చంద్రబాబూ.. పాలనపై దృష్టి పెట్టు: ఉమ్మారెడ్డి | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. పాలనపై దృష్టి పెట్టు: ఉమ్మారెడ్డి

Published Thu, Oct 30 2014 4:28 PM

చంద్రబాబూ.. పాలనపై దృష్టి పెట్టు: ఉమ్మారెడ్డి

కడప: పార్టీలు మారుతున్నారంటూ ప్రచారం చేయిస్తున్న సీఎం చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టాలని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. ఎన్నికలు పూర్తైన తర్వాత ప్రత్యర్థి పార్టీలపై దాడులు చేయడం మంచి సాంప్రదాయం కాదని, దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సమీక్ష సమావేశంలో విజయసాయిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు 'మనసులో మాట'ను గమనిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే ఆలోచన లేదని అర్థమవుతుందన్నారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో ప్రాజెక్టులకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తే  వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్లలోనే రూ. 51 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని, సముచిత స్థానం కల్పిస్తామని విజయసాయిరెడ్డి హామీయిచ్చారు.

Advertisement
Advertisement