-
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
ముడి చమురు ధరలు రెండేళ్లుగా నిలకడగా ఉన్నా అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు మాత్రం 4 రెట్లు పెరిగాయి!పశ్చిమాసియాలో అడపాదడపా ఉద్రిక్తతలు పెరిగి, వెంటనే చల్లబడుతున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఇప్పటికీ గట్టిగానే నడిపిస్తున్న ముడి చమురు ధరలు ఈ కారణంగా గత రెండేళ్లుగా పెద్ద మార్పులకు గురికాకుండా నిలకడగా ఉన్నాయి. ఫలితంగా దేశంలో శిలాజ ఇంధన మార్కెట్లో మూడొంతులకు పైగా వాటా కలిగి ఉన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎమ్సీలు) లాభాలు మాత్రం 2023–2024 ఆర్థిక సంవత్సరంలో నాలుగు రెట్లు పెరిగాయని వార్తలొస్తున్నాయి.ఓఎమ్సీలకు లాభాలొస్తే వాటిలో అత్యధిక వాటాలున్న కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో కోట్లాది రూపాయలు అందుతాయనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఇతర సరకులు, సేవల ధరలు పెరుగుతున్న ఇలాంటి సమయంలోనైనా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలనే ఆలోచన ఈ ప్రభుత్వరంగ కంపెనీలకు రావడం లేదు. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్లో ధరలు బాగా పైకి ఎగబాగినప్పుడు ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను వెంటనే పెంచేసే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ఓఎమ్సీలు దేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు అవకాశం వచ్చినప్పుడైనా మేలు చేసే నిర్ణయాలు తీసుకోవచ్చు.ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరలను శాసించే పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన ఒపెక్ దేశాలు జూన్ 1న సమావేశమై ఈ విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయని తెలుస్తోంది. దేశం లోపల అత్యధిక మొత్తాల్లో చమురు నిక్షేపాలు ఉన్నా కొన్ని దశాబ్దాలుగా వాటిని వెలికితీయకుండా పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలపై అమెరికా ఆధారపడేది. అయితే, ఇటీవల ముడి చమురును భారీ స్థాయిలో వెలికితీసి వాడుకుంటోంది అమెరికా. దానికి తోడు కొవిడ్–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఏకైక అగ్రరాజ్యం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం, నిరుద్యోగం మామూలు స్థాయికి ఇంకా పడిపోకపోవడంతో ముడి చమురుకు డిమాండ్ రెండేళ్ల క్రితంలా లేదు.దీనికి తోడు మరో ప్రపంచ ఆర్థికశక్తి చైనా వేగం తగ్గడం కూడా శిలాజ ఇంథనాల వాడకం తగ్గిపోవడానికి మరో పెద్ద కారణం. దాదాపు 45 నెలలుగా క్రూడాయిల్ టోకు ధరలు నిలకడగా ఉన్నా భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు ఆ నిష్పత్తిలో ప్రయోజనం అందించకపోవడం సబబు కాదనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వెల్లడవుతోంది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఎన్నికలపర్వం ముగిస్తే భారం తప్పదా.?
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ చమురు ధర 90 యూఎస్ డాలర్లకు చేరింది. కానీ భారత్లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఎన్నికలవేళ వీటిలో మార్పులు చేస్తే ఓటర్లలో కొంత వ్యతిరేకత వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నా వాటిని ప్రజలకు పాస్ఆన్ చేయడంలో కేంద్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. దేశ ఇంధన అవసరాలు దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్పై భారీగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలను పెంచేలో దోహదం చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య వ్యవహారం మరింత ముదిరితే పరిస్థితులు చేదాటిపోయి దేశీయంగా ఇంధన ధరలు పెరగడం ఖాయమని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ నెల మొదటివారంలో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కూడా ధ్రువీకరించింది. దీంతో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ 300లకుపైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2023 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఈ దేశాల మధ్య వివాధం మరింత ముదిరితే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇరాన్పై ప్రతీకార దాడుల్లో తాము పాల్గొనబోమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్న నేపథ్యంలో ఒమన్, ఇరాన్ల మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి కీలకంగా మారనుంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుందని అంచనా. ఇప్పటికే ఇజ్రాయెల్తో సంబంధాలున్న ఓ వాణిజ్య నౌకను ఈ జలసంధిలో ఇరాన్ అడ్డుకుంది. ఇది ఇంతటితో ఆగకపోతే కష్టమే. ఒపెక్ సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి ఈ జలసంధి ద్వారానే పెద్ద ఎత్తున చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ జలసంధిగుండా ప్రయాణించే చమురు నౌకలను నిలిపేస్తే భారత్కు కష్టాలు తప్పవు. ఇదీ చదవండి: 5,500 మందితో హైదరాబాద్లో భారీ ఎక్స్పో.. ఎప్పుడంటే.. ఎన్నికల వేళ ఆచితూచి.. యుద్ధ భయాలు ఇలాగే కొనసాగితే భారత్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగడం ఖాయమని తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్లతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత వీటి ధరలు పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! హింట్ ఇచ్చిన కేంద్ర మంత్రి
Petrol and Diesel price : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఊహాగానాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. దేశంలో 2022 మే 22 నుంచి స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. నాలుగో త్రైమాసికంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి వస్తే దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచనప్రాయంగా తెలిపారు. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా (యూఎన్జీసీఎన్ఐ) 18వ జాతీయ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిమాట్లాడుతూ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు గత నష్టాల నుంచి కోలుకున్నాయని, రాబోయే త్రైమాసికంలో లాభాలను చూడవచ్చని పేర్కొన్నారు. "మీరు వారిని (చమురు కంపెనీలను) అడిగితే, వారు తమ లాభం తగ్గిందని చెబుతారు.. కానీ వారు కోలుకున్నారు. నాలుతో త్రైమాసికం బాగుంటే ధరలను తగ్గించవచ్చని ఆశిస్తున్నాను” అని పూరి అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు గత మూడు త్రైమాసికాల్లో నిలకడగా లాభాలను నమోదు చేశాయి. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే ఈ కంపెనీలు ఏకంగా రూ.11,773.83 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. గత మూడు త్రైమాసికాల్లో వారి ఉమ్మడి లాభాలు రూ.69,000 కోట్లను అధిగమించాయి. -
‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. దాంతో చమురు ధరపై పరిమితిని విధించాయి. మరోవైపు రష్యా ముడి చమురును తక్కువ ధరకే విక్రయించడానికి సిద్ధమైంది. డిస్కౌంట్ ధరలో చమురు దొరుకుతుండడంతో భారత్ రష్యా నుంచి తన దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేయకపోయి ఉంటే భారత్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఓ నివేదికలో పేర్కొంది. ‘ఇండియన్ రిఫైనర్లు రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేయకపోయి ఉంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడేది. రోజుకి 19 లక్షల బ్యారెల్స్ అవసరం అవుతున్నాయి. రష్యా కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే ఆయిల్ రేటు బ్యారెల్కు అదనంగా 30–40 డాలర్ల మేరకు భారం పడేది’ అని వెల్లడించింది. అంతర్జాతీయంగా రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అవసరం అవుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇదీ చదవండి: 2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఒకవేళ ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్) రోజుకి ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తే, ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దాంతో ఆయిల్ ధర బ్యారెల్కు 125–130 డాలర్లకు చేరుకుంటుంది. ఇండియాలో రోజుకి అవసరమయ్యే 19.5 లక్షల బ్యారెల్స్ను సిద్ధం చేయకపోతే అదనంగా మరింత ధర పెరిగే ప్రమాదం ఉందని పెట్రోలియం మినిస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ వాడకంలో ఇండియా మూడో స్థానంలో ఉందని, అందులో 85 శాతం క్రూడ్ అవసరాలను దిగుమతుల తీర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలోని రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెల్స్గా ఉందని తెలిపారు. -
రష్యా తిరస్కరణ.. పెట్రోల్, డీజిల్ ధరలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి!
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారీ నగదు కొరతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ రష్యాపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే రాయితీపై ముడి చమురు సరఫరా చేసిన రష్యాను మరింత తగ్గించాలని కోరగా రష్యా తిరస్కరించింది. పాకిస్తాన్కు చెందిన ‘ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదిక ప్రకారం.. రష్యాను దీర్ఘకాల చమురు ఒప్పందాన్ని ఖరారు చేయాలని కోరింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన తమకు బ్యారెల్ ముడి చమురు గరిష్టంగా 60 డాలర్లకే విక్రయించాలని అభ్యర్థించింది. ఇది భారత్ విక్రయించిన దానికంటే దాదాపు 6.8 డాలర్లు తక్కువ. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత జులైలో రష్యా చమురు సగటు ధర బ్యారెల్కు 68.09 డాలర్లు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు చమురు ధరలపై మరిన్ని తగ్గింపులను పొందాలని పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ‘ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదించింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు, ఓడరేవులో వసూలు చేసే వాస్తవ ధర అయిన 'ఫ్రీ ఆన్ బోర్డ్' (FOB) ఒక బ్యారెల్కు 60 డాలర్లు బెంచ్మార్క్గా నిర్ణయించాలని పాకిస్తాన్ కోరింది. అంటే పాకిస్థాన్కు ఎగుమతి చేసే చమురు సరుకు రవాణా ఖర్చును కూడా భరించాలని అభ్యర్థించింది. భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పాకిస్తాన్లో ఆగస్ట్లో ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను రెండుసార్లు పెంచడం గమనార్హం. సెప్టెంబర్ ప్రారంభంలో, అన్వర్ ఉల్ హక్ కకర్ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు (పాకిస్తానీ రూపాయల్లో) రూ.14.91, రూ.18.44 చొప్పున పెంచింది. ప్రస్తుతం (అక్టోబర్ 19) ఆ దేశంలో సూపర్ పెట్రోల్ ధర లీటరు రూ. 283.38, హైస్పీడ్ డీజిల్ ధర లీటరు రూ. 304.05 ఉంది. గతంలో రాయితీ ఈ ఏడాది జూన్లో అప్పటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. రాయితీపై రష్యా ముడి చమురు మొదటి రవాణా కరాచీకి చేరుకుంది. మీడియా నివేదిక ప్రకారం.. మాస్కో ఒక నెలలో 1,00,000 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ఒక కార్గోను రవాణా చేసింది. ఆ చమురు కోసం సరుకు రవాణా ఖర్చు కూడా రష్యా చెల్లించింది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ విక్రయాలు - కారణం ఏంటంటే?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1–15తో పోలిస్తే ఈ నెల తొలి అర్ధ భాగంలో పెట్రోల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్ టన్నులుగా ఉంది. డీజిల్ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్ టన్నులకు వచ్చి చేరింది. 2022 అక్టోబర్లో దుర్గా పూజ/దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికంగా ఉంది. 2023 సెప్టెంబర్ 1–15తో పోలిస్తే ఈ నెల 1–15 మధ్య పెట్రోల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు మాత్రం 9.6 శాతం ఎగశాయి. 2022 అక్టోబర్తో పోలిస్తే ఈ నెల అర్ధ భాగంలో విమాన ఇంధన డిమాండ్ 5.7 శాతం దూసుకెళ్లి 2,95,200 టన్నులు నమోదైంది. నెలవారీగా పెరుగుతూ.. నీటి పారుదల, సాగు, రవాణా కోసం ఇంధనాన్ని ఉపయోగించే వ్యవసాయ రంగంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డీజిల్ అమ్మకాలు సాధారణంగా రుతుపవన నెలలలో క్షీణిస్తాయి. అలాగే వర్షం కురిస్తే వాహనాల రాకపోకలు మందగిస్తాయి. దీంతో గత మూడు నెలల్లో డీజిల్ వినియోగం తగ్గింది. రుతుపవనాలు ముగిసిన తర్వాత వినియోగం నెలవారీగా పెరిగింది. 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్ వినియోగం 2021 అక్టోబర్తో పోలిస్తే 12 శాతం, 2019 అక్టోబర్తో పోలిస్తే 21.7 శాతం పెరిగింది. అలాగే డీజిల్ వాడకం 2021 అక్టోబర్తో పోలిస్తే 23.4 శాతం, 2019 అక్టోబర్తో పోలిస్తే 23.1 శాతం అధికమైంది. విమాన ఇంధన వినియోగం 2021 అక్టోబర్తో పోలిస్తే 36.5 శాతం అధికంగా, 2019 అక్టోబర్తో పోలిస్తే 6.6 శాతం తక్కువ నమోదైంది. వంటకు ఉపయోగించే ఎల్పీజీ విక్రయాలు 1.2 శాతం పెరిగి 1.25 మిలియన్ టన్నులుగా ఉంది. -
ఇజ్రాయెల్-పాలస్తీనా వార్: పెట్రోలు, నిత్యావసరాల ధరల వాత తప్పదా?
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం దేశీయంగా ప్రజలపై పెనుభారం పడనుందా? పెట్రోలు సహా, పలు వినియోగ వస్తువులు, ఇతర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయా అంటే అవుననే అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం ప్రపంచ ముడి చమురు సరఫరాను ప్రభావితం చేయనుంది. దీంతో పాటు వివిధ వినియోగ ఉత్పత్తులు ఇతర మరెన్నో ప్రపంచ సరఫరాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రభావ తీవ్రతను కచ్చితంగా అంచనా లేనప్పటికీ ధరల పెరుగుదల తప్పదనేది నిపుణుల మాట. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ గోధుమ సరఫరాపై ప్రభావం చూపినట్లే, ఇజ్రాయెల్-హమాస్ వార్ ప్రపంచ ముడి చమురు సరఫరాకు ముప్పు తెస్తుందని, తద్వారా దేశంలో హైదరాబాద్ లాంటి ఇతర ప్రధాన నగరాల్లోని ప్రజల గృహవినియోగం భారం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర ఇప్పటికే 7.5 శాతానికి పైగా పెరిగింది.ఇప్పటికే బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. ఎన్సిఆర్కు చెందిన వైట్ గూడ్స్ తయారీదారు సూపర్ప్లాట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా ప్రకారం, యుద్ధం మరో పక్షం రోజులు కొనసాగితే, నవంబర్లో స్మార్ట్ టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెంపు తయారీదారులను రెండు రంగాల్లో ప్రభావితం చేస్తుంది. ఎలక్ట్రానిక్, గృహోపకరణాలలో కీలకమైన పదార్థం ప్లాస్టిక్ ధరలు, లాజిస్టిక్స్, సరఫరా ఖర్చులు పెరుగుతాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం ఉత్పత్తి , డెలివరీ ఖర్చులో ఈ రెండింటి వాటా దాదాపు 33 శాతం. ఇంకా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) వస్తువులు వంటివి ప్రభావితం కావచ్చు. దేశంలోని ఎఫ్ఎంసీజీ తయారీదారులు ఇప్పటికే పేలవమైన అమ్మకాలు, గ్రామీణ కుటుంబాల నుండి తగ్గిన డిమాండ్తో సతమత మవుతున్నారు. Nuvama ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకుల ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్ వృద్ధి తక్కువగానే ఉంటుంది, ఆగస్టు నెలలో వర్షపాతం లోటు వందేళ్ల గరిష్టానికి చేరడంతో ప్రముఖ FMCG కంపెనీల వృద్ది సింగిల్ డిజిట్కే పరిమితం కానుంది.బీఎన్పీ పారిబాస్ డైరెక్టర్-హెడ్ ఆఫ్ ఇండియా ఈక్విటీ రీసెర్చ్, కునాల్ వోరా ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో ఆయా కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. అంతర్జాతీయ ఆదాయంలో మధ్య-ప్రాచ్య ప్రాంతం వాటా ఉన్న డాబర్ , మారికో లాంటి భారతీయ కంపెనీలకు నష్టమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి అక్టోబర్ 6 నాటికి ముడి చమురు ధర బ్యారెల్కు 84.58 డాలర్లు ఉండగా, ఈరోజు (అక్టోబర్ 16) 90.98 డాలర్లకు పెరిగింది. ఈ యుద్ధం మరింత తీవ్రతరమైతే ముడి చమురు ధరలు పైకి ఎగియ వచ్చు. దీంతో భారతదేశంతో సహా చమురు-దిగుమతి చేసుకునే దేశాలకు చమురు ధరలను పెంచడం తప్ప వేరే మార్గం ఉండదనే అంచనాలున్నాయి. అంతేకాదు ఈ యుద్ధంతో దేశీయ టీ ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. దేశంనుంచి తేయాకును ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో ఒకటైన ఇరాన్పై ప్రభావం చూపితే అది తమ పరిశ్రమను కూడా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన ఆందోళన. గాజాలో ఇజ్రాయెల్ తన చర్యలను ఆపకపోతే తాము చూస్తూ ఉరుకోబోమన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ వ్యాఖ్యలు ఈ వాదనలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ వార్లో ఇరాన్- లెబనాన్ చేరిపోతే మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితి మరింత ముదురుతుందనే ఆందోళన నెలకొంది. -
పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు
Petrol Diesel Prices దేశ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభం లోకి కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో అక్కడ ఇంధన ధరలు రూ. 300 మార్కును దాటాయి. దీంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశ ప్రజలు మరింత సంక్షోభంలోకి కూరుకు పోనున్నారని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంధన ధరలను పెంచేసింది. పెట్రోల్ ధరను 14.91, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరను 18.44 పెంచినట్లు గురువారం సాయంత్రం ప్రకటించింది. దీంతో అక్కడ ప్రస్తుతం పెట్రోల్ ధర305.36 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరుకుంది. ఇటీవలి ఆర్థిక సంస్కరణలతో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఆల్ టైం హైకి చేరింది. ఫలితంగా పాకిస్థానీ రూపాయి కూడా దిగ జారి పోతుండటంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను కూడా భారీగా పెంచేసింది. డాలరు మారకంలో పాక్ కరెన్సీ 305.6 వద్దకు చేరింది. -
కేంద్రం మరో సంచలనం: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
దేశ ప్రజలకు రక్షాబంధన్ గిప్ట్ అందించిన కేంద సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా అంటే.. అవుననే అంటున్నాయి తాజా రిపోర్టులు. 2024 ఎన్నికలకు ముందు కేంద్రం మోటార్ ఇంధన ధరలపై దృష్టి పెట్టే అవకాముందని సిటీ గ్రూప్ నివేదించింది. ఎల్పీజీ సిలిండర్ల రేటును తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గనుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలకమైన పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే దేశ ప్రజలకు ఊరట కల్పించనుందని అంచనా వేస్తున్నారు. వంట గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం ద్రవ్యోల్బణాని చెక్ పెట్టడమేకాకుండా, కొన్ని ప్రధాన పండుగలు, కీలక ఎన్నికలకు ముందు గ్యాసోలిన్, డీజిల్ ధరల తగ్గింపు వైపు దృష్టి సారించనుందని సిటీ గ్రూప్ తన కథనంలో పేర్కొంది. ఎల్పీజీ తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని ఆర్థికవేత్తలు సమీరన్ చక్రవర్తి, ఎం. జైదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు టొమాటో ధరల తగ్గుదల, తాజా చర్యతో సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం 6శాతం దిగువకు చేరే అవకాశం ఉందన్నారు. జులైలో 15 నెలల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ధరలను చల్లబరచడానికి అధికారులు చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎల్పీజీ సిలిండర్ల ధరలను 14.2 కిలోగ్రాముల గ్యాస్ను 200 రూపాయలు తగ్గింపుతో దాదాపు 300 మిలియన్ల వినియోగ దారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఆహార ధరలను తగ్గించడానికి గృహ బడ్జెట్లను అదుపులో ఉంచడానికి భారతదేశం ఇప్పటికే బియ్యం, గోధుమలు , ఉల్లిపాయలు వంటి ప్రధాన వస్తువుల ఎగుమతులను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడితోపాటు, కే- ఆకారపు రికవరీ నేపథ్యంలో, గ్యాస్ ధర తగ్గింపు వినియోగదారుల సెంటిమెంట్కు సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్లో డిమాండ్-సరఫరా కొరత కారణంగా ఉల్లి ధర పెరుగుతుందన్న అంచనాలను గమనించాలన్నారు.అలాగే గ్లోబల్ క్రూడ్ ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ, గత ఏడాదినుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదనీ, ఈ నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీ కోతద్వారా ఇంధన ధరలను తగ్గించవచ్చని, ఎన్నికల ముందు ఈ అంశాన్ని తోసి పుచ్చలేమని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ, మిజోరం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్గఢ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది చివరల్లో జరగ నున్నాయి. ఆ తర్వాత 2024 ప్రారంభంలో జాతీయ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించు కోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
Petro Prices : త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు ?
మరోసారి భారత్లో పెట్రోల్, డీజిల్ ధలరకు రెక్కలు రానున్నాయా ? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా సరే ....ఇండియాలో క్రూడాయిల్ ధరలు ఎందుకు పెరుగబోతున్నాయి ? మొన్నటి వరకు భారత్కు చమురు దిగుమతుల్లో డిస్కౌంట్స్ ఇచ్చిన ఆ దేశం ఒక్కసారిగా ధరలు పెంచడమే ఇందుకు కారణమా ? ముడిచమురు కోసం ఒకటి రెండు దేశాలపై ఆధారపడటమే భారత్కు శాపంగా మారిందా ? డిస్కౌంట్ ఫట్.. రేట్లు అప్ మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలుకు రెక్కలు రాబోతున్నాయన్న అంచనాలు వస్తున్నాయి. ఇప్పటి దాకా ఒపెక్ దేశాల మీద ఆధారపడి చమురును దిగుమతి చేసుకున్న భారత్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని చేసుకోవడం ప్రారంభించింది. అది కూడా ఇతర చమురు దేశాల నుంచి దిగుమతి చేసుకునే రేటు కంటే దాదాపుగా బ్యారెల్ 30 డాలర్లకే భారత్కు ముడిచమురు దొరికేది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ పై డిస్కౌంట్ను డిస్కనెక్ట్ చేసింది రష్యా దీంతో ఈ భారం ఇండియాపై పడనుంది. The rest of Europe needs cheap and plentiful amount of food, to feed their welfare parasites. No Russian sanctions on their grain trade. I think Russia's goal with Ukraine has larger implications for eastern trade alliances developing in the energy markets without the petro$$$$$$ pic.twitter.com/tBTNS5McTq — Snuff Trader (@SnuffTrader) July 6, 2023 మన వాటా ఎంత? ఎంతకు కొంటున్నాం? ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్పై ఇస్తున్న డిస్కౌంట్ను రష్యా బ్యారెల్పై 4 డాలర్ల వరకు మాత్రమే పరిమితం చేసింది. అదీకాక రవాణా ఛార్జీలను కూడా ఇంతకు ముందున్న దానికంటే రెట్టింపు వసూలు చేస్తోంది. ఇంతకు ముందు మన చమురు అవసరాల్లో కేవలం 2శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం కానీ యుద్ధం తరువాత తక్కువ ధరకే చమురు లభించడంతో ఇపుడు మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 44శాతానికి పెరిగింది. పశ్చిమ దేశాల ఆంక్షలెందుకు? 2022లో పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్పై బ్యారెల్కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్ను విధించాయి. అయినప్పటికీ అదే ఆయిల్ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేయడమే ఇపుడు చమురు ధరలు భారీగా పెరిగేందుకు కారణంగా కనపబడుతోంది. క్రూడాయిల్ను బాల్టిక్, బ్లాక్ సముద్రాల నుంచి మన దేశంలోని వెస్ట్రన్ కోస్ట్కు డెలివరీ చేయడానికి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. Ruble surrendered long before the rest of Russia, has lost 40% of its worth since the 2022 invasion. This would be difficult for any country, far more shocking for a petro-state. Russia is Venezuela w/ bigger army. pic.twitter.com/Uf7F8yumMs — steve from virginia (@econundertow) July 6, 2023 అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు రష్యా ఉక్రేయిన్ పై దాడి చేస్తున్న సమయంలో బ్రెంట్ క్రూడాయిల్ధర 80-100 డాలర్ల దగ్గర ఉంది. అయినప్పటికీ మనకు రష్యా అతి తక్కువ ధరకే ముడిచమురును అందించడంతో ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి భారీగా ఆయిల్ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, హెచ్పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ వంటి ప్రభుత్వ కంపెనీలు, రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ కంపెనీలతో సపరేట్గా డీల్స్ కుదుర్చుకుంటుండడంతో రష్యన్ క్రూడ్పై ఇస్తున్న డిస్కౌంట్ భారీగా తగ్గిందని కొంత మంది చమురు రంగ నిపుణులు చెబుతున్నారు. మనకెంత ధర? రష్యాకు ఎంత ఖర్చు? ప్రస్తుతం బ్యారల్ బ్రెంట్ ముడిచమురు ధర 77 డాలర్ల దగ్గర ఉంది ఈ లెక్కన రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు ధర రవాణా ఛార్జీలతో కలిపితే ఇంచు మించు అంతే మొత్తంలో ఖర్చు అవుతుండటంతో ఇపుడు భారత్ మరోసారి ప్రత్యామ్నయ మార్గాలను అన్వేశిస్తోంది. అదీకాక మరోసారి రష్యా కంపెనీలతో బేరమాడేందుకు ఇండియాకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే చైనా ఐరోపాల నుంచి రష్యా చమురుకు ప్రస్తుతం డిమాండ్ తగ్గింది సో.. ఇది భారత ప్రభుత్వానికి కలిసివచ్చే అవకాశం. సామాన్యుడి పరిస్థితేంటీ? మన ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రష్యా నుంచి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ళ ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. సో మనం కనుక మరోసారి రష్యాతో బేరమాడితే మనకూ తక్కువ ధరలో చమురు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ మన ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఉన్న నష్టాలతో రిటైల్ మార్కెట్లో కామన్ మ్యాన్కు మాత్రం ఆ ప్రయోజనాలు అందడం లేదనేది నిజం. అంతర్జాతీయంగా ఎలా ముడిచమురు ధరలు ఉన్నా సామాన్యుడికి మాత్రం ప్రయోజనం శూన్యం అనేది నిపుణులు చెపుతున్నమాట. రాజ్ కుమార్, బిజినెస్ కరస్పాండెంట్ -
వాహనదారులకు భారీ షాక్! పెట్రో ఎగుమతులపై ట్యాక్స్ పెంపు!
వాహనదారులకు కేంద్రం షాకిచ్చింది. పెట్రో ఎగుమతులపై విధించే ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతులపై రూ.13 పెంచుతున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే చమురుపై టన్నుకు రూ.23,230 అదనంగా ట్యాక్స్ విధించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతుంది.దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్రం బంగారంతో పాటు పెట్రోల్,డీజిల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ఎగుమతులపై ట్యాక్స్ను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా కేంద్ర నిర్ణయం వాహనదారులకు మరింత భారంగా మారనున్నాయి. ట్యాక్స్ పెంపుతో పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎఫెక్ట్ ఉండదు ఇటీవల కాలంలో ముడిచమురు ధరలు బాగా పెరిగాయి. దేశీయ ముడి ఉత్పత్తిదారులు ముడి చమురును దేశీయ రిఫైనరీలకు అంతర్జాతీయ సమాన ధరలకు అమ్ముతున్నారు. ఫలితంగా దేశీయంగా ముడిచమురు ఉత్పత్తిదారులు లాభాలు ఆర్జిస్తున్నారు' అని ప్రభుత్వం తెలిపింది. "ఈ సెస్ దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు."అంటూ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. -
అటు పెట్రో సంక్షోభం: ఇటు రహమాన్ పాటకు డాన్స్తో ఫిదా!
కొలంబో: శ్రీలంక సంక్షోభంతో అతలాకుతలమవుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంతో కుదేలవుతోంది. విదేశీ మారక నిల్వలు సరిపడా లేక విదేశీ దిగుమతులకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో పడిపోయింది ద్వీప దేశ శ్రీలంక. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ రేట్లతో జనం నానా అగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోలు ధరలకు తోడు అక్కడి ప్రభుత్వ ఆంక్షలు సామాన్య జనానికిచుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు పెట్రోలు బంకుల దగ్గర జనం భారీగా క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్లో ఒక ఆటో డ్రైవర్ డాన్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఏఆర్రహమాన్ స్వరపర్చిన ముక్కాలా.. ముకాబులా పాట ఆయన చేసిన డాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. #SriLanka: The petrol queue dance (to @arrahman's music from 1994) - received via whatsapp. Hoping to see him sometime when I'm in line. #lka #SriLankaEconomicCrisis pic.twitter.com/e42hiiLWmi — Meera Srinivasan (@Meerasrini) June 16, 2022 -
రికార్డ్ స్థాయికి చమురు: పేలనున్న పెట్రో బాంబు?
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా యుద్ధం, రష్యాపై ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రికార్డు స్థాయికి చేరాయి. ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడాయిల్ను మూడొంతుల మేర నియంత్రించడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు అంగీకారం తెలిపాయి. ఫలితంగా రష్యా ముడి చమురు దిగుమతి మరింత కఠినతరం కానుంది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే క్రూడాయిల్ బ్యారెల్ ధర 124 డాలర్లకు చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బ్యారెల్ రేటు పెరగడం ఇదే తొలిసారి. రష్యాపై ఆరో ప్యాకేజీ కింద ఆంక్షలు, నిషేధాజ్ఞలు తీవ్రం కావడంతో ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్పై పడింది. క్రూడాయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్కు 124 డాలర్లకు చేరడానికి దారి తీసిందీ పరిస్థితి. బ్రెంట్, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధరల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ఇక్కడ బ్యారెల్ ధర 60 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఈ ధరల ఒత్తిడి దేశీయ ధరలపై పడే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభం దేశీయ ఇంధన రంగం కూడా ప్రభావితం కానుంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో, దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులు, రిఫైనర్ల కార్యకలాపాల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 30.5 శాతం, త్రైమాసికంలో 7.40 శాతం పెరిగాయి. అలాగే నిఫ్టీ 50లో 5 శాతానికి పైగా పతనంతో పోలిస్తే 2022లో బిఎస్ఇ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ 7.5 శాతం లాభపడింది. అలాగే ఇండియాలోని రెండు చమురు ఉత్పత్తిదారులు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాల మార్చి త్రైమాసికంలో నికర లాభం వరుసగా 21 శాతం, 207 శాతం జంప్ చేయడం విశేషం. ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైనపుడు ముడి చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్లకు అటూ ఇటూ కద లాడింది. మధ్యలో కాస్త శాంతించినప్పటికీ రష్యన్ చమురు ఎగుమతులపై యూరోపియన్ యూనియన్ తాజా ఆంక్షలతో మళ్లీ బ్యారెల్ 124 డాలర్ల మార్కుకు ఎగిసింది. దీంతో పెట్రోలు ధరలు మరింత పుంజుకోనున్నా యనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్రం పన్నులను తగ్గించిన్పటికీ అంతర్జాతీయ ప్రభావంతో దేశీయంగా మళ్లీ పెట్రో వాత తప్పదనే భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు చమురు ధరలు బ్యారెల్ 110 డాలర్లకు చేరడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం కంటే పెద్ద ముప్పే అంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల దావోస్లో వ్యాఖ్యలును గుర్తు చేసుకుంటున్నారు. -
పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ..ఎక్కడంటే?
గత వారం కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే.పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ.8, డీజిల్పై రూ.6 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దిగువకు చేరింది. పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలివే ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గడంతో ఛండీఘడ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.20కి,డీజిల్ ధర రూ.6.57 తగ్గడంతో రూ.84.26కి చేరింది. దీంతో పాటు పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలిలా ఉన్నాయి. పంజాబ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.96 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.41 గుజరాత్లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.8 హర్యానాలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.5 అస్సాంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96 జమ్మూ- కశ్మీర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.8 ఉత్తరా ఖండ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.8 జార్ఖండ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.5గా ఉంది. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే! 1/ Good to see the interest generated by @PMOIndia @narendramodi ‘s decision yesterday to bring an Excise Duty cut on petrol and diesel. Sharing some useful facts. ‘am sure criticism/appraisal can benefit from having them before us. — Nirmala Sitharaman (@nsitharaman) May 22, 2022 ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.గతేడాది నవంబర్ '2021లో చేసిన సుంకం తగ్గింపుతో సంవత్సరానికి రూ.1,20,000 కోట్లు. ఈ ఏడాది కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో కేంద్రానికి సంవత్సరానికి లక్షకోట్ల మేర ప్రభావం చూపుతుంది. ఈ రెండు సుంకాల కోతలపై కేంద్రానికి మొత్తం రాబడి ప్రభావం ఏడాదికి 2,20,000 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ ట్వీట్లో పేర్కొన్నారు. -
లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై సుంకాలతో పాటు ప్లాస్టిక్, స్టీల్ మొదలైన వాటికి సంబంధించిన ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు దిగివచ్చేందుకు వీలవుతుం దని ఎగుమతిదారులు తెలిపారు. తయారీలో పోటీతత్వం మెరుగుపడేందుకు, విలువను జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడగలదని పేర్కొన్నారు. అలాగే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గగల దని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేష న్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. టెక్స్టైల్స్ ముడి వనరుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్తి ఎగుమతులపై సుంకాలు విధించి, కాటన్ యార్న్ దిగుమతులపై సుంకాలు ఎత్తివేస్తే దేశీ పరిశ్రమలకు సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నా రు. పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఉక్కు, ప్లాస్టిక్ ముడి సరుకులకు సంబంధిం చి దిగుమతి సుంకాలను కూడా తగ్గించిన కేంద్రం.. ముడి ఇనుము, ఉక్కు ఇంటర్మీడియట్స్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. -
గుడ్న్యూస్: పెట్రో ధరలపై భారీ ఊరట.. భారీగా తగ్గించిన కేంద్రం
-
ధరల దెబ్బ..! దేశంలో భారీగా పడిపోతున్న పెట్రోల్, డీజిల్ అమ్మకాలు!
ఆదాయం..ఆవ గింజలా ఉంటే.. ఖర్చు కొండలా మారింది. దీంతో తోడు పెరిగిపోతున్న నిత్యవసర ధరలతో పాటు..సరుకు రవాణాకు లింకై ఉండడంతో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అందుకే సామాన్యులు ఒక్కోరూపాయి లెక్కలేసుకొని మరి ఖర్చు చేస్తున్నారు. దీంతో గత నెల తొలి 16 రోజులతో పోల్చితే ఈ నెలలో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గాయి. డీజిల్ వినియోగం 15.6 శాతం, వంటగ్యాస్ వినియోగం 1.7 శాతం తగ్గింది. అలాగే మహమ్మారి సమయంలో గ్యాస్ వినియోగం వృద్ధి పెరిగింది. అయినప్పటికీ తాజాగా గ్యాస్ డిమాండ్ తగ్గింది. వంట గ్యాస్ ఏప్రిల్ 1 నుంచి 15 రోజుల వినియోగంలో నెలవారీగా 1.7శాతం క్షీణించింది.పెరుగుతున్న ధరలతో ఏప్రిల్ 1 నుండి 15 వరకు ప్రాథమికంగా, ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థల పెట్రోలు అమ్మకాలు 1.12 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 12.1శాతం అధికంగా ఉంది. అలాగే 2019 కాలంతో పోలిస్తే 19.6శాతం అయితే, మార్చి 2022 మొదటి 15 రోజుల్లో నమోదైన 1.24 మిలియన్ టన్నుల అమ్మకాలతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 9.7శాతం తగ్గింది. ఇంకా, దేశంలో అత్యధికంగా ఉపయోగించే డీజిల్ ఏప్రిల్ మొదటి 15రోజుల వరకు 7.4 అమ్మకాలను నమోదు చేసి సుమారు 3 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది కూడా 2019లో ఇదే కాలం కంటే 4.8% ఎక్కువ. అయితే ఈ ఇంధన వినియోగం మార్చి 1 నుంచి 15 రోజుల మధ్య 3.53 మిలియన్ టన్నుల వినియోగంతో పోలిస్తే 15.6 శాతానికి పడిపోయింది. -
ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు.. మళ్ళీ పెంచారు
-
ఆగని పెట్రో బాదుడు.. ఇవాళ ఎంతంటే..?
చమురు సంస్థలు వినియోగదారులపై ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతుంది. ఇక సోమవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 30పైసలు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.112.35 ఉండగా డీజిల్ ధర రూ.99.09గా ఉంది. వైజాగ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.08 ఉండగా డీజిల్ ధర రూ.99.09గా ఉంది ముంబైలో లీటర్ పెట్రోల్ధర రూ.113.88 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.98.13 గా ఉంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.11 ఉండగా.. డీజిల్ ధర రూ.90.42గా ఉంది కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.53 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.93.57గా ఉంది. -
వినూత్న నిరసన.. ఇళ్ల ముందు 31న డప్పులు కొడుతూ బెల్స్ మోగించండి..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి తర్వాత వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీరోజు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ తీరును ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చింది. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ పార్టీ పోరుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దశల వారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా పెరుగుతున్న ధరలకు నిరసనగా.. మార్చి 31వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రజలందరూ తమ ఇళ్లు ముందు, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లు ముందు పెట్టుకొని, డప్పులు కొడుతూ బెల్స్ మోగించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సూర్జేవాలా మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో లీటరు పెట్రోల్ ధర రూ.29లు, డీజిల్ ధర రూ.28.58లు పెంచారని స్సష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు రోజుల్లోనే లీటరు పెట్రోల్పై రూ.3.20 పెంచారని మండిపడ్డారు. మరోవైపు.. ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని 531శాతం, పెట్రోల్పై 203 శాతం పెంచినట్టు ఆరోపించారు. -
సామాన్యుడికి చుక్కలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశ వ్యాప్తంగా సామాన్యులపై పెట్రోల్, డీజిల్ వాత కొనసాగుతోంది. ఐదు రోజుల్లో నాలుగో సారి చమురు సంస్థలు ధరలు పెంచాయి. దీంతో శనివారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై 89పైసలు, డీజిల్పై 86పైసలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన హెచ్పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ ఏకంగా 2.25 బిలియన్ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నట్లు సమాచారం. దేశంలో పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.98.10గా ఉంది విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.60 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.99.56 పైసలుగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.61పైసలు ఉండగా డీజిల్ ధర రూ.89.87 పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.35పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.97.55పైసలుగా ఉంది చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.43పైసలు ఉండగా డీజిల్ ధర రూ.94.47పైసలుగా ఉంది బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.88.14పైసలుగా ఉంది -
వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
-
వాహనదారులకు భారీ షాక్..మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు!
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తరువాత వాహనదారులపై పెట్రో బాదుడు షురూ అయ్యింది. చివరి సారిగా డీజిల్,పెట్రోల్ ధరలు గతేడాది నవంబర్ 4వరకు పెరిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడు మళ్లీ పెట్రోల్ ధరల పెంపు ప్రారంభమైంది. దీంతో బుధవారం లీటర్ పెట్రోల్పై 90పైసలు, డీజిల్పై 84పైసలు పెరిగాయి. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. అయితే రోజురోజుకు చమురు సంస్థలు నష్టాలు పెరుగుతుండడంతో పెట్రో ధరల పెంపు అనివార్యమైందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధరూ.110గా ఉండగా డీజిల్ ధర రూ.96.36 పైసలుగా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.112.08 ఉండగా డీజిల్ ధర రూ.98.10పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.99 ఉండగా డీజిల్ ధర రూ.97.90పైసలుగా ఉంది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.21 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.87.47పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.82పైసలు ఉండగా డీజిల్ ధర రూ.95.00పైసలుగా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.51 ఉండగా డీజిల్ ధర రూ.90.62పైసలుగా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.16 ఉండగా డీజిల్ ధర రూ.92.19పైసలుగా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.42 ఉండగా డీజిల్ ధర రూ.85.80పైసలుగా ఉంది. -
పెట్రోల్, డిజీల్ ధరలు రూ. 12 పెరిగే ఛాన్స్..! బంకులకు క్యూ కట్టిన జనాలు..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిన్ ధరలు సరికొత్త రికార్డులు నమోదుచేసింది. దీంతో అంతర్జాతీయంగా పెట్రోల్, డిజీల్ ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇంధన ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెట్రోల్, డిజీల్ ధరలు స్థిరంగానే కొనసాగాయి. కాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరు క్షణమే ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే వార్తలు రావడంతో ప్రజలు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకున్నారు. మార్చి నెల తొలి పదేహేను రోజుల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్, డిజీల్ను ప్రజలు తమ వాహనాల్లో నింపుకున్నారు. కొత్త రికార్డులు..! ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరల పెంపు ఉంటుందనే భయం ప్రజల్లో కన్పించింది. దీంతో మార్చి మొదటి రెండు వారాల్లో జనాలు భారీగా ఇంధనాన్నినిల్వ చేసుకున్నారు. బ్లూమ్బెర్గ్ లెక్కల ప్రకారం..మార్చి 1 నుంచి 15 మధ్యకాలంలో భారత్కు చెందిన మూడు అతిపెద్ద రిటైలర్ల డీజిల్ విక్రయాలు ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువగా 3.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయని పేర్కొంది. ఇక పెట్రోల్ మార్చి 1 నుంచి 15 మధ్య కాలంలో 1.23 మిలియన్ టన్నులతో పెట్రోలు విక్రయాలు జరిగాయి. ఈ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18 శాతం ఎక్కువ. 2019 కాలంతో పోలిస్తే 24.4 శాతం అధికం. ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు సుమారు 132 రోజుల పాటు స్థిరంగా ఉన్నాయి. ఇక ఎల్పీజీ గ్యాస్ అమ్మకాలు అమ్మకాలు 17 శాతం పెరిగాయి. రూ. 12 కు పెరిగే ఛాన్స్..! రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు సుమారు 80 డాలర్ల నుంచి 130 డాలర్లకు చేరకుంది.ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వచ్చాయి. ఫలితాల తరువాత ఇంధన ధరలు ఏకంగా రూ. 12 పెరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ రేట్లు మారలేదు.కాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ఆఫర్ త్వరలోనే ముగియనుంది వెంటనే మీ వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకోండి అంటూ ప్రజలకు హితవు పలికారు. నష్టాల్ని పూడ్చుకోవాల్సిందే పెట్రోల్, డిజీల్ అమ్మకాలు పెరగడానికి ఇంధన హోర్డింగ్ దోహదపడిందని హర్దీప్ సింగ్ పురి పార్లమెంట్లో తెలియజేశారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రకారం, అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగిన తర్వాత నష్టాలను పూడ్చుకోవడానికి, అతిపెద్ద ఇంధన రిటైలర్ సంస్థలు భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంధన ధరలు పెంపుకు రిటైలర్లు తగిన చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారు. చదవండి: భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..! -
మన దేశంలోనే పెట్రోల్ ధరలు తక్కువ.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి కాలంలో చాలా దేశాలలో ఇంధన ధరలు 50 శాతానికి పైగా పెరిగితే భారతదేశంలో కేవలం ధరలు 5 శాతం పెరిగాయని సభకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నేడు రాజ్యసభలో తెలిపారు. గత ఏడాది నవంబర్ 4న ఇంధన ధరలపై కేంద్రం పన్నులు తగ్గిస్తే మహారాష్ట్ర, కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించలేదని అని అన్నారు. "మేము గత ఏడాది సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాము. కానీ, మహారాష్ట్ర & కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించలేదు. చమరు ధరలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము" మంత్రి తెలిపారు. "కరోనా మహమ్మారి సమయంలో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యుకె, స్పెయిన్ దేశాలలో పెట్రోల్ ధరలు 50, 55 & 58 శాతం పెరిగితే.. భారతదేశంలో చమరు ధరలు 5 శాతం మాత్రమే పెరిగాయి. ఇందుకు మనం సంతోషించాలి" అని అన్నారు. ముడి చమురుపై రష్యా అందిస్తున్న డిస్కౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత మూడు సంవత్సరాలు, ప్రస్తుత సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం(సెస్లతో సహా) విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించిన మొత్తం వివరాలను మంత్రి రాజ్యసభకు తెలియజేశారు. 2018-29లో సేకరించిన మొత్తం సుంకం రూ.2.14 లక్షల కోట్లు అయితే, 2019-20లో ఇది రూ.2.23 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2020-21లో ఈ మొత్తం రూ.3.73 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి సేకరించిన మొత్తం సుంకం రూ.1.71 లక్షల కోట్లు వసూలు అయినట్లు హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. (చదవండి: రష్యాతో బిజినెస్ చేస్తాం.. లాభం ఉక్రెయిన్కు ఇస్తాం!)
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన భారత్
నైపుణ్యాన్ని వెలికితీస్తున్న చెస్ పోటీలు
ముగిసిన చెస్ పోటీలు
అన్నప్రాశన రోజే తిరిగిరాని లోకాలకు
పేరుపాలెం బీచ్లో సందడి
పచ్చిరొట్టగా జీలుగ సాగు
భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
క్రికెట్ జట్టు ఎంపిక
ఉరేసుకొని బాలిక ఆత్మహత్య
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల
Advertisement