పసలేని పవన్‌ ప్రసంగం | Sakshi
Sakshi News home page

పసలేని పవన్‌ ప్రసంగం

Published Sat, May 4 2024 10:30 AM

పసలేని పవన్‌ ప్రసంగం

గిద్దలూరు రూరల్‌: పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం పసలేకుండా సప్పగా సాగడంతో కూటమి పార్టీల శ్రేణుల్లో నీరసం కనిపించింది. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ప్రధాన కూడలి వద్ద జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభ ప్రసంగంలో క్లారిటీ లేకపోవడంతో వచ్చిన వారంతా ప్రసంగం మధ్యలోనే వెనుదిరిగారు. సినిమా హీరోగా ఆయనను అభిమానించే కొంతమంది మాత్రమే హాజరవడంతో ఆశించిన స్థాయిలో జనాలు కనిపించలేదు. మూడు పార్టీల కూటమి నాయకులు మద్యం, డబ్బు ఇచ్చి పవన్‌ బహిరంగ సభకు తరలించేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఊగుతూ ఒకే బైక్‌పై ముగ్గురునలుగురు ఎక్కి రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఓటు లేని వారితో కూడా పార్టీ జెండాలు చేతపట్టించి కేకలు వేయించారు. ఒంగోలు–నంద్యాల ప్రధాన రహదారిపై పవన్‌ ప్రసంగం ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మంది జనాలు కనిపించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. జనసేన పార్టీ జెండాలు చేత పట్టి మద్యం షాపుల వద్ద నిలుచుని పూటుగా మద్యం సేవించే వారు అధికంగా కనిపించారు. ఇంత పెద్ద స్టార్‌ వస్తే.. తక్కువ మంది హాజరవడంపై విమర్శలు వినిపించాయి.

Advertisement
Advertisement