ముంబై: తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ తాగుబోతును జుట్టుపట్టి లాక్కెళ్లి మరీ పోలీస్ స్టేషన్లో అప్పగించిందో యువతి. చుట్టూ ఉన్న జనం గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డా... ఆ తాగుబోతును ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. ఇది అర్థరాత్రో, అపరాత్రో జరగలేదు... పట్టపగలు...జరిగింది. బుధవారం మధ్నాహ్నం కాండివ్లి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ముంబైలోని బోర్విలికి చెందిన మంధరే విలే పార్లే లోని కాలేజీలో మాస్ మీడియా మూడవ సంవత్సరం చదువుతోంది. కాలేజీ నుంచి తిరిగి వస్తూ లోకల్ ట్రైన్ కోసం స్టేషన్లో ఎదురు చూస్తుండగా...ఎక్కడినుంచో వచ్చాడో ఒక తాగుబోతు ఆమె మీద చేయివేశాడు. భయంతో పక్కకు జరిగింది. దీంతో మరింత ముందుకు వచ్చాడా దుండగుడు. షాక్ నుంచి తేరుకున్న ఆమె వెంటనే తన దగ్గరున్న కాలేజీ బ్యాగ్తో అతగాడిని నాలుగు ఉతుకులు ఉతికింది.
అయినా గురువుగారు దారికి రాలేదు. పైగా ఎదురు దాడికి దిగాడు. అంతే మంధరే కోపం కట్టలు తెంచుకుంది. జుట్టు దొరక బుచ్చుకొని గవర్నమెంటు రైల్వే పోలీస్ స్టేషన్ దాకా ఈడ్చుకొచ్చి పోలీసులుకు అప్పగించేదాకా ఆ కోపం చల్లార లేదు. ఇంత జరుగుతున్నా చుట్టపక్కల ఉన్న జనం చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప, ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయినా ఆమె ఒంటరిగానే పోరాడింది. రకరకాల ప్రశ్నలతో విసిగించిన రైల్వే పోలీసు అధికారులు చివరికి మంధరే ఫిర్యాదు స్వీకరించి, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
వాడు తాగి మత్తులో ఊగుతున్నాడు... పైగా కనీసం తాకడానికి భయపడేంత మురికి కంపు కొడుతున్నాడు.. నామీద దాడి చేస్తాడేమోనని భయం వేసింది కాసేపు. అయినా ధైర్యంగా ఎదుర్కొన్నాను.. అంటూ చెప్పుకొచ్చింది మంధరే. ప్రతి అమ్మాయి ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండకూడదు.. ధైర్యంగా ఎదుర్కోవాలి..కచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి అంటూ సందేశమిచ్చిందీ ఈ ధీశాలి.