-
ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!
ముంబై మహానగరంలో ఐకానిక్ రెడ్ డబుల్ డెక్కర్ బస్సులు ఇక కనిపించవు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో రానున్న 9 నెలల్లో సిటీట్రాఫిక్ సిస్టమ్లో 900 ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తేనుంది. మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) కొత్త డబుల్ డెక్కర్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (బెస్ట్) చివరి నడుస్తున్న డబుల్ డెక్కర్ బస్సును స్వాధీనం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై వాసులు భావోద్వేగంతో వీటికి వీడ్కోలు పలకడం వైరల్గా మారింది. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్గా స్పందించారు. తన "అత్యంత ముఖ్యమైన చిన్ననాటి జ్ఞాపకాల" దొంగతనం చేశారంటూ ముంబై పోలీసుల అధికారిక ఎక్స్(ట్విటర్) ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. (మరో గ్లోబల్ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్రావు) We’ve received a 'nostalgic heist' report from @anandmahindra Sir! We can clearly see the theft, but we cannot take possession of it. Those B.E.S.T cherished memories are safely kept in your heart, and among all Mumbaikars.#DoubleDecker #MumbaiMemories #BestMemories https://t.co/32L2nmzXiQ — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) September 15, 2023 “హలో, ముంబై పోలీస్.. నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకదానిని దొంగిలించడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అంటూ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. దీనికి ముంబై పోలీసులు కూడా స్పందించారు. డిపార్ట్మెంట్ దొంగతనం గురించి స్పష్టంగా తెలుస్తోంది. కానీ దానిని స్వాధీనం చేసుకోలేం అంటూ బదులిచ్చారు. ఆనంద్ మహీంద్రా సర్ నుండి 'నోస్టాల్జిక్ హీస్ట్' నివేదికను అందుకున్నాం, కానీ దానిని స్వాధీనం చేసుకోలేం ఆ B.E.S.T ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు మీతోపాటు ముంబైవాసులందరి హృదయాల్లో భద్రంగా ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర మీరు చాలా డిఫరెంట్ అంటూ వారిని అభినందిస్తూ తిరిగి ట్వీట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) కాగా 1997లో86 ఏళ్ల క్రితం నగర వీధుల్లో ప్రవేశపెట్టారు. వీటి ప్లేస్లో మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) డబుల్ డెక్కర్లు రోడ్డెక్కాయి. రెడ్ డీజిల్తో నడిచే డబుల్ డెక్కర్ల యుగం సెప్టెంబర్ 15, శుక్రవారంతో ముగిపోయిన నేపథ్యంలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులకు వందలాది మంది ముంబైకర్లు వీడ్కోలు పలికారు. పూల దండలు, బెలూన్లతో అలంకరించి మరీ చివరిగా డీజిల్తో నడిచే డబుల్ డెక్కర్లకు బై బై చెప్పారు. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. -
జ్ఞాపకాల అంగడి
