న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీయడంలో బీజేపీ ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతోందన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ నోటీసులు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకవేళ అలా చేయకుంటే తమకు పరువు నష్టం కల్గించినందుకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాల్సి వస్తుందని నోటీస్ లో పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి ఐదు రోజుల్లోగా కేజ్రీవాల్ వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
త్వరలోనే పదిమంది నల్లకుబేరుల పేర్లతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తానని కేజ్రీవాల్ వెల్లడించిన నేపథ్యంలో బీజేపీ నోటీసులు పంపింది. మొత్తం నల్లధనాన్ని వెలికి తీసేవరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతోపాటు బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రభుత్వానికి దాదాపు 200 పేర్లు అందాయని, తాను ప్రభుత్వంలో ఉంటే తానే ఆ పేర్లన్నింటినీ బయట పెట్టేవాడినని సంచలన ప్రకటన చేశారు.