-
చదువు పూర్తయిందా.. ఉద్యోగం కావాలా..? ఇదే బెస్ట్ ఛాయిస్..
ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలని అనుకుంటారు. కానీ ఎంచుకున్న రంగంలో ఏ విభాగంలో డిమాండ్ ఉందో తెలుసుకోలేక నష్టపోతుంటారు. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ విభాగంలో ఎక్కువ కొలువులు రానున్నాయో నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. చదువు అయిపోయాక ఉపాధి అవకాశాలు లభించాలంటే విద్యను అభ్యసిస్తున్నపుడే సృజనాత్మక ఆలోచనలు, కృత్రిమమేధ, డేటాసైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించాలని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టా తీసుకుంటుండగా... ఇందులో చాలా శాతం మంది ఉద్యోగాలు సాధించడం లేదు. సొంతంగా అంకుర సంస్థలను స్థాపించేందుకు కొద్దిమందే ముందుకొస్తున్నారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్లో పరిశోధనలు.. విదేశాల్లో కృత్రిమ మేధ, డేటా సైన్స్, ఆటోమేషన్ అంశాలపై అధికంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో విభిన్నమైన ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఓ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ కొద్ది నెలల కిందట కృత్రిమ మేధతో అనుసంధానమైన స్మార్ట్ఫ్రిజ్ను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐరోపా దేశాల్లో ఆవిష్కరించింది. ఇదీ చదవండి: 4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే.. ఒక సాంకేతిక పరికరాన్ని ఫ్రిజ్లో అమర్చితే చాలు అందులోని కూరగాయలు ఏ రోజు వండుకోవాలో చెబుతుంది. పండ్లు, ఇతర సామగ్రి ఖాళీ అవుతున్నప్పుడు దానంటదే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది. ఇలాంటి ఆలోచనలు, సాఫ్ట్వేర్లు ఇతర రంగాలకూ అవసరం. వీటితో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా చాలా మార్పులు రానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన అంశాలను విద్యను అభ్యసిస్తున్నపుడే నేర్చుకుంటే చదువు అయిపోయాక వెంటనే కొలువు దొరికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. -
దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్ డిగ్రీలు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది. సగానికిపైగా ఇక్కడే.. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది. విదేశాలు లేదా సాఫ్ట్వేర్.. బీటెక్ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్ చేసేటప్పుడే పార్ట్ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. -
యువ ఇంజనీర్లకు 'ఉపాధి ఎక్కడ'?
► నిజామాబాద్కు చెందిన సూర్యకిరణ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేశాడు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్సే అతని ప్రధాన సబ్జెక్టు. ఇతను ఓ ప్రముఖ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మైక్రో లెవల్ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఇంత సూక్ష్మ స్థాయి టెక్నాలజీ గురించి అతను పుస్తకాల్లో చదవలేదు. ప్రాజెక్టు సమయంలోనూ దీని జోలికెళ్ళలేదు. దీంతో నైపుణ్యం లేదని కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే కాదు..దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆకర్షణీయమైన వేతనంతో ఏ బహుళజాతి కంపెనీలోనో తక్షణ ఉద్యోగం లేదా డిగ్రీ పూర్తి కాగానే ఎమ్మెస్ కోసం అమెరికా లాంటి దేశానికి వెళ్లి పోవచ్చు. డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రధానంగా ఇలాంటి కారణాలతోనే ఇంజనీరింగ్పై ఆసక్తి చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా కంప్యూటర్ సంబంధిత కోర్సులపై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఏటా సగటున 14 లక్షల మంది ఇంజనీరింగ్లో చేరుతున్నారు. కానీ ఏటా సగటున కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభిస్తుండటం గమనార్హం. ఇందులోనూ కేవలం 8 శాతం మందికి మాత్రమే వారు చదివిన విద్యకు తగిన ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వారంతా ఏదో ఒక ఉద్యోగంతో సరిపుచ్చుకుంటున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాలు స్పష్టం చేస్తుండటం శోచనీయం. మన రాష్ట్రంలో 2021–22లో 87 వేల మంది ఇంజనీరింగ్లో చేరారు. వీరిలో 58 శాతం కంప్యూటర్ కోర్సుల్లో చేరారు. కానీ ఈ ఏడాదిలో కేవలం 39 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉద్యోగాలు పొందారు. వీటిల్లో ఎక్కువగా నాన్–స్కిల్డ్ ఉద్యోగాలే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాంకేతికతకు సరిపడ నైపుణ్యాలు కొరవడటం, సంబంధిత సబ్జెక్టుపై తగిన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏళ్ల నాటి టెక్నాలజీయే ఇప్పుడూ..! ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సాంకేతికతను అన్ని రంగాలూ అందిపుచ్చుకుంటున్నాయి. మానవ వనరులతో సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి టెక్నాలజీ పారిశ్రామిక రంగాన్ని శాసిస్తోంది. అయితే వీటి నిర్వహణకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఇంజనీర్ల అవసరం ఉంది. కానీ బోధనలో ఎప్పటికప్పుడు మార్పు చెందే టెక్నాలజీని చేర్చడం లేదని, ఏళ్ళ నాటి టెక్నాలజీతోనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారని విద్యావేత్తలు అంటున్నారు. గత కొన్నేళ్ళుగా కంప్యూటర్ సైన్స్లో అనేక కొత్త కోర్సులు వస్తున్నాయి. ఇవన్నీ మూడేళ్ళ క్రితమే డిజైన్ చేసినవి. కోవిడ్ తర్వాత అన్ని రంగాలు తక్కువ మానవ వనరులతో పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను అభివృద్ధి చేశాయి. ఇంటినుంచే బ్యాంకు లావాదేవీలు, ఢిల్లీలో ఉండి ఎక్కడో మారుమూల ఉన్న సోలార్ సిస్టమ్ను పరిశీలించే విధానాలు వచ్చాయి. కానీ ఈ టెక్నాలజీ విద్యార్థుల వరకూ వెళ్ళడం లేదు. ఇలాంటి పరిస్థితులే యువ ఇంజనీర్ల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు. తూతూ మంత్రం ప్రాజెక్టులు ఇంజనీరింగ్ విద్యలో ప్రాజెక్టులు కీలకం. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేసేవారు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే టెక్నాలజీపై ప్రాజెక్టులు చేయాలి. కానీ ఏదో ఒక ప్రాజెక్టును ఎవరితోనో చేయించుకుని వస్తున్నారని, విధిలేని పరిస్థితుల్లో వాటిని అనుమతించాల్సి వస్తోందని ఒక యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఇక ప్రైవేటు కాలేజీలు వీటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. చాలా కాలేజీలకు నాణ్యమైన పరిశ్రమలతో ఎలాంటి సంబంధాలూ లేవు. దీంతో విద్యార్థులకు మంచి ప్రాజెక్టులను సూచించలేకపోతున్నారు. విద్యార్థులు కూడా ఏదో ఒక ప్రాజెక్టు చేశామనిపించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త విషయాలపై దృష్టి పెట్టాలనే ఆలోచనను విద్యార్థి దశలోనే విస్మరిస్తే, కంపెనీలు కోరుకునే కొత్త టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుందని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యకే కాదు..ఉన్నత విద్య మొత్తానికీ ఇదే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిలో, విద్యా విధానంలో మార్పు రావాల్సిన తక్షణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అంటున్నారు. సాంకేతికతలో మార్పులు అందిపుచ్చుకోవడం లేదు ఉన్నత విద్యకు వచ్చిన విద్యార్థి తరగతి గదిలోనే ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే కొత్త విషయాలను రాబట్టే విధానం అభివృద్ధి చెందుతుంది. మెజారిటీ విద్యార్థుల్లో ఇది కన్పించడం లేదు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికతలో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోలేక పోతున్నారు. ఇదే ఉపాధికి ప్రధాన అడ్డంకిగా మారింది. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ, జేఎన్టీయూహెచ్) ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయాలి 75 ఏళ్ళు గడిచినా భారత విద్యా విధానంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదు. అనేక కమిషన్లు వేసినా ఈ దిశగా ముందడుగు వేయలేదు. ఈ కారణంగానే మన అవసరాలకు కావాల్సిన విద్యా విధానాన్ని రూపొందించుకోలేకపోతున్నాం. పరిశోధనాత్మక విద్యకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. థియరీ విద్యతో పాటు ప్రధానంగా ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయాలి. – ప్రొఫెసర్ తాటికొండ రమేష్ (వీసీ, కాకతీయ వర్సిటీ) నాణ్యమైన ప్రాజెక్టు వర్క్ పెంచాలి సాంకేతిక విద్యే కాదు.. ఉన్నత విద్యలోనూ థియరీలోనే ముందుకెళ్తున్నాం. కానీ పుస్తకాల్లో ఉన్నదానికి నిజ జీవితంలోని అనుభవాలు జోడించడం లేదు. థియరీతో పాటు నాణ్యమైన ప్రాజెక్టు వర్క్ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే పెంచాలి. ఈ దిశగా ఏఐసీటీఈ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. ఏదో ఒక ఉపాధి అనుకోవడం కాదు.. ఉన్నత విద్య తర్వాత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం) విద్యార్థి దశలోనే సంస్థలతో భాగస్వామ్యం ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా అన్ని సంస్థలు యాంత్రిక విధానాలను అనుసరిస్తున్నాయి. వీటి నిర్వహణ నైపుణ్యాలు ఉన్న ఇంజనీర్లకే ఉపాధి అవకాశాలుంటాయి. ఉదాహరణకు ఆసుపత్రులు ఏఐ ద్వారా ముందుకెళ్తున్నాయి. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తెలియాలంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడే ఆ విద్యార్థికి సంస్థలు, కంపెనీలతో భాగస్వామ్యం అవసరం. అప్పుడే భవిష్యత్ అవసరాలకు ఇంజనీరింగ్ విద్యను ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది. ఈ దిశగా ఉన్నత విద్యలో మార్పులు అవసరం. – ఎస్.నీలిమ (సీఈవో, అనురాగ్ యూనివర్సిటీ) నైపుణ్య సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే విధానం ఉండాలి విద్యార్థికి మార్కులు కొలమానంగా ఉండే విద్యా విధానం మారాలి. అందుకే దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని ఓ సంస్థను కోరాం. విద్యార్థిలో ఉండే నైపుణ్య సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే పరీక్షా విధానం భావి ఇంజనీర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి (చైర్మన్, ఉన్నత విద్యా మండలి) -
రెండో ఏడాది నుంచే ఫీల్డ్ స్టడీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్య ఈ ఏడాది నుంచి సరికొత్తగా ఉండబోతోంది. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అన్ని కాలేజీలూ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. విశ్వవిద్యాలయాలు సైతం ఇప్పటికే బోధన ప్రణాళిక తీరు తెన్నులను కాలేజీలకు పంపాయి. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా స్వీయ అనుభవంతో బోధన ఉండబోతోందని యూనివర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విజ్ఞానం అందిపుచ్చుకునేందుకు కృషి చేయాలని అంటున్నాయి. ఉద్యోగులు కావాల్సిన కంపెనీలు నాలుగో సంవత్సరంలో కాకుండా ముందు నుంచే విద్యార్థులపై దృష్టి పెట్టబోతున్నాయి. వారిలో నైపుణ్యానికి పదును పెట్టే రీతిలో ప్రాజెక్టు వర్క్స్ను ఎంపిక చేసినట్టు కొన్ని కాలేజీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు తెలిపాయి. రెండో ఏడాది నుంచే... అన్ని బ్రాంచీల విద్యార్థులకు మొదటి సంవత్సరం పుస్తక విషయ పరిజ్ఞానం ఆధారంగానే కొనసాగుతుంది. రెండో ఏడాది నుంచి ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ నాల్గవ సంవత్సరంలో మాత్రమే ఈ ప్రక్రియ ఉండేది. అదికూడా విద్యార్థులు ఇష్టానుసారం ఏదో ఒక ప్రాజెక్టు సమర్పించేవాళ్లు. ఈ క్రమంలో విద్యార్థులు ఎవరో తయారు చేసిన ప్రాజెక్టులను కొని తెచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. దీనివల్ల విద్యార్థికి డిగ్రీ చేతికొచ్చినా విషయ పరిజ్ఞానం పెద్దగా ఉండేది కాదు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు రిపోర్టులను పక్కాగా తయారు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్లు చెబుతున్నారు. ఎంపిక చేసిన ప్రముఖ కంపెనీలకు సెకండియర్ విద్యార్థి వెళ్లాలి. అక్కడి నిపుణులతో మమేకమై సరికొత్త టెక్నాలజీపై ఆలోచన చేయాలి. విద్యార్థిలో విషయ పరిజ్ఞానం ఉందని, ప్రాజెక్టు రిపోర్టు సరికొత్తదేనని సంబంధిత సంస్థలు ధ్రువీకరించాలి. అప్పుడే ప్రాజెక్టు రిపోర్టును విశ్వవిద్యాలయాలు ఆమోదిస్తాయి. ఇదేవిధంగా నాల్గో సంవత్సరంలోనూ మరింత లోతైన అవగాహనతో ఆవిష్కరణ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి సంపూర్ణమైన స్వీయ పరిజ్ఞానం పొందుతాడని విశ్వవిద్యాలయాలు భావిస్తున్నాయి. కంప్యూటర్ కోర్సులపై దృష్టి రాష్ట్రంలో 90 వేల మంది ఇంజనీరింగ్లో చేరగా, ఇందులో 64 శాతం కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచీలకు చెందిన వారున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. ఇంజనీరింగ్ విద్యలో కేవలం బేసిక్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకోవడం ఇప్పటివరకూ జరిగింది. ఇక నుంచి తొలి ఏడాదిలోనే అంతర్జాతీయంగా వాడుకలో ఉన్న కోడింగ్ విధానంపై తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల అనుసంధానంతో కంప్యూటర్ కోర్సుల్లో లోతైన ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుపరిచే దిశగా ఈ ఏడాది నుంచి బోధన ప్రణాళిక ఉండబోతోందని వర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. కోడింగ్పై సరైన అవగాహన ఉందనేది ప్రాజెక్టు రిపోర్టుల ద్వారా విద్యార్థి నిరూపించుకోవాలి. ప్రాజెక్టు రిపోర్టులే కీలకం ఈ ఏడాది నుంచి సెకండియర్లో ప్రాజెక్టు నివేదికలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దీనివల్ల విద్యార్థి నాణ్యమైన ఇంజనీర్గా బయటకొచ్చే వీలుంది. ఎంతోమంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నా, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లకే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఆ దిశగానే సరికొత్త బోధన ప్రణాళికకు శ్రీకారం చుడుతున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూ వీసీ -
ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు సిద్ధం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తేవాలనుకుంటున్న ఈ బోధనా విధానం ప్రకారం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోనే ప్రముఖ సంస్థల్లో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే మార్కులు ఇస్తారు. అలాగే ఆఖరి సంవత్సరంలో మరో ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాలనే షరతు పెట్టనున్నారు. ఎందుకీ మార్పు...? ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో 12 శాతం మంది మాత్రమే స్కిల్డ్ జాబ్స్ పొందుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సర్వేలో ఇది స్పష్టమైంది. కంప్యూటర్ సైన్స్లో కనీసం కోడింగ్ కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అధ్యయనంలో వెల్లడైంది. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా విద్యా ప్రణాళిక లేదని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందని నిపుణులు అంటున్నారు. కోవిడ్ తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల కోసం స్థానికంగా నిపుణుల కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బోధన స్థాయిలోనూ పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు ఉండాలని ఏఐసీటీఈ సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత కొంతకాలంగా సరికొత్త బోధన ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడది ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. నాణ్యమైన విద్య, తక్షణ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్నత విద్యలో మార్పులతోపాటు ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఇంజనీరింగ్ విద్యలో ఫీల్డ్ అనుభవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే దీని భాగస్వామ్యాన్ని పెంచనున్నాం. నవీన దృక్పథంతో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే ఇంటర్నల్ మార్కులను 20 నుంచి 40కి పెంచాం. ఎక్స్టర్నల్స్ 60 మార్కులకు ఉండేలా మార్పులు చేశాం. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు వర్క్ చేయడం, సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ తీసుకురావడాన్ని తప్పనిసరి చేస్తున్నాం. ఇవన్నీ ఇంజనీరింగ్ విద్య నాణ్యతను పెంచుతాయని, మార్కెట్లో మంచి నిపుణులుగా విద్యార్థులను నిలబెడతాయని ఆశిస్తున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement