చిత్ర హింసలు పెట్టి.. చేతిని నరికేసింది | Sakshi
Sakshi News home page

చిత్ర హింసలు పెట్టి.. చేతిని నరికేసింది

Published Fri, Oct 9 2015 8:48 AM

చిత్ర హింసలు పెట్టి.. చేతిని నరికేసింది

చెన్నై: పొట్టకూటి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ భారతీయురాలిని చిత్రహింసలు పెట్టారు. ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న కస్తూరి మునిరత్నం (58) అనే మహిళ చేతిని ఆమె పైఉద్యోగిని నరికేసింది. చిత్రహింసలు భరించలేక ఆ ఇంట్లో నుంచి ఆమె పారిపోవడానికి ప్రయత్నించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.  

తమిళనాడుకు చెందిన కస్తూరిని స్వదేశం తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరారు. సౌదీ అరేబియాలో కస్తూరిని తీవ్రంగా వేధించేవారని, సరిపడా భోజనం కూడా పెట్టేవారు కాదని చెప్పారు. మూడు నెలల క్రితం ఆమె సౌదీ అరేబియాకు వెళ్లినట్టు తెలిపారు. గత సెప్టెంబర్ 29న కస్తూరి చేతిని నరికేశారని చెప్పారు. ఆమెను సౌదీ అరేబియాకు పంపిన ఏజెంట్ ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆమె రియాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కస్తూరిని స్వదేశం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంకే ఎంపీ కనిమొళి .. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు లేఖ రాశారు.

కస్తూరికి జరిగిన దారుణంపై సుష్మా స్వరాజ్ స్పందించారు. ఇది అనాగరిక చర్యని, తీవ్రంగా బాధించిందని సష్మా ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా అధికారులతో మాట్లాడామని, బాధితురాలితో భారత ఎంబసీ సంప్రదించిందని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement