చిక్కుల్లో క్రికెటర్ మలింగా | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో క్రికెటర్ మలింగా

Published Fri, Jun 23 2017 1:16 PM

చిక్కుల్లో క్రికెటర్ మలింగా - Sakshi

కొలంబో:శ్రీలంక క్రీడామంత్రి దయసిరి జయసెకెరాను ఆ దేశ వెటరన్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా కోతితో పోల్చి చిక్కుల్లో పడ్డాడు. అసలు క్రికెట్ గురించి ఏమీ తెలియని మంత్రిని కోతితో పోల్చిన మలింగా కొత్త వివాదాన్ని కొనితెచ్చుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు టీమిండియాపై గెలిచిన శ్రీలంక.. కీలకమైన పాక్ తో మ్యాచ్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

 

దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు మలింగా వింతగా సమాధానం ఇచ్చాడు. ఏ మాత్రం ఫిట్ గా లేని క్రికెటర్లను ఎంపిక చేయడంతోనే తాము ఓటమి పాలైనట్లు మలింగా  పేర్కొన్నాడు. తమ జట్టులో అధిక బరువుగల క్రికెటర్లను ఎంపిక చేయడంలో క్రీడామంత్రి దయసిరే కారణమన్నాడు. పనిలో పనిగా క్రీడామంత్రి దయసిరి జయసెకెరాను కోతితో పోల్చాడు. ఒక గూడులో ఉన్న చిలకల గురించి కోతికి ఎలా తెలుస్తుందంటూ సదరు మంత్రిని విమర్శించాడు. అదే సమయంలో ఆ వ్యాఖ్యలపై ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని మలింగా తనను సమర్ధించుకునే యత్నం చేశాడు.  కాగా, తనపై మలింగా చేసిన 'కోతి' వ్యాఖ్యలపై దయసిరి జయసెకెరా విచారణకు ఆదేశించాడు. మలింగా చేసిన వ్యాఖ్యలపై నివేదిక వచ్చిన తరువాత అతనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి దయసిరి హెచ్చరించాడు.

Advertisement
Advertisement