తల్లి లేకుండానే అంత్యక్రియలు | Sakshi
Sakshi News home page

తల్లి లేకుండానే అంత్యక్రియలు

Published Tue, Nov 14 2023 4:22 AM

-

మెదక్‌ మున్సిపాలిటీ : దీపావళి ప్రతీ ఇంట్లో వెలుగులు తెస్తే.. ఆ కుటుంబంలోకి మాత్రం చీకటి తెచ్చింది. పండుగ రోజు టపాసులు కొనేందుకు తల్లి, ఇద్దరు కుమారులతో కలిసి స్కూటీపై వెళ్తుండగా టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు టైర్‌ కిందపడి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టేక్మాల్‌ మండలం కాద్లూర్‌ గ్రామానికి చెందిన అన్నపూర్ణ మెదక్‌ పట్టణం జంబికుంటలో నివాసం ఉంటున్నారు. మెదక్‌లోని కేజీబీవీలో టీచర్‌గా పని చేస్తూ పృథ్వీ తేజ్‌ (9), ప్రణయ్‌ తేజ్‌ (12) చదివించుకుంటూ జీవిస్తోంది. దీపావళి పండుగ కావడంతో టపాసులు కొనడానికి కుమారులతో కలిసి వడ్డెర కాలనీలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్దకు స్కూటీపై వెళ్తున్నది. మార్గమధ్యలో గోల్కొండ వీధిలో ప్రధాన రోడ్డుపై స్కూటీని వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె రోడ్డు పక్కన పడింది. కుమారులు టిప్పర్‌ టైర్‌ కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. కళ్ల ముందే వారు చనిపోవడం చూసిన ఆ తల్లి గుండెలు అవిసేలా రోదించడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి, అనంతరం గ్రామానికి పంపించారు. టిప్పర్‌ డ్రైవర్‌ వాహనాన్ని వదిలేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తల్లి లేకుండానే అంత్యక్రియలు

టేక్మాల్‌(మెదక్‌): మెదక్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు చిన్నారుల అంత్య క్రియలు స్వగ్రామమైన కాద్లూర్‌లో తల్లి లేకుండానే జరిగాయి. కళ్ల ముందే ఇద్దరు కొడుకులు చనిపోవడం చూసిన అన్నపూర్ణ కోమాలోకి వెళ్లడంతో సంగారెడ్డిలోని పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందు తోంది. దీపావళి పండుగ రోజే ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కాద్లూర్‌ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో చనిపోయిన ప్రణయ్‌తేజ్‌ (12) మెదక్‌ గీతా పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా, పృఽథ్వీ తేజ్‌ (9) తుప్రాన్‌ గీతా పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.

Advertisement
Advertisement