-
స్టార్టప్లకు నిధుల కొరత..
ముంబై: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో దేశీ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గిపోతోంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 79 శాతం క్షీణించింది. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం గతేడాది జనవరి–జూన్ మధ్యకాలంలో 18.4 బిలియన్ డాలర్ల మేర ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ/వీసీ) పెట్టుబడులు రాగా ఈసారి మాత్రం అదే వ్యవధిలో 3.8 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఫండింగ్ పరిమాణం తగ్గిపోవడం ఒక ఎత్తైతే.. అటు డీల్స్ కూడా పడిపోవడం మరో ఎత్తు. గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే ఒప్పందాల సంఖ్య 60 శాతం క్షీణించి 727 నుంచి 293కి పడిపోయింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో పీఈ/వీసీ ఫండ్స్ వర్ధమాన మార్కెట్లలో రిసు్కలతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం కంటే పెద్దగా రిసు్కలు లేకుండా మెరుగైన రాబడులు అందించే బాండ్లు మొదలైన సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ సీఈవో రాజేష్ సలూజా తెలిపారు. అయితే, దీర్ఘకాలికంగా ఈ ధోరణి ఉండకపోవచ్చని, పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత పెట్టుబడులు మళ్లీ పుంజుకోగలవని ఆయన అభిప్రాయపడ్డారు. తగ్గిన వేల్యుయేషన్స్ .. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా ఎగిసిన దేశీ టెక్నాలజీ స్టార్టప్ల వేల్యుయేషన్లు గత కొన్నాళ్లుగా గణనీయంగా తగ్గాయి. యూనికార్న్లపరంగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్లు) ప్రపంచంలోనే భారత్ మూడో ర్యాంకులో ఉన్నప్పటికీ .. గత తొ మ్మిది నెలలుగా కొత్తగా ఒక్క అంకుర సంస్థ కూడా యూనికార్న్ హోదా దక్కించుకోలేదు. సమీప కాలంలో దక్కించుకునే సూచనలూ కనిపించడం లేదు. యూనికార్న్లు కాగలిగే సత్తా ఉన్న అంకురాలంటూ హురున్ గతేడాది 122 స్టార్టప్లతో జాబితా చేయగా, ఈ ఏడాది అందులో నుంచి 19 సంస్థలు స్థానం కోల్పోయాయి. మరోవైపు, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా వాటాలు విక్రయించి పెట్టుబడులు తెచ్చుకునేందుకు అంకుర సంస్థలు కూడా సుముఖత చూపడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అత్యంత సంపన్న వర్గాలు లేదా వెంచర్ డెట్ ఫండ్స్ నుంచి రుణాల రూపంలో తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నాయి. తద్వారా వాటాలను విక్రయించాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు వివరించాయి. చక్కని పనితీరుతో మంచి వేల్యుయేషన్ గల కంపెనీలు.. మార్కెట్ పరిస్థితులు బాగా లేనప్పుడు నిధులను సమీకరించేందుకు ఇష్టపడవని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. బుల్ మార్కెట్తో పోలిస్తే బేర్ మార్కెట్లో సరైన వేల్యుయేషన్ లభించదు కాబట్టి పరిస్థితి చక్కబడే వరకు అవి కాస్త వేచి చూస్తాయని పేర్కొన్నారు. డేటాలో మరిన్ని అంశాలు.. ► 2023 ప్రథమార్ధంలో 170 పైచిలుకు తొలి దశ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 2022 ప్రథమార్ధంలో నమోదైన 435 డీల్స్తో పోలిస్తే 61 శాతం క్షీణించాయి. ఇన్వెస్ట్ చేసిన నిధుల పరిమాణం బట్టి చూస్తే స్టార్టప్లకు 624 మిలియన్ డాలర్లు లభించాయి. గతేడాది ప్రథమార్ధంలో వచి్చన 1.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 65 శాతం క్షీణత. ► వృద్ధి దశ, ఆఖరు అంచె పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గాయి. 123 డీల్స్ ద్వారా 3.2 బిలియన్ డాలర్లు వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఈ విభాగానికి సంబంధించి 292 డీల్స్ ద్వారా 16.