వీటిలో ఎన్నిటిని గుర్తుపట్టారు? ఓ మై గుడ్నెస్ అన్నిటినా? అయితే మీరు పలు బ్రాండ్లకు మంచి బిజినెస్ ఇస్తున్నట్టే! వాట్ ఆర్ యూ టాకింగ్? ఇవి నా చిన్నప్పటి.. లేదా నా యూత్ మెమొరీస్.. వాటిని బ్రాండ్స్ ఏం చేసుకుంటాయి? బిజినెస్ చేసుకుంటాయి! ఎస్.. ఇప్పుడు వినియోగదారుల చిన్ననాటి.. టీనేజ్ జ్ఞాపకాలే పలు వ్యాపార సంస్థలకు పెద్ద బిజినెస్ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ జ్ఞాపకాలే కొత్త బిజినెస్కు ఆలోచన పడేలా చేస్తున్నాయి.. నోస్టాల్జియాకున్న పవర్ అది! అందుకే దీన్ని నోస్టాల్జియా మార్కెట్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ తిరుగుతోంది ఈ ఇరుసు మీదే! ఇంట్లో.. బయటా.. ఎక్కడ ఏ వస్తువు కనపడినా.. ఏ పరిసరంలో తిరుగాడినా.. ఏ మాటలు.. పాటలు విన్నా.. అవన్నీ ఏదోరకంగా జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నవే అయ్యుంటాయి! లేదంటే గతంలోని ఏదో ఒక సందర్భాన్ని.. అపూర్వ క్షణాలను.. వ్యక్తులను గుర్తుచేసేవే ఉంటాయి! గమ్మత్తయిన ఓ వర్ణం.. అమ్మకు తను కట్టుకున్న తొలి చీరను గుర్తుచేయొచ్చు. మనవరాలో.. మనవడో.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మరీ కొనుక్కున్న ఓ స్టీల్ గిన్నె.. నానమ్మకు తన కాపురాన్ని జ్ఞాపకంలోకి తేవచ్చు. స్పాటిఫైలో పాట.. నాన్నకు తన బాల్యంలోని సినిమా థియేటర్ని అతని కళ్లముందు ఉంచొచ్చు. పఫ్తో హెయిర్ స్టయిల్ అత్తను తన యవ్వనపు రోజుల్లోకి తీసుకెళ్లొచ్చు. ఓటీటీ సిరీస్లోని ఓ సన్నివేశంతో తన చిన్నప్పుడు దొంగతనంగా కాల్చిన సిగరెట్ దమ్ము.. తాతయ్య మది అట్టడుగు పొరల్లోంచి బయటకు రావచ్చు! ఇలా జ్ఞాపకల్లేని జీవితం ఉంటుందా? పైగా పాతవన్నీ మధురాలే! అందుకే కదా అన్నారు ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని! ఈ మాటనే వ్యాపార మంత్రంగా పట్టేసుకున్నాయి పలు వ్యాపార సంస్థలు. ఎలాగంటే.. ‘ఆరోజుల్లో... ’ అని మొదలుపెట్టే సంభాషణతో చుట్టూ ఉన్న వాళ్లు చిరాకు పడుతుండొచ్చు. విసుగు చెందుతుండొచ్చు. కానీ.. వ్యాపార సంస్థలు మాత్రం ఆ మాటల ప్రవాహాన్ని పట్టుకుని అందులో ఈది.. ఆ జ్ఞాపకాల్లో తమ బ్రాండ్స్ను దొరకబుచ్చుకుని పాత కొత్తల కలయికతో రీమేక్ చేసి యాడ్స్ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ ‘యాది’ అనే టెక్నిక్ను బిజినెస్ ట్రిక్గా మలచుకుంటున్నాయి. ఈ స్క్రిప్ట్కి లీడ్ అందింది ఎప్పుడు? ఇంకెప్పుడూ.. కరోనా టైమ్లోనే! భలేవారే.. అన్నిటికీ కరోనాతో ముడిపెడితే ఎలా? అంటే పెట్టాల్సిందే మరి! కరోనాతో కరెంట్ ఎరా.. కరోనాకు ముందు.. తర్వాత అని చీలిపోతుందని లాక్డౌన్లో జోస్యం చెప్పుకున్నాం! నెమ్మదిగా అదిప్పుడు అనుభవంలోకి వస్తోంది. మార్కెట్లో లాభాలు సృష్టిస్తోంది. అంటే కాలం ఆ విభజనను స్పష్టం చేసిందన్నట్టే కదా! లాక్డౌన్లో చాలా మంది.. నాటి దూరదర్శన్ సీరియళ్లు, పాత సినిమాలు, పాటలతోనే కాలక్షేపం చేశారుట. ఆ కాలక్షేపంలో పల్లీ బఠాణీలు, పాప్కార్న్ని కాకుండా ఆ సీరియళ్లతో సమానంగా ఆస్వాదించిన నాటి ప్రకటనలను.. ప్రొడక్ట్స్ను.. వాటి తాలూకు తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారని పలు అధ్యయనాల సారాంశం. ఆ సారాన్ని పట్టుకునే వ్యాపార సంస్థలు నోస్టాల్జియాలో మార్కెట్ను వెదుక్కున్నాయి. మిలెనీయల్స్కీ.. జెన్జెడ్కీ.. ఆ తరపు మెమోరీస్ని కొత్త ర్యాపర్లో చుట్టి ప్రకటనల గిఫ్ట్స్ని అందిస్తున్నాయి. ఈ జాబితాలో క్రెడ్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి క్యాడ్బరీ దాకా పలు ప్రముఖ బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఇలా కొత్త ర్యాపర్లో పాత యాడ్స్ను చుట్టి స్క్రీన్ మీద పరుస్తున్నాయి. ఆ మధురాలు పాత తరపు వినియోగదారుల భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యి నాటి ఆనందానుభూతులను తాజా చేసి ఆ బ్రాండ్స్ పట్ల వాళ్ల లాయల్టీని పెంచుతున్నాయి. ఈ తరమేమో ఆ గిమ్మిక్కి పడిపోయి.. ఆ బ్రాండ్స్కి కొత్త కన్జూమర్స్గా రిజిస్టర్ అవుతోంది. ఇలా ఒకే ఇంట్లో ఆబాలగోపాలన్ని అలరించి.. మెప్పించి తమ ఖాతాను స్థిరపరచుకుంటున్నాయి. ఇదే కాక క్రెడ్ ఓజీ (OG) పేరుతో రాహుల్ ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్, జావగల్ శ్రీనాథ్, మనీందర్ సింగ్, సబా కరీమ్ లాంటి నాటి మేటి క్రికెటర్స్తోనూ యాడ్స్ రూపొందించింది. ఇలా రిలీజ్ అయిన వెంటనే అలా వైరల్ అయ్యాయి ఆ ప్రకటనలు. ఆ యాడ్స్లో కొన్ని.. క్యాడ్బరీ.. కుఛ్∙ఖాస్ హై 90ల్లో.. ఒక క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటాడు.. సెంచరీకి చివరి బంతి అన్నమాట. బంతి గాల్లో లేచి.. క్యాచ్ అవుతుందా అన్న ఉత్కంఠలో క్యాచ్ మిస్ అయ్యి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ చాక్లెట్ తింటూ టెన్షన్ పడ్డ అతని గర్ల్ఫ్రెండ్ ఆనందానికి అవధులుండవు. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేస్తూ స్టేడియంలోకి వస్తుంది.. సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! ఇప్పుడు క్రికెట్ స్టేడియం.. లేడీ క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటుంది. సెంచరీకి ఒక రన్ తక్కువగా ఉంటుంది ఆమె స్కోర్. ఓ షాట్ కొడుతుంది. అది గాల్లో లేచి.. బౌండరీ దగ్గరున్న ఫీల్డర్ దోసిట్లో పడబోయి.. మిస్ అయి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ తింటూ టెన్షన్ పడిన ఆ క్రికెటర్ బాయ్ఫ్రెండ్ సంతోషానికి ఆకాశమే హద్దవుతుంది. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేసుకుంటూ స్టేడియంలోకి వస్తాడు సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! స్విగ్గీ ఇన్స్టామార్ట్.. ఫైవ్స్టార్తో కలసి అప్పుడు.. ఫైవ్స్టార్ ఇద్దరు యువకులు.. ఓ ప్యాంట్ను దర్జీకిస్తూ ‘నాన్నగారి ప్యాంట్.. ఒక అంగుళం పొడవు తగ్గించాలి’ అని చెప్పి వాళ్ల వాళ్ల షర్ట్ జేబుల్లోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసి ఓ బైట్ తిని .. ఆ ఇద్దరూ మొహాలు చూసుకుని అప్పుడే ఒకరినొకరు గుర్తుపట్టినట్టు.. ‘రమేశ్.. సురేశ్’ అని పిలుచుకుంటారు. ఇలా చాక్లెట్ తింటూ.. మైమరిచిపోయి.. దర్జీకి పదేపదే ఆ ప్యాంట్ను అంగుళం చిన్నది చేయమని పురమాయిస్తూంటారు. ఈలోపు ఆ ప్యాంట్ కాస్త నిక్కర్ అయిపోతుంది. ఇప్పుడు.. స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇందులోనూ రమేశ్, సురేశ్ ఇద్దరూ ఓ ప్యాంట్ తీసుకుని దర్జీ దగ్గరకు వస్తారు. ఆ ప్యాంట్ పొడవు తగ్గించాలని పురమాయించి.. ఫైవ్స్టార్ కోసం జేబులు వెదుక్కుంటూంటారు.. ఖాళీ అయిపోయిన ర్యాపర్స్ తప్ప చాక్లెట్స్ దొరకవు. అప్పుడు వాయిస్ ఓవర్ వినిపిస్తుంటుంది.. ‘ఇప్పటికిప్పుడు చాక్లెట్స్ కావాలా? స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేయండి.. నిమిషాల్లో చాక్లెట్స్ మీ ముందుంటాయి’ అంటూ! అప్పుడు రమేశ్.. సురేశ్ పక్కకు చూడగానే చాక్లెట్స్ పట్టుకుని నిలబడ్డ స్విగ్గీ ఇన్స్టామర్ట్ డెవలరీ పర్సన్ కనపడుతుంది. క్రెడ్.. (క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ యాప్) నాడు.. దీపికాజీ (నిర్మా వాషింగ్ బార్) దీపికా చిఖలియా (నాటి టీవీ రామాయణంలో సీత పాత్రధారి) కిరాణా షాప్లోకి వెళ్లి.. నిర్మా బట్టల సబ్బు ఇవ్వమని షాప్ అతన్ని అడుగుతుంది. ‘దీపికాజీ.. మీరెప్పుడూ సాధారణ సబ్బే కదా తీసుకునేది.. మరిప్పుడూ?’ అంటూ ఆగిపోతాడు. ‘సాధారణ సబ్బు ధరకే నిర్మా బార్ వస్తుంటే ఎందుకు కాదనుకుంటాను’ అంటుంది దీపికా. నేడు .. కరిష్మాజీ (క్రెడ్ పేమెంట్ యాప్ కోసం) షాప్లోకి వెళ్తుంది కరిష్మా కపూర్ సెల్ఫోన్ చార్జర్ కోసం. సాధారణమైన చార్జర్ కాక స్టాండర్డ్ చార్జర్ అడుగుతుంది. ‘కారిష్మాజీ.. మీరు సాధారణంగా మామూలు చార్జరే అడుగుతారు కదా.. మరిప్పుడు?’ అని ఆగుతాడు. సాధారణ చార్జర్ ధరకే క్రెడ్ బౌంటీ స్టాండర్డ్ చార్జర్ ఇస్తుండగా ఎందుకు కాదంటాను!’ అంటుంది. పార్లే జీ.. భారత్ కా అప్ నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్ ) నిరుటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లే జీ ‘ భారత్ కా అప్నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్)’ పేరుతో నోస్టాల్జియా క్యాంపెయిన్ యాడ్ను విడుదల చేసింది. ‘స్వాతంత్య్ర సమర ప్రయాణంలో మేమూ కలసి నడిచాం! చాయ్ తీపిని.. స్వాతంత్య్ర సాధన సంతోషాన్నీ రెట్టింపు చేశాం! దేశం సాధించిన ప్రతి విజయంలో భాగస్వాములమయ్యాం..’ అంటూ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు దేశం సాధించిన ప్రగతిని చూపిస్తూ.. అప్పటి నుంచీ ఉన్న తన ఉనికినీ ప్రస్తావిస్తూ .. నాటి జ్ఞాపకాల వరుసలో తనను ముందు నెలబెట్టుకుని.. ఇప్పటికీ అంతే తాజాగా ఉన్నానని చెబుతూ తన ప్రొడక్ట్ అయిన బిస్కట్స్ను మిలెనీయల్స్ చేతుల్లో ఉన్న చాయ్ కప్పుల్లో.. పాల గ్లాసుల్లోనూ డిప్ చేసింది. టాటా సాల్ట్ కూడా బాక్సర్ మేరీ కోమ్ను పెట్టి.. ‘దేశ్ కా నమక్’ పేరుతో నోస్టాల్జియా, సెంటిమెంట్ను కలిపి కొట్టి కమర్షియల్ యాడ్ను రూపొందించింది. అది వర్కవుట్ అయింది. మదర్స్ రెసిపీ కూడా తన పచ్చళ్ల వ్యాపార ప్రమోషన్కు జ్ఞాపకాల ఊటనే వాడుకుంది. దిన పత్రికలూ నోస్టాల్జియా ప్రకటనలనే నమ్ముకున్నాయి. అందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా ‘హ్యాకీ చాంపియన్’ యాడే ఉదాహరణ. ఇవేకాక పేపర్ బోట్, గూగుల్ వంటి న్యూజనరేషన్ కంపెనీలూ నోస్టాల్జియాను ప్లే చేశాయి. రీలాంచ్ కూడా నోస్టాల్జియాతో ప్రొడక్ట్ ప్రకటలనే కాదు ప్రొడక్షన్ ఆగిపోయిన వస్తువులనూ తిరిగి ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాటిల్లో పార్లే వాళ్ల రోలా కోలా ఒకటి. 80లు, 90ల్లో పిల్లలకు ఈ క్యాండీ సుపరిచితం. పదమూడేళ్లుగా ఇది ఆగిపోయింది. కానీ దీనితో ముడిపడున్న తీపి జ్ఞాపకాలు మాత్రం 80, 90ల్లోని పిల్లలతో పాటే పెరిగి స్థిరపడ్డాయి. అందుకే నాలుగేళ్ల కిందట.. కేరళకు చెందిన 29 ఏళ్ల సిద్ధార్థ్ సాయి గోపినాథ్ అనే యువకుడు రోలా కోలా ఫొటో పెట్టి.. దాన్ని పార్లేకి ట్యాగ్ చేస్తూ ఇది మళ్లీ మార్కెట్లోకి రావాలంటే ఎన్ని రీట్వీట్స్ కావాలంటూ ట్వీట్ చేశాడు. అతని ట్వీట్కి పార్లే స్పందించింది. కనీసం పదివేల రీట్వీట్స్ కావాలని బదులిచ్చింది. అయిదారు నెలలకు సిద్ధార్థ కోరిక నెరవేరింది. ‘మంచి ఫలితానికి నిరీక్షణ తప్పదు.. కానీ నిరీక్షణ ఫలితమెప్పుడూ తీయగానే ఉంటుంది.. రోలా కోలా ఈజ్ కమింగ్ బ్యాక్’ అంటూ పార్లే ప్రకటించింది. సిద్ధార్థ్ ఈ రోలా కోలా కోసం ట్యాగ్ చేయని సెలబ్రిటీల్లేరు.. మెగా బ్రాండ్స్ లేవు. ఆఖరకు నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏవియేషన్ కంపెనీలనూ వదల్లేదు. కాంపా కోలా.. 1970, 80ల్లో తన టేస్ట్తో మార్కెట్ను రిఫ్రెష్ చేసిన సాఫ్ట్డ్రింక్ ఇది. గ్లోబలైజేషన్తో మన అంగట్లోకి వచ్చిన పెప్సీ, రీ ఎంటర్ అయిన కోకా కోలా థండర్ వేవ్స్కి తట్టుకోలేక దేశీ సాఫ్ట్డ్రింక్ కాంపా కోలా కనుమరుగైపోయింది. దీన్నిప్పుడు రిలయెన్స్ కొనుగోలు చేసింది.. దేశీ డ్రింక్గా నాటి జ్ఞాపకాల చల్లదనంతో వినియోగదారులను సేదతీర్చడానికి సిద్ధమైంది. మ్యాగీ ఏమైనా తక్కువ తిందా? నిర్ధారిత పరిమాణం కన్నా సీసం పాళ్లు ఎక్కువున్నాయన్న కంప్లయింట్తో నెస్లే ప్రొడక్ట్ మ్యాగీ మన వంటింటి కప్బోర్డులను ఖాళీ చేసి వెళ్లిపోయింది. వెళ్లింది వెళ్లినట్టు ఊరుకుందా? లేదు! పిల్లల ఆకలి తీర్చిన ఇన్స్టంట్ ఫుడ్ జ్ఞాపకాలను రెచ్చగొట్టింది.. మిస్ యూ.. కబ్ వాపస్ ఆయేగా యార్ (తిరిగి ఎప్పుడొస్తున్నావ్) అంటూ! ప్రకటనలు, నలుమూలలా హోర్డింగ్లతో హోరెత్తించింది. ఈ ఉత్సాహం, స్ఫూర్తితో చాలా కంపెనీలు.. షటర్ మూసుకున్న తమ ప్రొడక్ట్స్ని కొత్తగా ముస్తాబు చేసి తిరిగి మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయట. కొత్తేం కాదు.. నోస్టాల్జియాతో మార్కెట్ను ఏలడం కొత్త అనుకుంటున్నాం కానీ.. కాదు. ఫ్యాషన్ ప్రపంచం ఫాలో అయ్యేది ఈ సూత్రాన్నే! బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్మన్ కలర్ కాలం నాటి ట్రెండ్స్ని రెట్రో స్టయిల్ పేరుతో ఎప్పటికప్పుడు మార్కెట్ చేయట్లేదూ..! అలా బెల్బాటమ్, త్రీ ఫోర్ హ్యాండ్స్ బ్లౌజెస్, పోల్కా డాట్స్ డిజైన్స్, ఫ్రెంచ్ కట్ బియర్డ్స్, పఫ్ కొప్పులు ఎట్సెట్రా లేటెస్ట్ ఫ్యాషన్గా ఎన్ని యూత్ని ఆకట్టుకోవడం లేదు! ఆధునిక సాంకేతికతకు కవల జంటలైన ‘ఈ’ జెనరేషన్కూ త్రోబ్యాక్ సుపరిచితమే సోషల్ మీడియా సాక్షిగా. నిజానికి ప్రస్తుతం పలు బ్రాండ్స్ చేస్తున్న ఈ నోస్టాల్జియా మార్కెట్కి ప్రేరణ సోషల్ మీడియా త్రోబ్యాక్ థర్స్డేతోపాటు అది పోస్ట్ అయిన పాస్ట్ ఈవెంట్స్.. ఇన్సిడెంట్స్లను తడవ తడవకు గుర్తుచేసే తీరే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్ట్రాటెజీ వల్ల పలు బ్రాండ్ల అమ్మకాలూ పెరిగాయనీ చెప్తున్నారు. ‘జ్ఞాపకాలనేవి భలే గిరాకీ బేరం. నాటి సంగతులను మంచి ఫీల్తో జత చేసుకుని వస్తాయి. ఎన్నటికీ ఇంకిపోని భావోద్వేగాల తడిని కలిగుంటాయి. కాబట్టే అవి మార్కెట్లో సేల్ అవుతున్నాయి’ అంటున్నారు ‘22ఫీట్ ట్రైబల్ వరల్డ్వైడ్’ నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ దేబాశీష్ ఘోష్. ‘టీబీడబ్ల్యూఏ ఇండియా’ సీసీఓ పరీక్షిత్ భట్టాచార్యేమో ‘నోస్టాల్జియా అనేది టైమ్ మెషిన్ లాంటిది. నడుస్తున్న కాలానికి అందులో యాక్సెస్ ఉండదు. మళ్లీ మళ్లీ అనుభూతి చెందాలనుకున్న క్షణాల్లోకి అది మనల్ని తీసుకెళ్తుంది.. మళ్లీ జీవించేలా చేస్తుంది. ఆ బలహీనతనే కంపెనీలు ఎన్క్యాష్ చేసుకుంటున్నాయి’ అంటున్నారు. అయితే ఈ ప్రహసనంలో కొన్ని బ్రాండ్స్.. పాత ప్రకటన లేదా జ్ఞాపకానికి సమకాలీనతను జోడించే ప్రయత్నంలో వాటికున్న ఎసెన్స్ను కాపాడుతూ ఆధునికతను అద్దడంలో విఫలమవు తున్నాయి. పాత యాడ్స్.. ఆ కాలంలో అద్భుతంగా ఉండి ఉండొచ్చు. అంతే అద్భుతమైన ఫలితాలనూ రాబట్టి ఉండొచ్చు. కాని వాటి విలువ సామాజికంగా కానీ.. కల్చర్ పరంగా కానీ ప్రాసంగికతను కలిగి ఉందా? దాన్ని నేటి తరం గ్రహించగలుగుతున్నదా? ఆ ప్రకటనల సారం నేటికీ సరిపోలనున్నదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి కొన్ని యాడ్స్ను ఇప్పుడు చూస్తే అంటే పరిణతి చెందిన ఆలోచనాతీరుతో.. ఇప్పుడు నెలకొని ఉన్న సున్నిత వాతావరణంలో పరికిస్తే అవి వివాదాస్పదంగా కనిపించవచ్చు. పురుషాధిపత్య ధోరణినీ చూపిస్తూండవచ్చు. కాబట్టి.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని పాత ప్రకటనలకు ఆ సెన్స్ను జోడించాకే నోస్టాల్జియా స్ట్రాటెజీని మార్కెట్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
సెకనున్నర మాత్రమే శిష్యరికం చేశా.. చల్తాహై!
నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగారు ఒక కుటుంబం. ఆ ఇంట్లోని అబ్బాయే రాము. నా వయసు వాడే. మాటా మాటా కలిశాకా తెలిసింది తనూ ఆర్టిస్ట్ అని, బొమ్మలు వేస్తాడని. చూపించాడు కూడా. బోలెడంత పద్దతైన ప్రాక్టీసు, పోస్టర్ కలర్స్ తో వేసిన చక్కని పెయింటింగ్స్. నేను థ్రిల్లై పోయా ఆ బొమ్మలు చూసి. నన్ను నేనూ ఆర్టిస్ట్ అని చెప్పుకునే వాణ్ణే కానీ, రామూలా నా దగ్గర వేసిన బొమ్మల ఆధారాలు ఏమీ ఉండేవి. ఊరికే హృదయం ఆర్టిస్ట్ అని ఉన్నదంటే ఉన్నది అంతే. అప్పుడే కాదూ. ఇప్పుడూ అంతే. మరప్పుడయితే రామూని అడిగా ఇంత బాగా బొమ్మలు ఎట్లా వేస్తావు రామూ అని. నంద్యాలలో గుడిపాటి గడ్డ వీధిలో గణేష్ బాబు అనే ఆర్ట్ టీచర్ ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకున్నా అన్నాడు. సరేని నేను మా ఇంకో ప్రెండ్ వీర శేఖర్ ఇద్దరం కలిసి గురువు గణేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళామో, లేదా రామూనే తీసుకెళ్ళాడో కూడా నాకిప్పుడు గుర్తు లేదు. ఆ ఇంట్లో బొమ్మలు నేర్చుకునే నిమిత్తం ఇంకా మావంటి వాళ్ళు బొలెడు మంది ఉన్నారు. ఆయన మా ఇద్దర్ని ఒక మూలలో కూర్చోపెట్టి మా నోట్ పుస్తకంలో ఒక ఏనుగు బొమ్మ గీసి ఇచ్చి దాన్ని దిద్దమన్నాడు. నేను దాన్ని దిద్దనవసరం లేకుండా ఆ పక్క పేజీలో మరో ఏనుగు బొమ్మని సెకనున్నరలో వేసి ఆయనకు చూపించా. ఆయన అరే! భలే! అని నన్ను మెచ్చుకోకుండా, అలా స్వంతంగా బొమ్మలు వేయకూడదు. ఒక వారం పాటు నేను గీసి ఇచ్చిన బొమ్మ మీదే దిద్దుతూ ఉండాలి అని చెప్పాడు. నేను ఊరికే సరేనని ఆయన వేపు తల ఊపి ఆ ఇంటి గుమ్మం వేపుగా బయటికి వచ్చేసా. అప్పుడు లోపల శేఖర్ ఏమయ్యాడో తెలియదు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మేమిద్దరం ఆ క్రాష్ కోర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ సెకనున్నర శిష్యరికం తరువాత నేనెవరిని ఇక నా గురువుగా అపాయింట్ చేసుకోలేదు. అనగననగ -తినగ తినగ పథకం కింద నా బొమ్మలు నేనే వేసుకుంటూ, వాటిని దిద్దుకుంటూ చల్తాహై. ఆ విధంగా రుద్దుడూ దిద్దుడూ అనేది బొమ్మల్లోనే కాదు. కుట్టు పని అనే టైలరింగ్ లో కూడా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకనో, బడి మీద, చదువు మీద ఆసక్తి లేకనోఉండే పిల్లలు ఖాళీగా ఉండి నాశనం పట్టకూడదని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలని ఏ టైలర్ దగ్గరో పని నేర్చుకోవడానికో పెడతారు. కొంతమంది పిల్లలయితే రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసి జీవిత వృద్దిలోకి వద్దామనే పూనికతో కూడా వాళ్లకై వాళ్ళే ఏ టైలర్ మాస్టర్ దగ్గరో కుదురుకుంటారు. ముఫై రోజుల్లో మిషిన్ కుట్టుడు నేర్చెసుకుని, తమ కాలి క్రింద తిరిగే మిషిను చక్రం అలా తిరుగుతూ తిరుగుతూ అంబాసిడర్ కారు చక్రంలా మారి తమ గుడిసే ముందు బ్రేకు వేసి ఆగుతుందనే తెలుగు సినిమా భ్రమలో ఉంటారు. తెలుగు సినిమా కాదు కదా కనీస తెలుగు కథల్లో మాదిరిగానైనా దర్జి జోగారావు దగ్గర శిష్యరికం చేసిన బాబిగాడు తన గాళ్ ప్రెండు పోలికి చాలని జాకెట్టు మాదిరి తుంట రవిక కుట్టడం కూడా వారికి కుదరదు. ఎందుకంటే టైలరింగ్ నేర్చుకోడానికి నువ్వు అందరికంటే ముందుగా పొద్దున్నే షాపు దగ్గరికి చేరాలా, మూలనున్న చీపురు పట్టి అంగడి లోపలా ఆపై బయట చీలికలు పీలికలైన గుడ్డ ముక్కలన్నీ శుభ్రంగా ఊడ్చేసి ఆపై వంగిన నడుముని అమ్మాయ్యా అని పట్టు దొరికించుకునేలోగా కటింగ్ మాష్టరు వస్తాడు. ఓనామహా శివాయహా అనే ఒక పాత బట్ట ముక్కకి కత్తిరతో ఒక గాటు పెట్టి దానిని నీ చేతిలో పెట్టి కాజాలు ప్రాక్టీస్ చెయ్యమంటాడు. కాజాలు కుట్టి కుట్టి వేలికి కన్నాలు వేసుకోవడం ఎలాగూ ప్రాక్టీస్ అయ్యేలోగా మళ్ళీ గుడ్డ ముక్కల చీలికలు పీలికలు షాపు నిండా చేరుతాయి. వాటిని చీపురు పట్టి శుభ్రం చేసి మళ్ళీ నువ్వు కాజాలకు కూచోవాలా! అనగనగా ఆ కాలానికి గడియారంలో రెండే ముల్లులు. ఒకటి పీలికలు- రెండు కాజాలు. గడియారం అలా గడిచి గడిచి నీకు ఎప్పుడో ఒకప్పుడు, ఒక మంచి కాలం వచ్చే వరకు నువ్వు గురువుగారి దగ్గరే ఓపిగ్గా పడి ఉంటే అప్పుడు గడియారంలో సెకన్ల ముల్లు కూడా చేరి అంగీలకు, ప్యాంట్లకు, నిక్కర్లకు గుండీలు కుట్టే పని దగ్గరకు నెట్టబడతావు . అయితే నే చెప్పబోయేది ఇదంతా బొమ్మలు వేయడం, కాజాలు కుట్టడం గురించి కథలూ, గాథలు కబుర్లు కావు. ఇంటి గోడమీద వేలాడే క్యాలెండర్ కు గుచ్చబడి ఉండే ఒక సూది పుల్ల కథ. ఈ రోజుల సంగతి నాకు తెలీదు. నా చిన్ననాటి రోజులలో కుట్టు మిషన్ షాపు దాక నడక పడకుండానే చిరుగులు పడ్డ బట్టలపై చిన్నా చితక కుట్టు సంగతులు వేసేంత జ్ఞానం ఇంట్లో ఆడవాళ్లందరికీ వచ్చి ఉండేది. మగవాళ్ళకు కూడా తెలిసి ఉండేది. అయితే ఈ పనులన్నీ ఎక్కువగా ఇళ్ళల్లో ఉండే అమ్మమ్మలో, నాయనమ్మలో చక్కగా ముచ్చటలు చెప్పుకుంటూ సాగించేవారు. పని నడిపించడం సులువే! అయితే వారి కష్టమంతా సూదిలోకి దారం ఎక్కించడమే కష్టంగా ఉండేది. పెరిగిన వయసులో కంటి చూపుకు, సూది బెజ్జానికి, దారపుమొనకు ఎక్కడా సామరస్యం కుదిరేది కాదు. ఎప్పుడెప్పుడు సూదిలో దారం ఎక్కించమని జేజి అడిగేనా, దారం ఎక్కించేందుకు పిల్లలు పోటా పోటీగా సిద్దం. దారం ఎక్కిద్దామని సూది దారం తీసుకున్న అన్నకో చెల్లాయికో ఒక నిముషమన్నా సమయమివ్వాలా? వాడి గురి కాస్త తప్పితే చాలు ఇలా తేని మరొకడు ఆ సూద్దారం లాక్కుని ఎంగిలితో దారం తడి చేసుకుని, నోట్లో నాలుక మొన బయటపెట్టి, ఒక కన్ను మూసి మరో కన్నుతో చెట్టుమీద పిట్టకన్ను దీక్షతో చూసే అర్జునుడయ్యేవాడు. నాలుక మొన అంటే గుర్తుకు వస్తుంది పిల్లలని చక్కగా తమ ముందు కూర్చో పెట్టుకుని నోట్లో నాలుకని చాపి తమ సూది ముక్కుల అంచులకు తాకించి నీకు చాతనవునా ఇలా తగిలించడం అని గేలి చేసే మేనత్తల సంతతి ఇంకా ఎక్కడైనా మిగిలే ఉందా? మొబైల్ ఫోన్ ల కేలండర్ ఆప్ లకు గుచ్చ జాలని సూదులని ఏ గడ్డి వాములోనో వెతికి పట్టుకుని ఆ సూది తొర్ర గూండా చూపు పోనిస్తే బెజ్జానికి ఆవల సెలవంటూ వెళ్ళి పోయిన వేలాది అమ్మమ్మా నానమ్మల తమ మనవ సంతానంతో పకపకల వికవికల వివశమవుతు కనపడుతున్నారు. పిల్లల చేతుల్లో మొబైలు గేముల పలకలు కాదు. తెల్లని సూదులు చురుక్కుమని మెరుస్తున్నాయి. వేలాది దారపు ఉండలు రంగు రంగుల గాలి పటాల వలే గాలిలోకి ఎగురుతున్నాయి. జ్ఞాపకం ఎంత విలువైనది. జీవితం ఎంత అందమైనది. -
భారత రాష్ట్రపతి స్వాగతం కోసం స్వయంగా బ్రిటన్ రాణి
క్వీన్ ఎలిజబెత్-2 జీవితం.. బ్రిటన్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం గుర్తుంచుకోదగిన ఒక అధ్యాయం. సుదీర్ఘకాలంగా ఒక రాజ్యాన్ని పాలించిన సామ్రాజ్ఞిగా ఆమె తనకంటూ ఓ చెరగని ముద్రవేసుకుని వెళ్లిపోయారు. అంతేకాదు.. తన హయాంలో పలు దేశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారామె. అందులో భారత్ కూడా ఉండగా.. ఆ ఆదరాభిమానాలకు అద్దం పట్టిన ఘటనే ఇది.. క్వీన్ ఎలిజబెత్-2 ప్రయాణంలో భారత ఆధ్యాయం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. ఆమె భారత్కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఒకప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ లండన్ పర్యటన సందర్భంగా స్వయంగా ఆమె కదిలివచ్చి స్వాగతం పలికారు. 1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1963లో బ్రిటన్లో పర్యటించారు. ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా, సంస్కరణల వాదిగా ఎంతో పేరున్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్కు మునుపెన్నడూ లేనంతగా బ్రిటన్లో రాయల్ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెత్-2 స్వయంగా విక్టోరియా రైల్వే స్టేషన్కు వచ్చి సర్వేపల్లికి స్వాగతం పలికింది. తనతో పాటు ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్ను కూడా స్టేషన్కు తోడ్కోని వచ్చింది. ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్లను పరిచయం చేసిన రాణి(photo credit : BFI) రాజకుటుంబ ప్రముఖులతో పాటు, దేశంలోని అత్యున్నత సైన్యాధికారులు వెంట రాగా సర్వేపల్లిని జాతీయ గీతం జనగణమన ఆలాపనతో రాజమర్యాదలు చేసి తన వెంట తీసుకెళ్లారు రాణి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మొత్తం 11 రోజుల పాటు బ్రిటన్లోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. బ్రిటన్ సాధనసంపత్తికి అద్దం పట్టే పరిశ్రమలు, భవనాలు, వంతెనలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో సర్వేపల్లి పర్యటించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నాటి బ్రిటన్ సాంప్రదాయ గుర్రపు పందాలను చూడడానికి వచ్చినప్పుడు రాణి ఎలిజబెత్ స్వయంగా వెంట వచ్చారు. నాటి రాష్ట్రపతి సర్వేపల్లికి రాణి ఎలిజబెత్ ఆహ్వానం(photo credit : BFI) నాటి వీడియోలో ఎలిజబెత్ ఎంతో హుందాగా, మరెంతో అందంగా కనిపించారు. వీడియోలో మూడు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు బ్రిటీష్ వస్త్రధారణలో రాణి కనిపించగా, చాలా మంది భారతీయ మహిళలు ఆనాటి సంప్రదాయ చీరలో కనిపించారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎలిజబెత్ కన్నుమూసిన సందర్భంగా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వీడియో నాటి చరిత్రను కళ్ల ముందుంచింది. కర్టెసీ : BFI (బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఆర్కైవ్ నుంచి సేకరించిన వీడియో ఆధారంగా) -
ఈ బిజినెస్మేన్ని గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి యాక్టర్ కావాలని బిజినెస్మేన్ అయ్యారు. టీనేజీలో ఉన్నప్పుడు బాలీవుడ్ సినిమాలంటే చెవి కోసుకునేవారు. నచ్చిన సినిమాలో సీన్లను తలపించేలా రియల్ లైఫ్లో ఎడ్వెంచర్లు చేశారు. అక్కడితో ఆగిపోలేదు. సినిమా కెరీర్ లక్ష్యంగా హర్వర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అక్కడే బిల్గేట్స్తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. ఇంకేముంది యాక్టర్ కావాల్సిన వ్యక్తి మళ్లీ బిజినెస్ రూట్లోకి వచ్చారు. వ్యాపారంలో అనేక రికార్డులు సృష్టించారు. Remembering the best weekends of my youth. In ‘72 -I was 17-a friend & I used to often hitchhike from ‘Bombay’ to ‘Poona’ taking rides on trucks. That’s probably when I developed my love for the open road..The movie ‘Parichay’ had come out & we would sing “Musafir hoon Yaaron’😊 pic.twitter.com/VuTvMTyivd — anand mahindra (@anandmahindra) November 13, 2021 సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. జీన్స్ టీషర్ట్లో ఉన్న ఆ వ్యక్తి ట్రక్లో కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతనెవరా ? అని మనం ఆలోచించేలోగా.. ఆయనే అన్ని వివరాలు చెప్పారు. 1972లో ఆనంద్ మహీంద్రా 17 ఏళ్ల టీనేజీ కుర్రాడిగా ఉన్నప్పుడు అప్పుడే బాలీవుడ్లో దుమ్మరేపిన పరిచయ్ సినిమా చూశారు. అంతే ఆ సినిమాలో ముసాఫిర్ హుం యారో అని పాట పాడుతూ తన స్నేహితుడితో కలిసి బాంబే నుంచి పూనాకి ట్రక్కులో ప్రయాణం చేశారు. ఆ సందర్భంగా తీసుకున్న తన ఫోటోను ఆనంద్మహీంద్రా ట్వీట్టర్లో పంచుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement