కథేమిటని అడగలేదు | Sakshi
Sakshi News home page

కథేమిటని అడగలేదు

Published Tue, Mar 31 2015 2:51 AM

కథేమిటని అడగలేదు

సాధారణంగా ఏ నటుడైనా నటి అయినా ఒక స్థాయికి చేరుకున్నాక దర్శక నిర్మాతలను కథ చెప్పండి అని అడగడం, విన్న తర్వాత అది బాగోలేదు, ఫలానా అంశాలు చేర్చండి అంటూ జోక్యం చేసుకుంటూ ఉంటారు. నటి సమంత కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కథల విషయంలోనే కాదు, ధరించే దుస్తులు తదితర అంశాలలోనూ జోక్యం చేసుకుంటారని, హీరోల ఆధిక్యంపై ప్రశ్నిస్తుంటారని సమాచారం. అలాంటిది తాజాగా విక్రమ్ సరసన నటిస్తున్న పత్తుఎండ్రదుకుళే చిత్ర కథేంటని అడగలేదట.
 
  కారణం ఆ చిత్రం దర్శకుడే అంటారామె. గోలీసోడా ద్వారా మెగాఫోన్ పట్టిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్‌మిల్టన్ బాల తారలతో ఆ చిత్రాన్ని తెరకెక్కించి ఘనవిజయాన్ని సాధించారు. అలాంటి దర్శకుడి తాజా చిత్రం పత్తుఎండ్రదుకుళే. ఐ చిత్రం తర్వాత విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. ఇందులో నటించాల్సిందిగా ఆమెను అడిగినప్పుడు కథ గురించి అడగకుండా వెంటనే ఓకే చెప్పారట. విజయ్ మిల్టన్ తొలి చిత్రం గోలీసోడా చూసిన ఈమెకు ఆ చిత్రం తెగ నచ్చేసిందట.
 
 వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి పొగడ్తలతో ముంచేశారట కూడా. అంత మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడు పత్తుఎండ్రదుకుళే చిత్రంలో తన పాత్రను బాగానే తీర్చిదిద్ది ఉంటారనే నమ్మకంతో కథ వినకుండానే న టించడానికి అంగీకరించారట. కత్తి చిత్రంతో కోలీవుడ్‌లో తొలి విజయాన్ని అందుకున్నా ఆ చిత్రంలో తనకు నటించడానికి పెద్దగా అవకాశం ఏమీ లేదని పెదవి విరిచిన సమంత పత్తుఎండ్రదుకుళేపై చాలా ఆశలు పెట్టుకున్నారు. త్వరలో విజయ్‌తో మరోసినిమాకు సిద్ధమవుతున్నారు.
 

Advertisement
Advertisement