-
Roundup 2022: ఒక యుద్ధం.. ఒక హిజాబ్.. ఒక రాణి
ఒక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తే, ఒక వైరస్ ప్రపంచదేశాల వెన్నులో ఇంకా వణుకు పుట్టిస్తూనే ఉంది. ఒక అమాయకురాలి మరణంతో ఈ హిజాబ్ మాకొద్దు అంటూ ఇరాన్ నవతరం నినదిస్తే, ఒక రాణి మహాభినిష్క్రమణంతో ఇంగ్లండ్లో ఒక శకం ముగిసిపోయింది. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటన్ పాలనా పగ్గాలను ఇప్పుడు భారతీయ మూలాలున్న వ్యక్తి తీసుకోవడం చూస్తే భూమి గుండ్రంగానే ఉంటుందన్న మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోవడం ఒక మైలురాయి అయితే, వాతావరణ మార్పులతో అగ్రరాజ్యాలు కూడా గడ్డ కట్టుకుపోవడం మన కళ్ల ముందే కనిపిస్తున్న కఠిన సత్యం. మొత్తంగా చూస్తే 2022 ప్రపంచదేశాలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను, కొన్ని తీపి గురుతుల్ని మిగిల్చి వెళ్లిపోతోంది. ఒక్కసారి 2022లోకి తొంగిచూస్తే... వార్తల్లో వ్యక్తులు జెలెన్స్కీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ రష్యా దండయాత్రను సమర్థంగా ఎదుర్కొని ఈ ఏడాది హీరోగా మారారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ యుద్ధానికి దిగితే ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నారు. వారంలో ముగిసిపోతుందనుకున్న పుతిన్ అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంకా కదనరంగంలో పోరాడుతున్నారు. జెలెన్స్క్లో ఈ పోరాట స్ఫూర్తిని గుర్తించిన టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా కవర్ పేజీ ప్రచురించింది. రిషి సునాక్: ఒకప్పుడు భారత దేశాన్ని దాస్యం శృంఖలాల్లో బంధించి ఏళ్ల తరబడి పరిపాలించిన బ్రిటన్కు భారతీయ మూలాలున్న రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 42 ఏళ్ల వయసుకే ప్రధాని పీఠమెక్కి బ్రిటన్ చరిత్రలో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ను గట్టెక్కించడంలో లిజ్ ట్రస్ విఫలం కావడంతో టోరీ ఎంపీల మద్దతుతో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి అల్లుడైన రిషి బ్రిటన్ ప్రధానిగా అక్టోబర్ 25న పదవీ ప్రమాణం చేశారు. ఎలాన్ మస్క్: నిత్యం సమస్యలతో చెలగాటమాడడాన్ని అమితంగా ఇష్టపడే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది వార్తల్లో నిలిచారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ని అక్టోబర్ 27న కొనుగోలు చేశారు. ఆ తర్వాత సంస్థలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్క్ వంటి వివాదాలకు తెరలేపారు. చివరికి తాను ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న పోల్ నిర్వహిస్తే 57.5% మంది ఆయన పదవికి రాజీనామా చేయాలని తీర్పునివ్వడం విశేషం. విషాదాలు ► బ్రిటన్ రాణి ఎలిజబెత్ (96) సంపూర్ణ జీవితాన్ని గడిపి అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 8న కన్నుమూశారు. 70 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా బ్రిటన్ సింహాసనాన్ని ఏలిన ఆమె మరణంతో బ్రిటన్లో ఒక శకం ముగిసిపోయింది. దేశానికి మహరాణి అయినప్పటికీ ఆ అధికారం ఎప్పుడూ ప్రదర్శించకపోవడంతో ఆమె అందరి మన్ననలు పొందారు. ► సోవియెట్ యూనియన్ చిట్టచివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ 91 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆగస్టు 31న కన్నుమూశారు. సోనియెట్ యూనియన్లో ఆర్థిక సంస్కరణలకు తెరతీసి ప్రపంచ గతినే మార్చిన గొప్ప దార్శనికుడు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నానికి సారథ్యం వహించి ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారు. అందుకే నోబెల్ శాంతి బహుమానం ఆయనను వరించింది. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబె నరా నగరంలో జూలై 8న డెమొక్రాటిక్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఒక దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పలు జరపడంతో తూటాలు నేరుగా ఆయన ఛాతీలోకి వెళ్లడంతో తుది శ్వాస విడిచారు. ఎన్నికలు ► చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ అక్టోబర్ 23న వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చైనాలో ఈ పదవికి ఎన్నికైన వారే అధ్యక్ష పగ్గాలు చేపడతారు. ► బ్రెజిల్లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరాను ఓడించిన వామపక్ష వాది లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా అక్టోబర్ 30న నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ► ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోని ఎన్నికయ్యారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని అక్టోబర్ 25న దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో అతివాద ప్రభుత్వం ఏర్పాటుకావడం విశేషం. ► ఇజ్రాయెల్లో మూడేళ్ల రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ మరోసారి బెంజిమన్ నెతన్యాహూ ప్రధాని పదవి అందుకున్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన రికార్డు నెతన్యాహూపై ఉంది. నవంబర్ 15న ఆయన మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టారు. ► నేపాల్లో అయిదు పార్టీల సంకీర్ణ కూటమి కుప్పకూలిపోవడంతో మాజీ ప్రధాని, సీసీఎస్–మావోయిస్ట్ సెంటర్ పార్టీ చైర్మన్ ప్రచండ ప్రధాని పగ్గాలు చేపట్టారు. సహచర కమ్యూనిస్టు నేత కేపీ శర్మ ఓలి మద్దతుతో డిసెంబర్ 26న ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం కరోనా ప్రభావంతో ఆర్థికంగా దివాలా తీసిన దేశాల్లో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2.2 కోట్ల జనాభా ఉండే దేశంలో ధరాభారాన్ని ప్రజలు మోయలేని స్థితికి వచ్చేశారు. ఆహార పదార్థాలు కూడా అందరికీ సరిపడా పంపిణీ చేయడంలో విఫలం కావడంతో జూలైలో ప్రజలు భారీగా నిరసనలు చేపట్టారు. జులై 9న ఆందోళనకారులు గొటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో ఆయన దేశం విడిచివెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రణిల్ విక్రమ్సింఘె అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ శ్రీలంక ఇంకా అప్పులకుప్పగానే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ► అఫ్గానిస్తాన్లో జూన్ 21నసంభవించిన భారీ భూకంపంలో వెయ్యి మందికిపైగా మరణించారు. ► జూన్లో పాకిస్తాన్ను వరదలు ముంచెత్తాయి. కొద్ది నెలల పాటు జనం నానా అవస్తలు పడ్డారు. అక్టోబర్ నాటికి పాకిస్తాన్లో వరద నష్టం 14.9 బిలియన్ డాలర్లుగా వరల్డ్ బ్యాంకు అంచనా వేసింది. ► ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు ఈజిప్టులో షర్మ్ఎల్–షేక్లో నవంబర్ 6 నుంచి 18 వరకు జరిగింది. పర్యావరణ విపత్తులతో నష్టపోయే పేద, వర్ధమాన దేశాలను ఆదుకోవడానికి పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి సంపన్న దేశాలు అంగీకరించాయి. ► వాతావరణ మార్పులు ఈ ఏడాది అన్ని దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వేసవికాలంలో వడగాడ్పులతో పశ్చిమాది దేశాలు అల్లాడిపోతే ఇప్పుడు ఆర్కిటిక్ బ్లాస్ట్తో అమెరికా గడ్డకట్టుకుపోతోంది. మంచు తుపానుకు లక్షలాది మంది అంధకారంలో మగ్గిపోతూ ఇబ్బందులు పడుతున్నారు. అవీ ఇవీ ► అమెరికాలో మారిలాండ్లో బాల్టిమోర్లో వైద్యులు ఈ ఏడాది జనవరి 12న పంది గుండెని మనిషికి అమర్చే శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే రెండు నెలలు తిరక్కుండానే