-
3 రోజుల్లో కొత్త కరెంట్ కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: మెట్రోపాలి టన్ నగరాల్లో వినియోగదారులు అవసరమైన పత్రాలన్నీ పొందుపరిచి, కొత్త కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వా లని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే పాత కనెక్షన్లో మార్పుల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ(వినియోగదారుల హక్కులు) రూల్స్–2020ని సవరిస్తూ రూల్స్–2024ను శుక్రవారం జారీ చేసింది. అదేవిధంగా మున్సిపల్ ప్రాంతాల్లో వారంరోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా కనెక్షన్ జారీ చేయాలని నిర్దేశించింది. రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని కొండ ప్రదేశాల్లో అయితే 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. పంపిణీ వ్యవస్థల విస్తరణ, కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటే.. 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకొని, విద్యుత్ సరఫరా చేయాలని నిర్దేశించింది. ఇక గ్రూప్ హౌసింగ్ సొసైటీ కింద అన్ని ఇళ్లకు అవకాశం ఉంటే.. సింగిల్ పాయింట్ కనెక్షన్ (ఒకే కనెక్షన్) ఇవ్వాలని పేర్కొంది. సొసైటీలో 50 శాతం దాకా యాజమానులు వ్యక్తిగత కనెక్షన్ కోరితే.. వారందరికీ వ్యక్తిగత కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగిల్ పాయింట్ కనెక్షన్ టారిఫ్ కూడా సగటు గృహ కనెక్షన్ టారిఫ్ను దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సొసైటీల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం ప్రత్యేకంగా కనెక్షన్ కావాలంటే జారీ చేయాలని నిర్దేశించింది. మీటర్లలో లోపాలు లేదా దెబ్బతినడం.. కాలిపోవడం వంటి అంశాలపై దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోపు కొత్త మీటర్ బిగించాలని, మీటర్ రీడింగ్లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేస్తే కొత్త మీటర్ను ఐదురోజుల్లోగా బిగించడమే కాకుండా తప్పుడు బిల్లింగ్పై ఫిర్యాదును మూడు నెలల్లోపు పరిష్కరించాలని పేర్కొంది. సోలార్ విద్యుత్ కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి, సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను 15 రోజుల్లోగా అందించాలన్నారు. 10 కిలోవాట్ల దాకా రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ కోసం వచి్చన దరఖాస్తును సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక అవసరం లేకుండా అనుమతించాలని ఆదేశించింది. రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ బిగించిన తర్వాత సరి్టఫికెట్ను వినియోగదారుడు దాఖలు చేస్తే కనెక్షన్ అగ్రిమెంట్, కొత్త మీటర్ను 15 రోజుల్లోగా అందించాలని స్పష్టం చేసింది. -
బెంగళూరు–వాడీ లైన్ల అనుసంధానం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వే ప్రాజెక్టు ఎట్టకేలకు జాతికి అంకితం కాబోతోంది. ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంత సరిహద్దు వరకు పనులు పూర్తి కావడంతో సమాంతరంగా ఉన్న రెండు ప్రధాన రైలు మార్గాల అనుసంధానానికి అవకాశం ఏర్పడింది. మహబూబ్నగర్–కర్ణాటకలోని మునీరాబాద్ మధ్య 243 కి.మీ. మేర జరుగుతున్న రైల్వే లైన్ పనుల్లో భాగంగా దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల అనుసంధానంతో ఈ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో పూర్తయింది. ఇది ఇటు సికింద్రాబాద్ (మహబూబ్నగర్)–బెంగళూరు లైను, అటు సికింద్రాబాద్–వాడీ–ముంబై లైన్లను అనుసంధానిస్తుంది. బెంగళూరు లైన్లో దేవరకద్ర నుంచి మొదలయ్యే ఈ ప్రాజెక్టు, వాడీ మార్గంలోని కృష్ణా స్టేషన్ వద్ద తెలంగాణ పరిధిలో ముగుస్తుంది. ఇక్కడి వరకు పనులు పూర్తి కావడంతో ఈ అనుసంధాన లైన్ను ఇప్పుడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బెంగళూరు సహా కొన్ని ఇతర ప్రాంతాలకు వాడీ మీదుగా రైళ్లు తిరుగుతున్నాయి. దీని బదులు ఆ రైళ్లు ఇకపై దేవరకద్ర మీదుగా బెంగళూరుకు చేరుకోవచ్చు. దీనివల్ల రైల్వేకు దూరాభారం తగ్గుతుంది. సరుకు రవాణా రైళ్లకూ ఇది దగ్గరి దారి కానుంది. అలాగే జక్టేర్, మరికల్, మక్తల్, మాగనూరు లాంటి ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రధాని చేతులమీదుగా కాచిగూడ–సిద్దిపేట డెమూ ప్రారంభం? మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైల్వేలైన్ సిద్ధమై రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆమోదముద్ర కూడా రావడంతో రైళ్లను నడిపేందుకు అవకాశం కలిగింది. ఇందులో భాగంగా కాచిగూడ–సిద్దిపేట మధ్య రోజువారీ నడిచేలా డెమూ సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించే రెండు రోజుల్లో ఏదో ఒక రోజు డెమూ రైలు సర్విసును ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ప్రధాని చేతుల మీదుగా రైలును ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించనుందో చూడాల్సి ఉంది. ఇక ముద్ఖేడ్–డోన్ మార్గంలో డబ్లింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు లైన్లు వినియోగానికి సిద్ధమైన నేపథ్యంలో ఆ పనులను కూడా ప్రధాని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు: మహబూబ్నగర్–మునీరాబాద్ మంజూరు: 1997–98 నిడివి: 243 కి.మీ. ప్రాజెక్టు వ్యయం: రూ. 3,473 కోట్లు తెలంగాణ పరిధి: 66 కి.మీ. వ్యయం: రూ.943 కోట్లు విద్యుదీకరణ: పూర్తి -
పోలవరంలో మరో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం (టన్నెల్) తవ్వకం పనులు పూర్తయ్యాయి. 919 మీటర్ల పొడవుతో 18 మీటర్ల వ్యాసంతో 20 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఈ సొరంగం తవ్వకం పనులను పూర్తిచేశామని.. లైనింగ్ పనులను ప్రారంభించామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్బాబు ‘సాక్షి’కి వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఈ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసిన అప్పటి సీఎం చంద్రబాబు.. రూ.292.09 కోట్లకు కాంట్రాక్టు సంస్థకు అప్పగించి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దుచేసి.. రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడీపీ సర్కార్ హయాంలో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థే.. ఆ పనులను రూ.231.47 కోట్లకే చేయడానికి 2019, సెపె్టంబరు 19న ముందుకొచ్చింది. దీంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. దీనిద్వారా చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని సీఎం జగన్ రట్టుచేశారు. తక్కువ ఖర్చుతోనే సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో సీఎం మరో అడుగు ముందుకేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనుసంధానాల పనులు కొలిక్కి.. పోలవరం జలాశయం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). కనిష్ట నీటిమట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు). కుడి కాలువను 174 కిమీల పొడవున 17,633 క్యూసెక్కులు (1.52 టీఎంసీ) సామర్థ్యంతో తవ్వారు. ఈ కాలువ కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ కాలువను జలాశయంతో అనుసంధానం చేసేలా జంట సొరంగాలు (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో), హెడ్ రెగ్యులేటర్ను 2020లో సీఎం జగన్ పూర్తిచేశారు. పోలవరం (గోదావరి)–ప్రకాశం బ్యారేజ్ (కృష్ణా)–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీఆర్సీ) ద్వారా పెన్నాను అనుసంధానం చేసే పనుల్లో భాగంగా జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా.. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం తవ్వకం పనులు పూర్తిచేశారు. ఎడమ కాలువను 181.50 కిమీల పొడవున 17,561 క్యూసెక్కుల సామర్థ్యం (1.51 టీఎంసీ)తో చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటికే 91% పూర్తయ్యాయి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 40.54 మీటర్ల స్థాయిలో ఉంటే ఎడమ కాలువ.. 40.23 మీటర్ల స్థాయిలో ఉంటే కుడి కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం పనులు తాజాగా పూర్తయ్యాయి. వరద తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి పూర్తిచేయనున్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే దిశగా.. ఇక కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చితే.. సీఎం జగన్ వాటిని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా చేపట్టి వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తిచేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారు. అలాగే, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనులవల్ల గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చక్కదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు వాటిని పూర్తిచేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టు ఫలాలను శరవేగంగా రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. -
మెక్రాన్ సతీమణికి పోచంపల్లి ఇక్కత్ చీర బహుకరించిన మోదీ..
ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండు రోజులపాటు కొనసాగింది. శుక్రవారం జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యన్నత పురస్కారంతో ఆ దేశ అధ్యక్షుడు సన్మానించారు. అయితే.. పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలకు తోడు సంస్కృతిక అంశాలను కూడా జోడించారు. ఆ దేశ పెద్దలకు ప్రధాని మోదీ భారత సంస్కృతికి చెందిన విలక్షణమైన కానుకలను అందించారు. అధ్యక్షుడు మెక్రాన్కు గంధపు చెక్కతో తయారు చేసిన సితార్ను బహుకరించారు. దక్షిణ భారతదేశంలో గంధపు చెక్కతో చేసే పూరాతన హస్తకళకు చెందిన కళారూపం. సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్పై ఉన్నాయి. మెక్రాన్ సతీమణి చేత.. తెలంగాణ చీర.. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్కు ప్రధాని మోదీ పోచంపల్లి ఇక్కత్ చీరను బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఇక్కత్ చీర తెలంగాణకు చెందిన పోచంపల్లిలో ఉద్భవించిన అరుదైన కళారూపం. ఆకర్షనీయమైన రంగులతో క్లిష్టమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందిన కళాఖండం. చందనం పెట్టెపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కబడి ఉన్నాయి. మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్.. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్కు 'మార్బుల్ ఇన్లే వర్క్'తో అలంకరించబడిన టేబుల్ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్లోని మక్రానా నుంచి పాలరాతిని, దేశంలో విలువైన రాళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. రాళ్లను కత్తిరించి అందంగా తయారు చేసే కళాఖండం. కాశ్మీరీ కార్పెట్.. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్కు చేతితో అల్లిన కాశ్మీరీ కార్పెట్ను బహుకరించారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన కళారూపం ఇది. మృదుత్వం కలిగి వివిధ కోణాల్లో వేరు వేరు రంగుల్ని కలిగి ఉంటుంది. గంధపు ఏనుగు.. ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చెర్కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు బొమ్మను ప్రధాని మోదీ బహుకరించారు. ఏనుగు భారతీయ సంస్కృతిలో జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. ప్రకృతికి, కళలకు మధ్య సామరస్యాన్ని సూచించే అందమైన ప్రతిబింబం ఇది. ఇదీ చదవండి: ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు.. -
కావేరికి ‘గోదారే’!
సాక్షి, అమరావతి : గోదావరి–కావేరి అనుసంధానానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఛత్తీస్గఢ్ సర్కార్ అంగీకరించకున్నా.. ఆ రాష్ట్ర వాటాలో వాడుకోని 141.3 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించడాన్ని వారు తప్పుపడుతున్నారు. మా నీళ్లను కావేరికి ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్గఢ్ సర్కార్ అభ్యంతరం తెలపడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ 141.3 టీఎంసీలపై ఛత్తీస్గఢ్ సర్కార్ హక్కులను వదులుకోవడానికి అంగీకరించినా ఆ జలాలను కావేరికి తరలించడానికి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని స్పష్టంచేస్తున్నారు. ఛత్తీస్గఢ్ వదులుకున్న 141.3 టీఎంసీలను పునఃపంపిణీ చేయాలని గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలు ట్రిబ్యునల్ను ఆశ్రయించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ మొహిలే చెబుతున్నారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల మిగులు జలాలను జతచేసి.. 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2018లో ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదన రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు తలా 80 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించారు. ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం.. గోదావరి–కావేరి అనుసంధానానికి ఎన్డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనపై ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 106 టీఎంసీలను ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో గోదావరి–కావేరి అనుసంధానంలో ఎన్డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా డీపీఆర్ను రూపొందించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు అందిస్తామని పేర్కొంది. దీనిపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో గత మార్చి 6న టాస్క్ఫోర్స్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ఛత్తీస్గఢ్ అభ్యంతరం చెబుతున్నా.. టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్వహించిన ఈ సమావేశానికి ఛత్తీస్గఢ్ సర్కార్ను ఆహ్వానించలేదు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తావిస్తూ.. ఛత్తీస్గఢ్ సర్కార్ను ఆహ్వానించకుండా, ఆ రాష్ట్ర కోటా నీటి తరలింపుపై ఎలా చర్చిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రశ్నించాయి. ఛత్తీస్గఢ్ సర్కార్తో ఉన్నతస్థాయిలో చర్చించి.. ఆ రాష్ట్ర కోటా నీటిని తరలించడానికి అంగీకరింపజేస్తామని కమిటీ చెప్పుకొచ్చింది. కానీ, ఇది ఆచరణ సాధ్యంకాదని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ మొహిలే స్పష్టంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ కేటాయించని జలాలపై పూర్తి హక్కు తమకుందని.. తమ నీటిని ఎలా తరలిస్తారని ఛత్తీస్గఢ్ సర్కార్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్డబ్ల్యూడీఏ ఎలా ముందడుగు వేస్తుందన్నది వేచిచూడాల్సిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement