-
హ్యాపీ స్పేస్
యాంత్రిక ప్రయాణంలో పోటీ ఎప్పుడూ ఉండేదే! కానీ, చంటిబిడ్డ తన జీవనంలోకి వచ్చినప్పుడు అమ్మ కళ్లలో.. కలల్లో చుట్టూ జీవం ఉండాలనుకుంటుంది. ‘ఆ ప్రయాస నుంచి పుట్టుకువచ్చిందే నా ప్రకృతి ఎకో ప్లే థీమ్’ అంటోంది భార్గవి. హైదరాబాద్ అల్వాల్లో ఉంటున్న భార్గవి నేచురల్ కలర్స్ వాడకం గురించి అపార్ట్మెంట్ పిల్లలకు పరిచయం చేస్తూ కనిపించారు. ఆసక్తితో ఆమె చేస్తున్న పని గురించి ప్రశ్నించినప్పుడు పిల్లల కోసం తను సృష్టించిన సహజ ప్రపంచాన్ని మన ముందుంచారు.. ‘‘పుట్టింది మెదక్ జిల్లాలో. ఎమ్టెక్ చేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో బిజీ బిజీగా మారిపోయాను. పెళ్లై, పిల్లలు జీవితంలోకి వచ్చాక నాలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. మూడేళ్ల నా కూతురు స్వతంత్రంగా ఎదగాలంటే ఏదైనా హ్యాపీ స్పేస్ ఉందా.. అని వెతికాను. కానీ, నాకేవీ సంతృప్తినివ్వలేదు. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే పిల్లల వికాసం అంత బాగుంటుంది అనే తపన నాది. దీంతో చాలారోజులు ఆలోచించాను. నా సేవింగ్స్ ఎంత ఉన్నాయో చూసుకున్నాను. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆరేళ్లక్రితం నా ఇద్దరు పిల్లలతో ఈ థీమ్ ప్రాజెక్ట్ను ప్రారంభించాను. ఇప్పుడు ముప్పైమంది పిల్లలు ఉన్నారు. ఈ ముప్పై సంఖ్య దగ్గరే నేను కటాఫ్ పెట్టుకున్నాను. స్వలాభం ఏ మాత్రం చూసుకోని ఒక ప్రాజెక్ట్ ఇది. నాకై నేను నా పిల్లలకోసం సృష్టించుకున్న ప్రపంచం. ఈ పిల్లలు ఎదిగి, పైస్కూళ్లకు వెళ్లినప్పుడు ఎంత ప్రతిభను చూపిస్తున్నారో స్వయంగా తెలుసుకుంటున్నాను. ఈ హ్యాపీ స్పేస్లో పిల్లలు చేసే అద్భుతాలు కళ్లారా చూడాల్సిందే. అందమైన పెయింట్స్ వేస్తుంటారు. సీడ్ బాల్స్తయారుచేస్తారు. కాగితాలతో బొమ్మలు తయారుచేస్తారు. కూరగాయలు, పువ్వులతో రంగులు తయారుచేస్తారు. తొమ్మిదేళ్ల పాప ఫిక్షన్ స్టోరీస్ రాసి, బుక్ కూడా పబ్లిష్ చేసింది.ఆరుబయట చెట్ల కింద రాలిపడిన పూలు, విత్తనాలను ఏరుకొచ్చి, ఒక్కోదాని గురించి వివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారికి ఇష్టమైన పండ్లు, కూరగాయలతో సలాడ్స్ చేస్తుంటారు. ప్రతీదీ నిశితంగా పరిశీలించడం వల్ల వారిలో ఎంతటి అవగాహన పెరుగుతుందో స్వయంగా చూస్తుంటాం. ఇది వారి మానసిక వికాసానికి ఎంతో మేలు కలిగిస్తుంది. హ్యాండీ క్రాఫ్ట్ తయారీలో పిల్లల చూపే ప్రతిభ చాలా సృజనాత్మకంగా ఉంటుంది. పిల్లలను స్వతంత్రంగా ఎదగనిస్తే ఎన్ని అద్భుతాలు చూపుతారో స్వయంగా నేనే తెలుసుకుంటూ ఆశ్చర్యపోతుంటాను. రెండేళ్ల నుంచి పద్నాలుగేళ్ల పిల్లలు ఈ గ్రూప్లో ఉన్నారు. పిల్లలు వేసే ప్రశ్నలే ఈ ఎకో థీమ్లో పాఠ్యాంశాలు. ఎవరికీ నచ్చలేదు... మా దగ్గరకు వచ్చే పిల్లల్లో ఇప్పుడు స్పెషల్ కిడ్స్ కూడా ఉన్నారు. వారిలో ఎంత ఆర్ట్ ఉందో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాను. చాలా మంది పేరెంట్స్ ముందు నా థీమ్ను ఏ మాత్రం నమ్మలేదు. ‘పిల్లలకు ఈమె ఏమీ నేర్పడం లేదు. ఆడుకోవడానికి వదిలేస్తున్నారు. క్రమశిక్షణగా పిల్లలు ఒక్క దగ్గర కూర్చోవడం లేద’ని చాలా మంది తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. కోవిడ్ టైమ్లో అయితే అందరూ మూసేయమనే సలహాలే. మా ఇంటి నుంచి మరీ ఎక్కువగా వచ్చాయి. ‘జాబ్ మానేసి, ఇలాంటి ప్రాజెక్ట్ వద్దు, ఎలాంటి లాభాలూ ఉండవు’ అనే మాటలే నా చుట్టూ విన్నాను. కానీ, లాభం కోసం ఈ థీమ్ని ఎంచుకోలేదు. నా పిల్లల కోసం ఎంచుకున్నాను. నేను నమ్మిన ఈ సిస్టమ్పై నాకు చాలా నమ్మకం ఉంది. నా ఈ థీమ్కు తగిన టీచర్లను ఎంపిక చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. దీంతో నేనే కొందరిని ఎంపిక చేసుకొని, నాకు తగినవిధంగా ట్రైన్ చేసుకున్నాను. అదే పట్టుదలతో కొనసాగించాను. ఫైనాన్షియల్గా ఇది సక్సెస్ఫుల్ అని చెప్పలేం. కానీ, ఎప్పటికీ నిలిచే ఉండేది, నాకు సంతృప్తిగా అనిపించిన ప్రపంచం ఇదే. దానినే పిల్లలకు పరిచయం చేయాలనుకున్నాను. నా పిల్లలనూ ఈ ప్రపంచంలో పెంచడం చాలా హ్యాపీగా ఉంది. అవగాహన కార్యక్రమాలు... ఈ థీమ్ వల్ల పిల్లల్లో జరిగే మానసిక వికాసం ఎంతగా ఉంటుందో తెలియజేస్తూ కార్పోరేట్ స్కూళ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్లు నిర్వహిస్తున్నాం. పిల్లల్లోని స్వయంప్రతిభ ఎలా ఉంటుందో, వారిని వారిలాగే ఎలా ఎదగనివ్వాలో మా నేచర్ పిల్లలను పరిచయం చేసి, మరీ చూపుతుంటాను. రోజువారీ మనకు ఏం అవసరమో వాటన్నింటినీ స్వయంగా ఇక్కడి పిల్లలు చేస్తుంటారు. వాళ్లే వంట చేయడం, తినడం.. ఏదీ కూడా చెప్పకుండానే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ, తమ ప్రతిభను చూపుతుంటారు. లాభాపేక్ష లేకుండా చేసే ఈ పని రాబోయే తరాలకు ప్రయోజనం కలిగించడమే నాకు వచ్చే ఆదాయం’ అని చెబుతోంది భార్గవి. – నిర్మలారెడ్డి ఫొటో: మోహనాచారి -
డ్రోన్లతో అటవీ భూమిలో 10 వేల సీడ్ బాల్స్.. మారుత్ డ్రోన్స్ ఒప్పందం
ఆగ్రా/ఫిరోజాబాద్: ’హరా బహారా’ నినాదం కింద అడవుల పెంపకం కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ మారుత్ డ్రోన్స్ చేతులు కలిపింది. డ్రోన్ల ద్వారా ఆగ్రాకు సమీపంలో 10 ఎకరాల అటవీ భూమిలో 10,000 సీడ్ బాల్స్ను వెదజల్లింది. తమ సీడ్కాప్టర్స్ ద్వారా 2030 నాటికి 100 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. వృక్షారోపణ్ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే ప్రక్రియను నిర్వహించేందుకు ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లు, డ్రోన్ టెక్నాలజీ తోడ్పడగలవని ఉత్తర్ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ తెలిపారు. -
ఇక కొండలపై మొక్కల పెంపకం
సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై ఈ వర్షాకాలంలో ఒకే రోజు కోటి పండ్ల మొక్కలు నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. ఉపాధి హామీ పథకంలో.. కొండలపై మొక్క బతికేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి ఖర్చుతో అధికారులు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. సాధారణంగా మొక్కల పెంపకంలో ఒక్కో మొక్క నాటాలంటే.. గుంత తీసేందుకు కనీసం రూ.25, మొక్క కొనుగోలుకు రూ.25 నుంచి రూ.50.. ఇలా ఒక్కో మొక్కకే రూ.50 నుంచి 100 దాకా ఖర్చవుతుంది. అయితే సీడ్ బాల్స్ విధానంలో ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి మాత్రమే ఖర్చుపెట్టేలా కొండలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సేంద్రియ ఎరువులతో కూడిన షోషకాలు ఎక్కువగా ఉండే మట్టిని సిద్ధం చేసుకుని.. ఆ మట్టిని ఉండలు ఉండలుగా చేస్తారు. ఒక్కో ఉండలో నాటాల్సిన మొక్కకు సంబంధించిన విత్తనాన్ని ఉంచుతారు. ఎలాంటి నేలలోనైనా నామమాత్రపు తేమకే ఆ విత్తనం మొలకెత్తేలా ఆ మట్టి ఉండలు(సీడ్స్ బాల్స్) అత్యంత నాణ్యంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విత్తనం, మట్టి ఉండల తయారీకి అయ్యే ఖర్చు కూడా ఒక్కో దానికి అర్ధరూపాయి లోపే ఉంటుందంటున్నారు. కనీసం వెయ్యి కొండల్లో పదివేల చొప్పున.. ఈ వర్షాకాలంలో కొండలపై కోటి మొక్కలు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ.. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు మండలానికి రెండేసీ కొండలను ఎంపిక చేసుకోనుంది. మండలానికి కనీసం ఒక్క కొండపైనైనా ఈ సీడ్ బాల్స్ విధానంలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇలా రాష్ట్రంలో 660 మండలాల్లో కనీసం వెయ్యి కొండల్లో ఒక్కో కొండపై పది వేల చొప్పున మొక్కల పెంపకాన్ని చేపడతారు. ఉపాధి హామీ పథకం, వాటర్హెడ్ కార్యక్రమాల్లో భాగంగా గతంలో కూలీల ద్వారా వర్షం నీరు నిల్వలకు స్ట్రెంచ్ల తవ్వకం జరిపిన కొండలను ఎక్కువగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. కాగా, సీతాఫలం, ఉసిరి, రేగు వంటివాటితో పాటు కుంకుడు, వెలగ వంటి వాటినే ఈ మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. నీడకు పనికొచ్చే వేప, కానుగ మొక్కలను కూడా పెంచుతారు. కొండల గుర్తింపు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వర్షాకాలం మధ్య కల్లా కార్యక్రమాన్ని చేపడతామని అధికారులు వెల్లడించారు. -
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
ఏమిటీ విత్తన బంతులు.. ఎలా తయారు చేస్తారు?
సాక్షి, విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణలో కీలకమైన పచ్చని చెట్లను పెంచడానికి వీలైన అన్ని వనరులను అధికార యంత్రాంగం సమీకరిస్తోంది. రెండేళ్లుగా చేపడుతున్న ‘జగనన్న పచ్చతోరణం’ సత్ఫలితాలనిస్తుండడంతో.. పచ్చదనం పెంపునకు ఈ ఏడాది అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. విశాఖ జిల్లాలోని కొండలు, గుట్టలు, ఖాళీ స్థలాల్లో విసిరేందుకు సామాజిక అటవీ శాఖ 2 లక్షల విత్తన బంతులను తయారుచేయిస్తోంది. అడవులు సహజ సిద్ధంగా తయారు కావాలి. గుంతలు తవ్వి, మొక్కలు నాటి.. అడవులు సృష్టించాలంటే సాధ్యం కాని పని. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవి జీవ వైవిధ్యానికి అద్దం పడుతుంది. ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోయినా.. అడవుల్లో చెట్లు సహజ సిద్ధంగానే పెరుగుతాయి. ఇలాంటి అడవులను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా శ్రమిస్తోంది. ఇందుకోసం విలక్షణమైన విత్తన బంతుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. హరిత హారం అడవిలో అంతంత మాత్రంగా కనిపించడం, గుట్టలు, కొండల్లో పచ్చదనం కనుమరుగవుతున్న విషయాలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘జగనన్న పచ్చతోరణం’పేరుతో విత్తన బంతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏమిటీ విత్తన బంతులు? ప్రత్యేకంగా సంరక్షణ అవసరం లేకుండా.. ప్రకృతి సిద్ధంగా త్వరగా పెరిగే చెట్ల రకాలకు అధికారులు విత్తన బంతుల పద్ధతి అమలు చేస్తున్నారు. ముందుగా మన వాతావరణానికి అనుకూలమైన చింత, వేప, కానుగ, రెల్ల, కుంకుడు, ఏగిస మొదలైన చెట్ల నుంచి విత్తనాలు సేకరిస్తారు. జల్లెడ పట్టిన ఎర్రమట్టిని సిద్ధం చేస్తారు. 75 శాతం ఎర్రమట్టిలో 25 శాతం ఆవుపేడ, కొంత కోకాపిట్ను కలిపి ఎరువు మిశ్రమంగా తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని కలిపి వారం రోజులు మురుగబెడతారు. అనంతరం జీవామృతం(ఆవుపేడ, బెల్లం, శనగపిండి)తో మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి వీడిపోకుండా గట్టిగా ఉండేందుకు స్టార్చ్ లిక్విడ్, బబుల్ గ్లూ ద్రావణాలు మట్టి ముద్దలో కలుపుతారు. ఈ మట్టి ముద్దల్లో విత్తనాలను పెట్టి ఎండబెట్టారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత కందకాలు, గుట్టలు, కొండలు, సాగుకు పనికిరాని భూముల్లో విసురుతారు. అటవీ జాతి మొక్కలే కావడంతో సీడ్ బాల్స్ నుంచి విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. గతేడాది మంచి ఫలితాలు గతేడాది కూడా అటవీ శాఖ విత్తన బంతులను చల్లింది. మొత్తం 2 లక్షల విత్తన బంతులు తయారు చేయగా.. జీవీఎంసీకి 50 వేల బంతులు అందించారు. నౌకాదళంతో కలిసి నగరంలోని కొండలపై జీవీఎంసీ అధికారులు విత్తన బంతులు చల్లారు. మిగిలిన 1.50 లక్షల బంతులను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు విసిరారు. వాటి నుంచి ప్రస్తుతం మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. ఈ ఏడాది కూడా 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ముఖ్యమంత్రి సూచనలతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన బంతులు తయారు చేస్తున్నాం. నేడు మనం జాగ్రత్త చేసిన విత్తనమే.. రేపు భారీ వృక్షంగా మారుతుంది. జగనన్న పచ్చతోరణంలో భాగంగా విత్తన బంతుల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. తక్కువ ఖర్చుతో సేంద్రీయ పద్ధతిలో తయారు చేసి.. పెద్ద సంఖ్యలో వృక్ష సంపద పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. అవసరమైతే నౌకాదళ సహకారం కూడా తీసుకుంటాం. – ఎన్ ప్రతీప్కుమార్, రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి సీడ్ బాల్స్తో అనేక లాభాలున్నాయి.. కొండప్రాంతాల్లో గోతులు తవ్వి మొక్కలు నాటడం చాలా కష్టతరం. విత్తన బంతుల తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. పోషకాలు అధికంగా ఉండే మట్టిలో విత్తనాలను పెట్టడం వల్ల మొక్కలు బతికే అవకాశాలు 100 శాతం ఉన్నాయి. గతేడాది చేపట్టిన సీడ్బాల్స్ ప్రక్రియ సత్ఫలితాలిచ్చింది. ఈ పద్ధతిలో జిల్లాలోని అటవీ ప్రాంతం, రెవెన్యూ హిల్స్లో.. అన్ని రకాల ప్రదేశాల్లోనూ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సెప్టెంబర్లో విత్తన బంతులు విసిరే ప్రక్రియ ప్రారంభిస్తాం. – గంపా లక్ష్మణ్, డీఎఫ్వో, సామాజిక అటవీ శాఖ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
భారీగా పట్టుబడిన నగదు
మహిళపై అత్యాచారం: కేసు నమోదు
దేశానికి మోదీ నాయకత్వం అవసరం
బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదు
మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం
మహిళలే నిర్ణేతలు
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement