ఆమె కావాలంది.. ప్రధాని ఇచ్చేశారు!! | Sakshi
Sakshi News home page

ఆమె కావాలంది.. ప్రధాని ఇచ్చేశారు!!

Published Mon, Feb 27 2017 8:12 AM

ఆమె కావాలంది.. ప్రధాని ఇచ్చేశారు!! - Sakshi

ట్విట్టర్‌లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, అక్కడ చెప్పిన సమస్యలను పరిష్కరించడంలో నరేంద్రమోదీ మంత్రివర్గం మంచి చురుగ్గా ఉంది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు లాంటి వాళ్లయితే నిమిషాల్లోనే స్పందించి సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా స్వయంగా ప్రధానమంత్రే ఈ ట్విట్టర్ సందేశాలకు స్పందించిన వైనం బయటపడింది. మహాశివరాత్రి పర్వదినం రోజున తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదియోగి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఆ సందర్భంలో ఆయన మెడలో నీలి రంగు స్కార్ఫ్‌ ఒకటి ధరించారు. 
 
శిల్పి తివారీ అనే మహిళకు ఆ స్కార్ఫ్ ఎంతగానో నచ్చేసింది. ట్విట్టర్‌లో చురుగ్గా ఉండే ఆమె.. వెంటనే తనకు ఆ స్కార్ఫ్ కావాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఒకే ఒక్క లైనులో చేసిన ఆ ట్వీట్ ప్రధానికి ఎందుకు నచ్చిందో తెలియదు గానీ, ఆయన అద్భుతంగా స్పందించారు. ఆమె చేసిన ట్వీట్‌ను ఒక ప్రింటవుట్ తీసి, దాని మీద స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి.. దాంతో పాటు ఆమె ముచ్చటపడిన స్కార్ఫును కూడా పార్సిల్లో పంపేశారు!! దాంతో ఆమె పరమానంద భరితులయ్యారు. తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చేసుకుని, మోదీ పంపిన స్కార్ఫ్ వేసుకున్న ఫొటో పెట్టేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆమెను పలువురు అభినందనలతో వెల్లువెత్తించారు. ట్విట్టర్‌లో వెరిఫైడ్ అకౌంట్ ఉన్న తివారీ.. తాను పంపిన ట్వీట్‌కు ప్రధానమంత్రి స్పందించిన తీరును జీవితాంతం గుర్తుంచుకుంటారు అనడంలో అనుమానం ఏమీ లేదు కదా!!



 
Advertisement

తప్పక చదవండి

Advertisement