స్వయంగా నేనే వస్తా | Sakshi
Sakshi News home page

స్వయంగా నేనే వస్తా

Published Wed, Dec 2 2015 3:00 AM

స్వయంగా నేనే వస్తా - Sakshi

♦ ప్రతి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తా
♦ ఆదిలాబాద్ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్
♦ ఒక్కో జిల్లాలో వారం రోజులుంటా
♦ వీలైతే ఆదిలాబాద్ నుంచే పర్యటన ప్రారంభిస్తా
♦  మండల కేంద్రం నుంచి జిల్లాకు డబుల్ రోడ్డుండాలి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించడంతోపాటు నేరుగా ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకునేందుకు త్వరలోనే జిల్లాల పర్యటన చేపడతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఒక్కో జిల్లాలో వారం రోజుల పాటు ఉండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. నీటి పారుదల, తాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు తదితర నిర్మాణాలను పరిశీలిస్తానని అన్నారు. స్థానికంగా ఉండే ఇతర సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వీలైతే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా నుంచే జిల్లాల పర్యటన ప్రారంభిస్తానని ఆ జిల్లా ప్రజాప్రతినిధులకు మాటిచ్చారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా నేతలు, అధికారులతో సీఎం సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయని, ఇక వాటిని వేగంగా అమలు చేయడమే మిగిలి ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వరంగల్ ఎన్నికల్లో ఆ విషయం మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. వారి నమ్మకం నిలబెట్టేలా ప్రభుత్వం పని చేయాలని, ప్రజా ప్రతినిధులు ప్రజల అవసరానికి తగ్గట్టు స్పందించాలని సూచించారు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, విఠల్‌రెడ్డి, చిన్నయ్య, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం అదనపు కార్యదర్శి శాంతకుమారి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 తూర్పు ఆదిలాబాద్‌పై ప్రత్యేక శ్రద్ధ
 అత్యంత వెనుకబడిన తూర్పు ఆదిలాబాద్ ప్రాంతంపై మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎమ్మెల్యేలను అడిగి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో తక్షణం చేయాల్సిన పనులను, దీర్ఘకాలిక ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులను గుర్తించారు. నీటి పారుదల ప్రాజెక్టులు, రహదారులు, వంతెనల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు, వైద్య సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతీ మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు వేయాలని ప్రభుత్వం ఓ విధానం పెట్టుకుందని, దాని ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో కూడా అన్ని మండల కేంద్రాలకు డబుల్ రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

కొన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు నదులు, కాల్వలు దాటే క్రమంలో పడవలు ఉపయోగించాల్సి వస్తోందని సీఎం అన్నారు. అలాంటి ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వంతెనల నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్‌ను సీఎం కోరారు. మంచిర్యాల-చంద్రాపూర్ నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎత్తిపోతల పథకాలను వెంటనే పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు సూచించారు. తూర్పు ఆదిలాబాద్ ప్రాంతంలో అదనపు సబ్ స్టేషన్ల నిర్మాణం నత్తనడక నడుస్తోందని, ఈ పనులను స్వయంగా పర్యవేక్షించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
 కొమురం భీం వారసులకు డబుల్ బెడ్రూం ఇళ్లు
 ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌లో కొమురం భీం వారసులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్యమంత్రిని కోరారు. కొమురం భీం వారసులకు చెందిన 15 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయని, వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement
Advertisement