బెంగళూరులో కరోనా డేంజర్‌ బెల్స్‌.. నాలుగు మరణాలు | Sakshi
Sakshi News home page

బెంగళూరులో కరోనా డేంజర్‌ బెల్స్‌.. నాలుగు మరణాలు

Published Fri, Jan 5 2024 11:07 AM

Corona Positive Cases Increased In Karnataka Bangalore - Sakshi

ఢిల్లీ: కరోనా సబ్‌ వేరియంట్‌ జేఎన్‌-1 కారణంగా దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరస్‌ కారణంగా రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 4,334 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటనలో​ తెలిపింది. 

కాగా, దేశంలో కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 కారణంగా మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు.. కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 298 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగళూరులోనే 172 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం, ఇదే సమయంలో కరోనాతో నలుగురు మృతిచెందడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. ఇక, ప్రస్తుతం కర్ణాటకలో 1,240 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

భారీగా పెరిగిన జేఎన్‌-1 కేసులు..
ఇదిలా ఉండగా.. దేశంలో జేఎన్‌-1 పాజిటివ్‌ కేసులు 500 మార్కును దాటాయి. ప్రస్తుతం దేశంలో జేఎన్‌-1 వేరియంట్‌ కేసులు 541 ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కర్ణాటకలో 199, కేరళలో 148, గోవాలో 47, గుజరాత్‌లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్‌లో 4, తెలంగాణ 2, ఒడిషా, హర్యానాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. 

ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. మిజోరం, త్రిపుర, చండీఘర్‌, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, నాగాలాండ్‌లో పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి యాక్టివ్‌ కేసులు కూడా లేవని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 

Advertisement
Advertisement