మార్చి 9న ఆ వ్యక్తి మరణించడం విషాదం ► గర్భవిచ్ఛిత్తిపై అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అబార్షన్ను నిషేధం విధిస్తూ 1973లో రియో వెర్సస్ వేడ్ తీర్పుని జూన్ 24న తోసిపుచ్చింది. దీంతో అమెరికాలో మహిళలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ► బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్–3 రాజ సింహాసనాన్ని అధిష్టించారు. సెప్టెంబర్ 17న ఆయన గద్దెనెక్కి తల్లి అంతిమ సంస్కారం సహా అన్నీ దగ్గరుండి నిర్వహించారు. ► ప్రపంచ జనాభా మరో మైలు రాయి చేరుకుంది. మొత్తం జనాభా 800 కోట్లను దాటేసింది. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో నవంబర్ 15న జన్మించిన చిన్నారితో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కు దాటినట్టుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది . ► కోవిడ్–19 ఈ ఏడాదితో ముగిసిపోతుందని అందరూ భావించినప్పటికీ చివరికొచ్చేసరికి చైనాలో తీవ్ర రూపం దాల్చింది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఎఫ్7తో రోజుకి 10 లక్షలకుపైగా కేసుల నమోదవుతున్నాయని, రోజుకి అయిదు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టుగా ఒక అంచనా. పుతిన్ యుద్ధోన్మాదం ఉరుములేని పిడుగులా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్పై ఫిబ్రవరి 24న యుద్ధాన్ని ప్రకటించడంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్ చేస్తున్న సన్నాహాలను తీవ్రంగా వ్యతిరేకించిన పుతిన్ రాత్రికి రాత్రికి బాంబు దాడులు చేశారు. పశ్చిమ దేశాల అండతో ఉక్రెయిన్ రష్యా సేనల్ని సమర్థంగా ఎదుర్కొంటూ ఉండడంతో పది నెలలు గడుస్తున్నా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తే, పులి మీద పుట్రలా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టించింది. ఈ యుద్ధంలో సాధారణ పౌరులే 10 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని అంచనాలున్నాయి. ఉక్రెయిన్ నుంచి ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని ఏకంగా 78 లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలతో చమురుకు కొరత ఏర్పడి ఎన్నో దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ధరల పెరుగుదల, ఆహారం కొరత , సరఫరాలో అడ్డంకులు వంటివాటితో ప్రపంచమే స్తంభించిపోయినట్టయింది. రష్యా వైఖరిని నిరసిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ మానవ హక్కుల మండలి నుంచి రష్యాని సస్పెండ్ చేసింది. ఇరాన్లో మహిళల విజయగీతిక హిజాబ్ సరిగా ధరించని నేరానికి మహసా అమిన్ అనే 22 ఏళ్ల యువతిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు సెప్టెంబర్ 16న లాకప్లో ఆమె మరణించడంతో ఇరాన్లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 1979లో మత ఛాందసవాడులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి సవాళ్లు ప్రభుత్వం ఎదుర్కోలేదు. దేశవ్యాప్తంగా యువతీ యువకులు ఏకమై రోడ్లపై హిజాబ్లను తగులబెట్టిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలో నిలిచాయి. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 18 వేల మందిని అరెస్ట్ చేశారు. అయినా నిరసనలు ఆగకపోవడంతో ప్రభుత్వం దిగి వచ్చి మోరల్ పోలీసు వ్యవస్థని రద్దు చేయడం ఆ దేశ ప్రజలు సాధించిన అతి పెద్ద విజయం. అయితే హిజాబ్ను రద్దు చేయాలంటూ 100 రోజులైనా ఇంకా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారమైన హృదయాలతో... రాణికి వీడ్కోలు
