దసరా రష్ | Sakshi
Sakshi News home page

దసరా రష్

Published Thu, Oct 2 2014 1:15 AM

Dasara rush

రైళ్లన్నీ కిటకిట
 తరగని వెయిటింగ్ లిస్టు
 ప్రయాణికులఅవస్థలు

 
విశాఖపట్నం సిటీ : రైళ్లకు దసరా తాకిడి పెరిగిం ది. రైళ్లన్నీ రద్దీగా కదులుతున్నాయి. నిరీక్షణ జాబితా చాంతాడులా వేలాడినట్టే బోగీల్లో ప్రయాణికులు కూడా వేలాడుతున్నారు. బుధవారం ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నుంచే రద్దీ తీవ్రత మొదలైంది. జనరల్  బుకింగ్ కౌంటర్ దాటి ప్రయాణికులు టికెట్ల కోసం నిరీక్షించారు.

జ్ఞానాపురం వైపు కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు క్యూ కట్టారు. ఉదయం 5 గంటలకు క్యూకట్టినా అనుకున్న రైలుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు సిద్దపడి టిక్కెట్ కోసం నిరీక్షించిన వారిలో అనేక మంది సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కోసం కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు.

ఒకరిని ఒకరు తోచుకుంటూ రెలైక్కేందుకు ఒక్కసారిగా పోటీపడడంతో తోపులాట జరిగింది. జనరల్ బోగీల్లోకి వెళ్లేందుకు ఉభయగోదావరి జిల్లాల ప్రయాణికులు పోటీపడడంతో తోపులాటలు జరిగాయి. సికింద్రాబాద్ వెళ్లేందుకు సాయంత్రం విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ల వద్ద కూడా రద్దీ కనిపించింది. ఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణికులను క్యూ కట్టించడంతో కాస్త తోపులాటలు తగ్గాయి.
 
హౌరా వైపునకు బాగా డిమాండ్.!

విశాఖ నుంచి హౌరా వైపు వెళ్లేందుకు భారీ డిమాండ్ వుంది. హౌరా వెళ్లే రైళ్లలో నిలబడేందుకే చోటు కనిపించడం లేదు. చెన్నె, బెంగుళూరు, ముంబాయి నుంచి హౌరా వెళ్లే అన్ని రైళ్లలో రద్దీ విపరీతంగా వుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఆ రైళ్లన్నీ పూర్తిగా నిండిపోయి వుంటున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రయాణికులు ఎక్కేందుకు చోటుండడం లేదు. హౌరా మెయిల్, కోరమండల్, ఈస్టుకోస్టు, ఫలక్‌నామా, యశ్వంత్‌పూర్-హౌరా, విశాఖ-షాలిమార్, సికింద్రాబాద్-హౌరా వంటి రైళ్లన్నీ కిక్కిరిసినడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు సైతం బెర్తులన్నీ ఫుల్‌గా నిండిపోయాయి. పాఠశాలలకు, ప్రై వేట్ కాలేజీలకు, కోచింగ్ కేంద్రాలకు సెలవులు ఇచ్చేస్తుండడంతో ఊర్ల బాట పట్టారు.

Advertisement
Advertisement