హైదరాబాద్ : అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాల నడుమ ఏపీ అసెంబ్లీ సమావేశం శుక్రవారం 10 నిమిషాలు వాయిదా పడింది. హుదూద్ తుపానుపై అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవ తీర్మానం చేయడానికి సభలో సీఎం చంద్రబాబు లేనందునా రేపటికి వాయిదా వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ను కోరారు. బాబు లేకుండా తీర్మానం చేయాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఆ సమయంలో హుదూద్ తుపాన్ సమయంలో బాధితులకు ఆహారం అందించిన తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కొన రవికుమార్ లు... జగన్పై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.
దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమ నిరసన తెలిపారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ బుద్దప్రసాద్... మీ సీట్లల్లో కూర్చోవాలని వైఎస్ఆర్ సీపీ సభ్యులకు సూచించారు. అందుకు ససేమిరా అనడంతో ఇరు పార్టీ సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దాంతో సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.