ప్రతి ఒక్కరూ విద్యార్థి దశనుంచే నిబద్ధత, నిజాయితీతో పాటు కష్టపడేతత్వం అలవాటు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవడం సాధ్యమవుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎఫ్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ సాంబిరెడ్డి అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీవీఐటీ) నందు ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వేడుకలకు సాంబిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సాధారణ మనిషి అసాధారణ దృక్పథం కలిగి ఉండడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందనే దానికి ఉదాహరణ మోక్షగుండం విశ్శేశ్వరయ్య ఉదాహరణ అన్నారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేవిధంగా నేటితరం ఇంజనీర్లు సంసిద్ధులై ఉండాలన్నారు. హైదరాబాద్ ఐఐఐటీ ప్రొఫెసర్ గరిమెళ్ళ రామ్మూర్తి మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి యువ ఇంజనీర్ల చేతిలో ఉందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ భారత జాతికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన అనన్య సేవలు గుర్తుచేసుకుంటూ నేటి ఇంజనీర్లు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, జాయింట్ సెక్రటరీ ఎస్ఆర్కె పరమహంస, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంజనీర్స్ డే పురస్కరించుకుని కళాశాలలో సివిల్, ఈసీఈ ఇంజినీరింగ్విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.