-
వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో నూతన వైద్య విధానాలపై పరిశోధనలు చేసేలా వైద్యులు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పరిష్కారాలపై ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందుకు కళాశాలలో మల్టిడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్(ఎంఆర్యూ)ను ఏర్పాటు చేశారు. దీని కేంద్రంగా వివిధ విభాగాల్లోని వైద్యులు, పోస్ట్రుగాడ్యుయేట్ విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. అందుకయ్యే ఖర్చును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేయనుంది. అయితే ముందుగా పరిశోధనలకు కళాశాల ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొందాలి. ఇలా అనుమతి పొందిన పరిశోధనలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఏం పరిశోధనలు చేయాలనుకుంటున్నారు? ఎలా చేస్తారు? ఏ అంశంపై చేస్తారు? అనే వివరాలను పేపర్ ప్రజెంటేషన్ రూపంలో సమర్పించాల్సి ఉంది. వీటిని వైద్య కళాశాలలోని ఎథికల్ కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపుతారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చాక పరిశోధనలు ప్రారంభించవచ్చు. పలు విభాగాల్లో పరిశోధనలు సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇప్పటికే ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేశారు. ప్రస్తుతం కమ్యూనిటీ మెడిసిన్(ఎస్పీఎం)లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అలాగే పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలకు ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అక్కడి నుంచి అనుమతి రావాల్సి ఉంది. క్లినికల్ రీసెర్చ్ సైతం.. ఔషధ రంగంలో కొత్తగా కనిపెట్టిన మందుల పనితీరుపై కూడా సిద్ధార్థ వైద్య కళాశాలలో క్లినికల్ రీసెర్చ్ చేస్తున్నారు. ఆయా వ్యాధులకు మందులు ఎలా పనిచేస్తున్నాయి? వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వీటికి సైతం ముందుగా ఎథికల్ కమిటీ నుంచి అనుమతులు తప్పనిసరి. అలాగే రోగి అంగీకారం కూడా అవసరం. కాగా కళాశాలలో జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ అందుబాటులో ఉంది. ఇందులో కొత్తగా సోకే వ్యాధుల జీన్స్, ఏ రకం వ్యాధి అనేది గుర్తించనున్నారు. కరోనాలో కొత్త వేరియెంట్లతో పాటు హెచ్3ఎన్2 వైరస్ వంటి వాటిని కూడా గుర్తించే సదుపాయం ఉంది. అందుబాటులోకి నూతన వైద్య విధానాలు ఇప్పటివరకు వివిధ వ్యాధులకు ఎక్కడో చేసిన పరిశోధనల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. అలా కాకుండా మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పద్ధతులపై ఇక్కడే పరిశోధనలు చేయడం ద్వారా నూతన వైద్య విధానాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు చేసే పరిశోధనల్లో వైద్య విద్యార్థులు సైతం భాగస్వాములు కానుండటంతో వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చదువుకునే సమయంలోనే పరిశోధనలపై పట్టు సాధించడంతో పాటు కొత్త విధానాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. కొత్త చికిత్సలపై అవగాహన పెరుగుతుంది.. వైద్య కళాశాలలోని పలు విభాగాల్లో పరిశోధనలతో వైద్య విద్యార్థుల్లో పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. నూతన వైద్య విధానాలు, కొత్త చికిత్సలపై అవగాహన పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తయ్యాయి. పరిశోధనల కోసం వైద్య కళాశాలలో ప్రత్యేకంగా మలీ్టడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ను ఏర్పాటు చేశాం. –డాక్టర్ కంచర్ల సుధాకర్, ప్రిన్సిపాల్, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ -
Covid-19: దేశాన్ని గడగడలాడించింది ఈ వేరియంటే..
సాక్షి, అమరావతి: ‘కరోనా వైరస్ వ్యాప్తి 2020 మార్చి నుంచి ఉన్నా వేరియంట్లపై మనం ఎక్కువ దృష్టి సారించింది సెకండ్ వేవ్లోనే. దేశంలో అత్యంత ప్రభావం చూపింది డెల్టా వేరియంటే. ఈ రోజుకు కూడా డెల్టా వేరియంట్ వివిధ రాష్ట్రాల్లో ఉంది. తదుపరి మరో 25 రకాల ఉప (సబ్ లీనియన్స్) వేరియంట్లను సృష్టించుకుంది. వాటినే ‘ఏవై 1 – ఏవై 25’ అని వ్యవహరిస్తున్నాం..’ అని హైదరాబాద్లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందుకూరి తెలిపారు. ఏపీలో శాటిలైట్ సెంటర్ (జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ) ఏర్పాటు కోసం సిద్ధార్థ మెడికల్ కాలేజీని పరిశీలించేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలివీ... థర్డ్వేవ్ ముప్పు ఏమేరకు ఉండవచ్చు? థర్డ్ వేవ్పై ఏం మాట్లాడినా అది ఊహాజనితం అవుతుంది. మనం ఇప్పుడు సెకండ్ వేవ్ చివరి దశలో ఉన్నాం. థర్డ్వేవ్ వస్తుందా.. రాదా? అనేది ఎవరూ చెప్పలేరు. ఒక్కసారి దేశంలో ఇన్ఫ్లుయంజా వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉందో తెలిసిందే. దీనిపై కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి. థర్డ్వేవ్ అనేది రకరకాల పరిస్థితులపై ఆధారపడి ఉంది. డెల్టా వేరియంట్ ప్రభావం ఎంత? దేశాన్ని గడగడలాడించింది ఇదే. దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా శాంపిళ్లు జినోమిక్ సర్వే చేస్తే డెల్టా ప్రభావమే ఎక్కువగా ఉంది. దీనికి మళ్లీ ఏవై పేరుతో 25 ఉప వేరియంట్లు వచ్చాయి. వీటిలో ఏవై 12, ఏవై 4 అనే రెండు మాత్రమే ప్రభావం చూపాయి. డెల్టా తర్వాత ఏ వేరియంట్ ప్రభావం చూపిస్తుందనేది చెప్పలేం. డెల్టా తర్వాత కొత్త వేరియంట్ రాలేదు. డెల్టా ప్లస్ అంటున్నారు కానీ దానిపై స్పష్టత లేదు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా కేసులు వచ్చాయి కదా? కరెక్టే. ఇది డెల్టా వేరియంట్ వల్లే. ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని మరీ ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. అందుకే కొంతమందికి వ్యాక్సిన్ తీసుకున్నా వచ్చింది. అయితే వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే వీరిలో తీవ్రత తక్కువ అని తేలింది. డెల్టా వేరియంట్కు వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కేరళలో కేసులు పెరగడానికి కారణాలేమిటి? కేరళలో ఇప్పుడు సెకండ్ వేవ్ పీక్ దశలో ఉంది. ఢిల్లీలో పీక్ దశలో ఉన్నప్పుడు కేరళలో సీరో సర్వెలైన్స్ 40 శాతమే ఉంది. అప్పుడు ఢిల్లీలో 70 శాతానికి పైగా ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో దశలో సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు కేరళలోనూ అంతే. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ చివరి దశలో ఉంది. స్కూళ్లు ప్రారంభమయ్యాయి కదా.. పరిస్థితి ఏమిటి? స్కూళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే. బాగా వెంటిలేషన్ (వెలుతురు), ఫ్యాన్ తిరుగుతూ ఉంటే సమస్య ఉండదు. జర్మనీలో ఇది నిర్ధారణ అయింది. అందుకే పిల్లలను బాగా వెంటిలేషన్ ఉన్న గదుల్లో ఉంచమని చెబుతున్నాం. భవిష్యత్ పరిణామాలను ఎలా ఎదుర్కోగలం? అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. కిక్కిరిసిన జన సమూహాలు (మాస్ గ్యాథరింగ్స్) లేకుండా చూసుకోవడం, మాస్కులు విధిగా ధరించడం వల్ల థర్డ్వేవ్ను చాలావరకూ నిలువరించవచ్చు. ప్రజలు తీసుకునే జాగ్రత్తలు, వ్యవహరించే తీరును బట్టే వైరస్ పోకడ ఉంటుంది. చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉందా? అలాగని ఏమీ లేదు. ఇప్పటివరకూ వాళ్లు తక్కువగా ప్రభావితమయ్యారు. వ్యాక్సిన్ ఇవ్వలేదు కాబట్టి పిల్లలకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. పిల్లలకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ఎక్కడా లేదు. శాటిలైట్ ల్యాబొరేటరీ వల్ల ఉపయోగాలేమిటి? దేశవ్యాప్తంగా శాటిలైట్ ల్యాబొరేటరీలు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంతవరకూ వైరస్ పరివర్తనాలు, ఎలాంటి వైరస్లు ఉన్నాయి లాంటివాటిని తెలుసుకునేందుకు హైదరాబాద్లోని సీసీఎంబీకి పంపేవారు. విజయవాడలో ఏర్పాటు చేస్తే ఇక్కడే నమూనాలను పరిశీలించవచ్చు. దాన్ని బట్టి ఏ వేరియంట్ వస్తే ఎలా చికిత్స చేయవచ్చు అనేది తెలుస్తుంది. ప్రస్తుతం సీసీఎంబీకి పంపిస్తున్న నమూనాలు కూడా యథావిధిగా వెళతాయి. దీనికి సుమారు రూ.కోటిన్నర ఖర్చవుతుంది. నెలకు గరిష్టంగా రెండు వేల వరకూ నమూనాలను పరిశీలించే అవకాశం ఉంది. జినోమిక్ ల్యాబ్ ఏర్పాటుపై ఎంవోయూ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో శాటిలైట్ సెంటర్ (జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ)ఏర్పాటుకు సంబంధించి సీసీఎంబీ డైరెక్టర్ డా.వినయ్ నందుకూరితో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ గురువారం ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టుకు స్టేట్ బ్యాంక్ ఇండియా ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందిస్తోంది. ల్యాబ్ ఎస్బీఐ ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందచేస్తుంది. ల్యాబ్కు కావాల్సిన స్థలం, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. సాంకేతిక సహకారాన్ని జాన్ హాప్కిన్స్ సంస్థ అందిస్తుంది. కరోనా వైరస్కు సంబంధించిన వేరియంట్ల ఉనికిని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ నెలకు 2 వేల నమూనాలను పరిశీలించే అవకాశం ఉంది. నెల రోజుల్లో ల్యాబ్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జినోమిక్ సీక్వెన్స్తో రకరకాల వేరియంట్ల ఉనికిని తెలుసుకోవడం వల్ల చికిత్సను ఎప్పటికప్పుడు మార్చుకునే వీలు కలుగుతుంది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వస్తే ఈ ల్యాబ్ను మరోరకంగా కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. వైరస్ బలహీనపడే అవకాశాలున్నాయా? చెప్పలేం. గతంలో ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అది బలహీనపడుతూ వచ్చింది. కరోనా వైరస్ కూడా మన దేశానికి వచ్చి రెండేళ్లు కావస్తోంది. బలహీన పడుతుందని ఆశాభావంతో ఉన్నాం. దీంతో పాటు ప్రజల్లో కూడా ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది కదా. డెల్టా కంటే ప్రభావవంతమైన వేరియంట్ వస్తే తప్ప అంతగా ప్రభావం ఉండదని భావిస్తున్నాం. త్వరగా వ్యాక్సినేషన్ చేయగలిగితే చాలామటుకు వైరస్ నుంచి రక్షణ పొందే అవకాశాలున్నాయి. -
ప్రజారోగ్య రథయాత్ర
ఈ రోజు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చరిత్రలో గొప్పగా చెప్పుకోదగ్గ రోజు. ఎందుకంటే.. 1,088 కొత్త అంబులెన్స్లను ప్రారంభించాము. అవి రోడ్డుపై పోతూ ఉంటే.. మనస్సుకు ఎంతో ఆనందం కలిగింది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి వివిధ జిల్లాలకు ప్రయాణమైపోతున్న వాహనాలను చూసి ఎంతో సంతోషం కలిగింది. ఇది ఒక రికార్డు. ఇన్ని అధునాతన అంబులెన్స్లను ఒకేరోజు ప్రారంభించడం, జిల్లాలకు పంపించడం అనేది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘట్టం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అది విజయవాడ నడిబొడ్డున ఉన్న బెంజ్ సర్కిల్.. బుధవారం ఉదయం సరిగ్గా 9 గంటలా 25 నిమిషాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరునవ్వుతో కాన్వాయ్లో నుంచి కిందకు దిగారు.. అప్పటికే బారులు తీరి సేవల రంగంలోకి ఉరికేందుకు 108, 104 వాహనాలు కనుచూపు మేర సిద్ధంగా ఉన్నాయి.. సీఎం వైఎస్ జగన్ జెండా ఊపగానే ఒక్కసారిగా కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ పరుగులు తీశాయి. కనీ వినీ ఎరుగుని రీతిలో వాహన శ్రేణి ఒక్కసారిగా చూడముచ్చటగా ముందుకు సాగిపోతుంటే కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులు కళ్లార్పకుండా చూస్తూనే ఉన్నారు. ప్రాంగణాన్ని దాటుకుని వెళుతున్న ప్రతి వాహనానికి రెండు చేతులూ జోడించి ముఖ్యమంత్రి నమస్కరిస్తుండగా, అంబులెన్స్ డ్రైవర్లు ప్రతి నమస్కారం చేస్తూ వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు వాహన శ్రేణి కదులుతూన్నంత సేపూ వేదిక మీద నిల్చొని ముఖ్యమంత్రి అభివాదం చేసిన దృశ్యం అంబులెన్స్ సిబ్బందికే కాదు.. రాష్ట్ర ప్రజలందరినీ ముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అంబులెన్స్ల వ్యవస్థపై చూపిన శ్రద్ధ ఇప్పుడు ఆయన తనయుడిగా సీఎం వైఎస్ జగన్ చూపిస్తున్నారని అక్కడున్న పలువురు చర్చించుకోవడం కనిపించింది. మంత్రులు ఆళ్లనాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మరికొంత మంది ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బారులు తీరిన అంబులెన్స్లు ► రెండు మాసాలుగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఆయా వాహనాలన్నీ ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుకున్నాయి. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి ఉన్నాయి. ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను ప్రారంభించగానే 412 కొత్త 108 వాహనాలు, 676 కొత్త 104 వాహనాలు సైరన్ మోగిస్తూ.. కేటాయించిన జిల్లాలకు బయలుదేరాయి. ► సీఎం ప్రతి ఒక్క వాహన చోదకుడికీ అభివాదం చేశారు. దీంతో డ్రైవర్లు, టెక్నీషియన్ల ముఖంలో ఆనందం కనిపించింది. ► బెంజి సర్కిల్ నుంచి కొన్ని వాహనాలు రామవరప్పాడు వైపు, మరికొన్ని వారధి వైపు వెళ్లాయి. రూ.203 కోట్లు వ్యయం చేసి ఇంత పెద్ద స్థాయిలో వాహనాలు కొనుగోలు చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని అక్కడకు వచ్చిన వారు చర్చించుకున్నారు. డీజిల్ లేదు.. టైర్లు పోయాయన్న మాటే లేకుండా.. ► గతంలో డీజిల్ లేక, టైర్లు దెబ్బతిని అంబులెన్స్లు ఆగిపోయిన సందర్భాలు కోకొల్లలు. అది గతం. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త వాహనాలను ఏర్పాటు చేసింది. ► మండలానికి కేటాయించిన అంబులెన్స్ను ఈఆర్సీ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్)కు అనుసంధానించింది. ఫోన్ చేయగానే 15 నిమిషాల్లో ఘటనా స్థలికి వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన నియోనేటల్ అంబులెన్స్లు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సమూల మార్పులతో 104 వాహనాలు ► 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్న 104 వాహనాలే మొన్నటి వరకూ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమూ కొత్తవి కొనలేదు. మెజారిటీ వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి. ► అందుకే ఒక్కటంటే ఒక్క పాత వాహనాన్ని తీసుకోకుండా మండలానికి ఒకటి లెక్కన 676 వాహనాలూ కొత్తగా కొన్నారు. ► ఈ వాహనాలు ప్రతి పల్లెనూ నెలలో ఒకసారి తాకి రావాల్సిందే. ఆ ఊళ్లో ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిందే. గతంలో 52 రకాల మందులు.. ఇప్పుడు 74 రకాల మందులు. రక్త పరీక్షలు అక్కడికక్కడే చేస్తారు. ► ప్రతి వాహనమూ ప్రాథమిక కేంద్రానికి అనుసంధానమై ఉంటుంది. రోగుల వివరాలతో పాటు సమస్త సమాచారాన్ని క్యూఆర్ కోడ్తో కూడిన ఎలక్ట్రానిక్ కార్డులో నిక్షిప్తం చేస్తారు. దీంతో జబ్బుల ఉనికిని త్వరగా కనుక్కుని ముందస్తు చర్యలు తీసుకునే వీలుంటుంది. ► వైద్య సేవలే కాకుండా మాతా శిశు మరణాలు అరికట్టడం, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటం, పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి సేవలు అందించడం, సీజన్ను బట్టి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివన్నీ ఇకపై 104 వాహనాల ద్వారానే చేస్తారు. -
కుయ్.. కుయ్.. ఇక కొత్తగా
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108, 104 అంబులెన్స్లను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన సీఎం జగన్ ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108, 104 సర్వీసులను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేయగా, ఇప్పుడు సీఎం జగన్ వాటికి అత్యాధునిక వైద్య సేవలను జోడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 108 సర్వీసుల్లో మార్పులు ► అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్లను కూడా వినియోగించనున్నారు. ► కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్లలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)గా తీర్చిదిద్దారు. ► మరో 26 అంబులెన్స్లను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఎన్నో సదుపాయాలు ► బీఎల్ఎస్ అంబులెన్స్లలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్ఎస్ అంబులెన్స్లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. నియో నేటల్ అంబులెన్స్లలో ఇన్క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు. జనాభా–అంబులెన్స్ల నిష్పత్తి ► గతంలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండనుంది. ► గతంలో సంవత్సరానికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆవరణలో 104,108 వాహనాలు ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు ► ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేస్తారు. ► ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఉంటుంది. ► ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, రోగుల డేటాను ఆన్లైన్లో అప్డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేయడం సులువు అవుతుంది. వేగంగా సేవలు ► పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్లు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ► ప్రతి అంబులెన్స్ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. ► ప్రతి అంబులెన్స్లో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్టీ) బాక్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎంఎంయూల్లో 20 రకాల సేవలు ► మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ మొత్తం 20 రకాల సేవలందించేలా 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది. ► అన్నీ కలిపి ఒకేసారి మొత్తం 1,088 వాహనాలను సీఎం జగన్ బుధవారం ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.203 కోట్లు ఖర్చు చేసింది. కొత్త, పాత అంబులెన్స్లతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ.318.93 కోట్లు ఖర్చు కానుంది. 104 సర్వీసుల్లో మార్పులు.. కొత్తగా 676 వాహనాలు ► మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక 104 సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 676 సర్వీసులను సిద్ధం చేశారు. గతానికి ఇప్పటికీ మార్పు ► రాష్ట్రంలో గతంలో 108 అంబులెన్స్లు 440కి గాను ప్రతి మండలం (676 మండలాలు)తో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ సేవలందించనున్నాయి. ► మండలానికి ఒకటి చొప్పున ఉండే 104 వాహనాలు నెలలో ఒక రోజు ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులను ఇవ్వనున్నాయి. ► రోజుకు ఒక గ్రామ సచివాలయాన్ని సందర్శించడంతో పాటు రోజంతా ఆ గ్రామంలో డాక్టర్లు ఉంటారు. గ్రామంలోని ఇళ్లను, అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను కూడా సందర్శించి వైద్య సేవలు అందిస్తారు. ► గ్రామీణ ప్రాంతాల్లో ఒకే డాక్టర్ ద్వారా వైద్య సేవలు కల్పించడం ద్వారా విదేశాల తరహాలో ఫ్యామిలీ డాక్టర్గా మంచి సేవలు అందించడానికి వీలుంటుంది. ► గతంలో 104 అంబులెన్స్లు (ఎంఎంయూ) 292 మాత్రమే (మూడు మండలాలకు ఒకటి) ఉండగా, ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలతో పాటు 74 రకాల ఔషధాలు అందుబాటులో ఉంటాయి. గతంలో 52 ఔషధాలు మాత్రమే ఉండేవి. ► ఇప్పుడు హైపర్ టెన్షన్ (బీపీ), మధుమేహం (సుగర్), సాధారణ అవుట్ పేషంట్లకు చికిత్స అందించడంతో పాటు మలేరియా, టీబీ, లెప్రసీ, మాతా శిశు సంరక్షణ, తదితర 20 రకాల వైద్య సేవలకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ► సీజనల్ వ్యాధులతో సహా 29 పరికరాలతో అంటువ్యాధులు, ఇతర వ్యాధుల స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. గతంలో ఈ అంబులెన్స్లలో కేవలం వైద్యులు మాత్రమే అతి కష్టం మీద అందుబాటులో ఉండేవారు. ► ప్రస్తుతం 104 సర్వీసుల్లో మొత్తం 744 మంది వైద్యులు సేవలందించనున్నారు. వీటిని డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. తద్వారా అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా వైద్య సేవలు అందనున్నాయి. ► గతంలో 292 వాహనాలతో రోజుకు కేవలం 20 వేల మంది రోగులకు సేవలందించగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 676 సర్వీసుల ద్వారా రోజూ 40,560 మందికి సేవలందుతాయి. నేడు సువర్ణ అధ్యాయానికి నాంది ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని రాష్ట్ర ప్రజారోగ్య రంగంలో ఒక సువర్ణ అధ్యాయానికి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంది పలుకుతున్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1088 కొత్త 108, 104 వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం 9 గంటల సమయంలో సీఎం ప్రారంభించనున్నారని వెల్లడించారు. దివంగత వైఎస్సార్ ప్రారంభించిన ఈ సేవలను చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్సార్ రహదారి భద్రతకు 108 సర్వీస్ లింక్ ► 108 అంబులెన్స్ సర్వీసులకు కొత్తగా ప్రారంభిస్తున్న డాక్టర్ వైఎస్సార్ రహదారి భద్రత కార్యక్రమాన్ని లింక్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి దీని ద్వారా ఆస్పత్రులలో ఉచితంగా వైద్య సేవలందిస్తారు. ► రెండు రోజుల పాటు లేదా గరిష్టంగా రూ.50 వేల వ్యయం వరకు వైద్య సేవలందిస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. -
హవ్వ..ఇదేం తీరు...అమాత్యా?!
