-
ఫార్మాకు కొత్త పీఎల్ఐ పథకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగానికి కొత్త ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీకి అవసరమైన కీలక రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా కీలక రసాయనాల ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్ధేశం. ఫార్మాతో ముడిపడి ఉన్న అన్ని విభాగాలు ప్రస్తుత పీఎల్ఐ కింద కవర్ కాలేదు. దీని కారణంగా ఈ రసాయనాలు ఇప్పటికీ చైనా నుండి పెద్దమొత్తంలో భారత్కు దిగుమతి అవుతున్నాయి. అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే నూతన పీఎల్ఐ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే తదుపరి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదిత పథకం భాగం కావచ్చు. ప్రస్తుత పథకానికి సవరణ.. భారత్కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడిపదార్థాల్లో 55–56 శాతం వాటా చైనాదే. 2013–14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్లో చైనా వాటా విలువ పరంగా 64 శాతం, పరిమాణం పరంగా 62 శాతం వృద్ధి నమోదైంది. 2022–23 వచ్చేసరికి ఇది వరుసగా 71 శాతం, 75 శాతానికి ఎగబాకింది. చైనా నుంచి ముడిపదార్థాల (బల్క్ డ్రగ్) దిగుమతులు 2013–14లో 2.1 బిలియన్ డాలర్లు, 2018–19లో 2.6 బిలియన్ డాలర్లు, 2022–23 వచ్చేసరికి 3.4 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. చైనాలో ఈ రసాయనాల తయారీ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ఏపీఐల ఉత్పత్తికై భారతీయ తయారీ సంస్థలు చైనా నుంచే వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కాలుష్యకారకాలు. ఈ రసాయనాలను పీఎల్ఐ పరిధిలోకి చేర్చేందుకు ప్రస్తుత పథకాన్ని సవరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. జాప్యాలకు దారితీయవచ్చు.. ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎల్ఐ పథకం కింద పరిశ్రమకు కీలక స్టారి్టంగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ను స్థానికంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫార్మా సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పీఎల్ఐ పథకం కవర్ చేయడం లేదు. అయితే ఏపీఐల తయారీలో వాడే రసాయనాల ధరలను చైనా తగ్గించింది. పీఎల్ఐ పథకంలో భాగం కాని కంపెనీలు చైనా నుంచి ఈ రసాయనాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. కీలక ఔషధ ముడి పదార్ధాల కోసం ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం భారత ఫార్మా పరిశ్రమకు ప్రమాదం కలిగించే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం ఏమంటే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినట్టయితే మందుల కొరత, తయారీ జాప్యాలకు దారితీయవచ్చు. -
సరైన ‘నియంత్రణ’తోనే దివ్యౌషధం
భారత్లో తయారైన మందులు తీసుకోవడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో కొంతమంది మరణించినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దేశ ఫార్మా రంగంలో నాణ్యతా ప్రమాణాలపై సర్వే ప్రారంభించింది. విమర్శకులు చాలాకాలం నుంచి చేస్తున్న ఆరోపణలు కఠిన వాస్తవమని ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికీ స్పష్టంగా తెలిసింది. దీనివల్ల వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వ సంస్థల కళ్లు విచ్చుకున్నాయని చెప్పాలి. లేదా చాలాకాలంగా తెలిసిన విషయాలను వీరు అసలు పట్టించుకోలేదని అయినా అనుకోవాలి. సర్వే చెప్పిన అంశాల్లో ఒకటి – దేశంలో నాణ్యత ప్రమాణాలను పాటించడంపై అస్సలు శ్రద్ధ లేదు అన్నది. నిబద్ధత, తగిన శిక్షణ లేకపోవడం అన్నవి సరేసరి. నాణ్యతా ప్రమాణాల లోపాల ఫలితంగానే నాసిరకం ఔషధాలు భారత్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. మందులు చౌకగా లభిస్తాయన్న ఢంకా బజా యింపునకూ ఇవే కారణాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ఇంకా మొదలు కావాల్సి ఉన్నా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సర్వే జరపడమే కొంత ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు ఇప్పుడు ఒక్కతీరుగా ఆలోచించడం మొదలుపెట్టాయి. చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన చర్యలపై స్పష్టతా ఏర్పడింది. మితిమీరిన జోక్యం... దేశ ఫార్మా రంగాన్ని పట్టిపీడిస్తున్న అంశం ఏదైనా ఉందీ అంటే అది మితిమీరిన ప్రభుత్వ జోక్యమనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన పలు సంస్థలు ఫార్మా రంగంలో జోక్యం చేసుకుంటూంటాయి. ఈ క్రమంలో ఎవరికి వారు తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూంటారు. తద్వారా అసలు ప్రయోజనం దెబ్బతింటూ ఉంటుంది. స్థానికంగా తయారయ్యే మందులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లైసెన్సులు జారీ చేస్తూంటాయి. దీనివల్ల చాలా మందుల నాణ్యత అనేది రాష్ట్రాన్ని బట్టి మారిపోతూంటుంది. ఫార్మా రంగంపై నియంత్రణ సుస్పష్టంగా ఉన్నప్పుడే నాణ్యతను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. నాణ్యమైన మందులు లేకపోతే ఈ ఆధునిక యుగంలో మరింత ఎక్కువ కాలం జీవించడం అసాధ్యం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలోనూ ఫార్మా రంగం ప్రాముఖ్యత ఏమిటన్నది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. భారత్కు ప్రపంచ ఫార్మా రాజధాని అనే పేరుంది. జెనెరిక్ మందులతో అన్ని దేశాల్లోనూ అవస రార్థులకు మందులు (పేటెంట్ హక్కులు లేనివి) అందుబాటులో ఉండేందుకు కారణమైంది భారత్! ప్రాణాంతక హెచ్ఐవీ నియంత్రణలో ఈ జెనెరిక్ ఔషధాలది చారిత్రాత్మక పాత్ర. భారతీయ ఫార్మా కంపెనీల జెనెరిక్ ఉత్పత్తుల్లేకపోతే ఈ రోజు అమెరికా సహా పలు దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. చరిత్రను తరచి చూస్తే... భారతీయ ఫార్మా రంగం సాధించిన ఘన విజయాలకు ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. 1970లలో ప్రాసెస్ పేటెంట్లకు కట్టుబడుతూనే... ప్రాడక్ట్ పేటెంట్లకు భారత్ ‘నో’ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏర్పాటు వల్ల పశ్చిమ దేశాల్లో పేటెంట్ హక్కులున్న ఖరీదైన మందులను కూడా ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా చౌకగా తయారు చేసే వీలేర్పడింది. ఫలితంగానే భారత్ మోతాదుల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫార్మా పరిశ్రమగా అవతరించగలిగింది. విలువ ఆధారంగా చూస్తే మాత్రం మనది 14వ స్థానం. భారత ఫార్మా రంగం మార్కెట్ విలువ 5,000 కోట్ల డాలర్లు కాగా ఇందులో సగం ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ప్రపంచ టీకా డిమాండ్లో 60 శాతాన్ని భారత్ పూరిస్తోందంటే పరిస్థితి ఏమిటన్నది తెలుస్తుంది. అమెరికా జెనెరిక్ మందుల డిమాండ్లో 40 శాతం భారత్ ద్వారా తీరుతోంది. యూకే ఔషధా లన్నింటిలో 25 శాతం ఇక్కడి నుంచే వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్లో తయారయ్యే మందుల నాణ్యతపై ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కారాదు. ఈ రకమైన నమ్మకం ఉన్నందునే గాంబియాలో మన మందుల వాడకం వల్ల పిల్లలు కొందరు మరణించారన్న వార్త కలకలం రేపింది. ఆ వెంటనే ఉజ్బెకిస్తాన్,శ్రీలంక... చివరకు అమెరికా నుంచి కూడా ఇదే రకమైన ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత దిగజారేలా చేసింది. మనకు మాత్రం నష్టం లేదా? మందుల కంపెనీల్లో చాలా సందర్భాల్లో కల్తీలను గుర్తించేందుకు అవసరమైన పరికరాలు, తగిన అర్హతలున్న సిబ్బంది కొరత ఉంటుంది. డైఎథిలీన్ గ్లైకాల్ వంటివి అంధత్వానికి కారణమవుతాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎగుమతుల కోసం ఉద్దే శించిన అన్ని దగ్గుముందులను ప్రభుత్వ పరిశోధన శాలల్లో పరీక్షించాలని ఒక ఆదేశం జారీ చేసింది. కానీ ఇదేమంత సత్ఫలితాలు చూపలేదు. ఎందుకంటే ఫార్మా విషయాలను వాణిజ్య శాఖ పర్యవేక్షించే పరిధి లేకపోవడం. అంతేకాకుండా... వాణిజ్య శాఖ ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తింది. అదేమిటంటే, ఇలాంటి కల్తీ దగ్గు మందుల కారణంగా భారతీయ రోగులకు హాని జరగడం లేదా అని! జమ్మూలో అదే జరిగింది. 2019 డిసెంబరు 2020 జనవరి మధ్య కాలంలో కల్తీ దగ్గుమందు వేసుకోవడం వల్ల దాదాపు 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఇంకో చిత్రమైన ఘటన జరిగింది. 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ స్థానంలో డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మోటిక్స్ బిల్ 2023ను ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. ఇప్పు డున్న వివాదాస్పద అంశాలు వేటికీ ఇందులో చోటు లేకుండా పోయింది. ఫార్మా రంగం సంస్కరణలు లక్ష్యంగా తీసుకొచ్చే ఏ కొత్త చట్టమైనా లైసెన్సింగ్ ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఔషధ నియంత్రణ ఏకరీతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం 28 రాష్ట్రాల్లో డ్రగ్ రెగ్యులేటర్స్ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒకే ఒక్క డ్రగ్ రెగ్యులేటింగ్ వ్యవస్థ... ఈ వ్యవస్థకు సలహా సూచనలు అందించేందుకు రెండు స్టాట్యుటరీ వ్యవస్థలు ఉంటే సరిపోతుంది. డ్రగ్ కంట్రోలర్ కార్యాలయం కూడా స్వతంత్ర సంస్థగా ఉండాలి. దీనివల్ల మంత్రుల ఆమోదం లేకుండానే డ్రగ్ కంట్రోలర్ అవసర మైనప్పుడు నిపుణులను నియమించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే వ్యతిరేక పవనాలు... ఫార్మా రంగానికి సంబంధించి ఇప్పటికే కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఫార్మా దిగుమతుల విషయంలో అమెరికా కొన్ని కఠిన మైన చర్యలకు సిద్ధమవుతోంది. భారతీయ ఫార్మా కంపెనీలకు నాణ్యత విషయంలో ఇప్పటికే అగ్రరాజ్యం బోలెడన్ని సార్లు హెచ్చ రికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం కీలకం కానుంది. ఆఫ్రికా దేశాలు కొన్ని కూడా అమెరికా మాదిరిగానే ఆలోచిస్తూండటం గమనార్హం. ఇంకో ముఖ్య విషయం... ఫార్మా