లండన్: అసంఖ్యాక అభిమానుల అశ్రు నివాళుల నడుమ బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. కార్యక్రమం ఆసాంతం పూర్తి ప్రభుత్వ లాంఛనాల నడుమ సాగింది. రాచ కుటుంబీకుల అంతిమయాత్రకు ఉపయోగించే ప్రత్యేక వాహనంలో రాణి పార్థివ దేహాన్ని ఉదయం 11 గంటలకు వెస్ట్మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్మినిస్టర్ అబేకు తరలించారు. రాజు చార్లెస్–3తో పాటు ఆయన తోబుట్టువులు, కొడుకులు, కోడళ్లు, మనవడు, మనవరాలు, ఇతర రాజకుటుంబీకులు వెంట నడిచారు. అబేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులతో పాటు 2,000 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు చివరిసారిగా నివాళులర్పించారు. నేపథ్యంలో విషాద సంగీతం వినిపిస్తుండగా గంటకు పైగా ప్రార్థనలు కొనసాగాయి. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తదితరులంతా బైబిల్ వాక్యాలు పఠించారు. ఈ సందర్భంగా రాణికి నివాళిగా బ్రిటన్వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. వెస్ట్మినిస్టర్ డీన్ తదితరులు శోక సందేశం వినిపించారు. దేశసేవకు జీవితాన్ని అంకితం చేస్తానంటూ రాణి తన 21వ పుట్టినరోజున చేసిన ప్రతిజ్ఞను ఆసాంతం నిలబెట్టుకున్నారంటూ కొనియాడారు. అనంతరం ఎలిజబెత్–2 వివాహ, పట్టాభిషేక వేడుకలకు వేదికగా నిలిచిన వెస్ట్మినిస్టర్ అబే నుంచే ఆమె అంతిమయాత్ర మొదలైంది. చారిత్రక లండన్ వీధుల గుండా భారంగా సాగింది. ఈ సందర్భంగా ఇరువైపులా అభిమానులు అసంఖ్యాకంగా బారులు తీరారు. తమ అభిమాన రాణికి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. రాణికి తుది నివాళులర్పిస్తున్నరాష్ట్రపతి ముర్ము, పలు దేశాధినేతలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై లక్షలాది మంది అంతిమయాత్రను వీక్షిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 96 ఏళ్లు జీవించిన రాణికి నివాళిగా లండన్లోని చారిత్రక బిగ్బెన్ గడియారం నిమిషానికోసారి చొప్పున 96 సార్లు మోగింది. హైడ్ పార్కులో రాయల్ గన్ సెల్యూట్ నిరంతరాయంగా కొనసాగింది. అనంతరం రాణి పార్థివ దేహాన్ని జాతీయ గీతాలాపన నడుమ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని చారిత్రక విండ్సర్ కోటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. శవపేటికపై ఉంచిన రాజ చిహ్నాలైన కిరీటం తదితరాలను తొలగించారు. సంప్రదాయ ప్రార్థనల అనంతరం సెయింట్ జార్జి చాపెల్కు తరలించారు. రాజ కుటుంబీకుల సమక్షంలో రాణి తల్లిదండ్రులు, భర్త, సోదరి సమాధుల పక్కనే ఖననం చేశారు. బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన రాణి పవిత్రాత్మ పరలోకంలోని ప్రభువును చేరాలంటూ బైబిల్ వాక్యాల పఠనం తర్వాత మరోసారి జాతీయ గీతాలాపనతో అంత్యక్రియలు ముగిశాయి. క్వీన్ విక్టోరియా మెమొరియల్ మార్గం గుండా సాగుతున్న రాణి అంతిమయాత్ర ఇదీ చదవండి: బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం -
రాణి అంత్యక్రియలకు సర్వం సిద్ధం
లండన్: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ఉదయం జరగనున్నాయి. వాటిలో పాల్గొనేందుకు 500 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు ఒక్కొక్కరుగా బ్రిటన్ చేరుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతమంది దేశాధినేతలు ఒక్కచోట కలుస్తున్న సందర్భం ఇదే కానుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. బ్రిటన్, కామన్వెల్త్ దేశాలను 70 ఏళ్లపాటు సుదీర్ఘంగా పాలించిన 96 ఏళ్ల ఎలిజబెత్–2 సెప్టెంబర్ 8న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తమ ప్రియతమ రాణిని కడసారి చూసుకునేందుకు గడ్డ కట్టించే చలిలోనూ బ్రిటన్వాసులు బారులు తీరుతూనే ఉన్నారు. రాణి మృతికి సంతాపంగా ఆదివారం రాత్రి దేశవ్యాప్తంగా నిమిషం పాటు మౌనం పాటించారు. రాష్ట్రపతి ముర్ము ఆదివారం లాంకెస్టర్ హౌస్ను సందర్శించారు. నివాళుల పుస్తకంలో భారత ప్రభుత్వం తరఫున శోక సందేశం రాశారు. అనంతరం వెస్ట్మినిస్టర్ హాల్లో రాణి భౌతికకాయానికి రాష్ట్రపతితో పాటు బైడెన్ దంపతులు కూడా నివాళులు అర్పించారు. ఇలా జరుగుతుంది... ► సోమవారం ఉదయం ఆరింటికల్లా రాణి సందర్శనకు వస్తున్న సందర్శకులను నిలిపేస్తారు. ► అనంతరం తుది నివాళుల కోసం దేశాధినేతలు, ప్రముఖుల రాక మొదలవుతుంది. ► 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్మినిస్టర్ హాల్ నుంచి అధికార లాంఛనాలతో సమీపంలోని వెస్ట్మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 12.15కు చారిత్రక లండన్ వీధుల గుండా రాణి అంతిమయాత్ర మొదలవుతుంది. శవపేటిక విండ్సర్ కోటకు చేరుకుంటుంది. ► అక్కడి సెయింట్ జార్జ్ చాపెల్లో గతేడాది మరణించిన భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి భౌతికకాయాన్ని ఖననం చేస్తారు. వెస్ట్మినిస్టర్ డీన్ ఆధ్వర్యంలో సాయంత్రానికల్లా కార్యక్రమం పూర్తవుతుంది. అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. ► 10 వేల మంది పై చిలుకు పోలీసులు, వేలాది మంది సైనిక తదితర సిబ్బందితో లండన్లో బందోబస్తు ఏర్పాట్లు కనీవినీ ఎరగనంతటి భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జనాన్ని అదుపు చేసేందుకు ఒక్క సెంట్రల్ లండన్లోనే ఏకంగా 36 కిలోమీటర్ల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ► అంత్యక్రియల సందర్భంగా సోమవారం కనీసం 10 లక్షల మంది లండన్కు వస్తారని అంచనా. -
బ్రిటన్ రాణికి కరోనా కష్టాలు!
లండన్: కరోనా మహమ్మారి ప్రభావం బ్రిటన్ రాణి ఎలిజబెత్–2పైనా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల సందర్శకుల రాక తగ్గిపోవడంతో ఎలిజబెత్ కుటుంబం 35 మిలియన్ పౌండ్ల(45 మిలియన్ డాలర్లు) ఆదాయం కోల్పోనున్నట్లు రాజకుటుంబం మనీ మేనేజర్ మైఖేల్ స్టీవెన్స్ చెప్పారు. ఎలిజబెత్ కుటుంబ వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను ప్రకటించారు. బ్రిటన్లో రాజ కుటుంబానికి ఎన్నో ప్యాలెస్లను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. వీరి ద్వారా ఫీజుల రూపంలో అందే మొత్తం ఎలిజబెత్ ఖాతాలోకే చేరేది. కరోనాతో ఈ ఆదాయానికి భారీగా గండి పడింది. మరోవైపు రాణి నివసించే ప్రఖ్యాత బకింగ్హమ్ ప్యాలెస్కు మరమ్మతులు చేయాల్సి ఉంది. చివరిసారిగా రెండో ప్రపంచ యుద్ధం కొన్నాళ్లకు ఈ ప్యాలెస్కు మరమ్మతులు చేశారు. ఇప్పుడు నిధులు లేవని మరమ్మతులు ఆపేస్తే ప్యాలెస్ శిథిలావస్థకు చేరుతుందని ఆందోళన చెందుతున్నారు. కరోనా కష్టకాలంలో నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని రాణి కోరబోరని స్టీవెన్స్ చెప్పారు. ఉన్న నిధులనే సర్దుబాటు చేసుకుంటామన్నారు. ప్యాలెస్ సిబ్బందికి ఇప్పటికే íజీతాలు చెల్లించడం నిలిపి వేశారు. గత ఆర్థిక సంవత్సరం బ్రిటన్ ప్రభుత్వం రాజ కుటుంబానికి 69.4 మిలియన్ పౌండ్లు అందజేసింది. అంతకుముందు నాటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2.4 మిలియన్ పౌండ్లు అధికం కావడం గమనార్హం. -
కోహినూర్ పిటిషన్ స్వీకరించిన పాక్ కోర్టు
లాహోర్: కోహినూర్ వజ్రంపై పిటిషన్ను పాకిస్తాన్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వజ్రాన్ని బ్రిటిన్ నుంచి తిరిగి తెప్పించే విషయమై పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు అంగీకరించింది. బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 కిరీటంలో ఉన్న కోహినూర్ను పాకు తేవాలని జావెద్ ఇక్బాల్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ను లాహోర్ హైకోర్టు విచారించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement