5జీ కూడా వచ్చేస్తోంది! | Sakshi
Sakshi News home page

5జీ కూడా వచ్చేస్తోంది!

Published Thu, Nov 26 2015 4:01 PM

5జీ కూడా వచ్చేస్తోంది!

మన దేశంలో 4జీ మొబైల్ నెట్‌వర్క్ ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. కొంతమంది ఆపరేటర్లు దీన్ని ప్రవేశపెట్టి, బాగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ జపాన్ మాత్రం అప్పుడే ఒకడుగు ముందుకు వేసేసింది. అక్కడ వైర్‌లెస్ కమ్యూనికేషన్లలో ముందంజలో ఉన్న ఓ కంపెనీ.. విజయవంతంగా 5జీ డేటా ట్రాన్స్‌మిషన్ ప్రయోగాలు చేసింది. 2020 నాటికి దీన్ని వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెబుతోంది. ఎన్ఐటీ డొకోమో ఇంక్ సంస్థ ఈ ప్రయోగం చేసింది. టోక్యోలోని రొపోంగి హిల్స్ కాంప్లెక్సులో తాము అక్టోబర్ 13వ తేదీన అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్‌మిషన్ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్ వేగాన్ని అందుకుందని కంపెనీని ఉటంకిస్తూ సిన్హువా వార్తాసంస్థ తెలిపింది.

ఈ ప్రయోగంలో.. మిల్లీమీటరు తరంగదైర్ఘ్యంతో కూడిన సిగ్నళ్లను అత్యధికంగా 70 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యంతో పంపారు. ఇప్పటివరకు షాపింగ్ మాల్స్ లాంటి వాణిజ్య ప్రాంగణంలో ఎవరూ 5జీ డేటా ట్రాన్స్‌మిషన్ ప్రయోగాలు చేయలేదని, సాధారణంగా ఇలాంటి చోట్ల డేటా ట్రాన్స్‌మిషన్‌లో రకరకాల సమస్యలు రావడమే ఇందుకు కారణమని డొకోమో సంస్థ తెలిపింది. అయితే, తాము బీమ్ ఫార్మింగ్, బీమ్ ట్రాకింగ్ అనే రెండు కొత్త టెక్నాలజీలు ఉపయోగించి మొబైల్ పరికరం ఎక్కడుందో అన్న దాని ఆధారంగా బీమ్ దిశను నియంత్రించామని డొకోమో వివరించింది. దానివల్ల తమ ప్రయోగం విజయవంతం అయినట్లు చెప్పింది.

Advertisement
Advertisement