-
ఏమిటి ఈ పరీక్ష? ఎందుకు?
పరీక్ష... లేదా పరీక్షలు అనే మాట విద్యారంగంలో తరచూ వినిపిస్తూ ఉంటుంది. చెప్పిన పాఠాలు విద్యార్థి ఎంత శ్రద్ధగా విన్నాడు, ఎంత జ్ఞానాన్ని పొందాడు, దాని సారమెంత అన్నది ఉపాధ్యాయులు అంచనా వేయాలి. అలా వేసే అంచనానే పరీక్షంటే. పరీక్ష అతణ్ణి పైతరగతులకు పంపే ఒక పక్రియ లేదా సాధనం. అయితే పరీక్ష అనేది విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదు. చదువున్నా లేకపోయినా, జీవితంలో ప్రతి ఒక్కరూ పరీక్షకు గురి అయిన వారే. తమను తాము పరీక్ష చేసుకునేవారే. ఇంతకీ పరీక్ష అంటే ఏమిటి, ఎందుకో తెలుసుకుందాం. మన మాట తీరు, ఇతరులతో మన సంబంధాలు, వారితో మన వర్తన, విలువలు, నీతి, నిజాయితీ, తోటి మానవుల పట్ల మన భావన, ప్రేమ ఇటువంటి అనేకమైన వాటిని అంచనా వేసుకునేందుకు కూడా పరీక్ష అవసరం. మన జీవిత ప్రవాహ సారాన్ని అర్ధం చేసుకుని దాన్ని ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాలి. అంటే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. దాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఈ పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇతర జీవులకు, మనకు ఉండే జనన మరణాల సారూప్యతకు భిన్నంగా, గొప్పగా మన జీవనవిధానాన్ని గమనిస్తూ జీవితాన్ని మార్పు చేసుకోగలమా? అలా మన తెలివితేటలకు, ఆధిక్యతకు ఒక విశిష్టత, అర్థం చూపగలమా? ఆ ఆలోచన వచ్చిన వారెవరైనా తమ శల్య పరీక్షకు సంసిద్ధులైతే జీవితాన్ని చక్కగా మలచు కోవటం కష్టం కానే కాదు. అది మనోవికాసానికి, గొప్ప ఆలోచనలకు దారి తీసి మానవాళికి ఉపయుక్తం అయ్యే అనేక ఆవిష్కరణలకు దారితీస్తుంది.‘శోధించని జీవిత జీవనయోగ్యం కాదు’ అన్నాడు సోక్రటీస్. ఈ పరీక్షకు విద్యార్థి, పరీక్షాధికారి ఎవరికి వారే. విద్యార్థి సంవత్సరకాలంలో పుస్తకాలలోని తను పొందిన జ్ఞానాన్ని ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటాడో అలా ప్రతి వ్యక్తి తను గడిపిన, గడుపుతున్న జీవితాన్ని నెమరు వేసుకోవాలి. వివిధ సందర్భాలలో తన మాటలు, ప్రవర్తన అనుబంధాలకు, ఆప్యాయతలకు ఎంత విలువనిచ్చాయి, వాటిని తను ఎంత నిలబెట్టుకున్నాడో స్ఫురణకు తెచ్చుకోవాలి. తన వర్తన ఇతరుల మనస్సులనేమైనా అకారణంగా గాయపరిచిందేమో తరచి చూసుకోవాలి. వృత్తి జీవితంలోనూ ఒక ఉద్యోగి, రచయిత, కళాకారుడు తమ కృషి లేదా పని తీరును సమీక్షించు కోవడమూ పరీక్షే. జీవితాన్ని ఎంత నిశితంగా పరీక్షలకు గురి చేస్తే అంతగా మన వ్యక్తిత్వం సార్థక మవుతుంది. ఇక్కడ పరీక్ష పత్రం తయారు చేసేది, సమాధానాలు రాసేది మనమే. దీనితో విద్యార్థి పాత్ర ఉపాధ్యాయుని పాత్రగా మారుతుంది. ఇప్పుడు పరీక్షాధికారిగా వీటి మంచి చెడులను విశ్లేషించాలి. మంచికి మురిసిపోతూ మనల్ని మనమే ప్రశంసించుకో కూడదు. మంచిని చూసినంత బాగా, నిశితంగా లోపాలను చూడాలి. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించగలగాలి. ఆ ఫలితాలను లోతుగా చూసి, ఒక నిజమైన, ఖచ్చితమైన మదింపు వేసుకోవాలి. అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే వివేచన కావాలి. ఇక్కడ బేషజాన్ని, ఆహాన్ని విడిచి తప్పులను దిద్దుకునే సంస్కారం అలవరుచుకోవాలి. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. విద్యార్థి తన విద్యాభ్యాసకాలంలో రాసే పరీక్షలు కొన్నే ఉంటాయి. కాని మనం జీవితాంతం మన జీవితాన్ని పరీక్షకు గురి చేయాల్సిందే. సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిందే. సోక్రటీస్ చెప్పిన మాటల సారమిదే. తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు ఉపాధ్యాయులు ఈ శోధన తత్వాన్ని పిల్లలు అలవాటు చేసుకునేలా చెయ్యాలి.ఈ శోధన మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. కొందరు వ్యక్తులకు ఈ శోధన చిన్నతనం నుండే సహజంగా ఉంటుంది. ఆ శోధనా దృష్టి కొందరిలో అతి చిన్న వయస్సులోనే ఏర్పడి చక్కని రూపు దాల్చి ఉన్నత పథంలో పయనం చేసి మొత్తం మనవాళికి దాని ఫలితాలను అందిస్తుంది. వారు చిర స్మరణీయులవుతారు. ఈ శోధనాతత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. ముఖ్యంగా ఉపాధ్యాయులకు, శాస్రవేత్తలకు, నాయకులకు చాలా అవసరం. ఎప్పటికప్పుడు తాము చేసిన పనిని, దానిలోని తప్పుల్ని తెలుసుకుని తమను తాము నూతనంగా ఆవిష్కరించుకుంటారు. సోక్రటీస్ అన్న మాటలలో పరిశీలన, తార్కికత, ఉత్సహం, ఆధ్యాత్మికత పెనవేసుకున్నాయి. ప్రశ్నించే, శోధించే గుణాలు ఉన్నాయి. వృత్తి జీవితంలోనూ ఒక ఉద్యోగి, రచయిత, కళాకారుడు తమ కృషి లేదా పని తీరును సమీక్షించు కోవడమూ పరీక్షే. జీవితాన్ని ఎంత నిశితంగా పరీక్షలకు గురి చేస్తే అంతగా మన వ్యక్తిత్వం సార్థకమవుతుంది. – లలితా వాసంతి -
లోపలి శత్రువు
ప్రతి మనిషికీ అంతరంగంలో ఆరుగురు శత్రువులు ఉంటారని చెబుతారు. ఆ శత్రువును ఓడించి అదుపులో పెట్టగలిగినప్పుడు ఆ మనిషికి పురోగతి సాధ్యమవుతుంది. అదుపులో పెట్టలేకపోతే పతనం తప్పదు. ఇది మనకు చిరకాలంగా వినిపిస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేవి విడివిడిగా వ్యక్తులకు ఉండే ఆరుగురు అంతః శత్రువులు. వీటినే అరిషడ్వర్గాలు అంటున్నాము. వ్యక్తులపై కాకుండా సమూహాలపై దాడి చేసే అంతః శత్రువులు కూడా ఉంటారు. ఈ శత్రువులు సామాజిక విలువల రూపంలో కూడా ఉండవచ్చు. కట్టుబాట్ల రూపంలో ఉండవచ్చు. ఆచార సంప్రదాయాల రూపంలో కూడా ఉండవచ్చు. ఈ సంప్రదాయాలు మన మెదళ్లలో తిష్ఠ వేసుకొని ఆలోచనలను తమ గుప్పెట్లోకి తీసుకుంటూ ఉండవచ్చు. సమాజం గతిశీలమైనది. నిరంతర చలనం దాని స్వభావం. వస్తుగత మార్పులను ఎప్పటికప్పుడు అది ఆహ్వానిస్తూనే ఉంటుంది. సామాజిక చైతన్యాన్ని శాశ్వత విలువలతో, కట్లుబాట్లతో నియంత్రించడం సాధ్యం కాదు. ఒకప్పుడు సదాచారాలు అనుకున్నవి కాలక్రమంలో దురాచారాలుగా పరిగణించవచ్చు. అటువంటి దురాచారాలను క్రమానుగతంగా మన సమాజం తొలగించుకుంటూ పురోగమిస్తున్నది. అట్లా తొలగించుకోలేక మిగిలిపోయిన దురాచారాలే సమాజ వికాసానికి ప్రతిబంధకాలవుతున్నాయి. కాలానుగుణమైన మార్పుల్ని ఆహ్వానించడం ఒక పురోగామి సూత్రం. అటువంటి మార్పులు మన ఆలోచనల్లో రావాలి. మనం ఏర్పరచుకున్న చట్టాల్లో కూడా రావాలి. మొన్న ఒక అబార్షన్ సంబంధిత కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం చెప్పింది ఇదే. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడం మహిళలకు ఉండే తిరుగులేని హక్కుగా సమున్నత న్యాయస్థానం గుర్తించింది. ఇది వైవాహిక స్థితిగతులతో సంబంధం లేకుండా మహిళలందరికీ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మనదేశంలో పెళ్లి కాకుండానే గర్భం దాలుస్తున్న బాలికలు, యువతుల సంఖ్యకు లెక్కలేదు. ఇటువంటి అవాంఛిత గర్భాలకు వారినే బాధ్యులుగా చేయటం దుర్మార్గం. తాము ఎదిరించలేని వారు, తమ వారు అనుకున్న వారి అఘాయిత్యాల బారిన పడుతున్న యువతులు ఎంతో మంది ఉంటున్నారు. కామాంధుల అత్యాచారాలకు గురవు తున్న వారు కూడా ఎంతోమంది ఉంటున్నారు. వీరే కాదు, వ్యక్తిగత కారణాల రీత్యా వివాహానికి దూరంగా ఉండదలచిన వారు, విడాకులు తీసుకున్న వారు కూడా చాలామంది ఉంటారు. ఇష్టపూర్వకమైన కలయికలు చట్టవిరుద్ధం కాదని గతంలోనే న్యాయస్థానం తీర్పు చెప్పింది. కలయిక చట్టవిరుద్ధం కానప్పుడు గర్భస్రావం మాత్రం ఎట్లా చట్టవిరుద్ధమవుతుంది? ఈ వైరుద్ధ్యాన్ని సుప్రీంకోర్టు తొలగించింది. పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన స్త్రీలకు పునరుత్పాదక హక్కులనేవి సహజ హక్కులు. ఈ సత్యాన్ని న్యాయస్థానం గుర్తించినట్లయింది. మన న్యాయస్థానాలు అప్పుడప్పుడు ఇటువంటి ప్రగతి శీలమైన తీర్పులనివ్వడం ద్వారా సామాజిక వికాసానికి దోహదం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే అమెరికా సుప్రీంకోర్టు ఇదే విషయంలో భిన్నమైన తీర్పు చెప్పిన నేపథ్యంలో మన సుప్రీం తీర్పు గర్వకారణం. అయితే మన న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో సామాజికాంశాలకు సంబంధించి ప్రగతి నిరోధకమైన తీర్పుల్ని ఇవ్వకపోలేదు. న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే కనుక సామాజిక విలువలుగా చలామణిలో ఉన్న భావజాల ప్రభావం వారిపై కూడా ఉండవచ్చు. పితృస్వామిక వ్యవస్థ భావజాల ప్రభావం నుంచి చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా తప్పించు కోలేకపోతున్నారు. పదేళ్ల కిందట సుప్రీంకోర్టులోనే ఒక విడాకుల పిటిషన్ మీద ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా సరే భర్త బదిలీపై వెళ్ళినప్పుడు భార్య తన ఉద్యోగాన్ని వదిలేసైనా సరే వెళ్లాలని కోర్టు చెప్పింది. సీతాదేవి శ్రీరాముడిని అనుసరించి వెళ్లినట్లు భార్య కూడా భర్తను అనుసరించి వెళ్లాలని కోర్టు అభిప్రాయ పడింది. అంతేకాదు, భార్యల సంపాదనను ‘లిప్స్టిక్ మనీ’గా కూడా పోల్చింది. 2018లో కేరళ హైకోర్టులో మరో న్యాయమూర్తి ఒక తీర్పును ఇస్తూ చేసిన వ్యాఖ్యానం మరింత దిగ్భ్రాంతికరంగా ఉన్నది. భార్యకు ఉండవలసిన లక్షణాలను చెప్పడానికి ఆయన ఒక సంస్కృత∙శ్లోకాన్ని ఉదహరించారు. పితృస్వామిక భావజాలానికి పరాకాష్ఠ ఈ శ్లోకం. బాగా పాపులర్. పురుషుల్లో చాలామందికి నచ్చుతుంది కూడా! ‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రి...’! భార్య చూడటానికి లక్ష్మీదేవిలా ఉండా లట! భర్తకు దాసి లాగా సేవ చేయాలి. మంత్రిలా సలహా లివ్వాలి. అమ్మలా తినిపించాలి. రంభలా శయనించాలి. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి. పురుషాధిక్య సమాజం కనుక పురుషుని కోణం నుంచి, కోర్కెల నుంచి అల్లిన శ్లోకం బాగానే ఉన్నది. కానీ దీన్నే తిరగేసి స్త్రీల కోణం నుంచి కొత్త శ్లోకం అల్లితే? తమ పురుషునిలో స్త్రీ కోరుకునే లక్షణాలపై పరీక్ష పెడితే ఎంతమంది పురుష పుంగవులు పాస్ మార్కులు తెచ్చు కోగలరు? చెప్పడం కష్టం. ఇటువంటి కాలం చెల్లిన మౌఢ్యాన్ని సమాజం వదిలించుకోలేకపోతే ఇప్పుడు మనకు అవసరమైన పురోగతిని సాధించటం సాధ్యం కాదు. అండపిండ బ్రహ్మాండమైన విశ్వంలో భూగోళమే ఒక పిపీలికం. మన పిపీలికం ఉన్న పాలపుంత ఈ చివరి నుంచి ఆ చివరవరకు కాంతి వేగంతో ప్రయాణం చేస్తే లక్ష సంవత్సరాలు పడుతుందట! ఈ పాలపుంతను పోలిన గెలాక్సీలు విశ్వంలో వందల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నరజాతి సాధించిన శాస్త్ర సాంకేతిక ప్రతిభ ఎక్కడున్నట్టు? విశ్వ రహః పేటికా విపాటన లక్ష్యం సాధించేది ఎప్పుడు? భూగోళంలో తన చరిత్రను తాను ఇప్పటికీ మానవుడు పూర్తిగా ఆవిష్కరించలేదు. క్రీస్తు పుట్టిన తర్వాత రెండు వేల యేళ్లు, అంతకుముందో వెయ్యేళ్లు తప్ప అంతకుమించి మనకున్నది అరకొర జ్ఞానమే. ఎన్నో మహో న్నతమైన నాగరికతలు ఎందుకు అంతరించాయో తెలియదు. ఆ నాగరికతల పూర్తి వివరాలూ తెలియవు. మూడున్నర వేల ఏళ్లకు పూర్వమే మహిళలకు సురక్షితమైన గర్భస్రావ విధానాలు ఎటువంటి వివక్ష లేకుండా అందుబాటులో ఉన్నాయని ఆధారాలు కూడా ఈజిప్టులో దొరికాయి. ఇన్నాళ్లకు ఇప్పుడు మనం సుప్రీంకోర్టు తీర్పును గొప్ప ముందడుగుగా వర్ణించుకునే దుఃస్థితిలో ఉన్నాము. ఎటువంటి అరమరికలు, విభేదాలు లేనప్పుడే, ప్రజలం దరూ ఐక్యమైనప్పుడే, విజ్ఞానవంతులైనప్పుడే మానవజాతి శాస్త్ర సాంకేతిక పురోగతి సాధించగలుగుతుంది. కానీ మతాన్ని సంకుచితంగా అన్వయించి, మౌఢ్యంగా అనువదించి విసురు తున్న కత్తులతో, పారిస్తున్న నెత్తురుతో నరజాతి శత్రు శిబిరాలుగా విడిపోతున్నది. మనదేశంలో కులోన్మాదం కలిగిస్తున్న నష్టం ఇంతా అంతా కాదు. వీటితో పాటు ఇంకా మన మెదళ్లలో తిష్ఠవేసిన పితృస్వామిక భావజాలం సగం జనాభాలోని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని చంపేస్తున్నది. ఈ పితృస్వామిక భావజాలం ఓ సైలెంట్ కిల్లర్. మతాలు, కులాలు, దురాచారాలు చేసిన నష్టం కంటే ఎక్కువ నష్టాన్ని నిశ్శబ్దంగా చేసుకుపోతున్నది. అభ్యుదయవాదులు, విప్లవకారు లుగా చెప్పుకునే వాళ్లు కూడా దీని కనికట్టు పట్టులో చిక్కుకుంటు న్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. మన టెలివిజన్లలో వచ్చే కార్యక్రమాల్లో చెత్త కార్యక్రమాలు కోకొల్లలు. సకుటుంబ సపరివార సీరియళ్ల పేరుతో కొన్ని సీరియళ్లు బోలెడంత సామాజిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇన్ని చెత్తల్లో ఒక చెత్త ‘బిగ్ బాస్’. కానీ మన అభ్యుదయవాదుల టార్గెట్ మాత్రం ‘బిగ్ బాస్’ ఒక్కటే. ఎందుకంటే అందులో ఓ పదిమంది అమ్మాయిలు, ఓ పదిమంది అబ్బాయిలు కొంత కాలం పాటు కలిసి ఉంటారట! ఎంతో పరిణతి పొందిన యువతీ యువకులు వీరు. చదువుకున్న వాళ్ళు, స్వతంత్రంగా జీవన గమనాన్ని సాగిస్తున్న వారు. వాళ్ళంతా కలిసి కొన్ని రోజులపాటు ఒకే ఇంట్లో ఉండి ఆటలాడినంత మాత్రాన ఏదో ప్రళయం ముంచుకొస్తుందట! ఆకాశం కుంగిపోతుందట! అగ్ని పర్వతాలు బద్దలవుతాయట! మన సంస్కృతీ సంప్రదాయా లను ఈ కార్యక్రమం మంటగలుపుతున్నదని విమర్శించేవాళ్లు ఉన్నారు. ఏ సంస్కృతిని? కార్యేషు దాసి సంస్కృతినేనా? అది మంటగలిస్తేనే మానవజాతి విముక్తి సాధించగలుగుతుంది. ‘బిగ్బాస్’ అనేది సమాజానికి పనికి వచ్చే గొప్ప కార్యక్రమం కాకపోవచ్చు. అంతమాత్రాన అందులో పాల్గొం టున్న యువతీ యువకుల క్యారెక్టర్ను దెబ్బతీసే కామెంట్లు చేయడం న్యాయం కాదు. వాళ్ల మీద వేస్తున్న నిందలు అమానుషం. ముఖ్యంగా చాలామంది యువతులు ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని, ఎన్నో మూతివిరుపుల్ని అధిగమించి స్పాట్లైట్లోకి దూసుకొస్తున్నారు. సమాన స్థాయి కోసం ప్రపంచం మీదకు దండెత్తి వస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో, నవ చైతన్యంతో కదం తొక్కుతూ వస్తున్నారు. వీళ్ళూ అందులో భాగమే! వీలైతే స్వాగతిద్దాం. కాకపోతే చచ్చుబడిన మోకాళ్ళను అడ్డం పెట్టకుండా పక్కకు తప్పుకుందాం. మహిళా సాధికారత సాధ్యం కాకుండా ముందు ముందు మరే గొప్ప నాగరికత నిర్మాణం కాబోదు. ఆ సాధికారత సాధ్యం కావాలంటే పితృస్వామిక భావజాలాన్ని ఓడించక తప్పదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
6 లక్షల జీతం.. ప్రేమించి పెళ్లాడి.. ఆఖరికి విడాకులు? అసలు తెలివి అంటే?
