-
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
అఖండ గోదావరి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణ మీదుగా దిగువన ఏపీలోని ధవళేశ్వరం దాకా నిండుగా ప్రవహిస్తుండటం.. మొత్తం అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో.. అఖండ గోదావరిగా మారింది. బాబ్లీ బ్యారేజీ నుంచి 2,92,889 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తేసి 2.74 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో 2,40,196 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ వరదకు స్థానిక ప్రవాహాలు చేరి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఏకంగా 7,40,951 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడ 7,12,294 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటికి దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, ఇతర ఉపనదులు, వాగులు తోడై.. గోదావరిలో 12 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. సరస్వతి (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ), సమ్మక్క (తుపాకులగూడెం), సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం) బ్యారేజీలకు వస్తున్న నీటిని వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద అప్రమత్తం భద్రాచలం వద్ద గురువారం ఉదయం నీటి మట్టం 50.5 అడుగులకు పెరగడంతో ఆందోళన వ్యక్తమంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత వరద తగ్గి.. రాత్రి 9 గంటలకు 11,77,133 క్యూసెక్కుల వరదతో 48.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. అయితే ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి భారీగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా నదికి జలకళ మహారాష్ట్ర, కర్ణాటకలలో విస్తారంగా వానలతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి 1.75 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద జూరాల ప్రాజెక్టుకు చేరుతుండటంతో ఈ సీజన్లో తొలిసారి ఏడు గేట్లు ఎత్తారు. దీంతోపాటు విద్యుదుత్పత్తి కూడా చేస్తూ.. మొత్తం 70,422 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి స్థానిక ప్రవాహం కలసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 71 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం వస్తోంది. ఇక్కడ నీటి నిల్వ 39.2 టీఎంసీలకు చేరింది. దిగువన మూసీ నుంచి వరదతో పులిచింతలలో నీటి నిల్వ 21.88 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర డ్యామ్కు 1,11,566 క్యూసెక్కుల వరద వస్తోంది. కాళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్! గురువారం అర్ధరాత్రి కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 11 లక్షల క్యూసెక్కులతో, 105.1 మీటర్లకు పెరగడం ఆందోళన రేపుతోంది. శుక్రవారం ఉదయానికి నీటి మట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది జూలై మూడో వారంలో గోదావరికి భారీ వరదలు వచ్చి.. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 108.19 మీటర్లకు పెరిగింది. మేడిగడ్డ, అన్నారం పంపుహౌజ్లు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పట్లో మేడిగడ్డకు ఏకంగా 26,79,260 క్యూసెక్కుల అతిభారీ వరద వచ్చి బ్యారేజీ గేట్లపై నుంచి పొంగిపొర్లింది. -
వచ్చే నెల నుంచే ‘ఎస్సారెస్పీ’కి నీరు
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు డిసెంబర్ నుంచే నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుత యాసంగిలో మొత్తంగా 6.10 లక్షల ఎకరాలకు నీరందించనున్నారు. ఈ మేరకు గురువారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లోయర్ మానేర్ డ్యాం ఎగువన 4 లక్షల ఎకరాలకు, దిగువన 1.60 లక్షల ఎకరాలకు, సరస్వతి, లక్ష్మీ కాలువల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని తీర్మానించారు. రెండు, మూడు రోజుల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. రెండో వారం నుంచి.. యాసంగికిగాను ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలపై కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్ అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ రెండో వారం నుంచి సాగునీరు ఇవ్వాలని, మొత్తంగా 8 తడులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎక్కువ నీళ్లు వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయకట్టు చివరి రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. దీనిపై మంత్రి హరీశ్రావు స్పందిస్తూ.. ఈ ఏడాది కృష్ణాలో బాగానే నీళ్లు వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు గోదావరిలో తక్కువగా వచ్చాయన్నారు. ఎస్సారెస్పీలోకి సాధారణం కంటే 15 శాతం తక్కువగా నీరు చేరిందని, ప్రస్తుతం 63 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజి–1లో చివరి ఆయకట్టు వరకు నీరిచ్చేలా పనులు చేపట్టేందుకు రూ.1,000 కోట్లు కేటాయించామని.. ఆ పనులు వేగవంతమయ్యేలా చూడాలని సూచించారు. అయితే ఆయా పనుల పేరుతో పంటలకు నీరందించే ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. ఈ పనులను 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. వీఆర్వో, వీఆర్ఏల సేవలను సైతం నీటి విడుదల పనులకు వినియోగించుకోవాలని సూచించారు. ఎల్ఎండీ దిగువన 1.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు టి.జీవన్రెడ్డి, గంగుల కమలాకర్, పుట్టా మధు, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, విద్యాసాగర్రావు, మనోహర్రెడ్డి, బొడిగె శోభ, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషీ, సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, సీఈ బి.శంకర్ తదితరులు పాల్గొన్నారు. సింగూరును త్యాగం చేసి ఇస్తున్నారు: ఈటల సీఎం కేసీఆర్, హరీశ్రావులు త్యాగం చేసి సింగూరు ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీకి జలాలను తరలించారని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గతంలో ఎస్సారెస్పీలో 40 టీఎంసీల కంటే తక్కువగా లభ్యత ఉంటే.. గేట్లు తెరిచి నీళ్లు ఇవ్వలేదని, ఇప్పుడా నిబంధనను పక్కన పెట్టామని చెప్పారు. ఆయకట్టు చివరి రైతుకు కూడా నీళ్లు అందించేందుకు చర్యలు చేపడతామని, అవసరమైతే మూడు నెలల పాటు తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకుందామని ఈటల ప్రతిపాదించారు. ఇక గతేడాది నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన టెయిల్ టు హెడ్ నీటి సరఫరా విధానం విజయవంతమైందని, మిగతా ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి హరీశ్రావు కోరారు. -
కిలోల కొద్దీ అదృష్టం
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో ఆదివారం మత్స్యకారులకు 22 కేజీల చేప చిక్కింది. ప్రాజెక్ట్లో ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో పెద్ద పెద్ద చేపలు చిక్కుతున్నాయి. కాగా ప్రాజెక్ట్లో చేపలు భారీ సంఖ్యలో మృతి చెందుతున్నాయి. నీటి పరిమాణం తగ్గిపోయి ఆక్సిజన్ అందనందున చేపలు వ్యాధిబారిన పడి మృతి చెందుతున్నాయని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. -
చేపపిల్లల ఉత్పత్తికి నీటి కొరత
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగు వ భాగాన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం సంవత్సరం ప్రాజెక్ట్లో నీరు లేకపోవడంతో చేప పిల్లల ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది.జూలై పక్షం రోజులు దాటుతున్నా నీటి కొరతతో చేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కాలేదు. జిల్లాలోనే స్వయంగా చేపపిల్లలను ఉత్పత్తి చేసే ఏకైక కేంద్రం ఎస్సారెస్పీ జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం. ప్రాజెక్ట్లో 1065 అడుగులు నీరున్నప్పుడు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి నీరందించవచ్చు. ప్రస్తుతం 1063.70 అడుగుల నీరు నిల్వ ఉంది. దీంతో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి ప్రాజెక్ట్ నీరు అందడంలేదు. చేపప్లిలల సంతనోత్పత్తికి జూలై, ఆగష్టు మాసలే అనువైనవి. జూలై మొదలు నుంచి ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాలి. నీటి సరఫరా లేక ఉత్పత్తిప్రక్రియ సకాలంలో సాగడం లేదు. దీంతో మత్స్య కారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సంత్సరం చేప పిల్ల ఉత్పతి పూర్తి స్థాయిలో జరుగుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు. జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి నిరంతరం విద్యుత్తు సరఫరా లేక పోవడం వలన తీవ్ర ఇబ్బందిగా ఉంది. ఉత్పత్తి కేంద్రానికి నీటి సరఫరా చేసేందుకు కేంద్ర వద్ద బావి తవ్వారు. బావి ద్వారా నీటి సరఫరా చేసి చేప పిల్లల ఉత్పత్తి కోసం స్వల్పంగా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే విద్యుత్తు సరఫరా లేక ఆ నీరు కూడా అందడంలేదు. వ్యవసాయానికి సరఫరా చేసే ఆరు గంటల విద్యుత్తు సరఫరా మాత్రమే ఉంది. అదీ లోవోల్టేజీ సమస్యతో మోటారు నడిచేది చాలా తక్కువ సమయం. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి నిరంతరం విద్యుత్తు సరఫరా కోసం ట్రాన్స్కోకు డిమాండ్ ప్రకారం రూ. 7 లక్షలు చెల్లించినట్లు మత్స్య శాఖ అధికారులు తెలుపుతున్నారు. జూలై మొదటి వారంలో కరెంటు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు లేదు. దీంతో నీటి కొరత తీవ్రమైంది. అదేవిధంగా అధికారులు స్పందించి బోరుబావి తవ్వించాలని మత్స్య కారులు కోరుతున్నారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మూడు కోట్ల చేప పిల్లల ఉత్పత్తి చేపట్ట వచ్చు. నీటి కొరత తీవ్రంగా ఉంది చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. కరెంట్ సరఫరా నిరంతరం లేక పోవడంతో ఉన్న నీటిని సరఫరా చేపట్ట లేక పోతున్నాం. దీంతో ఉత్పత్తి ప్రక్రియ ఆలస్య మవుతోంది. - లక్ష్మీ నారాయణ, ఇన్చార్జి, ఎఫ్డీవో -
వరద గోదారి
విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి వరద ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రానికి 51 అడుగులకు చేరింది. అటు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 30 అడుగుల (9.92 మీటర్లు)కు, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద 33 అడుగులకు (11.2 మీటర్ల)కు చేరుకుంది. దీంతో భద్రాచలం, రామన్నగూడెంలలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం వద్ద వరద 12 మీటర్లకు చేరితే ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇక భారీగా వరదలు పోటెత్తుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యూరు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని మండలాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్ అతలాకుతలం నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ప్రాణహిత, పెన్గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భైంసా పరిధిలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో నాలుగు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ నీటితో బైపాస్ రోడ్డు, వంతెన నీట మునగడంతో 12 మంది చిక్కుకుపోయారు. వారిని సహాయక సిబ్బంది కాపాడారు. వేమనపల్లి మండలంలో ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తోంది. మండల పరిధిలోని 18 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 32 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బెజ్జూరు మండలంలో తీగలబర్రె వాగు ఉప్పొంగడంతో తలాయి, ఇక్కపల్లి, భీమారం గ్రామాలు రెండు రోజుల నుంచి జల దిగ్బంధంలో ఉన్నాయి. ఆసిఫాబాద్, ఖానాపూర్ మండలాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నేరడిగొండ మండలం వాంకిడి వద్ద తాత్కలిక వంతెన కొట్టుకుపోవడంతో వాహనాలను జాతీయరహదారి మీదుగా మళ్లించారు. కాళేశ్వరం వద్ద ఉధృతంగా.. కరీంనగర్ జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నారుు. సోమవారం సాయంత్రానికి కాళేశ్వరం వద్ద నీటిమట్టం 11.2 మీటర్లకు చేరింది. కాళేశ్వరం దిగువన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతర్రాష్ట్ర వంతెనను తాకేంతగా వరద ప్రవహిస్తోంది. నీటిమట్టం 12 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. కాళేశ్వరం వద్ద నీటిమట్టం 13 మీటర్లకు చేరితే మహదేవపూర్ మండలంలోని పలు లోతట్టు గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉండటంతో.. అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి కమ్మునీటితో మండలంలోని పెద్దంపేట వాగు ఉప్పొం గింది. దాంతో నాలుగు రోజులుగా పెద్దం పేట, లెంకలగడ్డ, పంకెన, మోదేడు, పలి మెల, అప్పాజీపేట, బోడాయిగూడెం, సర్వాయిపేట, దమ్మూరు, బూర్గుగూడెం, నీలంపల్లి, వెంచంపల్లి, ముకునూర్, తిమ్మటిగూడెంలకు రాకపోకలు స్తంభించాయి. వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో వాగు వద్ద చిక్కిపోయూరు. వాగుకు ఇటు పక్కన ఉన్న అంబట్పల్లి, సూరారం తదితర గ్రామాల్లో బంధువులు, తెలిసినవారి ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇక గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని గోదావరిలో నాటు పడవలు తిప్పడాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు నిషేధించారు. భద్రాచలంలో పరవళ్లు.. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచ లం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో గోదావరి విశ్వరూపం చూపిస్తోంది. వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య కిలోమీటర్ మేర రహదారి నీటిలో మునిగిపోయింది. స్తంభాలు దెబ్బతిని విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాజేడు, ఏడ్జర్లపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన నీట మునిగింది. దూలాపురం, పూసూరు, కాసారం ప్రాంతాల్లో పంట పొలాల్లో వరద నీరు చేరింది. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, సీతమ్మ వారి నారచీరలు, సీతవాగుకు భారీగా నీరు చేరడంతో రామాయణ దృశ్యాలు నీట మునిగాయి. భద్రాచలం స్నానఘట్టాలపైకి వరద నీరు చేరింది. గోదావరి కరకట్ట స్లూయిస్ల లీకేజీతో భద్రాచలంలోని అశోక్నగర్ కొత్తకాలనీలోకి వరద నీరు వచ్చింది. దీంతో కాలనీ వాసులను సమీపంలోని పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. శ్రీరాంసాగర్కు పెరుగుతున్న వరద వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల కళ సంతరించుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లాలోని గెడ్డన్న వాగు నుంచి 18 వేల క్యూసెక్కులు, స్థానిక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 12 వేల క్యూసెక్కులు కలిపి మొత్తంగా 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం ఒక్కరోజులోనే 1.5 అడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు (90 టీఎంసీలు) కాగా... సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1,050.40 అడుగుల (6.42 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో గతేడాది ఇదే రోజున 1,057.80 అడుగుల (11.34 టీఎంసీలు) నీరు ఉంది. ఎగువన మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులకు జలకళ భారీగా వచ్చి చేరుతున్న వరదతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కొమురం భీమ్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో ఐదు గేట్లు ఎత్తివేశారు. ఇన్ఫ్లో 24 వేల క్యూసెక్కులు ఉండగా.. 25,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 700 అడుగులుకాగా.. 695.13 అడుగుల వరకు నీరు చేరింది. ఇంకా 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో.. అధికారులు తొమ్మిది గేట్లు ఎత్తి 99,400 క్యూసెక్కులు వదిలిపెడుతున్నారు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నిండిపోయింది. దీంతో 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 138.3 మీటర్లుకాగా.. సోమవారం సాయంత్రానికి 138.25 మీటర్లకు చేరింది. ఇన్ఫ్లో 8,600 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 158 క్యూసెక్కులుగా ఉంది. చెరువుల్లో ఆశాజనకం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువులకు నీటి కళ వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో 2,300 చెరువులకు వెయ్యి చెరువులు నిండిపోయాయి. ఖమ్మం జిల్లాలో మొత్తంగా 4,500 చెరువులకు 1,900 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. మరో వెయ్యి చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు చేరింది. మహబూబ్నగర్లో 30 చెరువులు పూర్తిస్థాయిలో నిండగా.. మరో 400 చెరువులు నిండేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరంగల్లో 69, నల్లగొండలో 50 చెరువులు పూర్తిస్థాయిలో నిండినట్లు చిన్న నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా భూగర్భ జలాలు భారీగా క్షీణించడంతో చెరువుల్లోకి నీటి ప్రవాహాలున్నా అవి ఇంకిపోతున్నాయని... ప్రస్తుత వర్షాలు మరిన్ని రోజులు కొనసాగితే గోదావరి బేసిన్లోని చెరువులన్నీ నిండుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీట మునిగిన పంటలు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండ లం రామన్నగూడెం, గొంటైని పం టలు నీట మునిగాయి. రాంనగర్, కోయగూడ ఎల్లాపురం, లంబాడీతండా జలది గ్బంధంలో చిక్కుకున్నాయి. రాంనగర్-రామన్నగూడెం మధ్య కాజ్వేపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆ గ్రామా ల వారికి మూడు రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయా రుు. దీంతో ఐటీడీఏ, రెవెన్యూ అధికారు లు సోమవారం పడవలు ఏర్పాటు చేశా రు. నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు రెం డు ఇళ్లు కూలిపోయాయి. వర్షాలతో కరీం నగర్ జిల్లా రామగుండం రీజియన్ పరిధిలోని సింగరేణి ఓపెన్కాస్ట్లలో నీరు చేరి బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు స్తంభించారుు. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాం పూర్, రెబ్బెన, బెల్లంపల్లి గనుల్లోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లో చేరిన నీటిని మోటార్లతో తోడివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పూడుకుపోతున్న ఎస్సారెస్పీ
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో రోజురోజుకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ఎగువ ప్రాంతాలనుంచి వచ్చే వరద నీరు, మట్టితో పూడిక పేరుకుపోతోంది. ఇప్పటికే సుమారు 34 టీఎంసీల మేర పూడిక చేరి ఉంటుందని భావిస్తున్నారు. పూడికపై సర్వే చేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పకడ్బందీగా సర్వే నిర్వహించి ఎంత మేరకు పూడిక పేరుకుపోయిందో తేల్చాలని, పూడికను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఠబాల్కొండ, న్యూస్లైన్ : ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి కాగానే 1970లో హైడ్రో గ్రాఫిక్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 112.02 టీఎంసీలుగా నిర్ధారించింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు, మట్టితో ప్రాజెక్టులో పూడిక పేరుకుపోతోంది. 1994 లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబరెటీస్ (ఏపీఈఆర్ఎల్) సంస్థ సర్వే చేసి ప్రాజెక్టులోకి 21.71 టీఎంసీల పూడిక వచ్చి చేరిం దని తేల్చింది. అంటే 1994 నాటికి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలకు పడిపోయిందన్నమాట. 2006లో అదే ఏపీఈఆర్ఎల్ సర్వే జరిపి ప్రాజెక్టులో 32 టీఎంసీల పూడిక పేరుకుపోయిందని నివేదిక ఇచ్చింది. లెక్క ప్రకారం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 79.96 టీఎంసీలకు పడిపోయినట్లు కాగా, ఈ నివేదిక నమ్మశక్యంగా లేదని అధికారులు కొట్టిపారేశారు. పూడికపై 1994లో ఏపీఈఆర్ఎల్ సంస్థ ఇచ్చిన నివేదిక ను నమ్మిన ప్రాజెక్టు అధికారులు.. 2006లో ఇచ్చిన రిపోర్టు నమ్మశక్యంగా లేదని అంటున్నారు. ఏటా 0.8 టీఎంసీల పూడిక 1970 నుంచి 1994 వరకు 24 ఏళ్లలో 21.71 టీఎంసీల పూడిక చేరింది. 1994 నుంచి 2006 వరకు 12 ఏళ్లలో 10 టీఎంసీల పూడిక చేరినట్లు సర్వే తేల్చింది. ప్రాజెక్టులోకి ఏటా ఎగువ ప్రాంతాల నుంచి 0.8 టీఎంసీల పూడి క వచ్చి చేరుతుందని అధికారుల సర్వే రికార్డులు చెబుతున్నాయి. వారి లెక్కల ప్రకారం 36 ఏళ్లలో 28.8 టీఎంసీల పూడిక చేరుతుం ది. 24 టీఎంసీల పూడిక చేరిందని 2006లో ఏపీఈఆర్ఎల్ సంస్థ ఇచ్చిన నివేదికను ప్రాజె క్టు అధికారులు ఎందుకు తిరస్కరించారో అర్థంకాని పరిస్థితి. అయితే ప్రాజెక్టులో ఇంత భారీగా పూడిక చేరిందని తెలిస్తే రైతులనుంచి ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడిన అధికారులు.. సర్వే రిపోర్టును తిరస్కరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా అధికారులు మళ్లీ అదే సంస్థతో ప్రస్తుతం సర్వే చేయిస్తుండడం గమనార్హం. వారం రోజుల్లో సర్వే ప్రారంభం కానుంది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎస్సారెస్పీ వట్టిపోయే పరిస్థితి ఏర్పడుతోంద న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1963లో ఈ ప్రాజెక్టు పురుడుపోసుకుంది. సుమారు 18 లక్షల ఎకరాలకు సాగు నీరు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు తాగు నీరు అందిస్తూ ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా మారింది. అయితే ఈ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పూడిక పేరుకుపోతుండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. పూడికతీత విషయమై అధికారులు గతంలో ఓసారి విదేశీ బృందాలను పిలిపిం చారు. పూడికను రసాయనాలతో కరిగించి, ప్రాజెక్టు వరద గేట్ల కింద అమర్చిన షిల్ట్ గేట్ల ద్వారా వదలాలని వారు సూచించారు. అయి తే షిల్ట్ గేట్లు సైతం మట్టిలోనే కూరుకుపోయాయని, అందువల్ల పూడికతీత సాధ్యపడలేదని పేర్కొంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఇప్పటివరకు వేల టీఎంసీల నీటిని గోదావరి నదిలోకి వదిలినా.. ఒక్కసారి కూడా షిల్ట్ గేట్లను ఎత్తకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతులు ఆరోపిస్తున్నారు. దాని ఫలితంగానే ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయాలు వేదికి, ప్రాజెక్టులోంచి పూడిక తొలగించాలని కోరుతున్నారు. పకడ్బందీగా సర్వే చేయిస్తాం ఏపీఈఆర్ఎల్ ప్రభుత్వ సంస్థ. అయితే గతంలో ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికపై నిర్వహించిన సర్వేలో పొరపాట్లు జరిగాయి. ఈసారి అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పకడ్బందీగా సర్వే చేయించి, ప్రాజెక్టులో ఎంతమేర పూడిక పేరుకుపోయిందో తేలుస్తాం. -శ్యాంసుందర్, ప్రాజెక్టు ఎస్ఈ
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
Advertisement