వ్యక్తిపైకి దూసుకెళ్లిన ఆటో | Sakshi
Sakshi News home page

వ్యక్తిపైకి దూసుకెళ్లిన ఆటో

Published Fri, Dec 2 2016 12:16 AM

వ్యక్తిపైకి దూసుకెళ్లిన ఆటో

పోరుమామిళ్ల: మద్యం మత్తులో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిపై ఆటో దూసుకెళ్లడంతో రెండు కాళ్లూ విరిగి, తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితికి చేరిన ఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కాశినాయన మండలం బాలాయపల్లెకు చెందిన కందుల ఓబులేసు(55) అత్తగారి ఊరు కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లెకు వెళ్లి గురువారం సాయంత్రం తిరిగి వస్తూ మద్యం సేవించాడు. మద్యం మత్తులో నడుచుకుంటూ కలసపాడు నుంచి సిద్దమూర్తిపల్లె దాటాక రోడ్డుపై పడిపోయాడు. స్పృహ కోల్పోయి రోడ్డుపై పడివున్న ఓబులేసుపై కలసపాడు నుంచి పోరుమామిళ్ల వైపు వేగంగా వస్తున్న ఆటో  దూసుకెళ్లింది. దాంతో ఓబులేసు రెండు కాళ్లూ విరిగి  రక్తస్రావమైంది. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ పరారయ్యాడు. ఆ  దారిన బైక్‌పై వస్తున్న సిద్దవరం డీలర్‌ గురప్ప ప్రమాదాన్ని గుర్తించి 108కు ఫోన్‌ చేశారు. అయినా ఒక్క వాహనం కూడా రాకపోవడంతో చివరకు ఓ ఆటోలో క్షతగాత్రుడిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం కడపకు తరలించారు.

Advertisement
Advertisement