పాతకక్షలే ప్రాణం తీశాయా..? | Sakshi
Sakshi News home page

పాతకక్షలే ప్రాణం తీశాయా..?

Published Wed, Oct 22 2014 4:11 AM

పాతకక్షలే ప్రాణం తీశాయా..?

మహబూబ్‌నగర్ క్రైం:
 జిల్లా కేంద్రంలోని వీరన్నపేటకు చెందిన సోహైల్(26)సోమవారం రాత్రి దారుణహత్యకు గురైన విషయం విదితమే. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా, సోహైల్ హ త్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళిలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ కాలేబాబా వద్ద సోహైల్ కారుడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో కాలెబాబా భార్యతో సోహైల్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి భర్తను హతమార్చేందుకు భార్య ఫథకం పన్నింది.

దీన్ని అమలుచేసేందుకు ఓ రాత్రి ఇంట్లో ఉన్న భర్త కాలెబాబాను ప్రియుడు సోహైల్‌తో కలిసి అతిదారుణంగా గొడ్డలితో నరికి హత్యచేశారు. ఈమేరకు కాలెబాబా గతకొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన మృతుడి స్నేహితులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు.

కాలెబాబా హత్యకేసులో ప్రధాన నిందితులుగా మృతుడి భార్య, ప్రియుడు సోహైల్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిల్‌పై విడుదలైన సోహైల్‌ను చంపేందుకు కాలెబాబా అనుచ రులు సమయం కోసం వేచిచూశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సోహైల్ టీడీగుట్ట ప్రాంతంలో ఒంటరిగా కనిపించడంతో కొందరు పదునైన ఆయుధాలతో అతనిపై విచక్షణరహితంగా దాడిచేసి గొంతుకోసి చంపారు.

పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. పాతకక్షల కారణంగానే గతంలో హత్యకు గురైన కాలేబాబా అనుచరులు సోహైల్‌ను మట్టుబెట్టి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులు ఆ కోణంలో పరిశోధనలు మొదలుపెట్టారు. కొందరు అనుమానితులను తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement