సారా తయారీ కేసులో లక్ష జరిమానా | Sakshi
Sakshi News home page

సారా తయారీ కేసులో లక్ష జరిమానా

Published Tue, Dec 1 2015 7:47 PM

Man fined One lakh for illegal liquor business

సంగారెడ్డి (మెదక్) : సారా తయారీ, విక్రయం కేసులో బైండోవర్ చేసిన నిందితుల్లో ముగ్గురికి ఎక్సైజ్ అధికారులు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. అందులో ఓ నిందితుడు లక్ష రూపాయల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించినట్టు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సంగారెడ్డి సూపరింటెండెంట్ కె.రఘురాం తెలిపారు. ఇప్పటివరకు సారా విక్రయం, తయారీ కేసులో ఇంత పెద్ద మొత్తం జరిమానా విధించి చెల్లించడం రాష్ట్రంలోనే ఇదే ప్రథమం. సంగారెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఎస్ మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. సారా తయారీ, విక్రయం పెద్ద ఎత్తున జరిపిన నేపథ్యంలో నిందితులను తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తారు.

ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించగా ఇద్దరు చెల్లిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. కాగా చిన్నశంకరంపేట మండలం సంకాపూర్ తండాకు చెందిన లంబాడి నింబ్యా(45) అనే వ్యక్తి జరిమానా చెల్లించకపోవడంతో అతనికి ఏడాదిపాటు జైలు శిక్షను అధికారులు ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు నిందితుల్లో రేగోడ్ మండలం గజివాడ తండాకు పాల్టి గురునాథ్ లక్ష రూపాయల జరిమానాను ప్రభుత్వానికి చెల్లించినట్టు సంగారెడ్డి ఈఎస్ కె.రఘురాం తెలిపారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ సారా తయారు చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement