష్ట గుణాలు అభివృద్ధి చేసుకుంటే జీవితం నందనవనం అవుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరిలోనూ నమ్మశక్యం కానంతటి దక్షత, కౌశలం, దివ్యసంపద ఉన్నాయి. అయినా వాటిని చాలా మంది గుర్తించడం లేదు. అందువల్ల మన గురించి మనం స్వయంగా తెలుసుకోవడానికి మానసికంగా మనల్ని మనం శోధించి, పరిశీలించుకోవాలి. దీనివల్ల మనకు కీడు జరగదు. దీనికి కావల్సింది స్వయంశిక్షణ. గొప్ప పరిశోధనలూ, జీవితంలోని అన్ని రంగాల్లోనూ పరిపూర్ణ విజయ సాధకులకూ వెనుక ఉన్న రహస్యం ఇదే. వారంతా స్వయం శిక్షణ అలవరచుకోవడమే. ఆరోగ్యకర ఆహారాన్ని స్వీకరించడం, యోగాసనాలు, తదితర వ్యాయామాల ద్వారా శారీరక క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే జీవశక్తుల్ని ప్రాణాయామం ద్వారా నియంత్రించి శ్వాస పీల్చడంలో క్రమశిక్షణను అలవరచుకోవచ్చు. వ్యర్థ ప్రసంగాలతో కాలాన్ని, శక్తిని వృథా చేయకుండా మౌనంగా ఉండడం మాటలాడడంలో క్రమశిక్షణ ను తెలుపుతుంది. అలాగే గ్రంథపఠనం ద్వారా ఆలోచనలు, భావనలు పవిత్రం చేసుకోవడం ద్వారా భావనల్లో క్రమశిక్షణ అలవడుతుంది. ప్రార్థనలు, తీవ్రమైన జప ధ్యానాలు చేయడం ద్వారా వివేచన కలిగి అంతర్గత స్వభావంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. దారంపోగు ఒక్కటిగా ఉన్నపుడు చాలా బలహీనంగా ఉంటుంది. అయితే అలాంటి ఎన్నో దారం పోగులను కలిపి తాడుగా పేనినట్లయితే ఆ తాడు ఏనుగును కూడా బంధించగలదు. అలాగే నిశ్చయాత్మకమైన భావనలు అనే బలవర్ధకమైన నియమిత ఆహారాన్ని మన మనస్సులలోకి ఎక్కించాలి. అప్పుడే మనం యోగ్యులుగా పరిణితి చెందుతాం. వ్యతిరేక భావనల్ని అధిగమించడంలో స్వయం శిక్షణ బాగా తోడ్పడుతుంది. కష్టాలను, ఆపదలనూ ఎదుర్కొనేందుకు దృఢమైన విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ప్రోది చేసుకోవడానికి క్రమ శిక్షణ ఆ క్రమశిక్షణ ద్వారా స్వీయ శిక్షణ అలవడుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అలాగే, మనలో పేరుకుపోయిన వ్యతిరేక భావాల్ని సహజమైన క్రమశిక్షణ ద్వారా తొలగించడం సాధ్యమేనన్న విషయాన్ని గుర్తించి మసలుకోవాలి. – దాసరి దుర్గా ప్రసాద్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement