-
ప్రపంచానికి మాస్కో పాఠం
ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. శుక్రవారం రాత్రి మాస్కో సమీపంలో క్రిక్కిరిసిన మాల్లోకి వచ్చి, ఓ సంగీత కార్యక్రమ హాలులోని జనంపై నలుగురు తీవ్రవాదులు జరిపిన విచక్షణారహితమైన దాడి ప్రపంచ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో కనివిని ఎరుగని ఈ స్థాయి దాడిలో దాదాపు 140 మందికి పైగా అమాయకులు ప్రాణాలు విడిస్తే, కొన్ని పదుల మంది గాయాల పాలయ్యారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ అయిదోసారి ఘనవిజయం సాధించిన కొద్ది రోజులకే ఈ దుశ్చర్య జరగడం గమనార్హం. యథేచ్ఛగా కాల్పులు జరిపి, భవనాన్ని తగులబెట్టిన దుండగులకు ఉక్రెయిన్తో లింకుందని రష్యా గూఢచర్య సంస్థల మాట. అయితే, 2022 నుంచి రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ మాత్రం తమకు సంబంధం లేదని ఖండించింది. కాగా, ఈ దాడి తామే చేసినట్టు తీవ్రవాద ‘ఐఎస్ఐఎస్’(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా) శాఖ అయిన ‘ఇస్లామిక్ స్టేట్ – ఖొరసాన్ ప్రావిన్స్’ (ఐఎస్ఐఎస్–కె) ప్రకటించడంతో కొత్త చర్చకు తెర లేచింది. జనబాహుళ్యం ప్రాంతాల్లో ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ప్రమాదం ఉందని అమెరికా మార్చి 7 నాటికే హెచ్చరించింది. అయినా, రష్యా పెడచెవిన పెట్టింది. అలా ఈ దాడులు మాస్కో స్వీయ భద్రతా వైఫల్యానికి అద్దం పట్టడమే కాక, ఆ దేశానికి తలవంపులయ్యాయి. మాస్కో శివారులోనే తీవ్ర వాదులు చులాగ్గా దాడి చేస్తుంటే, ఉక్రెయిన్పై యుద్ధంతో తీరిక లేని రష్యాకు తగిన ప్రత్యేక దళాలు అందుబాటులో లేకుండా పోయాయనే మాటా వినిపిస్తోంది. అయినా సరే, దేశంలో అసమ్మతిపై ఉక్కుపాదం మోపి, ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా 87.7 శాతంపైగా ఓట్లు తెచ్చుకొని, ఉక్రెయిన్పై యుద్ధానికి ప్రజామోదం ఉందని చెప్పుకుంటున్న రష్యా పాలకులు ఇప్పటికీ తప్పుడు దిశ వైపు చూస్తుండడం ఆశ్చర్యకరం. స్వయంకృతమని భావిస్తున్న తీవ్రవాద ముప్పుకూ పాశ్చాత్య ప్రపంచాన్నే నిందిస్తుండడం విచిత్రం. రెండు దశాబ్దాల పైగా ఉత్తర కాకసస్, చెచెన్యాలలో తీవ్రవాదంపై రష్యా తలపడుతోంది. సిరియా – ఇరాన్లతో దాని స్నేహం, మధ్యప్రాచ్యంలో దాని తీవ్రవైఖరి సరే సరి. ఇస్లామిజమ్ అణచివేతకూ దిగింది. దానికిప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విశ్లేషణ. నిజానికి, ఇరాక్, సిరియా దేశాల యుద్ధక్షేత్రాల్లో అసలైన ఐఎస్ఐఎస్ చాలా వరకు ఓటమి పాలైంది. అయితే, ఆ మాతృసంస్థ తాలూకు రక్తసిక్త వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న ‘ఐఎస్ ఐఎస్ –కె’ పడగ విప్పి, బుసలు కొడుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి పనిచేస్తున్నట్టుగా అందరూ భావిస్తున్న ఈ వర్గం నిదానంగా తన విషవృక్షపు ఊడలను విస్తరిస్తోంది. ఇప్పటికే అటు అఫ్గానిస్తాన్లోనూ, ఇటు పాకిస్తాన్లోనూ అది అనేక దాడులు జరిపింది. ఈ జనవరిలో సైతం ఇరాన్లోని కెర్మాన్లో ఇరానియన్ జనరల్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా అది జరిపిన బాంబు దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజా మాస్కో దాడితో ఈ తీవ్రవాద గ్రూపు భౌగోళికంగా తన పరిధిని విస్తరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. 2015 నాటి సిరియా అంతర్యుద్ధంలో రష్యా సేనలు అక్కడి అధ్యక్షుడు బషర్ అల్–అసద్ ఏలుబడిని సమర్థిస్తూ, ఐఎస్ వర్గానికి వ్యతిరేకంగా నిలిచాయి. సిరియాలో ప్రస్తుతం సద్దు లేనందున ‘ఐఎస్ఐఎస్–కె’ సారథ్యంలోని తీవ్రవాదులు అక్కడ తమ ఓటమికి ఇప్పుడిలా దాడి రూపంలో రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఉండవచ్చు. ఉక్రెయిన్తో యుద్ధంలో మునిగిన పుతిన్ ఈ తాజా తీవ్రవాద దాడిపై స్పందించే తీరు రానున్న రోజుల్లో ప్రపంచ శక్తి సంబంధాలపై ప్రభావం చూపడం ఖాయం. అసలు దాడికీ, ఉక్రెయిన్కూ సంబంధం ఉందన్న రష్యా మాట నమ్మశక్యంగా లేకపోగా, మధ్య ఆసియా ప్రాంతానికి విస్తరించాలని ‘ఐఎస్ఐఎస్–కె’ పడుతున్న ఆరాటానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. తజిక్ వర్గాల్లో ఈ తీవ్రవాద వర్గానికి ఆకర్షణ పెరుగుతోందనీ, ఈ ప్రాంతానికి విస్తరించే సత్తా దానికి ఉందనీ జనవరిలోనే ఐరాస భద్రతా మండలి తన నివేదికలో హెచ్చరించడం గమనార్హం. గత రెండు దశాబ్దాల్లో వివి«ద రకాల తీవ్రవాద ఘటనలు చూసిన మాస్కో కళ్ళు తెరిచి నిద్ర నటించడం మానాలి. ప్రస్తుత పరిస్థితుల్లో శుష్క ఆరోపణలు మానేసి, సమస్య అసలు మూలాలపై దృష్టి పెట్టాలి. సొంత పెరట్లోనే ఈ తీవ్రవాద వర్గంతో పోరాటం చేస్తున్న అఫ్గానిస్తాన్ పాలకులతో కలసి కార్యాచరణ చేపట్టాలి. రష్యా ఘటన సాక్షిగా ఇప్పుడు కావాల్సిందల్లా... తీవ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య ఒక స్పష్టమైన అవగాహన, అంగీకారం. అంతర్జాతీయంగా ఐఎస్ఐఎస్–కె ఊడలు మరింత లోతుగా దిగక ముందే వివిధ ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. మునుపు ఐఎస్ను మట్టి కరిపించడానికి కలసికట్టుగా కాలు కదిపినట్టే ఇప్పుడూ ముందుకు కదలాలి. ఐఎస్ఐఎస్–కె బలంగా వ్యతిరేకించే అఫ్గాన్ తాలిబన్తో అంతర్జాతీయ సమాజం సైతం సమన్వయం చేసుకోవాలి. సొంత గడ్డపై ఐఎస్ఐఎస్–కె, టీటీపీ లాంటి తీవ్రవాదుల కార్యకలాపాలను అనుమతించడం వల్ల చివరకు తమ దేశంతో పాటు, ఈ ప్రాంత భద్రతకే ప్రమాదమని అఫ్గానిస్తాన్ కూడా గ్రహించాలి. అందుకే, ఆ దేశం, దాని పొరుగునున్న ఈ తీవ్రవాద విషసర్పం కోరలు పీకే పనిలో ముందు వరుసలో నిలవాలి. ఇరాన్, చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు కలిసొచ్చి, ప్రాంతీయంగా ముప్పుగా పరిణమిస్తున్న ఈ తీవ్రవాద భూతాన్ని నిర్వీర్యం చేయాలి. ఏకాగ్ర దృష్టితో సునిశితమైన కార్యాచరణకు దిగితేనే ఫలితాలుంటాయి. అప్పుడే అసువులు బాసిన అమాయకుల పక్షాన నిలిచి, దోషులను వెంటాడి వేటాడగలం. పొంచివున్న సరికొత్త తీవ్రవాద వర్గపు ప్రమాదం నుంచి ప్రపంచాన్ని కాపాడగలం. -
మాస్కో దాడి: ‘ఐసిస్ హస్తముందని అమెరికా నమ్ముతుందా?’