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ► మే నెలలో 948 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో 53 డీల్స్ కుదరగా .. జూన్లో 546 మిలియన్ డాలర్ల విలువ చేసే 44 ఒప్పందాలు కుది రాయి. గతేడాది జూన్లో ఏకంగా 2.4 బిలియ న్ డాలర్ల విలువ చేసే 108 డీల్స్ కుదిరాయి. ► ప్రథమార్ధంలో పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా ఇండియా) అత్యధికంగా 21 డీల్స్తో టాప్ ఇన్వెస్టరుగా నిలి్చంది. యాక్సెల్ ఇండియా 11, బ్లూమ్ వెంచర్స్ 10 ఒప్పందాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రెయిన్మ్యాటర్ క్యాపిటల్, ఆనికట్ క్యాపిటల్, లైట్స్పీడ్ వెంచర్స్ మొదలైన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు చురుగ్గా పాలుపంచుకున్నాయి. ► ఈ ఏడాది ఇప్పటివరకూ కళ్లద్దాల బ్రాండ్ లెన్స్కార్ట్ అత్యధికంగా 500 మిలియన్ డాలర్లు సమీకరించింది. 250 మిలియన్ డాలర్లతో బిల్డర్.ఏఐ, తలో 150 మిలియన్ డాలర్లతో ఇన్ఫ్రా.మార్కెట్, జెట్వెర్క్, ఇన్సూరెన్స్దేఖో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అధిక వేల్యుయేషన్స్తో ఒత్తిడి .. అంకుర సంస్థల ప్రమోటర్లు, వ్యవస్థాపకులు భారీ వేల్యుయేషన్స్తో పెట్టుబడులు సమీకరించడం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల సత్వరం ఫలితాలు చూపించాల్సిన ఒత్తిడి పెరిగిపోతుందని వారు తెలిపారు. ఫలితంగా దీర్ఘకాలికంగా ఆలోచించడం కన్నా స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని వివరించారు. భారత్పే, ట్రెల్, జిలింగో, గోమెకానిక్ వంటి పలు దేశీ అంకుర సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బైటపడటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల కూడా ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాబట్టి అంకుర సంస్థలు అధిక వేల్యుయేషన్ల వెంటబడకుండా అవసరానికి తగినన్ని నిధులను మాత్రమే సమీకరించుకోవడం, సుస్థిరమైన వ్యాపార మోడల్ను తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి,నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నించబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. (హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్ షురూ ) అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కల్పించాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. (Virat Kohli First Car: స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్) స్టార్టప్లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్లో 1,00,000 పైచిలుకు స్టార్టప్లు, 108 యూనికార్న్లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) -
ఏవియేషన్కు రూ. 1,500 కోట్ల రుణ పరిమితి
న్యూఢిల్లీ: కోవిడ్ ధాటికి కుదేలైన రంగాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశించిన ఈసీఎల్జీఎస్కి (అత్యవస రుణ సదుపాయ హామీ పథకం) కేంద్ర ఆర్థిక శాఖ సవరణలు చేసింది. వైమానిక రంగ సంస్థలకు గరిష్ట రుణ పరిమితిని రూ. 400 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచింది. సముచిత వడ్డీ రేటుతో తనఖా లేని రుణాలు పొందడం ద్వారా విమానయాన సంస్థలు నిధుల కొరత సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020 మే నెలలో కేంద్రం ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులను బట్టి సవరిస్తూ, పొడిగిస్తూ వస్తోంది. ఇది ఈ ఏడాది మార్చితో ముగియాల్సి ఉండగా 2023 మార్చి వరకూ పొడిగించింది. ఈ స్కీము కింద 2022 ఆగస్టు 5 నాటికి ఈ స్కీము కింద రూ. 3.67 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
విత్డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’!
