ఎప్పుడూ తప్పు చేయలేదు | Sakshi
Sakshi News home page

ఎప్పుడూ తప్పు చేయలేదు

Published Fri, Jul 3 2015 8:08 AM

ఎప్పుడూ తప్పు చేయలేదు

సురేశ్ రైనా స్పష్టీకరణ
 న్యూఢిల్లీ:
వ్యాపారవేత్తనుంచి డబ్బులు తీసుకున్నానంటూ తనపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోది చేసిన ఆరోపణలను భారత క్రికెటర్ సురేశ్ రైనా ఖండించాడు. ఏ స్థాయిలో అయినా తాను ప్రాతినిధ్యం వహించిన జట్టు తరఫున నిజాయితీగా ఆడానని, ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని అతను అన్నాడు. తన మేనేజ్‌మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ ద్వారా రైనా ఒక మీడియా ప్రకటనను విడుదల చేశాడు. ‘నా గురించి ఇటీవల మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో స్పందించాల్సి వస్తోంది.
 
 కెరీర్ ఆసాంతం నేను నిజాయితీగా, అంకిత భావంతో క్రికెట్ ఆడాను. ఏ దశలోనూ ఎలాంటి తప్పు చేయలేదు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం.  సదరు వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే ఆలోచన కూడా ఉంది’ అని రైనా వివరణ ఇచ్చాడు. రైనాతో పాటు జడేజా, బ్రేవో బయటి వ్యక్తులనుంచి లంచాలు తీసుకున్నారని ఇటీవల లలిత్ మోది వెల్లడించారు. అయితే ఐసీసీ, బీసీసీఐ ఈ విషయంలో ముగ్గురు ఆటగాళ్లకూ క్లీన్‌చిట్ ఇచ్చాయి.

Advertisement
Advertisement