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ మారణహోమంలో ఇప్పటివరకు 137కు మంది మృతి చెందారు. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. అయితే దారుణాకి బాధ్యత వహిస్తూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అమెరికా సైతం బహిరంగంగా ధృవీకరిస్తూ ప్రకటనలు చేయటం గమనార్హం. అయితే అమెరికా ప్రకటనలపై తాజాగా రష్యా స్పందించింది. ఉక్రెయిన్, ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమిర్ జలెన్స్కీని రక్షించటం కోసమే అమెరికా.. ఈ దాడిని ఐసిస్పైకి నెడుతోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖారోవా అన్నారు. తాను అమెరికా వైట్ హౌస్ను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నిజంగా ఈ దాడికి పాల్పండింది ఐసిస్ అని మీరు (అమెరికా) ఖచ్చితంగా చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే అభిప్రాయం మీద అమెరికా ఉండగలదా? అని నిలదీశారు. గతం మధ్య ప్రాచ్య దేశాలకు సంబంధించిన వ్యవహారాలపై అమెరికా జోక్యం చేసుకోవటం వల్ల రాడికల్, ఉగ్రవాదుల అధిపత్యం పెరిగిందని మండిపడ్డారు. ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ క్రీయాశీలకంగా ఉండటాని అమెరికా జోక్యమే కారణమన్నారు. ఇలా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషేధమని తెలిపారు. నియంత్రణ వైఖరితో ప్రపంచాన్ని ఉగ్రవాదులకు మద్దతుగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఉక్రెయిన్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించడానికి అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తోందని మండిపడ్డారు. ఈ దాడికి సంబంధించి అమెరికా చేస్తున్న వ్యాఖ్యలపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే.. కాల్పుల ఘటనతో ఉక్రెయిన్కు సంబంధం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్కు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. పుతిన్ ఆరోపణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందిస్తూ.. మాస్కో మారణహోమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు తమకు లేదన్నారు. -
మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ఉగ్రవాదులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో దాడులకు పాల్పడ్డ నలుగురిలో ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దాడులకు పాల్పడ్డ అనుమానితుల్ని అరెస్టు చేసిన అనంతరం ఆదివారం(మార్చి 24) వారిని మాస్కోలోని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కచేరిలో కాల్పులు జరిపింది తామేనని ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు ఒప్పుకున్నారు. దీంతో.. మొత్తం నలుగురికీ మే 22 వరకు కోర్టు ప్రి ట్రయల్ కస్టడీ విధించింది. కాల్పులకు పాల్పడిన నలుగురు తజికిస్థాన్కు చెందినవారని తేల్చారు. కోర్టుకు తీసుకువచ్చినపుడు నలుగురి శరీరాలు గాయాలమయమై రక్తమోడుతున్నాయి. ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 22 రాత్రి మాస్కో శివార్లలోని ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు తామే కారణమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే దాడులకు ఉక్రెయిన్కు లింకు ఉందని, దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్కు పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఇదీ చదవండి.. ఉక్రెయిన్పై రష్యా మిసైళ్ల వర్షం -
USA: మాస్కో ఉగ్ర దాడులు.. ట్రంప్ పాత వీడియో వైరల్
వాషింగ్టన్: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రవాదుల దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు. ‘ఒబామా ఐసిస్ ఫౌండర్. ఐసిస్ ఆయనను గౌరవిస్తోంది. ఐసిస్ కో ఫౌండర్ హిల్లరీ క్లింటన్’ అని వీడియోలో ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మాస్కో దాడుల తర్వాత ట్రంప్ స్పందన అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది తాజా వీడియో కాదని, మాస్కో దాడులపై ట్రంప్ మాట్లాడిన వీడియో కాదని తేలింది. ఈ వీడియో 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడిన వీడియో అని, దీనిని మాస్కోలో తాజాగా జరిగిన ఐసిస్ మారణహోమానికి ముడిపెట్టి మళ్లీ వైరల్ చేస్తున్నారని తేల్చారు. మాస్కోలో శనివారం(మార్చ్ 23) జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ట్రంప్ ఇంకా తన స్పందన తెలియజేయలేదు. Big Statement By Donald Trump. He said, "Obama is the fuckin founder of ISIS. I'll never let you go Obama "#Russia #Moskau #MoscowAttack pic.twitter.com/4dRJRY5Phu — Umair Ali (@UmairAli_7) March 23, 2024 ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐసిస్) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది. సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్ జోక్యం రష్యాపై ఐసిస్ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది... అలా మొదలైంది... ఐసిస్ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్కు పుతిన్ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్–కె). ఇది అఫ్గానిస్థాన్లో ఐసిస్ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్ రాజధాని కాబూల్లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్–కెనే. దీన్ని పాకిస్థానీ తాలిబాన్ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్ కమెండోలు, అఫ్గాన్ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్–కె ఆగడాలకు కళ్లెం పడింది. అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ నుంచి వైదొలగడంతో ఐసిస్–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్లో దివంగత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది. ఇస్తాంబుల్లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్ను, ఆయన విధానాలను ఐసిస్–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా. మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement