పెళ్లి వద్దన్నందుకు సజీవ దహనం చేశారు | Sakshi
Sakshi News home page

పెళ్లి వద్దన్నందుకు సజీవ దహనం చేశారు

Published Sun, Feb 7 2016 9:38 AM

పెళ్లి వద్దన్నందుకు సజీవ దహనం చేశారు

పురానీ బజార్ (బిహార్) : పెళ్లి వద్దు.. ఇంకా చదువుకుంటాను అని కోరినందుకు పదహారేళ్ల బాలికను సజీవ దహనం చేశారు. స్వయానా కన్నతండ్రి, సవతి తల్లి.. మరికొంతమంది బంధువులతో కలసి ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపారు. ఈ అమానుష ఘటన బిహార్ లోని పురానీ బజార్లో చోటుచేసుకుంది.

పురానీ బజార్ కు చెందిన ఖుష్బూ (16) స్థానిక పాఠశాలలో 12 వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో తండ్రి సునీల్ ఠాకూర్ రెండవ వివాహం చేసుకున్నాడు. సోదరుడు అమృత్ రాజ్ అమ్మమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లిపోగా ఖుష్బూ మాత్రం తండ్రి మీద ప్రేమతో వారి వద్దే ఉండిపోయింది. ఇక అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి.  సవతి తల్లి పూనమ్ దేవి ఇంటి పనులన్నీ ఖుష్బూ మీదే పడేసేది. చిత్రహింసలకు గురిచేసేది. అయినప్పటికీ చదువులో చురుకుగా ఉండే ఖుష్బూ ఎంతో పట్టుదలతో చదువుతుండేది.

ఇటీవల ఈ అమ్మాయికి తెలియకుండా తల్లిదండ్రులు ఓ ముసలాడితో పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకున్న ఖుష్బూ ఆ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తనకిప్పుడే పెళ్లి వద్దని.. తానింకా చదువుకోవాలనుకుంటున్నానని తండ్రిని, సవతి తల్లిని ప్రాధేయపడింది. పెళ్లికి నిరాకరించడంతో వారి హింస తారాస్థాయికి చేరుకుంది. బంధువులతో కలిసి బుధవారం ఈ అమ్మాయిని సజీవ దహనం చేశారు. తీవ్రగాయాలతో పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది.

ఆమె సోదరుడు అమృత్ రాజు తండ్రి, సవతి తల్లి కలిసి చేసిన అకృత్యంపై పోలీసులను ఆశ్రయించాడు. మసౌహ్రీ స్టేషన్ పోలీసు అధికారి కుమార్ అకేలా మట్లాడుతూ.. ఖుష్బూ హత్యకు కారణమైనవారిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టు కోసం చూస్తున్నామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం నిందితులంతా  పరారీలో ఉన్నారు. 

Advertisement
Advertisement