విశాఖలో పంద్రాగస్టు ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

విశాఖలో పంద్రాగస్టు ఉత్సవాలు

Published Wed, Jul 29 2015 8:48 PM

independance celebrations in visakha beach

హైదరాబాద్: ఈసారి పంద్రాగస్టు ఉత్సవాలను విశాఖపట్టణం ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో పంద్రాగస్టు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ యువరాజ్ ఏర్పాట్ల విషయంలో సాధారణ పరిపాలనశాఖతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. పోలీసు పరేడ్ ఏర్పాట్లను రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్ ఐజీ ఆర్కే మీనా పర్యవేక్షణ చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు.

ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా సమాచార శాఖ కమిషనర్ తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. రూట్ మ్యాప్‌తో పాటు కార్లు పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను హోంశాఖ చూడాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. పాఠశాల విద్యా శాఖతో సమన్వయం చేసుకుని ఉత్సవాలకు తీసుకువచ్చే విద్యార్ధులకు బస్సులు ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్టీసీని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పురోగతిని వివరిస్తూ శకటాల ప్రదర్శనలకు అన్ని శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సూచించారు.

Advertisement
Advertisement