-
Telangana: అఫిలియేషన్లు లేకున్నా... అడ్మిషన్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షలు పూర్తవ్వడంతో ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ప్రవేశాల ప్రక్రియను ముమ్మరం చేశాయి. నిబంధనల ప్రకారం ఇంటర్ బోర్డ్ నుంచి అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉన్నా, దీన్ని పట్టించుకోవడం లేదు. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఏకంగా బ్రిడ్జ్, క్రాష్ కోర్సులంటూ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి మాత్రమే అన్ని కాలేజీలూ ప్రారంభించాలని ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ కూడా ఇచ్చింది. ఈలోపు అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పింది. గుర్తింపు లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. మండువేసవిలో తరగతులు నిర్వహిస్తున్నా, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. రూ. లక్షల్లో ఫీజులు: ప్రైవేటు కాలేజీలు ఈసారి ఫీజులు భారీగా పెంచాయి. ఐఐటీ, నీట్, ఇంటెన్సివ్ కోర్సులంటూ విభాగాల వారీగా ధరలు నిర్ణయించాయి. ఓ కార్పొరేట్ కాలేజీ గత ఏడాది సంవత్సరానికి రూ.1.25 లక్షలు తీసుకోగా, ఈసారి రూ.1.75 లక్షలు డిమాండ్ చేస్తోంది. జేఈఈ కోచింగ్తో కలిపితే రూ. 2.25 లక్షలు చెబుతోంది. సాధారణ కాలేజీలు కూడా ఏడాదికి రూ.75 వేల నుంచి రూ. 1.25 లక్షలు డిమాండ్ చేస్తున్నాయి. రవాణా చార్జీలు కూడా 20 శాతం పెంచారని తల్లిదండ్రులు చెబుతున్నారు. హాస్టల్ కోసం ఏటా రూ.1.25 లక్షలు అడుగుతున్నారు. మొత్తం మీద ఇంటర్ పూర్తయ్యే వరకూ రూ.2 నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గుర్తింపు ఇవ్వకుండానే...? రాష్ట్రవ్యాప్తంగా 3,111 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీలు తీసివేస్తే దాదాపు 1,516 ప్రైవేటు కాలేజీలు అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, లేబొరేటరీలు అన్నీ పరిశీలించిన తర్వాతే గుర్తింపు ఇస్తారు. గత ఏడాది 416 కాలేజీలకు పరీక్ష ఫీజు గడువు ప్రకటించే వరకూ గుర్తింపు ఇవ్వలేదు. బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్నాయని, అగ్రిప్రమాదాలను నివారించే వ్యవస్థ లేదనే అభ్యంతరాలున్నాయి. దీంతో లక్ష మంది విద్యార్థులు ఫీజు కట్టేందుకు ఆఖరి క్షణం వరకూ ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది మూడేళ్ల కాలపరిమితితో అఫ్లియేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేటు కాలేజీలు ఇంకా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే దశలోనే ఉన్నాయి. అయినా పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. టెన్త్ ఫలితాలొచ్చేలోగా గుర్తింపు పూర్తి: నవీన్ మిత్తల్ (ఇంటర్ బోర్డ్ కార్యదర్శి) అనుబంధ గుర్తింపు వచ్చిన తర్వాతే బోర్డ్ నిర్దేశించిన మేరకు ఫస్టియర్ ప్రవేశాలు చేపట్టాలి. ఇందుకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టినా, క్లాసులు నిర్వహించినా చర్యలుంటాయి. గతంలో మాదిరిగా కాకుండా, ఈసారి టెన్త్ ఫలితాలు వచ్చిన వెంటనే గుర్తింపు ప్రక్రియను పూర్తిచేస్తాం. ఆ తర్వాత అఫ్లియేషన్ ఇవ్వం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గుర్తింపు వచ్చిన తర్వాతే విద్యార్థులను కాలేజీల్లో చేర్చాలని కోరుతున్నాం. ఉల్లంఘనులపై చర్యలుండాలి: మాచర్ల రామకృష్ణగౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్) గుర్తింపు రాకుండా ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం అడ్మిషన్లు తీసుకోవడం చట్టవిరుద్ధం. అధికారులు ఇలాంటి కాలేజీలపై దృష్టి పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి. టెన్త్ ఫలితాలు రాకుండా ఇంటర్ క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. -
అఫిలియేషన్ ప్రక్రియ మొదలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొదలైంది. విశ్వవిద్యాలయాలు ఇప్పటికే కాలేజీల నుంచి సమాచారం సేకరించాయి. వాటిని సంబంధిత నిపుణులు పరిశీలిస్తున్నారు. అత్యధిక కాలేజీలు అనుబంధంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ ప్రక్రియలో ముందుంది. కాలేజీల నుంచి సేకరించిన సమాచారాన్ని సిబ్బంది కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ఆధారంగా ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున ఫ్యాకల్టీ నిపుణులు వెళ్తారని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. మరోవైపు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న వాటిల్లో పెంచుకునేందుకు కాలేజీలు ప్రయ త్నిస్తున్నాయి. అయితే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సీట్లు పూర్తిగా తగ్గించేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదు. ఆయా కోర్సుల్లో 30 శాతం సీట్లు ఉండి తీరాలని చెబుతున్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 200కు పైగా కాలేజీల్లో తనిఖీలకు సిద్ధం జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 వరకూ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. మరో 70 వరకూ ఫార్మసీ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, దానికి అనుబంధంగా వచ్చి న కొత్త కోర్సుల విషయంలోనే అధికారులు దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కోర్సుల్లో అవసరమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఫ్యాకల్టీ సరైనది ఉందా? మౌలిక సదుపాయాలు ఏమేర ఉన్నాయి? అనే అంశాలను తనిఖీ బృందాలు నిశితంగా పరిశీలించాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని యూనివర్సిటీలు తప్పనిసరి చేసినా, పలు కాలేజీలు దీన్ని అనుసరించడం లేదు. ఈ ఏడాది నుంచి దీనిని కచ్చి తంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలో భాగం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఫ్యాకల్టీ ప్రతిభ, ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా తనిఖీలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సదుపాయాలు లేకుండా గుర్తింపు కష్టం తనిఖీల విషయంలో యూనివర్సిటీలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. తనిఖీ బృందాలు కాలేజీ యాజమాన్యాలతో మిలాఖత్ అవుతున్నాయని, మౌలిక సదుపాయాలు లేకున్నా అనుమతిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కాలేజీలో బోధించే సిబ్బంది వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడమే కాకుండా, వారి వ్యక్తిగత పాన్ కార్డుల ఆధారంగా ఆదాయ పన్నుశాఖ ద్వారా తనిఖీలు చేయాలనే యోచనలో ఉన్నారు. ఫ్యాకల్టీ కాలేజీలో బోధిస్తున్నాడా? ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని, కాలేజీలో ఫ్యాకల్టీగా నమోదు చేసుకున్నాడా అనే అంశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా తనిఖీలు పూర్తి చేయాలని యూనివర్సిటీల అధికారులు భావిస్తున్నారు. మే రెండో వారంకల్లా పూర్తి చేస్తాం కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను మే రెండో వారంకల్లా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కాలేజీల్లో ఫ్యాక ల్టి, వసతులపై డేటా తెప్పించాం. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేని కాలేజీలు గుర్తింపు తేదీ నాటికి ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున నిపుణులు వెళ్తారు. అన్నీ పరిశీలించి, నిబంధనల మేరకు సరిగా ఉంటేనే గుర్తింపు ఇస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్టీయూహెచ్ వీసీ) -
సీబీఎస్ఈ అఫిలియేషన్లో మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలో ఏర్పాటు కానున్న విద్యాసంస్థలకు గుర్తింపు (అఫిలియేషన్) మంజూరు ప్రక్రియలో పలు మార్పులు చేసినట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. అఫిలియేషన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. జాతీయ నూతన విద్యా విధానం–2020 ప్రకారం సీబీఎస్ఈ బైలాలో పలు మార్పులు చేసింది. ఈ విషయాలతో తన అధికారిక వెబ్సైట్లో తాజాగా ఒక నోటిఫికేషన్ పొందుపరిచింది. 2021 మార్చి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వివిధ కమిటీల సిఫార్సుల మేరకు నూతన విద్యా విధానంలో చేసిన సూచనల ప్రకారం ఈ మార్పులు చేస్తున్నట్టు సీబీఎస్ఈ పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ లక్ష్యం ఇలా.. సీబీఎస్ఈ గుర్తింపు మంజూరుకు 2006 నుంచి ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం పూర్తిగా డిజిటలైజేషన్, డేటా అనలటిక్స్ ఆధారంగా తక్కువ మానవ వనరుల వినియోగంతో గుర్తింపు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు సీబీఎస్ఈ వివరించింది. త్వరితగతిన గుర్తింపు పొందడం, ఆటోమేటెడ్, డేటా డ్రైవన్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, పారదర్శకత పెంచడం, మొత్తం అఫిలియేషన్ విధానంలో అకౌంట్బిలిటీని పెంచడం, త్వరితంగా, కాల పరిమితిలోగా దరఖాస్తులను పరిష్కరించడం లక్ష్యంగా కొత్త విధానాన్ని చేపడుతున్నట్టు పేర్కొంది. ఇందుకు పూర్తి నిర్దేశిత సమయాలను పాటించనుంది. ఆయా విద్యాసంస్థలు అవసరమైన డాక్యుమెంట్లను సీబీఎస్ఈ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. చదవండి: వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే -
ఇంటర్ బోర్డు అధికారుల ‘గుర్తింపు’ దందా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) వ్యవహారంలో మరో అక్రమానికి తెరలేచింది. అనేక లోపాల కారణంగా ‘గుర్తింపు’పొందని కాలేజీల్లో భారీగా విద్యార్థుల అడ్మిషన్లు జరిగిపోతున్నాయి. ఇలా చేరిపోయిన ‘విద్యార్థుల భవిష్యత్తు’దెబ్బతింటుందనే సాకుతో ఆయా కాలేజీలకు ‘గుర్తింపు’ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆయా కాలేజీల యాజమాన్యాలతో ఇంటర్మీడియట్ బోర్డులోని కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని... ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల్లోనూ కొన్నింటిలో లోపాలున్నా.. ముడుపులు పుచ్చుకుని అఫిలియేషన్ ఇచ్చినట్టుగా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు బోర్డు కార్యదర్శికి ఉండాల్సిన అఫిలియేషన్ జారీ అధికారాన్ని ఇతర అధికారులకు కట్టబెట్టి మరీ అక్రమాలకు తెరతీసినట్టు బోర్డు వర్గాలే పేర్కొంటున్నాయి. అఫిలియేషన్ అధికారాలను పొందిన సదరు అధికారిని కలసి ముడుపులు ముట్టజెప్పితేనే ‘పని’జరుగుతోందని.. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు పేర్కొంటుండటం గమనార్హం. గడువు ముగిసిపోయినా.. రాష్ట్రంలో మొత్తం 1,640 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. ఇంటర్ బోర్డు ఈసారి పలు సడలింపులతో 1,303 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. వాటికి ఫిబ్రవరి 21వ తేదీ నాటికే అఫిలియేషన్లను పూర్తి చేయాల్సి ఉన్నా.. కాలేజీల విజ్ఞప్తి మేరకు అంటూ మార్చి 31 వరకు గడువు పొడిగించింది. అయినా అనేక లోపాల కారణంగా 337 కాలేజీలకు గుర్తింపు లభించలేదు. గత నెల 21న ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నాటికి కూడా ఆయా కాలేజీలు సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో ‘గుర్తింపు’అవకాశం కోల్పోయాయి. కానీ తాజాగా ‘విద్యార్థుల భవిష్యత్తు’దెబ్బతింటుందనే పేరుతో ఆయా కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరో రెండు మూడు నెలల్లో లోపాలన్నీ సవరించుకుంటామంటూ కాలేజీలు అఫిడవిట్ ఇస్తే.. వాటికి ‘గుర్తింపు’ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అటు ఆయా కాలేజీలు కూడా ‘బోర్డు ఇచ్చిన సమయంలోగా లోపాలను సవరించుకోకున్నా పోయేదేమీ లేదని.. విద్యా సంవత్సరం మధ్యలో కాలేజీలను మూసివేసే అవకాశం ఉండదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారా? అన్న సాకుతో యాజమాన్యాలు ఆందోళన చేయవచ్చని..’కొందరు అధికారులే కాలేజీల యాజమాన్యాలకు సూచిస్తూ అక్రమాలకు తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సగం వరకు కార్పొరేట్ కాలేజీలే.. అనుబంధ గుర్తింపు లభించని 337 కాలేజీల్లో సగం వరకు కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలే ఉన్నట్టు తెలిసింది. దీంతో భారీగా సొమ్ము దండుకోవచ్చన్న ఆశతోనే అధికారులు కుమ్మక్కైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కాలేజీలన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డుకు చెందిన క్షేత్ర స్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల దాకా భాగస్వామ్యం ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. అందువల్లే పలు కాలేజీలు తమకు అనుబంధ గుర్తింపు లేకపోయినా అడ్మిషన్లు చేసుకోవడం మొదలుపెట్టాయని.. ఇది తెలిసినా అధికారులెవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ప్రారంభించినా.. అంతే! ప్రైవేటు కాలేజీలు ఏటా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందాలి. ఇందుకోసం తొలుత ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ఇస్తే.. యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుంటాయి. సాధారణంగా జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందన్నది తెలిసిందే. అయినా నాలుగైదేళ్లుగా అధికారులు ముందుగానే అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపట్టకుండా జాప్యం చేశారు. కానీ ఈసారి మాత్రం మార్చి 31 నాటికే ‘గుర్తింపు’ప్రక్రియ పూర్తిచేసి.. గుర్తింపు పొందిన, గుర్తింపు రాని కాలేజీల జాబితాలను వెబ్సైట్లో పెడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గతేడాది ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం కోసం గతేడాది డిసెంబర్లోనే అఫిలియేషన్ల దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన ఇంటర్ బోర్డు.. ఫిబ్రవరి నాటికే ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించింది. కానీ జాప్యం చేసింది. ‘గుర్తింపు’లేని జాబితా ఏదీ? ఇంటర్ బోర్డు మార్చి 31 నాటికి 1,303 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. వాటి జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కానీ గుర్తింపు పొందని కాలేజీల జాబితాను మాత్రం వెబ్సైట్లో పెట్టకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి.. ఈ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ కాలేజీలకు గుర్తింపు రాకపోతే ఎలా? అనుబంధ గుర్తింపు లభించని కాలేజీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో వనస్థలిపురంలోని ఓ కాలేజీ విషయంగా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు.. గుర్తింపు లేకున్నా ఆ కాలేజీ ప్రవేశాలు చేపట్టడాన్ని చూసీ చూడనట్టు వదిలేశారు. చివరికి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన సమయం వచ్చే సరికి.. అధికారులు చేతివాటం చూపారు. అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో తమ విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేసేందుకు, ఫీజు చెల్లించేందుకు ఆ కాలేజీకి లాగిన్ ఐడీ ఇవ్వలేదు. దాంతో విద్యార్థులకు హాల్టికెట్లు రాక ఆందోళనకు దిగారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. వారందరినీ హయత్నగర్ ప్రభుత్వ కాలేజీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించింది. దీనివల్ల ఆ విద్యార్థులు ఎంసెట్ ర్యాంకుల్లో తీవ్రంగా నష్టపోయారు కూడా. తాజాగా అనుబంధ గుర్తింపు పొందని 337 ఇంటర్మీడియట్ కాలేజీల్లోనూ వేల మంది విద్యార్థులు చేరినట్టు అంచనా. ఇప్పుడు వీరి భవిష్యత్తు ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది. -
కాలేజీలకు కొత్త ‘గుర్తింపు’
జనగామ అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల గుర్తింపు (అఫిలియేషన్) కోసం ప్రత్యేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అఫిలియేషన్ కోసం గతంలో మాదిరిగా హైదరాబాద్ బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే గుర్తింపు అధికారాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారులకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న జిల్లా డీఐఈఓ వి.ఇంద్రాణి జిల్లాలోని 21 ప్రైవేట్ జూనియర్ కళాశాలతో పాటు 10 మోడల్, 04 సాంఘిక సంక్షేమ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్తో సమావేశాన్ని నిర్వహించి గుర్తింపు మార్గదర్శకాలను, విధివిధానాలను వివరించారు. మారిన ప్రక్రియ... ఇంటర్ కళాశాలలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి దాదాపు 14 పేజీలు ఉన్న ఒకే ఒక ఫారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అప్లోడ్ చేసిన ఫారంతో ఇంటర్మీడియట్ అధికారులు సంబంధిత కళాశాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ పేర్కొన్న అంశాలు అన్నీంటిన్ని క్షుణంగా పరీశీలించిన అనంతరం గుర్తింపు ఫీజును ప్రభుత్వానికి కట్టడానికి అనుమతిస్తారు. గతంలో గుర్తింపు ఫీజును కట్టిన తరువాతే కళాశాలలను పర్యవేక్షించే విధానానికి ప్రభుత్వం ఈసారి స్వస్తి పలికింది. కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రతి సంవత్సరం లేని గుర్తింపు ప్రక్రియను ప్రైవేట్ కళాశాలలకు ఆపాదించడంపై కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ విడుదల... జిల్లాలోని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు (ఒకేషనల్ కళాశాలలతో సహా) గుర్తింపు కోసం చేసుకునే దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడానికి ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణీత షెడ్యూల్ ప్రకటించారు. గుర్తింపు కోసం అపరాధ రుసుం లేకుండా 11 జనవరి 2018 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో 18 జనవరి వరకు, రూ.3 వేల ఆపరాధ రుసుముతో జనవరి 25 వరకు, రూ.5 వేలతో 1 ఫిబ్రవరి 2018 వరకు, రూ.10 వేలతో 08 ఫిబ్రవరి వరకు, రూ.15 వేల అపరాధ రుసుముతో 15 ఫిబ్రవరి వరకు, రూ.20 వేల అపరాధ రుసుముతో 22 ఫిబ్రవరి 2018 వరకు చెల్లించుకోవచ్చునని ఉత్తర్వులను జారీ చేశారు. కాగా గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ ఫాంను నేరుగా ఇంటర్ బోర్డు కార్యాలయానికి తీసుకుని వస్తే తిరస్కరిస్తామని స్పష్టంగా హెచ్చరించింది. వసతి గృహాలు ఉన్న ప్రైవేట్ కళాశాలల వారు 2018–19 గుర్తింపు కోసం 5 జనవరి 2018 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పెర్కొన్నారు. నిబంధనల ప్రకారమే గుర్తింపు... జిల్లాలోని ఇంటర్ కళాశాలల గుర్తింపు (ఆఫిలియేషన్) ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేసి అన్నీ వసతులు ఉంటేనే ఆఫిలియేషన్ జారీ చేస్తాం. – వి.ఇంద్రాణి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సంస్కరణలను స్వాగతిస్తున్నాం... ప్రైవేట్ కళాశాలల గుర్తింపు విషయంలో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలను స్వాగతిస్తున్నాం. ఇదే క్రమంలో ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు అందజేస్తున్న స్కాలర్షిప్ల విషయంలో కూడా చొరవ తీసుకుని విడుదల చేస్తే కళాశాలలకు ఆర్థిక భారం తగ్గుతుంది. – ఆర్.బ్రహ్మచారి, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజామాన్య అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement