స్వర్ణరథంపై సర్వతేజోమయి | Sakshi
Sakshi News home page

స్వర్ణరథంపై సర్వతేజోమయి

Published Tue, Nov 25 2014 2:15 AM

స్వర్ణరథంపై సర్వతేజోమయి

తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పద్మావతీ అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగారు. భక్తుల  కోలాటాలు, భజనబృందాల కళా ప్రదర్శనల నడుమ  స్వర్ణరథోత్సవం కన్నులపండువలా సాగింది. ఉదయం పద్మావతిదేవి సర్వభూపాల వాహనంపై, రాత్రి గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
 
తిరుచానూరు : కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం రాత్రి శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు గరుత్మంతునిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8గంటలకు అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకరణలో తిరువీధుల్లో భక్తులను అనుగ్రహించారు. మధ్యాహ్నం 12గంటలకు  శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారికి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం జరిగింది.

సాయంత్రం 4.10గంటలకు స్వర్ణరథంపై సర్వతేజోమయి అయిన అమ్మవారు కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 7గంటలకు ఆస్థానమండపంలో అమ్మవారికి ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహనమండపానికిు తీసుకొచ్చి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య మణిమాణిక్యాలు, శ్రీవారి పాదాలు, శ్రీవారి సహస్రలక్ష్మీ కాసుల హారంతో అమ్మవారిని దివ్యాలంకారశోభితంగా అలంకరించారు.  

రాత్రి 8.30గంటలకు  భక్తుల కోలాటాలు, సంప్రదాయ భజన బృందాలు, జీయర్ స్వాముల దివ్యప్రభంద పారాయణం, వేదగోష్టి నడుమ శ్రీవారి పాదాలతో అమ్మవారు గరుత్మంతునిపై ఆశీనులై తిరువీధులలో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. పెద్ద సంఖ్యలో భక్తులు గరుడసేవలో అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు.

Advertisement
Advertisement