మరమ్మతులకు ఎన్ని శిలాఫలకాలు వేస్తారు ఆగస్టు 8న మరమ్మతు పనులకు కొత్తాస్పత్రిలో మంత్రి శిలాఫలకాలు మళ్లీ సోమవారం పాత ఆస్పత్రిలో అదేమంటే ఇంజినీర్లు సరిగా పనిచేయాలని హితబోధ లబ్బీపేట: ఆర్భాటపు ప్రచారం మినహా ..అభివృద్ధి శూన్యమనే దాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తీరే నిదర్శనంగా మారుతోంది. ఆస్పత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులతో చేపట్టిన మరమ్మతు పనులను ఈ నెల 8న కొత్తాస్పత్రిలో ఆర్భాటంగా శిలాఫలకాలు వేసి ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , మళ్లీ అదే పనులకు సంబంధించి సోమవారం పాత ఆస్పత్రిలో శిలాఫలకాలను మంత్రి కామినేని నిస్సిగ్గుగా ఆవిష్కరించారు. ఆస్పత్రి అభివృద్ధికి తామేమి నిధులు ఇవ్వకపోయినా, ఆస్పత్రి ఆరోగ్యశ్రీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఏకంగా రెండు శిలాఫలకాలు ఆవిష్కరించి ఆర్భాటపు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పరికరాల నిధులు..ప్యాచ్ వర్క్లుకా..? ప్రభుత్వాస్పత్రిలో 2008 సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించిన సేవలకుగాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నిధులు ప్రభుత్వం వద్ద ఉంచారు. వాటితో నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఒకవైపు ఆపరేషన్ థియేటర్లో సరైన పరికరాలు లేక ఇబ్బందులు ఎదురవడంతోపాటు, వ్యాధి నిర్థారణ పరీక్షలకు అవసరమైన అత్యాధునిక పరికరాలు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో తమ ప్రచారం కోసం... పరికరాలు కోసం ఉంచిన రూ. 4 కోట్లు నిధులను ప్యాచ్ వర్క్ల కోసం కేటాయించి,ఏకంగా రెండు ఆస్పత్రిల్లో రెండు శిలాఫలకాలు వేయించేసుకున్నారు. ఎక్కైడె నా కొత్త భవనాలు ప్రారంభోత్సవానికి, నిర్మాణాలను శిలాఫలకాలు వేస్తారు కానీ, ఈ మంత్రి రిపేర్లకు శిలాఫలకాలు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారు. స్థానిక నేతల కోసమేనా రెండు ప్రాంతాల్లో శిలా ఫలకాలు స్థానిక ఎమ్మెల్యేలు, అభివృద్ధి కమిటీ సభ్యుల పేర్లు కోసం తాపత్రయ పడి వేసినట్లు సమాచారం. వారు వేసినప్పటికీ నిసిగ్గుగా వైద్య మంత్రి వచ్చి ప్రారంభించడమేమిటని పలువురు మండి పడుతున్నారు. రెండు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేసేందుకు రూ.లక్షకు పైగా సొమ్ము దుర్వినియోగం అయినందనే వాదన వినిపిస్తుంది. ఇప్పటికైన ఎమ్మెల్యేలు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలనే కానీ, ఆర్భాటపు ప్రచారానికి కాదని హితవు పలుకుతున్నారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎం ఎస్ఎస్వై ద్వారా మంజూరైన నిధులకు సంబంధించి భవన నిర్మాణానికి సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆ నిధులు మళ్లీ వెనక్కివెళ్లే అవకాశం వుందని నిపుణులు సూచిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement