సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటేయాలని ఆపార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. అసెంబ్లీలో పార్టీ విప్ ప్రకాశ్ గౌడ్ సంతకంతో టీఆర్ఎస్లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 15 మందికి రిజిస్టర్ పోస్టు ద్వారా విప్ను పంపించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికవగా, శనివారం గులాబీ కండువా కప్పుకున్న మాధవరం కృష్ణారావుతో కలిపి ఐదుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు.
వారిలో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా మంత్రిగా కొనసాగుతున్న విషయం విదితమే. టీఆర్ఎస్లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినా, రహస్య ఓటింగ్ కావడంతో దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తున్నారో తెలియని పరిస్థితిలో విప్ జారీ వృధా ప్రయాసేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.