జీవరాశిని కాపాడుకోవాలి: మేనకాగాంధీ | Sakshi
Sakshi News home page

జీవరాశిని కాపాడుకోవాలి: మేనకాగాంధీ

Published Sat, Sep 16 2017 1:48 AM

జీవరాశిని కాపాడుకోవాలి: మేనకాగాంధీ - Sakshi

శామీర్‌పేట్‌: కీటకాలు మొదలు పెద్ద జంతువు వరకు ఉన్న జీవరాశిని కాపాడుకోవాల్సిన అవసరముందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్‌లోని నల్సార్‌ లా యూనివర్సిటీలో శుక్రవారం జంతు సంబంధిత చట్టాల అధ్యయన కేంద్రాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. మేనకాగాంధీ మాట్లాడుతూ ‘జంతు సంరక్షణ అంటే వాటి పట్ల ప్రేమ చూపడమే కాదు. పర్యావరణ పరిరక్షణ కూడా’అని పేర్కొన్నారు. జంతు సంబంధమైన చట్టాలను రూపొందించాలంటే జంతువులపై ఎంతో అధ్యయనం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కేంద్ర స్థాయిలోని పర్యావరణ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పర్యావరణ చట్టాల రూపకల్పనకు సహకరిస్తున్నదని, అదేవిధంగా నల్సార్‌ జంతు సంబంధ చట్టాల కేంద్రం కూడా జంతు సంరక్షణ చట్టాల రూపకల్పనకు తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కేంద్రం జంతు సంబంధ చట్టాల్లోని సమస్యలు, జంతు సంక్షేమ చట్టాల రూపకల్పనకు సహకరిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్న లకు ఆమె ఓపిగ్గా సమాధానం చెప్పారు. అనంతరం హ్యూమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌(హెచ్‌ఎస్‌ఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయసింహాను ఈ కేంద్రానికి గౌరవ డైరెక్టర్‌గా నియమించారు. కార్యక్రమంలో నల్సార్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పైజాన్‌ ముస్తఫా, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement