గాలేరు–నగరి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలేరు–నగరి పనులకు సంబంధించి బాలాజీ, మల్లెమడుగు ప్రాజెక్టుల ఇరిగేషన్ ట్యాంకుల పనులు, భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మల్లెమడుగు ప్రాజెక్టుకు సంబంధించి చెంచులక్ష్మి ఎస్సీ కాలనీలో భూసేకరణపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలన్నారు. బాలాజీ ప్రాజెక్టు పనులకు ఇంకా 3.5 కిలో మీటర్ల మేర భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు పనుల కోసం తరలింపునకు గురవుతున్న స్థానికులకు నష్టపరిహారం ఇప్పించడంలో అలసత్వం చేయవద్దన్నారు. బాలాజీ రిజర్వాయరుకు సంబంధించి సీసీఎల్ఏ కోర్టులో ఉన్న 20 ఎకరాలకు చెందిన రికార్డులను తనకు పంపాలని ఆయన రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీషా, డీఆర్వో విజయ్చందర్, ఎస్డీసీ మాధవీలత, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.