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులకు షాక్నిచ్చేలా విత్డ్రాయల్స్పై పరిమితులు విధించింది. ఖాతాదారులకు రూ. 50,000కు మించి చెల్లింపులు జరపకుండా 30 రోజుల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఏప్రిల్ 3 దాకా కొనసాగుతుంది. వైద్యం, ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే రూ. 50,000కు మించి విత్డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అటు యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ మాజీ సీఎఫ్వో ప్రశాంత్ కుమార్ను అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. భారీ స్కామ్తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్ బ్యాంక్పైనా రిజర్వ్ బ్యాంక్ అటువంటి చర్యలే తీసుకోవడం గమనార్హం. ఆందోళన వద్దు .. డిపాజిట్లు భద్రమే.. మొండిబాకీల భారం, డిపాజిట్ల విత్డ్రాయల్స్, రేటింగ్ డౌన్గ్రేడ్స్ వంటి పలు ప్రతికూల అంశాలతో బ్యాంకు పరిస్థితి నానాటికి దిగజారిందని ఆర్బీఐ పేర్కొంది. ‘పరిస్థితి చక్కదిద్దుకోవడానికి, విశ్వసనీయమైన పునరుద్ధరణ ప్రణాళికతో నిధులు సమీకరించుకోవడానికి యస్ బ్యాంక్ మేనేజ్మెంట్కు తగినన్ని అవకాశాలు ఇచ్చాం. కానీ ప్రణాళికలు అమలు చేయడంలో అది విఫలమైంది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత.. ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం యస్ బ్యాంకుపై మారటోరియం విధించాలంటూ ప్రభుత్వానికి సూచించడం మినహా మరో మార్గాంతరం లేదని భావించాం. తదనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది‘ అని ఆర్బీఐ పేర్కొంది. ఖాతాదారులు ఆందోళన చెందనక్కర్లేదన్న ఆర్బీఐ.. డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడతామని భరోసానిచ్చింది. బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం యస్ బ్యాంక్ పునరుద్ధరణ లేదా మరో బ్యాంకులో విలీనం చేయడానికి సంబంధించి త్వరలోనే తగు ప్రణాళికను రూపొందిస్తామని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిటర్లు సుదీర్ఘకాలం ఇబ్బందులు పడకుండా మారటోరియం ముగిసేలోగానే దీన్ని అమలు చేస్తామని తెలిపింది. ఎస్బీఐ చేతికి..? ఎల్ఐసీతో కలిసి టేకోవర్ వార్తలు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు.. యస్ బ్యాంక్ను ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్సార్షియం మొత్తం 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియంత్రణాధికారాలు దక్కే స్థాయిలో వాటాలు కొనుగోలు చేసేందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రావొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ముంబైలో ఎస్బీఐ బోర్డు సమావేశం కావడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. యస్ బ్యాంక్ మూతబడే పరిస్థితి ఉండబోదంటూ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు.. యస్ బ్యాంక్ను టేకోవర్ చేసేందుకు అనువైనవంటూ గతంలో ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వార్తలపై వివరణనివ్వాలంటూ ఎస్బీఐ, యస్ బ్యాంకులకు స్టాక్ ఎక్సే్చంజీలు సూచించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం అలాంటి పరిణామాలేమైనా ఉన్న పక్షంలో వెల్లడిస్తామంటూ ఎస్బీఐ తెలియజేసింది. అటు యస్ బ్యాంక్ కూడా .. ఇప్పటిదాకా తమకు దీనిపై ఆర్బీఐ లేదా ప్రభుత్వం లేదా ఇతరత్రా నియంత్రణ సంస్థలు, ఎస్బీఐ నుంచి ఏ విధమైన సమాచారమూ రాలేదని తెలిపింది. అటు, బ్రోకరేజీ సంస్థలు మాత్రం యస్ బ్యాంక్ పరిస్థితి ఆశావహంగా లేదంటూ వ్యాఖ్యానించాయి. ఒకవేళ ఇన్వెస్టర్లకు బలవంతంగా అంటగట్టినా.. మొండిబాకీల రిస్కులు భారీగా ఉన్నందున బ్యాంకు విలువను సున్నా కింద లెక్కగట్టి తీసుకోవడమే జరగవచ్చని జేపీ మోర్గాన్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘యస్’ నుంచి ‘నో’ వరకూ...! ► జూన్ 12, 2018: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా మూడేళ్లపాటు రాణా కపూర్ పునర్నియామకానికి వాటాదారుల ఆమోదం ► సెప్టెంబర్ 19, 2018: రాణా కపూర్ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ► సెప్టెంబర్ 21, 2018: యస్ బ్యాంక్ షేర్ ఒకే రోజు 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరి ► సెప్టెంబర్ 28, 2018: ప్రమోటర్ షేర్లను విక్రయించబోనని, కూతుళ్లకు ఇచ్చేస్తానని రాణా కపూర్ ప్రకటన. యస్ బ్యాంక్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్కు క్రెడిట్ వాచ్ రేటింగ్ను ఇస్తున్నామని కేర్ రేటింగ్స్ వెల్లడి ► అక్టోబర్ 17, 2018: రాణా కపూర్కు మరింత గడువును ఇవ్వడానికి నిరాకరించిన ఆర్బీఐ. 2019, ఫిబ్రవరి 1 కల్లా కొత్త సీఈఓను నియమించుకోవాలని ఆదేశం ► అక్టోబర్ 25, 2018: గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి. మార్క్టు మార్కెట్ నష్టాలు రెట్టింపు కావడం, మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండటంతో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. రుణ నాణ్యత భారీగా క్షీణించింది. ► నవంబర్ 14, 2018: చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా. ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగిన వసంత్ గుజరాతీ ► నవంబర్ 19, 2018: మరో ఇండిపెండెంట్ డైరెక్టర్ రెంటాల చంద్రశేఖర్ రాజీనామా ► నవంబర్ 27, 2018: యస్ బ్యాంక్ రేటింగ్ను డౌన్ గ్రేడ్చేసిన మూడీస్ సంస్థ. ► మార్చి 1, 2019: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవ్నీత్ గిల్. 3 శాతం ఎగసిన షేర్ ధర ► మార్చి 5, 2019: స్విఫ్ట్ కార్యకలాపాల విషయంలో నిబంధనలు పాటించనందుకు రూ. 1 కోటి జరిమానా విధించిన ఆర్బీఐ ► ఏప్రిల్ 26, 2019: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడి. రూ.1,507 కోట్ల నికర నష్టాలు ► ఏప్రిల్ 29, 2019: యస్ బ్యాంక్ రేటింగ్ను డౌన్గ్రేడ్ చేసిన మాక్వైరీ బ్రోకరేజ్ సంస్థ. ► ఏప్రిల్ 30, 2019: క్యూ4 ఫలితాల ప్రభావంతో 30% పతనమైన షేర్ ► మే 9, 2019: యస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ రేటింగ్ను ప్రధాన రేటింగ్ ఏజెన్సీలైన ఇండియా రేటింగ్స్, ఇక్రాలు డౌన్ గ్రేడ్ చేశాయి. ► మే 15, 2019: యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్లో అదనపు డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ నియామకం ► జూలై 18, 2019: రాణా కపూర్ తన పూర్తి వాటా షేర్లను తనఖా పెట్టారన్న వార్తలు వచ్చాయి. భారీగా పతనమైన బ్యాంక్ షేర్ ► ఆగస్టు 10, 2019: సీఎఫ్ఓగా అనురాగ్ అద్లాఖ నియామకం ► సెప్టెంబర్ 21, 2019: యస్ బ్యాంక్లో 2.75 శాతం వాటా విక్రయించిన రాణా కపూర్. 6.89 శాతానికి తగ్గిన వాటా ► అక్టోబర్ 3, 2019: యస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా ► నవంబర్ 1, 2019: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.600 కోట్ల నష్టాలు ► డిసెంబర్ 6, 2019: యస్ బ్యాంక్కు నెగిటివ్ అవుట్ లుక్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్. 9 శాతానికి పైగా పతనమైన షేర్ ధర ► డిసెంబర్ 17, 2019: కోటక్ మహీంద్రా బ్యాంక్లో యస్ బ్యాంక్ విలీనం కానున్నదని వినిపించిన వార్తలు ► జనవరి 10, 2020: కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ రాజీనామా చేసిన బోర్డ్ మెంటర్ ఉత్తమ్ ప్రకాశ్ రాజీనామా ► జనవరి 13, 2020: ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయాలని లేఖ రాసిన ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్. 6 శాతం పతనమైన షేర్ ధర ► మార్చి 5, 2020: ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియమ్... యస్ బ్యాంక్లో వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని వార్తలు. 26 శాతం లాభంతో రూ.36.85కు ఎగసిన షేర్. షేరు టార్గెట్ @ రూ. 1 అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, జేపీ మోర్గాన్ యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను రూ.1కు (గతంలో రూ.55)కు తగ్గించింది. రేటింగ్ను అండర్ వెయిట్గా కొనసాగించింది. ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నామని జేపీ మోర్గాన్ వివరించింది. గురువారం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన యస్ బ్యాంక్ షేరు.. ఆ తర్వాత టేకోవర్ వార్తలతో బీఎస్ఈలో 26% పెరిగి రూ.36.85 వద్ద క్లోజయ్యింది. -
నిధుల వేటలో సక్సె(య)స్!
