పులివెందుల: అధికార వికేంద్రీకరణలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 'వైఎస్ఆర్ కుటంబం' కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన శనివారం పులివెందులలో ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే గ్రామాలకే పూర్తి అధికారం కట్టబెడతామని తెలిపారు. గ్రామస్థాయిలో సచివాలయం ఏర్పాటుచేస్తామని, అక్కడికక్కడే సమస్యలకు పరిష్కారం కల్పిస్తామని తెలిపారు.
గ్రామ సచివాలయం సిఫారసులు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. 10మంది విద్యావంతులకు గ్రామసచివాలయంలోనే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఏ కమిటీలతో సంబంధం లేకుండా నిర్ణయాలు అమలుచేస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో గ్రామసచివాలయమే కీలకం కానుందని వివరించారు. ప్రతి సామాజిక వర్గానికి గ్రామ సచివాలయంలో ప్రాతినిథ్యం ఉండేలా చూస్తామని చెప్పారు.