-
సమస్యే లేదు – వేరే అర్థం ఎందుకు?
పత్రికలలో ‘‘2500 ఏళ్లుగా పాణిని వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అనే వార్త చదివి తెల్లబోయాను. రిషిరాజ్ పోపట్ అనే 27 ఏళ్ల యువకుడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పీహెడీ చేస్తున్నారట. అతడు చేసిన ప్రతిపాదన ఇది. సంస్కృత వ్యాకరణం పన్నెండు సంవత్సరాలు చద వాలని ప్రసిద్ధి. పూర్వం అలా చదివేవారు. ఇరవై ఏడేళ్ల యువకుడు ఇంగ్లీషులో చదివి ఇలా చెప్పడం ఒక వింత. తమ జీవితాలను విద్యాతపస్సులకు అంకితం చేసిన మునులు వరరుచి, పతంజలి. వారు వ్యాకరణ శాస్త్ర గ్రంథాలను రచించిన వారు. పతంజలి ముని యోగ శాస్త్రాన్ని రచించిన వారు. ప్రపంచంలో చాలా యోగాలకు ఆయన యోగశాస్త్రం మూలం. ‘మహా భాష్యం వా పాఠయేత్, మహా రాజ్యం వా పాలయేత్’ అని ఆర్యోక్తి. పతంజలి ముని వ్యాకరణ మహా భాష్యాన్ని పాఠం చెప్పడం ఒక పెద్ద రాజ్యాన్ని పాలించడంతో సమానం. మహా భాష్యమైనా పాఠం చెప్పాలి. మహా రాజ్యమైనా ఏలాలని పై సంస్కృత సూక్తికి అర్థం. తరువాత కైయటుడు, భట్టోజి దీక్షితులు, నాగేశ భట్టు మొదలైన వారు బహుశాస్త్ర పండితులు. వీరు వ్రాసిన గ్రంథాలన్నీ అర్థం చేసుకోవడమే గొప్ప విషయం. వీరందరినీ కించపరిచే ఇతడు చెప్పిన విషయాన్ని పరిశీలించాలి. ఒక పదం తయారు చేయడంలో రెండు సూత్రాలు ఒకేసారి ప్రవర్తిస్తూంటే వానిలో ఏ సూత్రం ప్రవర్తింప చేయాలనే విష యంలో పాణిని ముని ‘విప్రతిషేధే పరం కార్యమ్’ అనే సూత్రం చెప్పారు. సమానమైన బలం కలిగిన రెండు సూత్రాలకు వైరుధ్యం కలిగినపుడు వరుస క్రమంలో తరువాత ఉన్న సూత్రం ఎంచు కోవాలి అని పాణిని మునిని అనుసరించిన గ్రంథకర్తలు తెలిపారు. ‘‘ఈ పద్ధతి వ్యాకరణం ద్వారా అనేకమైన తప్పు రూపాలను తయారు చేస్తుంది’’ అని ఇతడి ప్రతిపాదన. కాబట్టి ఇతడు ఈ సూత్రానికి వేరే అర్థం చెబుతున్నారు. ఒక పదం తయారు చేసే క్రమంలో ఒకచోట రెండు సూత్రాలు ప్రవర్తించవలసినపుడు వాటికి వైరుధ్యం వస్తే ఆ పదంలో రెండో భాగంలో ప్రవర్తించ వలసిన సూత్రాన్నే ప్రవర్తింప చేయాలి. ఈ పద్ధతిని అవలంబిస్తే సుమారు అన్ని పదాల తయారీలో సరైన సమాధానం లభిస్తుందని ఇతడి ప్రతిపాదన సారాంశం. ఉదాహరణానికి మంత్ర + భిస్ అని ఉన్నపుడు 7 అ – 3 పా – 103 సంఖ్యగల సూత్రంచే మంత్రంలోని త్ర వర్ణమందు గల అకారానికి ఏ కారం వస్తుంది. దీనివల్ల మంత్రేభిః అనే అసాధు రూపం ఏర్పడుతుంది. 7 అ – 1 పా – 9 సంఖ్యగల సూత్రంచే భిస్ కు ఐస్ వస్తుంది. మంత్ర + ఐస్ = మంత్రైః అని తయారవుతుంది. ఇది సరి అయిన రూపం. కాబట్టి రెండు సూత్రాలకు విప్రతిషేధం వస్తే వరుస క్రమంలో తరువాతి సూత్రం అని చెప్పకూడదు. మంత్ర + భిస్ అనే చోట తరువాత ఉన్న ఐస్ కి భిస్ వస్తోంది. ఇది పదంలో కుడివైపున జరిగే కార్యం. దానిని విధించే సూత్రాన్ని ఎంచుకోవాలని పాణిని అభిప్రాయం. దీనివలన మంత్రైః అనే సరి అయిన రూపం ఏర్పడుతుందని రిషి రాజ్ ప్రతిపాదనం. సూత్ర గ్రంథాలలో అల్పాక్షరాలలో అనల్పమయిన అర్థాన్ని ఇముడ్చుతారు. దానిలో సారం చాలా ఉంటుంది. దోషం ఉండదు. ఇలాంటి సూత్రాలు విద్యను కంఠస్థం చేయడానికి ఉపయోగిస్తాయి. కాని విద్యార్థికి సూత్రంలో భావం ఎలా తెలుస్తుంది? గురువుల వల్ల, సూత్ర గ్రంథాల అధ్యయనం వల్ల, సూత్రాలపై రాసిన వ్యాఖ్యల వల్ల తెలుస్తుంది. సూత్ర గ్రంథాలకు గురుశిష్య పరంపరగా వచ్చిన అర్థమే గ్రంథకర్త అభిప్రాయం అయ్యే అవకాశాలు అధికం. అలాగే గురు శిష్య పరంపరగా ఈ సూత్రాల అధ్యయనం సాగేది. ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి పూర్వ గ్రంథాలు చెప్పినది తప్పు అనడం సమంజసం కాదు. కాత్యాయనునికి వరరుచి అని మరో పేరు. ఆయన వార్తికాలన్నీ మహా భాష్యంలో ఉన్నాయి. విడిగా లేవు. పతంజలి యోగ శాస్త్రం వ్రాశారు. వీరి వ్యాకరణ భాష్యాన్ని మహా భాష్యం అంటారు. బహువచనే ఝల్యేత్ 7 అ – 3 పా – 103 సూ. ఝలాదౌ బహు వచనే సుపి పరే అతోఙ్గ స్యైకార స్సా్యత్ రామేభ్యః ఇది పతంజలి భాష్యం. పై సూత్రం మంత్ర + భిస్ అన్నచోట త్ర కారానికి ఏత్వం విధించగలదు. ఇది తరువాతి సూత్రం కనుక మంత్రే + భిస్ అని అయ్యే అవకాశం ఉంది. అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. ‘అకారాన్తా దఙ్గా ద్భి స ఐస్ స్యాత్, రామైః’ ఇది భాష్యంలోనిది. మంత్ర + భిస్ అని ఉన్నపుడు పై సూత్రం చే ఐస్ వచ్చి మంత్రైః అని అవుతుంది. విప్రతిషేధే పరం కార్యమ్ ఈ సూత్రం చేత సమాన బలం కలిగిన రెండు సూత్రాలు ఒక చోట ప్రవర్తించవలసి వస్తే తరువాత ఉన్న సూత్రం ప్రవర్తించాలి. కానీ ఇక్కడ వరుసలో పూర్వం ఉన్న సూత్రం ప్రవర్తించిన రూపమే సరియైనది. కారణ మేమిటి ? అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. వృక్షైః, ఇహ పరత్వా దేత్వం ప్రాప్నోతి. ... కృతైత్త్వే భూత పూర్వ మకారం భవిష్యతి. ఐస్తు నిత్యమ్. ... కృతే ప్యేత్వే ప్రాప్నోతి అకృతేపి ప్రాప్నోతి. నిత్యత్వా ధైత్వే కృతే విహత నిమిత్తత్వాత్ ఏత్వం న భవిష్యతి. – వ్యాకరణ మహాభాష్యం (244 పు.) 7 అ – 3 పా – 103 వ సూత్రం పర సూత్రం కనుక దాని చేత మంత్ర + భిస్ అనే చోట త్ర కారంలో అకారానికి... ఏత్వం చేస్తే ఆ ఏకార స్థానంలో పూర్వం ఉన్నది అకారం కనుక అపుడు కూడా భిస్కు ఐస్ వస్తుంది. కావున ఐస్ నిత్యం. ఐస్ చేస్తే ఝలాది వర్ణం పరంగా లేదు కనుక ఏత్వం రాదు అని భాష్యకారులు చెప్పారు. మంత్రలోని త్ర కారంలో ఉన్న అకారానికి వచ్చిన ఏ కారం అకారం వంటిది ఎలా అవుతుందని ప్రశ్న. సంస్కృత వ్యాక రణంలో ‘యథోత్తరం మునీనాం ప్రామాణ్యమ్’ అని నియమము. పాణిని ముని సూత్రాలకు భాష్యం లేకపోతే అవి అర్థం కావు. పాణిని ముని సూత్రాలకంటే కాత్యాయన ముని వార్తికాలకు, అంతకంటె పతంజలి ముని భాష్యానికి ప్రామాణ్యం ఎక్కువ. వార్తికాలు, భాష్యం లేకపోతే పాణిని సూత్రాలు మొత్తం సంస్కృత పద సముద్రానికి లక్షణం చెప్పలేవు. పతంజలి ముని ఒక శ్లోకం ఉదాహరించారు. శ్లో. ఏత్వం భిసి పరత్వాచ్చే దత ఐస్క భవిష్యతి కృత ఐత్వే భూత పూర్వా్య ధైస్తు నిత్య స్తథాసతి ఇది కాత్యాయన ముని వార్తికం అయి ఉంటుంది. కాబట్టి ఈ కారిక, పతంజలి ముని వచనం ప్రమాణంగా తీసుకుని ఐస్ను విధించే సూత్రం నిత్యమని చెప్పడం సముచితమే. ‘త్రిముని వ్యాకరణమ్’ అని ఆర్యోక్తి. ముగ్గురూ వ్యాకరణ విషయంలో ప్రామాణికులే. పరం కంటే నిత్యం బలమయినది. కనుక ఏత్వం రాకుండా ఐస్ వచ్చిందని భావం. పర సూత్రం కంటె నిత్యం బల మయినదని ‘పూర్వ పర నిత్యాన్తరఙ్గానా ముత్తరోత్తరం బలీయః’ అనే పరిభాష తెలుపుతుంది. కావున పర సూత్రమైన ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రాన్ని నిత్య సూత్రమైన ‘అతో భిస ఐస్’ బాధించింది. మంత్ర + ఐస్ = మంత్రైః అయ్యింది. ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రమెలా అవుతుంది? ఏత్వం ఒక వర్ణానికి చెందిన విధి కదా అని ప్రశ్న. ఒక వర్ణానికి చెందిన విధిలో ఆదేశం స్థానివంటిది కాదని నిషేధం ఉంది. అపుడు ఏకారం అకారం వంటిది కాదు. ఇక్కడ భాష్యం వార్తికం ఎలా సరిపడతాయని ఆక్షేపం వస్తుంది. ‘అచః పరస్మిన్ పూర్వవిధౌ’ అనే సూత్రానికి మహాభాష్యంలో ‘అజాదేశః పరనిమిత్తకః పూర్వస్య విధిం ప్రతి స్థానివద్ భవతి. కుతః పూర్వస్య ఆదేశాద్’ అనే వాక్యాలున్నాయి. మంత్ర + భిస్ అనే చోట ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రంచే త్రకారంలో ఉన్న అకారానికి ఏత్వం వచ్చి మంత్రే + భిస్ అయ్యింది. ఇప్పుడు ‘అతో భిస ఐస్’ అనే సూత్రం చేత ‘భిస్’నకు ఐత్వం వస్తున్నపుడు ఆదేశం అయిన ఐస్ కంటే పూర్వ మందున్న ఏకారానికి స్థానివద్భావం చేస్తే భిస్ నకు ఐస్ ప్రాప్తించి మంత్రైః అవుతుంది. కాబట్టి పైన పతంజలి ముని, కాత్యాయన ముని పేర్కొన్నట్లు ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రం అయ్యింది. పరం కంటె నిత్యం ప్రబలం కనుక మంత్రైః అనే రూపం సిద్ధిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి తప్పు, సమస్య, గందర గోళం లేవు. రిషి రాజ్ పోపట్ పరిశోధన చేసి ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి సంస్కృత వ్యాకరణ మార్గంలో ఋషి పుంగవులను, ఋషి తుల్యులను కించ పరిచాడు. తాను విప్రతిషేధే అనే సూత్రానికి కొత్త అర్థం చెప్పడం వల్ల కొన్ని రూపాలు కుదరడం లేదు. ఇది అతడి ప్రసంగం చూసి చేసిన విమర్శ. అతడి సిద్ధాంత గ్రంథాన్ని విమర్శిస్తే అదో పెద్ద గ్రంథమవుతుందేమో! (క్లిక్ చేయండి: జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు) - డాక్టర్ చిఱ్ఱావూరి శివరామ కృష్ణ శర్మ వ్యాసకర్త రీడర్ (విశ్రాంత) ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్టణం -
గుండె జబ్బులపై అద్భుత విజయం
న్యూఢిల్లీ : గుండె జబ్బులను నివారించడంలో కేంబ్రిడ్జి పరిశోధకులు అద్భుతమైన విజయం సాధించారు. గుండెపోటు వల్ల చనిపోయిన గుండె రక్తనాళాలు, గుండె కణజాలానికి తిరిగి ప్రాణం పోశారు. గుండెపోటు వచ్చినప్పుడు కణజాలానికి ఆక్సిజన్ అందక గుండెలోని కొన్ని ప్రాంతాలు దెబ్బతింటాయి. అక్కడి కణజాలం శాశ్వతంగా చనిపోతుంది. దానికి జీవం పోయడానికి గతంలో పరిశోధకులు చేసిన ప్రయోగాలు ఏమీ విజయం సాధించలేక పోయాయి. కేంబ్రిడ్జి పరిశోధకులు మానవ గుండె నుంచి రెండు రకాల స్టెమ్ సెల్స్ను తీసుకొని వాటికి ఎలుకలలోని చచ్చిన గుండె కణజాలంలోకి ఎక్కించారు. వాటిని లాబరేటరీలో ఉంచి ఎదగనిచ్చారు. ఆ తర్వాత ఆ కణజాలాన్ని తీసుకెళ్లి ఎలుకల గుండెల్లోకి ఎక్కించారు. ఆశ్చర్యంగా అప్పటికే చచ్చిన ఎలుకల గుండెలోని కణజాలం తిరిగి ప్రాణం పోసుకుంది. ఇక ఈ ప్రయోగాన్ని మానవ గుండెలపై చేయడమే తరువాయని అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ సంజయ్ సిన్హా తెలిపారు. బ్రిటన్లో ఏటా తొమ్మిది లక్షల మంది గుండె పోటుకు గురవుతున్నారు. అలాంటప్పుడు వారి గుండెలో ఏదో ప్రాంతం చనిపోతోంది. పర్యావసానంగా వారు మరోసారి గుండెపోటు వచ్చినప్పుడు మరణిస్తున్నారు. వారిలో ప్రస్తుతం కేవలం 200 మందికి మాత్రమే గుండె మార్పిడి చికిత్సలు చేయగలగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రయోగం ద్వారా అద్భుత విజయాలు సాధించవచ్చని డాక్టర్ సంజయ్ చెప్పారు. అమెరికాలో అయితే ఏకంగా ఏటా దాదాపు 50 లక్షల మంది గుండె పోటుకు గురవుతున్నారు. -
గోడలెక్కే రోబో జలగ
టోక్యో: జలగ మాదిరిగా గోడలను సైతం సునాయాసంగా పాకుతూ ఎక్కగలిగే రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ రోబోలు భవనాల నిర్వహణ, తనిఖీ, అన్వేషణ, విపత్తు సమయాల్లో భవనాల లోపలికి వెళ్లగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని జపాన్లోని టోయోహాషి యూనివర్సిటీ, బ్రిటన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. దీని పేరు లీచ్(లాంగిట్యూడినల్లీ ఎక్స్టెన్సిబుల్ కంటినమ్ రోబోట్ ఇన్స్పైర్డ్ బై హిరుడినియా). దీనిని షవర్ హోస్(స్నానాల గదిలో వాడే పైపు), రెండు సక్షన్ కప్(గోడకు పట్టి ఉండే పరికరం)లను ఉపయోగించి తయారు చేశారు. జలగలు కొండలు, ఇతరత్రా ఎక్కేటప్పుడు వాటి శరీరంలో ఉండే సక్షన్ కప్లు ఉపయోగపడతాయని తాము గుర్తించామని అన్నారు. ఈ రెండింటితోపాటు మరికొన్ని పరికరాలను ఉపయోగించి దీనిని తయారు చేశామని వివరించారు. మృదువుగా, సౌకర్యవంతంగా ఉంటూ ఎలాంటి గోడలను అయిన ఎక్కగలిగే ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో ఇదేనని వెల్లడించారు. ఈ వివరాలు సాఫ్ట్ రోబోటిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
ఊపిరితో గ్లూకోజ్ మోతాదు తెలుసుకోవచ్చా?
మధుమేహ బాధితులకు శుభవార్త. రక్తంలో గ్లూకోజ్ మోతాదును పరీక్షించుకునేందుకు రోజూ సూదితో గుచ్చుకుంటున్నారా? అయితే మీ కష్టాలకు త్వరలోనే చెల్లుచీటీ పాడేయొచ్చంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు. మనం వదిలే ఊపిరి ద్వారానే గ్లూకోజ్ మోతాదును లెక్కవేయొచ్చని పరిశోధన పూర్వకంగా ఓ అంచనాకు వచ్చారు. సాధారణ ప్రజల నిశ్వాసాల్లో ఇసోప్రీన్ అనే వాయువు చాలా కొద్ది మోతాదులో ఉంటుందని, రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉండే వారిలో చాలా ఎక్కువగా ఉంటుందని.. ఎనిమిది మంది టైప్-1 మధుమేహ బాధితులపై జరిపిన అధ్యయనం ద్వారా స్పష్టమైంది. కొలెస్ట్రాల్ తయారీలో భాగంగా ఈ వాయువు ఉత్పత్తి అవుతుందని ఇప్పటికే తెలిసినప్పటికీ.. రక్తంలో గ్లూకోజ్ మోతాదు తగ్గడానికి దీనికి సంబంధం ఏమిటన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇసోప్రీన్ వాయువుతో మనకొచ్చిన ఇబ్బందేమీ లేకపోయినా.. కుక్కలకు మాత్రం ఈ వాసనంటే అస్సలు పడదు. అందుకే ఈ రకమైన హైపోగ్లైసీమియాతో బాధపడే వారిని కుక్కలు ఇట్టే పసిగట్టి దూరంగా జరుగుతాయి. ఈ లక్షణాన్ని మరింత అర్థం చేసుకోగలిగితే రక్తంలో గ్లూకోజ్ మోతాదు ఎంత ఎక్కువైందన్నది తెలుసుకోవచ్చని.. మందుబాబులను పట్టుకునేందుకు వాడే బ్రీత్ఎనలైజర్ వంటి పరికరాలను తయారు చేయవచ్చని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు అంటున్నారు. -
కుక్కల్లో 11 వేల ఏళ్ల నాటి కేన్సర్
లండన్: కుక్కల్లో 11 వేల ఏళ్ల క్రితం ఏర్పడిన ఓ కేన్సర్ వ్యాధి నేటికీ కొనసాగుతూ వస్తోందని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కుక్కల జననాంగాల్లో ఏర్పడే ‘సీటీవీటీ’ అనే కేన్సర్ ఒక కుక్క నుంచి మరో కుక్కకు నేరుగా సక్రమిస్తోందని వారు కనుగొన్నారు. 11 వేల ఏళ్ల క్రితం.. అలాస్కన్ మాలామూట్ జాతి కుక్కకు ఈ కేన్సర్ వచ్చి ఉంటుందని, అది వేరే కుక్కలతో జతకట్టడంతో వాటికి కేన్సర్ కణాలు సంక్రమించి ఉంటాయని భావిస్తున్నారు. సీటీవీటీ వ్యాధి జన్యుచరిత్ర(జీనోమ్)ను రూపొందించిన శాస్త్రవేత్తలు ఈ వ్యాధి జీనోమ్లో ఇంతవరకూ 20 లక్షల జన్యుమార్పులు జరిగాయని అంచనా వేశారు. ఒక్కో జన్యుమార్పుకు ఎంతకాలం పట్టిందన్న దానిని బట్టి ఇది 11 వేల ఏళ్ల క్రితం ఏర్పడి ఉంటుందని నిర్ధారించారు. మనిషిలో వచ్చే కేన్సర్ వ్యాధులలో వెయ్యి నుంచి 5 వేల జన్యుమార్పులు మాత్రమే జరగడం గమనార్హం. సాధారణంగా కేన్సర్ కణాలు ఇతర జంతువులకు నేరుగా సంక్రమించవు. కానీ ఇప్పటిదాకా టాస్మానియన్ డెవిల్ (చిన్న కుక్కలాంటి అడవి జంతువు), కుక్కల్లో మాత్రమే సీటీవీటీ కేన్సర్ను గుర్తించారు. సీటీవీటీ జన్యు చరిత్రపై అధ్యయనం ద్వారా ఇలాంటి కేన్సర్ల సంక్రమణపై కొత్త విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. -
పాలపుంత ఏర్పాటే భిన్నం!
లండన్: విశ్వంలోని నక్షత్ర సమూహా (గెలాక్సీలు)ల్లో ప్రకాశవంతంగా ఉండే మన పాలపుంత (మిల్కీవే).. మిగతావాటికి భిన్నంగా లోపలివైపు నుంచే మెల్లమెల్లగా ఏర్పడిందని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జియా-ఈఎస్వో ప్రాజెక్టు నుంచి సేకరించిన సమాచారం సహాయంతో.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అంతరిక్ష విభాగం శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్బ్యాంగ్ జరిగిన తర్వాత ఏర్పడిన తొలి నక్షత్రాల్లో ఎక్కువ శాతం హైడ్రోజన్, హీలియం మూలకాలు మాత్రమే ఉన్నాయని.. ఆ తర్వాతి కాలపు నక్షత్రాల్లో మెగ్నీషియం వంటి లోహ మూలకాలు ఉంటాయని పరిశోధనకు నేతృత్వం వహించిన మరియా బెర్జ్ మన్ చెప్పారు. ప్రస్తుతం పాలపుంతలోని నక్షత్రాల రసాయన సమ్మేళనాలను పరిశీలించగా... మన సూర్యుడి కక్ష్యా ప్రాంతమైన మధ్య భాగంలో ఉన్నవాటిలో లోహమూలకాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని, అంచులకు వెళ్లినకొద్దీ లోహ మూలకాల పరిమాణం పెరిగినట్లుగా గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం.. పాలపుంత మధ్యలో ఉన్న నక్షత్రాలు ముందుగా ఏర్పడ్డాయని, అనంతరం అంచులవైపు నక్షత్రాలు ఏర్పడుతూ పాలపుంత విస్తరించిందని తెలిపారు. అంతేగాకుండా.. పాలపుంత మధ్యలో ఉన్న నక్షత్రాలు ఏర్పడడానికి తక్కువకాలం పడుతోందని, అదే అంచులవైపు నక్షత్రాలు ఏర్పడడానికి సుదీర్ఘ కాలం పడుతోందని పేర్కొన్నారు.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్
మియాపూర్లో సందడి చేసిన డింపుల్ హయాతి (ఫొటోలు)
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
వారెవ్వా అభిషేక్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో
ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
క్రాష్ టెస్ట్లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
రామసేతు రహస్యం పార్ట్1: రామసేతు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
ట్రైనీ ఐఏఎస్గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
Nidhi Agarwal: కడపలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి (ఫొటోలు)
భారత్-కెనడా మ్యాచ్ వర్షార్పణం..
Advertisement