న్యూఢిల్లీ: నిధుల కొరత, మొండిపద్దులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్కు భారీ ఊరట లభించింది. 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,500 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ఓ ఇన్వెస్టర్ ముందుకొచ్చారు. కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకి ప్రతిగా ఈ మేరకు ఇన్వెస్ట్ చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్ నుంచి ఆఫర్ వచ్చినట్లు యస్ బ్యాంక్ గురువారం వెల్లడించింది. బ్యాంకు బోర్డు, నియంత్రణ సంస్థ, షేర్హోల్డర్ల నుంచి అనుమతులకు లోబడి తాజా పెట్టుబడులు ఉంటాయని తెలిపింది. ‘మరిన్ని పెట్టుబడుల కోసం ఇతర దేశ, విదేశ ఇన్వెస్టర్లతో కూడా చర్చలు కొనసాగుతాయి‘ అంటూ బ్యాంకు వివరించింది. వ్యాపార వృద్ధికి దోహదపడేలా మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తున్నామని, పలు విదేశీ సంస్థలతో పాటు దేశీయంగా ప్రైవేట్ ఈక్విటీ, వ్యూహాత్మక ఇన్వెస్టర్లు తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని యస్ బ్యాంకు గత నెలలో స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా ఆగస్టులో యస్ బ్యాంక్ రూ. 1,930 కోట్లు సమీకరించింది. నియంత్రణ సంస్థ ఏం చేస్తుందో.. పెట్టుబడుల వార్త వెల్లడి కావడానికి ముందు యస్ బ్యాంక్ మార్కెట్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వద్ద తిరుగాడింది. ఆ ప్రకారం చూస్తే 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడి చాలా భారీ మొత్తమే కానుంది. సంస్థ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై గట్టి నమ్మకమున్నందుకే ఇన్వెస్టర్లు కాస్త ఎక్కువ రేటు ఇచ్చేందుకు కూడా సిద్ధపడి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రూ. 100 వద్ద షేరు కేటాయించిన పక్షంలో విదేశీ ఇన్వెస్టరుకు 25 శాతం వాటా లభించవచ్చు. అంతకు మించి 26 శాతం వాటా తీసుకున్న పక్షంలో మైనారిటీ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫరు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మొత్తం వ్యవహారం జటిలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు, ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం భారతీయ బ్యాంకుల్లో ఏ ఒక్క ఇన్వెస్టరుకు 10 శాతానికి మించి వాటాలు తీసుకోవడానికి లేదు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీన్ని సడలించే అంశాన్ని పరిశీలించవచ్చని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం యస్ బ్యాంకు దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో క్యాథలిక్ సిరియన్ బ్యాంకులో ఫెయిర్ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కూడా ఇదే తరహాలో మెజారిటీ వాటాలు తీసుకునేందుకు అంగీకరించినందున.. తాజాగా అదే తరహా యస్ బ్యాంకు డీల్ విషయంలో ఆర్బీఐ కాదనకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. 24 శాతం ఎగిసిన షేరు.. విదేశీ ఇన్వెస్టరు పెట్టుబడుల వార్తలతో గురువారం యస్ బ్యాంక్ షేరు భారీగా ఎగిసింది. బీఎస్ఈలో ఒక దశలో ఏకంగా 35% పెరిగి రూ.76.65 స్థాయిని తాకింది. చివరికి 24% పెరిగి రూ. 70.45 వద్ద క్లోజైంది. ఎన్ఎస్ఈలో ఇంట్రాడేలో 39% (రూ.78.70కి) ఎగిసిన షేరు ఆ తర్వాత సుమారు 24 శాతం లాభంతో రూ.70.30 వద్ద ముగిసింది. యస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 3,500 కోట్లు ఎగిసి రూ.17,967 కోట్లకు చేరింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement