నిఘంటువు రూపొందించాలి | Sakshi
Sakshi News home page

నిఘంటువు రూపొందించాలి

Published Tue, Dec 1 2015 1:13 AM

Dictionary build

చర్చాగోష్టిలో వక్తలు
 సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ తెలుగు భాషకు నిఘంటువు రూపొందించాల్సిన అవసరం ఉందని పలువురు భాషావేత్తలు అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యంత్రి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం నాంపల్లిలోని తెలుగువర్సిటీ సమావేశ మందిరంలో భాషాభివృద్ధి పీఠం, నిఘంటు నిర్మాణ శాఖ ‘తెలంగాణ తెలుగు నిఘంటువు-నిర్మాణ ప్రణాళిక’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు.

 తెలంగాణ పది జిల్లాలలో ఉన్న భాషలోనుంచి అన్ని ప్రాంతాల పదాలను స్వీకరిస్తూ తెలంగాణ ప్రామాణిక భాషను రూపొందించాలని, ఆ తర్వాత నిఘంటు నిర్మాణం జరగాలని అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య అధ్యక్షోపన్యాసం చేస్తూ తెలంగాణ ప్రామాణిక భాష రూపొందించుకున్నప్పటికీ ఇతర ప్రాంతాల మాండలికాలను సమానంగా గౌరవించాలని అభిప్రాయపడ్డారు. ప్రామాణిక భాషను పాఠ్య పుస్తక రచనకు, అధికార వ్యవహారాలకు, మీడియా అవసరాలకు వినియోగించాలని అన్నారు.
 
 ప్రముఖ భాషావేత్త ఆచార్య ఎ.ఉషాదేవి మాట్లాడుతూ నిఘంటు నిర్మాణానికి అనుసరిస్తున్న శాస్త్రీయ పద్ధతినే తెలంగాణ నిఘంటువు నిర్మాణానికి కూడా వర్తింప చేయాలని కోరారు. విషయ సేకరణ, వడపోత, అర్థ నిర్ణ యం నిఘంటు నిర్మాణంలో ప్రధానమని సూచించారు. డాక్టర్ భుజంగరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని మాండలికాలనీ కలిపి ఒక ప్రామాణిక భాషగా రూపొందించాలని అన్నారు. తన వాదనకు ఆయన శాసనాధారాలు చూపారు.
 
 రెండవ సదస్సుకు ఆచార్య కె.ఆశీర్వాదం అధ్యక్షత వహించారు. జకోస్లోవేకియా రెండు గా విడిపోయిన..జక్ దేశం నుంచి వచ్చిన ఆచార్య ఎరస్లౌ వాచక్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు జి.ఉమా మహేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, ఆచార్య కె.రమణ య్య, జి.ఎస్.గాబ్రియేల్, వారణాసి మాధవ శర్మ, దేవీ లాల్, ఆచార్య వి.స్వరాజ్య లక్ష్మి, డాక్టర్ వడ్ల సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నిఘంటు నిర్మాణ శాఖ అధిపతి డాక్టర్ వై.రెడ్డి శ్యామల చర్చాగోష్టికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
 

Advertisement
Advertisement