‘స్కిల్‌’ శిక్షకులకు ఆహ్వానం  | Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ శిక్షకులకు ఆహ్వానం 

Published Fri, Nov 3 2023 3:17 AM

2000 skilled trainers are required in APSSDC - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన 192 స్కిల్‌ హబ్స్, ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసిన మరో 26 స్కిల్‌ కాలేజీలు, ఒక స్కిల్‌ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ఔత్సాహికుల నుంచి ఏపీ నైపుణ్యాభివృద్ధి  సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతి జాబ్‌ రోల్‌కు ఒక సర్టిఫైడ్‌ ట్రైనర్‌ చొప్పున మొత్తం 2,000 మంది శిక్షకులు  అవసరమవుతారని ఏపీఎస్‌ఎస్‌డీసీ అంచనా  వేసింది. అర్హత కలిగిన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ తరగతులపై ట్రైనింగ్‌ ఇచ్చి శిక్షకులుగా ఎంపిక చేస్తామని, ఇందుకు సంబంధించిన నిర్వహణ  విధివిధానాలు (ఎస్‌వోపీ)ని రూపొందించినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో వినోద్‌కుమార్‌  గురువారం ‘సాక్షి’కి తెలిపారు.

ఆసక్తిగలవారికి కేంద్ర నైపుణ్య శిక్షణ ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌ ప్రమాణాల ప్రకారం నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ఉచితంగా ట్రైనింగ్‌ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత శిక్షకులుగా సర్టిఫికెట్‌ జారీచేసి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎంపానల్‌మెంట్‌లో నమోదు చేస్తామని చెప్పారు. మొత్తం 20 రంగాలకు చెందిన 44 జాబ్‌ రోల్స్‌లో శిక్షకులను నియమించనున్నట్లు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏపీఎస్‌ఎస్‌డీసీ పోర్టల్‌ https://skilluniverse.apssdc.in/ user®istration లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకుని ఎంపికైన అభ్యర్థులను ఏపీ స్కిల్‌ యూనివర్సల్‌ పోర్టల్‌ లేదా యాప్‌లో ఉంచనున్నట్లు తెలిపారు.

ఆయా కోర్సుల్లో శిక్షణ అవసరమైనప్పుడు వీరు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని, శిక్షణా వ్యయంలో సుమారు 13 శాతం వరకు శిక్షకులకు పారితోషికంగా ఇస్తామని, కోర్సును బట్టి వీటి ఫీజులు మారుతుంటాయని వినోద్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చట్టం తీసుకురావడమే కాకుండా దానికి అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి పిరమిడ్‌ ఆకృతిలో ఒక ఎకో సిస్టమ్‌ను రూపొందించారు. ఇంటర్మీడియెట్‌లోపు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్‌ హబ్స్, ఆపైన విద్యార్థులకు స్కిల్‌ కాలేజీలు, హైఎండ్‌ స్కిల్‌ శిక్షణ కోసం స్కిల్‌ యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  

Advertisement
Advertisement