హైదరాబాద్: తమ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న నేతలు లేరని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందుకే తాను సొంతగా ప్రజాసమస్యలపై పోరాడతానని తెలిపారు. శనివారం హైదరాబాద్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. దీని ద్వారా తెలంగాణ రైతుల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయవద్దని ఆయనకు హితవు పలికారు.
విద్యుత్ కోతల వల్ల తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని... దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కరెంట్ ఇవ్వాలని ... తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలంతా పార్టీలకు అతీతంగా చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేయాలని సూచించారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.