చిక్కుల్లో మిల్కీబ్యూటీ తమన్నా | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో మిల్కీబ్యూటీ తమన్నా

Published Fri, Sep 30 2016 1:23 AM

చిక్కుల్లో మిల్కీబ్యూటీ తమన్నా

నటీనటులు వివాదాల్లో ఇరుక్కోవడం అన్నది సాధారణమైన  విషయమే. అయితే ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తించడం చిక్కుల్లో పడేస్తుంది. నటుడు అజిత్, నటి నయనతార లాంటి వారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి కట్టుబడి నడుచుకుంటున్నారు. అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉదాహరణకు అజిత్ గానీ, నయనతారగానీ చిత్ర ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోమని చిత్రాలను అంగీకరించే ముందే సదరు దర్శక నిర్మాతలకు చెప్పేస్తారు. వారు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోయినా తప్పు పట్టరు.
 
నటి త్రిష తాను నటించిన నాయకి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదనే ఆరోపణలను మూట కట్టుకున్నారు. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా అలాంటి నిందనే ఎదుర్కొంటున్నారు. నిజానికి ఈ భామ కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. దీంతో వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి.
 
ఇటీవల విజయ్‌సేతుపతికి జంటగా నటించిన ధర్మదురై చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రచార కార్యక్రమంలోనూ తమన్నా పాల్గొనలేదు. అలాంటి ది ఇటీవల తాను తాజాగా నటించిన దేవి చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం ధర్మదురై చిత్ర నిర్మాత సురేశ్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది.
 
ఆయన ఈ మిల్కీబ్యూటీపై మండిపడుతున్నారు. అంతటితో ఆగకుండా నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్‌కు తమన్నాపై పిర్యాదు చేశారు. విషయం ఏమిటంటే తమన్నా ఇప్పుడు విశాల్‌కు జంటగా కత్తిసండై చిత్రంలో నటిస్తున్నారు. మరి ఆయన ధర్మదురై చిత్ర నిర్మాత ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తిగా మారింది.

Advertisement
Advertisement