ఆమె ఐఐఎంలో ఎంబీఏ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో నెలకు ఆరు లక్షల జీతం పొందే ఉన్నతోద్యాగాన్ని సాధించింది. ఉద్యోగం వచ్చాక ఒక అబ్బాయిని రెండేళ్లపాటు ప్రేమించింది. తల్లితండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకుంది. పెళ్ళయాక ఆరునెలల్లో విడాకులు తీసుకొంది. అప్పటికి తాను నాలుగు నెలల గర్భవతి. అబార్షన్ చేయించుకొని విడాకులు తీసుకొన్న ఆమె ఇప్పుడు డిప్రెషన్లో ఉంది. ఇక జీవితంలో పెళ్లిచేసుకోను అంటోంది . మరో చోట మరో అమ్మాయి. అమెరికాలో అత్యున్నత సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అటుపై పెద్ద ఉద్యోగం సాధించింది. ఈమె సంపాదనపై కన్నేసిన ఒక యువకుడి ప్రేమ వలలో చిక్కి నరకయాతన అనుభవించి ఎలాగో ఒకలా బయటపడింది . మరో చోట ఐఐటీ చదివే విద్యార్ధి యూట్యూబ్ వీడియోలు చేస్తూ దానికి ఆదరణ లేదని (మరి కొన్ని కారణాలు) ఆత్మహత్య చేసుకొన్నాడు. పెద్దగా చదువుకోని వారు కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. మరి.. నువ్వు చదివే చదివేంటి ? చేస్తున్న వీడియోలు ఏంటి ? అంతకు మించి వీడియోలకు జనాదరణ ఎలా పెంచుకోవాలో తెలియకపోవడం.. పోనీ రాలేదు. అదే జీవితం అనుకొని తనువు చలించడం. ఏంటిది ? లక్షమంది పోటీ పడితే వందమందికి కూడా సీట్ దక్కని ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థల్లో సీట్ సాధించిన వారు నిస్సందేహంగా తెలివైన వారే ! కానీ రెండేళ్లు ప్రేమించినా అబ్బాయి తత్త్వం అర్థం చేసుకోలేని బేలతనం.. ఒకసారి అబార్షన్ అయితే అటుపై పుట్టే పిలల్లకు మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది అని తెలుకోలేని అజ్ఞానం. అవతలి వాడు ప్రేమిస్తున్నది తన జీతాన్ని.. తనకు కంపెనీ ఇచ్చిన షేర్లను అని తెలుసుకోలేని అమాయకత్వం.. ఏంటివన్నీ? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, మెడికల్ సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ లాంటి సబ్జెక్టులలో నైపుణ్యం సాధిస్తే అకాడమిక్ లేదా డొమైన్ ఇంటలిజెన్స్ అంటారు. సంగీతం లో పట్టుంటే మ్యూజిక్ ఇంటలిజెన్స్.. భాషపై పట్టుంటే లింగ్విస్టిక్ ఇంటలిజెన్స్. శ్రీదేవి. ఒకనాటి యువకుల కలల రాణి. అద్భుత నటి. కానీ అదివరకే పెళ్ళైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొంది. అనూహ్య పరిస్థితుల్లో లోకాన్ని వీడి వెళ్లిపోయింది. ఇక మరో ప్రముఖ నటి సావిత్రి ఎలా మోసపోయిందో మహానటి సినిమా పుణ్యమా అని చాలామందికి తెలిసింది. తెలివైన వారు ప్రతిభావంతులు ఇలా మోసపోతారెందుకు? చాలా మందికి అర్థం కాని విషయం ఒకటుంది. తెలివంటే కేవలం పాఠ్యఅంశాలపై పట్టుసాధించి మార్కులు, ర్యాంకులు కొట్టడం కాదు . మీకందరకు ఒక కాలేజీ మిత్రుడుంటాడు. కాలేజి ఎగ్గొట్టి జులాయిలా బలాదూర్ తిరిగేవాడు. కాలేజీలో పుస్తకాలతో కుస్తీ పట్టే వారెందరో ఇప్పుడు సర్కారీ క్లర్కులుగా ఉంటే.. మీరనుకున్న ఆ జులాయి కాంట్రాక్టర్గానో, బిజినెస్మేన్గానో అవతరమెత్తి కోట్లు కూడబెట్టివుంటాడు. కేవలం లక్ లేదా పలుకుబడి అనుకొంటే అది మీ అమాయకత్వం అవుతుంది. ఆలోచించండి. ఇదెలా సాధ్యం ? సోషల్ ఇంటలిజెన్స్.. సామాజిక తేలితేటలు.. ఎమోషనల్ ఇంటలిజెన్స్.. భావోద్వేగ తెలివితేటలు. ఈ రెండూ లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత సంపద ఉన్నాఅన్ని బండి సున్నాయే. ఎలాగంటారా ? మార్కులు, జీతం, సంపద ఇవన్నీ లక్షల్లో. సామజిక తేలితేటలు జీరో. ఇప్పుడు ఈ జీరోతో ఆస్తిని సంపాదనను గుణించండి. ఏమొచ్చింది? బండి సున్నా. అవునా కదా ? సామాజిక తెలివితేటలు ఉంటే ఆ సంఖ్యను ఆస్తి / జీతంతో గుణించండి. అనేక రెట్లు పెరుగుతుంది. సామాజిక తేలితేటలు లేక మలిమొఘల్ చక్రవర్తులైన ఫారూఖ్ షియార్, రఫీ ఉద్ డారాజ్, రఫీ ఉద్దీన్ లాంటి వారు సయ్యిద్ సోదరుల చేతిలో చిక్కి విలవిలలాడి, చరిత్ర మరుగయ్యారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ లేక పెద్ద సినిమాల్లో హీరోగా నటించినా అటుపై అవకాశాలు రావడం లేదని ఆత్మహత్య చేసుకొన్న వారొకరు. డిప్రెషన్ లో మరొకరు. దీర్ఘకాలం కోమా.. ఉరి.. ఇలా మరణాన్ని పొందినవారు ఇంకొందరు. తాత సంపాదించిన ఆస్తిని తగలెట్టేసి వ్యాపారాన్ని దివాళా తీయించిన వారు ఎందరో ! ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఈ వ్యక్తులు ఎవరు అని కాదు. ఎమోషనల్ సోషల్ ఇంటలిజెన్స్ను పిలల్లకు ఎలా నేర్పాలి? ఇందులో స్కూల్ , కాలేజీ పాత్ర ఏంటి ? తల్లితండ్రులుగా మన పాత్ర ఏంటి అని? ఆయన నాలుగో పెళ్ళానికి మూడో భర్త ఎవరు? ఆ వీడియోలో ఆమె ఒయ్యారాన్ని ఒలక పోసిందా? ఇలాంటి మనకు అవసరం లేని విషయాలపై మీరు ఆసక్తి ప్రదర్శిస్తూ సమయాన్ని వినియోగిస్తుంటే.. మీ పిలల్లు ఇంటర్నెట్ చీకటి ప్రపంచంలో దొరికే వీడియోలకు బానిసలై మీ చేయి దాటి పోతారు. ఆవు/ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? పిల్లలకు సోషల్ ఇంటలిజెన్స్ ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఎలా నేర్పాలో ఆలోచిస్తూ ఉండండి. - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
వ్యక్తిత్వ వికాసం పై నాట్స్ అవగాహన సదస్సు
ఫ్లోరిడా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా వ్యక్తిత్వ వికాసంపై 2022 మే 26న వెబినార్ నిర్వహించింది. నాట్స్ టెంపాబే విభాగం చేపట్టిన ఈ వెబినార్లో ఛేంజ్ సంస్థ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ స్వామి మాట్లాడుతూ... వ్యక్తిగత జీవితాల్లో చిన్న చిన్న మార్పులు ఎలాంటి పెద్ద ఫలితాలు ఇస్తాయనేది చక్కగా వివరించారు. తాను రూపొందించిన క్లామ్ ప్రోగ్రామ్ ద్వారా జీవితాన్ని ఎలా ఆనందమయంగా మార్చుకోవచ్చనేది అంశాల వారీగా ఆయన తెలిపారు. వాస్తవాలను గ్రహించినప్పుడే అజ్ఞాన అంధకారం తొలిగిపోయి జీవితంలో కొత్త కాంతులు వస్తాయన్నారు. మనిషికి ఆధ్యాత్మికత ప్రశాంతతను అందిస్తుందని తెలిపారు. మన శక్తికి మనమే పరిమితులను సృష్టించుకోవడం.. ఓటమి వస్తే కుంగిపోవడం.. లాంటి వ్యతిరేక భావనల నుంచి బయటపడేలా గోపాలకృష్ణ స్వామి దిశా నిర్దేశం చేశారు. ఈ వెబినార్లో పాల్గొన్న సభ్యుల సందేహాలను గోపాలకృష్ణ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ నంద్యాల మల్లికార్జున, రమేష్ కొల్లికి నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఈ వెబినార్కు మద్దతు ఇచ్చిన నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణగంటి, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరక్టర్లు శ్రీనివాస్ మల్లాది, రాజేష్ నెట్టెం, నాట్స్ (పైనాన్స్ అండ్ మార్కెటింగ్ ) వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, వెబ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సుదీర్ మిక్కిలినేని, టెంపాబే చాప్టర్ కోఆర్డినేటర్, ప్రసాద్ అరికట్ల, చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ సురేష్ బొజ్జా తో పాటు కోర్ టీమ్ కమిటీ సభ్యులు ప్రభాకర్ శాకమూరి, సుధాకర్ మున్నంగి, అనిల్ ఆరెమండ, నవీన్ మేడికొండ, శ్రీనివాస్ బైరెడ్డి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, రమేష్ కొల్లి, రవి తదితరులు ఈ వెబినార్ విజయవంత కావడంలో తమ వంతు సహకారం అందించారు. -
Shanta Balu: పూనా పవార్.. వయసు 86.. అయినా తగ్గేదేలే.. ధైర్యంగా..
అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని, స్వీయరక్షణలో శిక్షణ పొందినప్పుడు ఆత్మస్థయిర్యం దానంతట అదే పెంపొందుతుందని పర్సనాలటీ డెవలప్మెంట్లో భాగంగా నిపుణులు చెప్తున్నారు. మహిళల రక్షణ కోసం పని చేసే విభాగాల ప్రముఖులందరూ ఈ విషయంలో అమ్మాయిల తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులను పాఠశాల స్థాయిలోనే ప్రవేశ పెట్టాలనే సూచనలు కూడా చేస్తున్నారు. అయితే వీటన్నింటి గురించి ఏ మాత్రం తెలియని ఓ మామ్మ శాంతాబాలు పవార్ తాను నివసించే పూనా నగరంలో అమ్మాయిలకు కర్రసాములో శిక్షణనిస్తోంది. శాంతాబాలు పవార్ వయసు 86. మహారాష్ట్రలో శరద్ పవార్ ఎంత ఫేమసో పూనాలో శాంతాబాలు పవార్ అంత పాపులర్. దాదాపు ఎనభై ఏళ్లుగా ఆమె పూనా వీధుల్లో విన్యాసాలు చేస్తోంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి కర్రసాము, తాడు మీద నడవడం వంటి విన్యాసాలు చేస్తూ పెరిగింది. ఇప్పటికీ ముఖం మీద నుంచి మాస్కు తీసి చీరకట్టుకు దూర్చి, ఆమె రెండు చేతుల్తో కర్రలు పట్టుకుంటే గాలి పక్కకు తప్పుకుంటుంది. ఆమె చేతి ఒడుపు తగ్గలేదు, వేగమూ తగ్గలేదు. ఒకప్పుడు వీధి ప్రదర్శనకు మాత్రమే పరిమితం అయిన కళ... ఇప్పుడు పూనాలోని ఆడపిల్లలకు స్వీయరక్షణ విద్యగా మారింది. వారియర్ ఆజి దగ్గర శిక్షణ తీసుకుంటే తమ ఆడపిల్లల రక్షణ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, భరోసా ఉంటుందని భావిస్తున్నారు తల్లిదండ్రులు. శాంతాబాలు అజి రెండేళ్ల కిందట కరోనా సమయంలో ప్రారంభించిన శిక్షణకేంద్రం ఇప్పుడు ఆడపిల్లల కర్రసాముతో ధైర్యవికాసం పొందుతోంది. అప్పట్లో సోనూసూద్, రితేశ్ దేశ్ముఖ్ వంటి సెలబ్రిటీలు శాంతా బాలూ పవార్ను అభినందనలతో ముంచెత్తారు. ఆమె చేతిలోని కర్రసాము యుద్ధవిద్య పూనా అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు ఇరవై మంది సభ్యులున్న ఆజి కుటుంబాన్ని పోషించడానికి ఆధారం అయింది. కరోనా కారణంగా ఆమె కొడుకులకు పని లేకపోవడంతో ఆమె కర్రసాముతోనే కుటుంబాన్ని పోషిస్తోంది. ‘ఇంట్లో ఊరికే కూర్చోవడం నాకు నచ్చదు’’ అంటోంది శాంతాబాలు పవార్. అన్నట్లు ఈ వారియర్ ఆజీలో నటనాకౌశలం కూడా దాగి ఉంది. 1972లో హేమమాలిని, ధర్మేంద్ర నటించిన హిట్ మూవీ ‘సీత ఔర్ గీత’లో నటించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
అమేథీపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్?
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement