సినారె కవితల్లో కాళిదాసాది భారతీయ మహాకవుల పరువముంది. ఉర్దూ కవుల ఆవేశం, నవ్యత కనిపిస్తాయి. భట్టుమూర్తి వంటి ప్రజ్ఞ ఉంది. ఆయన హృదయమే కవిత్వం. బాలకవిగా చివురు తొడిగి కవితా వటవృక్షమై ఎదిగిన పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి కవితా ప్రస్థానంలో ఎన్నో మలుపులు కనిపిస్తాయి. ‘మార్పు నా తీర్పు’ అని ఏనాడో అన్నారాయన. ప్రవహించే నీరులా స్వచ్ఛమైన కవిత ఎప్పుడూ ఆరోగ్యకరమే. సినారె కవిత్వంలో మనకు ప్రధానంగా, ప్రథమంగా గోచరించేది రమణీయకత. ఏది చెప్పినా, మెత్తదనం సంతరించుకున్న కవిత ఆయన సొంతం. ఒకనాడు ఆయనను అనుప్రాస ప్రియుడన్నారు. కాని అనుప్రాస మోజులో పడి ఎక్కడా శిల్పాన్ని కాని, కవిత్వాన్ని కాని దూరం చేసుకోలేదు. వాటిని తన ధోరణిలోకి ఇముడ్చుకొని వశపరచుకొన్నాడు. అందుకే ప్రతి గేయం, ప్రతి పద్యం విరజాజి పందిరిలా ఉంటుంది.
నారాయణరెడ్డి చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన కవికిశోరం. బి.ఎ. దాకా ఉర్దూ మాధ్యమంలో చదివినా మాతృభాషపై మమకారం పోగొట్టుకోలేదు. విద్యార్థి దశనుండి కవితలు వ్రాస్తూ వచ్చారు. ఆ దశలోనే నవ్వని పువ్వు వంటి గేయ నాటికలు, జలపాతం వంటి ఉత్తమ రచనలు వెలువడ్డాయి. విద్యార్థిగా ఉన్నప్పుడే సభలూ సమావేశాలకూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన కంటే రసవంతంగా వ్యాఖ్యానమందించే వారు లేరనిపించుకొన్నారు కూడా.
సినారె కవితల్లో కాళిదాసాది భారతీయ మహాకవుల పరువముంది. ఉర్దూ కవుల ఆవేశం, నవ్యత కనిపిస్తాయి. భట్టుమూర్తి వంటి ప్రజ్ఞ ఉంది. భావకవిగా, అభ్యుదయ కవుల్లో అభ్యుదయవాదిగా, విప్లవ ధోరణికి నీరాజనం పట్టే విప్లవ రచయితగా, ప్రజాకవిగా భాసిల్లారు. విరసంతో సరసం ఆడగల సమర్థుడాయన. ఆయన హృదయమే కవిత్వం. ఆర్ద్రతతో తడిసిన ఆయన అంతరంగం నుండి పెకిలి వచ్చే ప్రతిపదంలోనూ కవిత్వం ఉంటుంది. ‘సురభిళ శబ్దమ్మొక్కటి తరగెత్తిన చాలు/ నా యెడద నందులందు కోటి నందనాలు గుబాళించు’ అనే శబ్ద శిల్పి ఆయన.
ఆయన తన రచనల్లో తననీ విధంగా పరిచయం చేసుకొన్నారు: ‘నా పేరు కవి, ఇంటిపేరు చైతన్యం, ఊరు సహజీవనం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం’. ఒక్కచోట ఆయన ఇలా హితవు పల్కారు: ‘ముళ్ళలాగ ఎవరినీ నొప్పించవద్దు/ పూలలాగ అందరినీ మురిపిస్తే ముద్దు’. పచ్చి వేడి, పిచ్చి చలువ ఆయనలో చూడొచ్చు. మహోద్ధతి, మౌనగతి రెండూ ఆయనకు తెలుసు. ఆయన సంప్రదాయాన్ని జీర్ణించుకొన్న ప్రయోగం. ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయం.
ఒక దీపావళినాడు ఒక చిన్నారిపాప దీపం వెలిగిస్తున్నది. ఆ పాపను చూసి రెడ్డిగారి హృదయంలో వెలిగిన కవితా జ్యోతి: ‘ముట్టించు పాపా దీపం ముట్టించు/ ముసురుకొన్న మా తమస్సును/ నీవైనా తుదముట్టించు’. ఆయన శ్రమ జీవుల చమట బిందువులను జాతి రత్నాలుగా తలచారొకచోట. మంచికి నిలబడ్డ మనిషిని మహర్షిగా కొలిచి మానవతావాదిగా కనిపించారు మరోచోట. పొరలు కమ్మని విజ్ఞానం అరవిందంలా విరియాలని వాంఛించారింకో చోట. ఆయన కవిత్వంపై కాల్పనికోద్యమ, మానవోద్యమ, అభ్యుదయోద్యమ ప్రభావాలున్నా వాటిని తనవిగా చేసుకోగల ప్రతిభాశాలి ఆయన.
లలితమైన భాష, రమ్యమైన భావన ఆయన సొంతం. ‘ఈ పదముల రాపాడిన మాపురములు, చిరుగజ్జెలు చప్పని నా బ్రతుకులోన రసధ్వనులను పలికించెను’. బండరాతిలో గుండెల చప్పుడును, పాషాణంలో సైతం ప్రాణాన్ని గమనించగలిగిన రసజ్ఞుడు. ‘ఈ నల్లని రాలలో - ఏ కన్నులు దాగెనో/ ఈ బండల మాటున - ఏ గుండెలు మ్రోగెనో/ పైన కఠినమనిపించును - లోన వెన్న కనిపించును/ కదలలేవు మెదలలేవు - పెదవి విప్పి చెప్పలేవు/ ఉలియలికిడి విన్నంతనె - గలగలమని పొంగి పొరలు’.
సహృదయత గల కవి - అందుకే సమతా శాంతుల నాకాంక్షిస్తున్నారు. ‘సమత నా తల్లి- సౌహార్దం నా తండ్రి/ అనాది నా జననం-అనంతం నా పయనం/ విశ్వం నా ఊరు-శాంతి నా పేరు’.
సామాన్య ప్రజలను పీడిస్తే-ఆవేశం పుడుతుంది. ఎక్కడ? ‘చిల్లిగవ్వకు కొరగాని-చితికిన బతుకుల నుంచి’. చివరకేమవుతుంది? ‘పిడికిళ్ల లోని ఆవేశం-పిడుగులను పుట్టిస్తుంది/ నడి నెత్తిలోని ఆవేశం- నవయుగాన్ని సృష్టిస్తుంది’.
కవి బ్రహ్మవంటివాడు-అతన్ని మించిన వాడే ఆత్మ చేతన అంటూ ఉంటే- ఆ సత్యాన్ని చాలా బాగా చెప్పారు.
‘నేను రాస్తున్నది తుడిచి వేస్తున్నది-గీతం కాదు, స్వరలిపి అతడు గీస్తున్నది సీలు వేస్తున్నది-అదృష్ట పలకం మీద భాస్వర లిపి స్వరం గొప్ప భాస్వరం కంటె-గీతిక గొప్ప జాతకం కంటె అతనికంటె నేనే గొప్ప-ఆత్మ చేతన అంటూ వుంటె’.
కవికి కావలసింది ఆత్మ చేతన. అతడు చేయాల్సిన కల్పనలేమిటో, అతని కర్తవ్యమేమిటో నిశితంగా అంటున్నాడు. ‘ఈ రాత్రి కనవలసింది- కవలలను కాదు-క్రాంతి గోళాలను/ ఈనాడు కావలసింది- డోల ఊపడం కాదు-నిద్రలేపడం’. సినారె ప్రతి మాటలో ప్రగతివాదం ప్రస్ఫుటిస్తుంది. ఒకనాడు భావ గీతాలు వ్రాసిన యువకవి; శృంగారాన్ని వరించిన రసజ్ఞుడు, కాలాన్ని గమనించి అవసరాన్ని గుర్తించి ప్రజా సమస్యలను ఆకళించుకొని ప్రజాకవిగా సాగుతున్నారు.
- డా॥ఎ.రాధాకృష్ణరాజు
(వ్యాసకర్త - అధ్యక్షులు,
కర్ణాటక తెలుగు విజ్ఞాన సమితి)
లలితమైన భాష రమ్యమైన భావం
Published Mon, Jul 25 2016 2:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
Voting Procedure: ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement