అప్పులభారంతో రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పులభారంతో రైతు ఆత్మహత్య

Published Sat, Sep 5 2015 7:03 PM

Farmer commits suicide

గీసుకొండ (వరంగల్) : రుణభారం భరించలేక వరంగల్ జిల్లాలో ఓ రైతు బలవన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన నౌగిరి శ్రీను(44) తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు మరో రెండున్నర ఎకరాల భూమిలో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. రెండేళ్ల నుంచి సాగు చేస్తున్నా పెద్దగా దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులపాలయ్యాడు.

కాగా అతనికి ఇద్దరు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు నాగరాణి వివాహం నాలుగు నెలల క్రితం చేశాడు. పెళ్లి కోసం, సాగు కోసం చేసిన అప్పులు రూ.2.40 లక్షల వరకు ఉన్నాయి. ఈ ఏడాది కూడా పంటలు సరిగా లేకపోవటంతో అప్పులు తీరే దారి కానరాక జీవితంపై విరక్తి చెంది శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. భార్య, పిల్లలు శనివారం ఉదయం నిద్రలేచి చూసే సరికి విగతజీవిగా కనిపించాడు.

Advertisement
Advertisement