రంగ పరీక్షలకు సంబంధించి అందరికీ అందుబాటులో ఉండేలా ఒక ఐటీ వేదిక సృష్టి వెంటనే జరగాలి. గత సమాచారం, ప్రస్తుత పరిణామాలన్నింటికీ ఈ వేదిక ఒక రెఫరెన్ ్స పాయింట్లా ఉండాలి. పరిశ్రమ వర్గాలతోపాటు నియంత్రణ సంస్థలు, ఈ అంశంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈ వేదికను ఉపయోగించుకుని తమ సామర్థ్యాన్ని మెరుగుపరచు కోవచ్చు. ఆన్ లైన్ ప్రభుత్వ సేవల రంగంలో భారత్కు ఉన్న అను భవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత పెద్ద సంగతి కానేకాదు. ఫార్మా రంగ సంస్కరణల విషయంలో వాంఛనీయమైన పరిణామం ఏదైనా ఉందంటే అది ఇటీవలి కాలంలో సంబంధిత మంత్రి చేసిన ఒక ప్రకటన. ‘‘ఫార్మా రంగ నియంత్రణ అనేది సహ కార సమాఖ్య తీరులో సాగాలి’’ అన్న ఆయన మాటలు ఆచరణలోకి వస్తే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవడమే కాకుండా... ఒకరికి ఒకరు ఆసరాగా నిలవడం ద్వారా మరింత బలోపేతం కావచ్చు కూడా. పార్టీల మధ్య తీవ్రమైన వైరం నెలకొన్న... త్వరలోనే పార్లమెంటరీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్న నేపథ్యంలో ఈ మాత్రం మార్పు ఆహ్వానించదగ్గదే! సుబీర్ రాయ్ వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
200 బిలియన్ డాలర్లకు ఫార్మా రంగం - 2030 నాటికి..
న్యూఢిల్లీ: ప్రస్తుతం దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి విలువపరంగా 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. తయారీని, ఎగుమతులను పెంచుకోవడం ద్వారా 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి అరుణిష్ చావ్లా ఈ విషయాలు తెలిపారు. 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాలంటే ఫార్మా పరిశ్రమ ఏటా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాలని, దిగుమతులను తగ్గించుకుని.. ఎగుమతులపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఇందుకోసం మనం దిగుమతులపై ఆధారపడుతున్న నిర్దిష్ట రంగాలను ఎంపిక చేసుకోవాలి. వచ్చే పదేళ్లలో ఆయా విభాగాలన్నింటిలోనూ మనం ఎగుమతిదార్లుగా ఎదిగేలా విధానాలను రూపొందించుకోవాలి’ అని చావ్లా పేర్కొన్నారు. ‘కొత్తగా స్మార్ట్ ఔషధాల తరం వస్తోంది. వచ్చే 20–30 ఏళ్లలో ఎంతో సంక్లిష్టమైన అనారోగ్యాలకు కూడా స్మార్ట్గా చికిత్సను అందించగలిగే కొత్త థెరపీలు రాబోతున్నాయి. దాని కోసం మనం అంతా సంసిద్ధంగా ఉండాలి’ అని ఆయన చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలతో పాటు పరిశ్రమకు ప్రభుత్వం విధానపరంగా అన్ని రకాల తోడ్పాటు అందిస్తోందని చావ్లా వివరించారు. భారత్ ఇప్పటికే చాలా విభాగాల్లో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. కొత్త టెక్నాలజీలు వస్తుండటంతో పాటు పరిశోధనలకు సంబంధించి విద్యా సంస్థలు, ప్రయోగశాలలు, పరిశ్రమ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో కీలకమైన దాదాపు అన్ని మెడికల్ టెక్నాలజీ ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగే స్థాయికి ఎదగగలమని చావ్లా ధీమా వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజంగా ఎదిగేందుకు సాంకేతిక వనరులు, నిపుణులు, పురోగామి ప్రభుత్వ విధానాలు మొదలైన వాటన్నింటినీ సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఈ చట్టంతో సాధించేదేమిటి?
ఎంతోకాలంగా అటు ఔషధ పరిశ్రమలవారూ, ఇటు ప్రజారోగ్యరంగ కార్యకర్తలూ ఎదురు చూస్తున్న జనవిశ్వాస్ బిల్లు గత నెల 27న లోక్సభలో, ఈ నెల 2న రాజ్యసభలో ఆమోదం పొందింది. మణిపుర్పై అట్టుడుకుతున్న కారణంగా పార్లమెంటులో తీవ్రగందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో గట్టెక్కిన ముఖ్యమైన బిల్లుల్లో ఇది కూడా చేరిపోయింది. 19 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 42 చట్టాలకు ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. ఇప్పుడు అమల్లో ఉన్న 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఔషధ రంగ పరిశ్రమలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయితే ఆ చట్టంలోని లొసుగుల వల్ల నాసిరకం ఔషధ తయారీదారులపై కఠిన చర్యలు సాధ్యం కావటం లేదన్నది ప్రజారోగ్యరంగ కార్యకర్తల విమర్శ. తాజా సవరణ బిల్లు దాన్ని మెరుగుపరచకపోగా మరింత నీరుగార్చిందని వారి వాదన. ఈ బిల్లు మొత్తం 180 స్వల్ప నేరాలకు జైలు శిక్ష బదులు జరిమానాతో సరిపెట్టింది. చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూపి జైలుకు పంపుతున్న ధోరణి సరికాదనీ, ప్రతి చిన్న అంశంలోనూ అధికారులకు వివరణ ఇవ్వాల్సి రావటం, కేసుల్లో ఇరుక్కుంటే న్యాయస్థానాల చుట్టూ తిరగటం ఉత్పాదకతకు అవరోధమవుతున్నదనీ ఔషధరంగ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. వారి కోణంలో ఈ సవరణలు మంచివే కావొచ్చుగానీ, రోగుల కోణం నుంచి దీన్ని పరిశీలించారా అన్నది సందేహమే. ఫార్మారంగంలో మన దేశం అంతర్జాతీయంగా ముందంజలో ఉంది. కానీ కొన్ని ఫార్మా సంస్థలు నాసిరకం మందులు ఎగుమతి చేసి దేశం పరువుప్రతిష్ఠలను దెబ్బతీస్తున్న ఉదంతాలు తక్కువేం కాదు. మన దేశంనుంచి ఎగుమతైన దగ్గుమందు సేవించి ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో నిరుడు 70 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆమధ్య ఉజ్బెకిస్తాన్లో కూడా 19 మంది పిల్లలు చనిపోయారు. ఇక్కడి నుంచి అమెరికాకు ఎగుమతైన కంటికి సంబంధించిన మందు వికటించి నిరుడు మే నెల నుంచి ఈ ఏడాది జనవరి వరకూ 55 మందికి సమస్యలు తలెత్తాయి. అందులో ఒకరు మరణించారు కూడా. పాత చట్టం కఠినంగా ఉన్నదని ఫార్మారంగం మొత్తుకుంటున్న కాలంలోనే ఇలాంటి ఉదంతాలు జరిగితే దాన్ని నీరుగార్చటం సమస్యను మరింత పెంచదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం కల్తీ మందులు, నకిలీ మందులు, తప్పుదోవ పట్టించే పేర్లతో మందుల చలామణీ, నాణ్యతా ప్రమాణం కొరవడిన మందులు అని నాలుగు రకాలుగా వర్గీకరించింది. ఆ మందులు వాడినవారికి ఎదురయ్యే సమస్య తీవ్రతను బట్టి ఆ నేరాలకు శిక్షలున్నాయి. కల్తీ, నకిలీ మందులవల్ల రోగి మరణం సంభవించిన పక్షంలో అందుకు కారకులని గుర్తించినవారికి పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష వరకూ ఉన్నాయి. తప్పుడు అభిప్రాయం కలిగించే బ్రాండ్లతో మందులు చలామణి చేస్తే రెండేళ్ల వరకూ శిక్ష ఉంది. ప్రామాణిక నాణ్యత లేని మందుల (ఎన్ఎస్క్యూ) తయారీకి రెండేళ్ల వరకూ శిక్ష, రూ. 20,000 వరకూ జరిమానా విధించవచ్చు. వీటన్నిటికీ తాజా బిల్లు అయిదు లక్షల వరకూ జరిమానాలతో సరిపెట్టింది. జైలు శిక్షలు తొలగించింది. ఇతర నేరాల మాటెలావున్నా ఎన్ఎస్క్యూ కేటగిరీ కిందకొచ్చే కేసులకు జైలు శిక్ష బెడద లేకుండా చేయటాన్నే ప్రధానంగా ప్రజారోగ్య రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆఖరి కేటగిరీ 27(డి) కిందే దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతుంటాయి. ఔషధంలో వినియోగించిన పదార్థాలు అనుమతించిన మోతాదులో కాకుండా వేరేవిధంగా ఉంటే ఆ ఔషధం రోగికి నిరుప యోగమవుతుంది. కానీ కొన్నిసార్లు జబ్బు ముదిరి మరణానికి దారితీసే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల వాదన. అలాంటి కేటగిరీని సైతం చిన్న తప్పిదంగా పరిగణించి జరిమానాలతో సరిపెడితే ఔషధ నాణ్యత దెబ్బతినదా... ప్రజారోగ్యం ప్రమాదంలో పడదా అని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి నిరుడు ఈ బిల్లు ముసాయిదాను ప్రకటించి అన్ని వర్గాల నుంచీ అభిప్రాయాలు కోరినప్పుడు ప్రజారోగ్య నిపుణులు ప్రధానంగా దీనిపైనే అభ్యంతరం తెలిపారు. అసలు ఫార్మా కంపెనీలు నిబంధన ప్రకారం రిజిస్టరయిన ఫార్మాసిస్టులను నియమించు కోవాల్సి వుండగా చాలా సంస్థలు దాన్ని ఉల్లంఘిస్తున్నాయి. అకారణంగా వేధించటాన్ని ఎవరూ సమర్థించరు. కానీ రోగుల ప్రాణాలతో ఆడుకునే విధంగా, కేవలం లాభార్జనే ధ్యేయంగా ఉండే సంస్థల విషయంలో కఠినంగా ఉండొద్దా? అసలే తరచు బయటి కొచ్చే ఉదంతాల వల్ల విదేశాల్లో మన ఫార్మా ఉత్పత్తులపై చిన్నచూపు పడుతోంది. మన చట్టాలు చాలా ఉదారంగా ఉండటంవల్లే, తగిన తనిఖీలు లేనందువల్లే ఇదంతా జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ఆ అభిప్రాయాన్ని పోగొట్టే విధంగా లేకపోగా మరింత సరళంగా మార్చిందని ప్రజారోగ్య కార్యకర్తల ఆరోపణ. కేవలం కఠిన శిక్షలు, తనిఖీలు మాత్రమే సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు. కానీ కల్తీ, నకిలీ మందుల కారణంగా రోగి ప్రాణం కోల్పోయినా, తీవ్రమైన వైకల్యం సంభవించినా ఆ రోగి కుటుంబానికి భారీయెత్తున పరి హారం చెల్లించే నిబంధన ఉంటే ఔషధ తయారీ సంస్థ దారికి రాదా? దీనికి బదులు రూ. 5 లక్షల జరిమానాతో సాధించేదేమిటి? ఈమాత్రం జరిమానా చెల్లించలేని స్థితిలో ఏ సంస్థయినా ఉంటుందా? పటిష్టమైన పర్యవేక్షణ, పారదర్శకత, నేరం చేస్తే కఠిన శిక్ష, భారీ పరిహారం చెల్లింపు తప్పదన్న భయం ఉంటేనే పరిస్థితి చక్కబడుతుంది. ఇవేమీ లేకుండా చట్టం తెచ్చి ప్రయోజన మేమిటి? -
పల్లెపల్లెకూ ఫార్మసీ స్టోర్!
న్యూఢిల్లీ: మారిన జీవనశైలి, ఆహార నియమాలతో పట్టణం, పల్లె అని వ్యత్యాసం లేకుండా ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. దీనికితోడు వైద్య వసతులు పెరగడంతో పల్లెల్లోనూ ఔషధ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీంతో ఫార్మసీ స్టోర్లు జోరుగా తెరుచుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఏర్పడిన అవగాహన సైతం ఔషధ వినియోగాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం, ఏటా మార్కెట్లోకి పెద్ద సంఖ్యలో ఫార్మాసిస్టులు రావడం కూడా ఔషధ దుకాణాల సంఖ్య విస్తరణకు మద్దతుగా ఉంటున్నాయి. ఏటా 4,50,000 మంది ఫార్మసీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంటే, ఇందులో 40,000–45,000 వరకు సొంతంగా దుకాణాలను తెరుస్తున్నట్టు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ తెలిపారు. దేశంలో 12 లక్షల మంది ఫార్మాసిస్టులకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘‘ఫార్మాసిస్టులు పల్లె బాట పడుతున్నారు. కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు కనీసం 1,000–2,000 మంది జనాభా ఉన్న ప్రతి ఊరులోనూ ఫార్మసీ స్టోర్ ఉంది’’అని సింఘాల్ వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు తమ ఆరోగ్య సమస్యల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారని, క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం పల్లెలు, చిన్న పట్టణాల్లో ఔషధ విక్రయాలు పెరగానికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కీలకంగా పనిచేస్తోంది. ఈ పథకం కింద 26,055 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 4.3 కోట్ల మంది చేరి వైద్యం పొందినట్టు 2022–23 ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1,54,070 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రిస్కిప్షన్ను జారీ చేస్తే ఔషధాలను ప్రభుత్వ చానళ్ల ద్వారా లేదంటే ప్రైవేటు ఫార్మసీ స్టోర్లలో కొనుగోలు చేసుకుంటున్నట్టు సింఘాల్ తెలిపారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోనూ ఔషధాలకు డిమాండ్ ఏర్పడినట్టు చెప్పారు. భారత ఫార్మా మార్కెట్లో టైర్–2 నుంచి టైర్–6 వరకు పట్టణాల వాటా 21 శాతంగా ఉంటుందని అంచనా. ఔషధాలకు డిమాండ్ ఏర్పడడంతో ఫార్మసీ కంపెనీలు సైతం మార్కెటింగ్ సిబ్బందిని చిన్న పట్టణాల్లోనూ మోహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బందిని పెంచుకుంటున్నాయి. తమకున్న విస్తృత నెట్వర్క్తో దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటు ధరలకే నాణ్యమైన ఔషధాలను అందిస్తున్నట్టు సన్ఫార్మా ప్రతినిధి తెలిపారు. ‘‘నేను దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజలు, మా కంపెనీ స్టాకిస్టులు, అమ్మకాల సిబ్బందితో మాట్లాడాను. రహదారులు, ఆస్పత్రులు, విద్యుత్ తదితర సదుపాయాల విస్తరణతో ప్రజలు తమ స్వస్థలాల్లోనే ఉండాలనుకుంటున్నారు. మెట్రో పట్టణాలకు రావాలని అనుకోవడం లేదు. కరోనా తర్వాత సొంత గ్రామాల్లోనే ఉండాలన్నది వారి అభీష్టంగా ఉంది’’అని మ్యాన్ కైండ్ ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ రాజీవ్ జునేజా వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం సైతం అమ్మకాలు పెరగడానికి తోడ్పడుతున్నట్టు తెలిపారు. చిన్న పట్టణాల్లోనూ వైద్యుల అందుబాటు పెరిగినట్టు ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి కృష్ణకుమార్ పేర్కొన్నారు. ‘‘మాకు 140 పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఉన్నాయి. ఒక్కోటీ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఈ పాయింట్లను 300కు పెంచుతున్నాం. దేశంలో 85 శాతం ప్రాంతాలను చురుకోగలం’’అని వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement